YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 24 February 2012

Kiran Kumar Reddy is binami for Chandrababu

 సీఎం కిరణ్, చంద్రబాబు ఏజెంట్: బాజిరెడ్డి గోవర్దన్

హైదరాబాద్, న్యూస్‌లైన్:ఎమ్మార్ కేసులో జైలుకెళ్లాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు కాపాడారో బహిరంగపర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్ డిమాండ్ చేశారు. కిరణ్-చంద్రబాబుల వ్యవహారం ‘లోపల కుస్తీ... బయట దోస్తి’ అన్న చందంలా ఉందని విమర్శించారు. చంద్రబాబుకు ఏజెంట్‌లా సీఎం పనిచేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

శాసనసభలో ఇద్దరూ ఒకరి ప్రయోజనాలు మరొకరు కాపాడుకుంటూ అధికారపక్ష పాత్రలో కిరణ్, ప్రతిపక్షపాత్రలో చంద్రబాబు రక్తి కట్టించారని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు వీరిద్దరూ చేస్తున్న అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 

‘‘ఎమ్మార్‌లో విల్లాలు కొనుగోలు చేసిన వారందరినీ విచారించిన సీబీఐ జేడీ లక్ష్మినారాయణ... చంద్రబాబు కోడలు బ్రహ్మణిని ఎందుకు విచారించలేదు? కాంగ్రెస్‌తో ఉన్నఫిక్సింగ్ కారణంగానే వారి వద్దకు వెళ్లలేదా? ఈ కేసులో జైలుకెళ్లాల్సిన చంద్రబాబును కూడా అందులో భాగంగానే సీఎం కిరణ్ ఆదుకున్నట్లా?’’ అని నిలదీశారు. వైఎస్ మరణం తర్వాత శంకర్రావు పిటిషన్ మొదలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, బాన్సువాడ ఉప ఎన్నిక, మానవహక్కుల కమిషన్ చైర్మన్, శాసనసభలో అవిశ్వాస తీర్మానం... ఆఖరికి సమాచార కమిషనర్ల దాకా ఇలా అన్నింట్లో కాంగ్రెస్‌తో చంద్రబాబు చేసుకున్న మ్యాచ్‌ఫిక్సింగ్‌ను ఆయన వివరించారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ ఇన్నాళ్లుగా చెబుతున్న వాటినే తాజాగ పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెబుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్న అవేవి పట్టని ప్రతిపక్షనేత చంద్రబాబు దివంగత వైఎస్‌ఆర్ ఏ విధంగా అప్రతిష్ట పాలుచేయాలనే ఆలోచనతో ఉన్నారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ సక్రమంగా అమలు కాకపోయినా చంద్రబాబు కిమ్మనడం లేదంటే వీరిద్దరి మధ్య సహకార బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతుందన్నారు. 

లోకేష్ ‘చదివింపు’లు బయటపెట్టాలి

చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు విదేశాల్లో చదువుకు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి ఐటీ రిటర్న్, బ్యాంక్ లావాదేవీలను ప్రజల ముందుంచాలని గోవర్దన్ డిమాండ్ చేశారు. అతని యూనివర్సిటీ ప్రవేశానికి కారణమైన జీ మ్యాట్ కోర్‌ను విడుదల చేయాలన్నారు. లోకేష్ చదువుకు సత్యం రామలింగరాజు రూ.60 కోట్లు చెల్లించారని దివంగత వైఎస్ అసెంబ్లీలో బయటపెడితే దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఇన్నాళ్ల తర్వాత చంద్రబాబు స్పందించడంలో మర్మమేమిటని నిలదీశారు. 

లోకేష్ చదువులకు తానే డబ్బు కట్టినట్లయితే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ తప్పుడు మాటలు, అసత్యాలతో కాలం వెళ్లదీసే చంద్రబాబు... తాను గొప్ప సత్యహరిశ్చంద్రుడనని చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. చంద్రబాబు అవకాశవాదాన్ని గమనించినందునే తెలుగు ప్రజలు రెండుసార్లు ఛీ కొట్టారని గోవర్దన్ వివరించారు.
అయినా ఈ విషయమై ఆరోపణలు చేసిన ఆరు నెలలకు ఇప్పుడు స్పందిస్తారా? అని ప్రశ్నించారు. ఖర్చు పెడితే లోకేష్ చదువుకు అయిన 60 కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని నిలదీశారు. 

సమయం సందర్భంలేకుండా మహానేత డాక్టర్ వైఎస్ గురించి మాట్లాడుతున్నారని బాజిరెడ్డి అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!