YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Thursday, April 10, 2025

Tuesday, 7 August 2012

ల్యాంకో.. కుమ్ముకో

కేంద్రం హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర
రాష్ట్రానికి తక్కువ ధరకే విద్యుత్‌ను ఇవ్వాలన్న కేంద్రం
అధిక ధరకు విక్రయిస్తున్న ల్యాంకో స్టేజ్-2, 
జీఎంఆర్ బార్జ్‌మౌంట్ ప్లాంట్లు 
ఫలితంగా ఏడాదికి రూ.438 కోట్ల భారం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒకవైపు మన గ్యాస్ మనకే రాకుండా పోతోంది. మరోవైపు వస్తున్న కొద్దిపాటి గ్యాస్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. గ్యాస్ కేటాయింపులు పొందిన సంస్థల నుంచి తక్కువ ధరకే విద్యుత్‌ను పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమ‌వుతోంది. రాష్ట్రానికే గ్యాస్ ఇస్తామ‌ని కేంద్రం నుంచి కేటాయింపులు పొందిన ల్యాంకో సంస్థ మొదట్లో తమిళనాడుకు విద్యుత్‌ను అమ్ముకుంది. జీఎంఆర్ బార్జ్‌వంట్ సంస్థదీ అదే తీరు. రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వకపోతే, అది కూడా తక్కువ ధరకు ఇవ్వకపోతే గ్యాస్ వెనక్కి తీసుకుంటామ‌ని కేంద్రం హెచ్చరించినప్పటికీ ల్యాంకో, జీఎంఆర్‌ల దందా నిరాటంకంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వమూ ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. దీంతో ఆ సంస్థలు యూనిట్ విద్యుత్‌ను ఏకంగా రూ.5.70కు విక్రయిస్తున్నాయి. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై ప్రతి ఏటా రూ.438 కోట్ల అదనపు భారం పడుతోంది. ల్యాంకో సంస్థ కొండపల్లి వద్ద 366 మెగావాట్ల సామ‌ర్థ్యంతో స్టేజ్-2 విద్యుత్ ప్లాంటును నిర్మించింది. ఈ ప్లాంటుకు గ్యాస్ కేటాయించే విధంగా కేంద్రానికి సిఫారసు చేయాలని 2006లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. మరోసారి 2008లో అప్పటి ఇంధనశాఖ మంత్రి షబ్బీర్ అలీని కలిసి కేంద్రానికి సిఫారసు చేయాలని కోరింది. ఇందుకు అంగీకరించిన మంత్రి 2008 సెప్టెంబరు 14న కేంద్రానికి లేఖ రాశారు. 

ఈ ప్లాంటుకు గ్యాస్ కేటాయిస్తే రాష్ట్రానికి అదనపు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని... తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి రావడంతో పాటు విద్యుత్ కష్టాలు తీరుతాయని అందులో పేర్కొన్నారు. ఆ విధంగా గ్యాస్ కేటాయింపులు పొందిన తర్వాత ల్యాంకో సంస్థ మాట మార్చింది. 2010 మార్చిలో ఈ ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయింది. పట్టించుకునే వారు లేకపోవడంతో అప్పటి నుంచి 2011 ఫిబ్రవరి వరకు అంటే ఏడాదిపాటు తమిళనాడుకు విద్యుత్‌ను అమ్ముకుంది. అదీ యూనిట్ 5 రూపాయలకు. గత ఏడాది 2011 ఏప్రిల్ నుంచి మాత్రం మనకు విద్యుత్‌ను విక్రయిస్తోంది. తాజాగా గత జూన్ నుంచి వచ్చే ఏడాది మే వరకు ట్రాన్స్‌కో పిలిచిన టెండర్ల మేరకు విద్యుత్‌ను విక్రయిస్తానని ముందుకు వచ్చింది. అయితే యూనిట్ విద్యుత్‌ను ఏకంగా రూ.5.70కు సరఫరా చేస్తోంది. అంటే తమిళనాడు కంటే 70 పైసలు ఎక్కువ. మిగతా ప్లాంట్లతో పోల్చుకుంటే ఏకంగా రూ.3 ఎక్కువ. వాస్తవానికి 2011 ఏప్రిల్ 21న..ల్యాంకో, జీఎంఆర్‌లు రాష్ట్రానికే విద్యుత్ ఇవ్వాలని, లేదంటే వాటికి గ్యాస్‌ను కట్ చేస్తామని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. ల్యాంకో, జీఎంఆర్ సంస్థలు మీకు విద్యుత్ ఇస్తున్నాయా? ఎంత ధరకు ఇస్తున్నాయి? అని 2011 సెప్టెంబర్ 26 నాటి మరో లేఖలో రాష్ట్రాన్ని కేంద్రం ఆరా తీసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనం దాల్చింది.

యూనిట్‌కు రూ.3 అదనం: వాస్తవానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు రూ.2.70కే యూనిట్ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. ల్యాంకో సంస్థ కొండపల్లి స్టేజ్-1 ప్లాంటు, వేమగిరి (జీఎంఆర్) సంస్థ కూడా మనకు ఈ ధరకే విద్యుత్‌ను ఇస్తున్నాయి. అంటే ల్యాంకో స్టేజ్-2, జీఎంఆర్ ప్లాంట్ల వల్ల యూనిట్‌కు రూ.3 అదనంగా వెచ్చించాల్సి వస్తోందన్నమాట. ల్యాంకో సంస్థ 90 మెగావాట్లు, జీఎంఆర్ బార్జ్‌వంట్‌లు 81 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. రెండూ కలిపి 171 మెగావాట్లు... అంటే సుమారు 4 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే యూనిట్‌కు అదనంగా రూ.3 చొప్పున రోజుకు 1.2 కోట్లు, ఏడాదికి ఏకంగా రూ.438 కోట్ల మేరకు రాష్ట్ర ఖజానాపై భారం పడుతోందన్నమాట. ఇంత భారం పడుతున్నా.. తక్కువ ధరకు విద్యుత్‌ను ఇవ్వకపోతే గ్యాస్ కట్ చేస్తామని కేంద్రం లేఖల మీద లేఖలు రాస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!