YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Thursday, April 10, 2025

Wednesday, 7 November 2012

బాబు వల్లే గ్యాస్ కష్టాలు

కేజీ బేసిన్ గ్యాస్ రాకుండా చేసింది చంద్రబాబే: షర్మిల
ఆ గ్యాస్ మనకొస్తే విద్యుత్తు, వంటగ్యాస్ అవసరం తీరేది 
బాబు ఇప్పుడు ప్రభుత్వంతో కుమ్మక్కై దానిపై అవిశ్వాసం పెట్టనంటున్నారు 
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
బుధవారం యాత్ర ముగిసేనాటికి..

రోజులు: 21, 
కిలోమీటర్లు: 268.80 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈ రోజు మార్గం మధ్యలో నన్ను ఓ మహిళ ప్రశ్నించింది. ఈ గ్యాస్ కష్టాలు ఎప్పుడు తీరతాయని అడిగింది. నిజానికి కృష్ణా గోదావరి(కేజీ) బేసిన్ మనకు దేవుడు ఇచ్చిన వరం. కేజీ బేసిన్‌లో ఉత్పత్తయ్యే గ్యాస్‌తో మన రాష్ట్ర విద్యుత్తు అవసరాలను పూర్తిగా తీర్చవచ్చు. పరిశ్రమలను నిలబెట్టుకోవచ్చు. వ్యవసాయాన్ని నిలబెట్టుకునేవాళ్లం. ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసుకోవచ్చు. 

అంతటి విలువైన గ్యాస్‌ను చంద్రబాబు రిలయన్స్ కంపెనీకి క ట్టబెట్టారు. రాజశేఖరరెడ్డి గారు ఇది అన్యాయమని, మన గ్యాస్ మనకు కావాలని కేంద్రానికి లేఖ రాస్తే దాన్ని పట్టించుకోలేదు. కేజీ బేసిన్ నుంచి మనకు రావాల్సిన గ్యాస్‌ను చంద్రబాబు తన స్వార్థం కోసం రిలయన్స్ కంపెనీకి మేలు జరిగేలా చూశారు. వాళ్లతో ‘ఈనాడు’ పత్రికలో ఒక్కో షేరుకు రూ.5.3 లక్షల విలువతో కొనిపించారు. ఈ ద్రోహం చంద్రబాబుదే. 2 జీ స్కామ్ కంటే పెద్ద స్కామని కాగ్ వంటి సంస్థలు నివేదికలు ఇచ్చాయి. కానీ దానిపై ఈ ప్రభుత్వం విచారణ జరిపించదు..’’ అని వైఎస్సార్‌సీపీ నేత షర్మిల చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 21వ రోజు బుధవారం ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా ఆమె అనంతపురంజిల్లా గుంతకల్లులో జరిగిన సభలో ప్రసంగించారు.

ఇద్దరూ కుమ్మక్కయ్యారు: ‘‘రెండెకరాల చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాదించారని కమ్యూనిస్టు లు ప్రశ్నిస్తే దానిపై విచారణ చేయరు. తెహల్కా వెబ్‌సైట్ చంద్రబాబుకు మించిన ధనవంతుడైన రాజకీయ నాయకుడు లేడని ప్రచురిస్తే దానిపై విచారణ చేయరు. ఐఎంజీకి వందల ఎకరాల భూములు కట్టబెడితే దానిపై విచారణ జరిపించరు. చంద్రబాబు భార్య ఎకరం కోటిరూపాయలకు భూమి అమ్ముకున్న చోట.. పక్కనే ఉన్న భూమిని ఎకరా రూ. 26 లక్షల చొప్పున ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు బాబు కట్టబెడితే విచారణ చేయరు. ఈ విచారణ జరగకుండా ఉండేందుకు ఆయన చీకట్లో చిదంబరంను కలుస్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం ఒక్కటయ్యాయి. జగనన్నపై అబద్ధపు కేసులు పెట్టారు. పైగా బెయిల్ రాకుండా చేసేందుకు చంద్రబాబు తన ఎంపీలను చిదంబరం వద్దకు పంపించారు. చిదంబరం కూడా వెనువెంటనే ఆ పనులు చేసేశారు’’ అని షర్మిల దుయ్యబట్టారు. ‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దించకుండా చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్తగా నాటకాలు ఆడుతున్నారు. ఎందుకు దించవని అడిగితే పలకరు’’ అని విమర్శించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!