YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 23 June 2012

చంచల్ గూడా జైలుకు చేరుకున్న ఇడి అధికారులు

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు ఈ ఉదయం చంచల్ గూడా జైలుకు చేరుకున్నారు. ఓఎంసి, ఎమ్మార్ ప్రాపర్టీస్, వైఎస్ జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసులకు సంబంధించి వారు ఇక్కడ మూడు రోజులు విచారిస్తారు. ఈ మూడు కేసులతో సంబంధం ఉన్న 9 మంది నిందితులను విచారిస్తారు. ఈరోజు ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మీ, ఓఎంసి ఎండి శ్రీనివాస రెడ్డి, రాజగోపాల్ లను విచారించే అవకాశం ఉంది. మొత్తం ఆరుగురు ఇడి అధికారులు ఇక్కడికి వచ్చారు.

Don't Alcohol In Tirupati : Bhumana Karunakar Reddy

రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

 సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో కలిసి భూ సెటిల్‌మెంట్‌లు చేసిన వ్యవహారంలో తెలుగుదేశం యువ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం తకరాజుగూడ శివారులోని చల్లంపల్లి గ్రామంలో ఎన్‌ఆర్‌ఐ మహిళకు చెందిన భూమిని స్వాహాచేసిన గుట్టును రట్టు చేసేందుకు రాష్ర్ట నేర పరిశోధన విభాగం(సీఐడీ) రంగంలోకి దిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న భాను కిరణ్, దంతులూరి కృష్ణను సీఐడీ పోలీసులు శనివారం కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసునకు సంబంధించి వీరిద్దర్నీ ఐదురోజులపాటు విచారించనున్నారు. చల్లంపల్లి గ్రామంలో టి.సునీత అనే ఎన్‌ఆర్‌ఐకి చెందిన 25 ఎకరాల భూమిని స్వాహాచేసిన వ్యవహారంపై సీఐడీ అధికారులు విచారణ జరిపి కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. 

సునీత వర్జీనియాలో ఉంటున్న విషయం తెలిసి చ ల్లంపల్లి గ్రామంలో ఆమెకున్న 25 ఎకరాలను కొట్టేసేందుకు నిందితులు ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాస్ పుస్తకాలు సృష్టించారు. ఈ విషయం తెలిసిన ఆమె స్వగ్రామానికి తిరిగివచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో భానుకిరణ్, దంతులూరి కృష్ణతో కలసి రేవంత్‌రెడ్డి సెటిల్‌మెంట్ చేసినట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో తేలింది. అందుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను సేకరించేందుకు భానుకిరణ్, కృష్ణలను సీఐడీ కస్టడీకి తీసుకుంది. చర్లపల్లి జైలు నుంచి వారిని శనివారం ఉదయం కస్టడీకి తీసుకుని.. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల తరువాత విచారణ ప్రారంభించారు. విచారణ అనంతరం రాత్రి కూడా సీఐడీ కార్యాలయంలోని సెల్‌లోనే వారిని ఉంచుతారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కూడా సీఐడీ విచారించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.

నేటినుంచి ‘భూమన’ నిరశన. తిరుపతిని మద్యరహిత నగరంగా చేయాలని డిమాండ్


‘రెండువేల ఏళ్ల చారిత్రక ప్రాశస్త్యం కలిగి, మూడు లక్షల మందికి పైగా నివసించే తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిదీ. తిరుపతి శాసనసభ్యునిగా నావంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నా మొట్టమొదటి లక్ష్యం తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా చూడడమే. అందుకే తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, నేటినుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను నగరంలో పర్యటించినప్పుడు భర్తల తాగుడు కారణంగా పుస్తెలు తెగిపోయాయని, ఇల్లు గుల్లయిందని చాలామంది మహిళలు కన్నీరు పెట్టుకున్నారని చెప్పారు. తిరుపతి పవిత్రతను కాపాడడంతో పాటు మహిళల కన్నీరు తుడవడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇది చాలా సున్నితమైన సమస్యని.. మానవీయకోణంలో చూడాల్సి ఉందన్నారు. తిరుపతిలో మద్యం ఏరులై పారుతోందని, ఏడాదికి రూ.190 కోట్లకుపైగా మద్యం వ్యాపారం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

దివంగత సీఎం వైఎస్సార్ హెలికాప్టర్ దుర్ఘటనకు సంబంధించిన దర్యాప్తును కూడా ఆగమేఘాల మీద ముగించింది ప్రస్తుత జేడీ లక్ష్మీనారాయణే

తమ చీకటి ఒప్పందాన్ని కాపాడుకునేందుకు ఎల్లో మీడియా పాట్లు పడుతోంది
అందుకే మీడియాను, మహిళను కించపరిచారంటూ దుష్ర్పచారం చేస్తోంది
విలేకరులు సీబీఐ జేడీకి ఫోన్ చేయడాన్ని మా పార్టీ ఎక్కడా తప్పుపట్టలేదు
లక్ష్మీనారాయణపై మాకు అనేక అనుమానాలున్నాయి..
వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై హడావుడిగా దర్యాప్తును ముగించింది ఆయనే
2011 సెప్టెంబర్, డిసెంబర్ మధ్య ఈనాడు.. ఈటీవీలకు జేడీ 23 కాల్స్ చేశారు.. 148 ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చారు.. ఆంధ్రజ్యోతి రిపోర్టర్లకు 4 కాల్స్, 68 ఎస్‌ఎంఎస్‌లు 
జేడీ నుంచి సాక్షి రిపోర్టర్లకు ఒక్క ఔట్ గోయింగ్ కాల్ కూడా లేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రను ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత దాన్ని పక్కదారి పట్టించేందుకు ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. జగన్‌పై జరుగుతున్న కుట్రను ప్రజలకు చెప్పకుండా, నిజాలు దాచిపెట్టి వారి చీకటి ఒప్పందాన్ని కాపాడుకునేందుకు ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోందని దుయ్యబట్టారు. అందుకే మీడియాను, మహిళను కించపరిచారంటూ అనవసర అంశాలను తెరపైకి తెచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారని విమర్శించారు. విలేకరులు సీబీఐ జేడీకి ఫోన్లు చేయడాన్ని తమ పార్టీ ఎక్కడా తప్పు పట్టలేదని స్పష్టం చేశారు. జేడీ లక్ష్మీనారాయణ వృత్తి ధర్మాన్ని అతిక్రమించడాన్నే ప్రశ్నించామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న జేడీని బాధ్యతగల మీడియా ఎందుకు ప్రశ్నించదు... వృత్తి ధర్మాన్ని సరిగా నిర్వహించని వ్యక్తిపై చర్చా కార్యాక్రమాలు ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. 

‘‘కాంగ్రెస్, టీడీపీ కలిసి జగన్‌మోహన్‌రెడ్డిపై రాజకీయంగా చేస్తున్న కక్షసాధింపు చర్యల్లో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ భాగస్వామ్యం కావడంలో ఉన్న మతలబు ఏమిటి? జేడీ తీరు చూస్తుంటే పాత కక్షలున్న వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో దర్యాప్తు చేయాలనే ఆలోచన ఇసుమంతైనా కనిపించడం లేదు. హైకోర్టు ఆదేశాలను కూడా తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అందుకే జగన్‌పై టీవీ సీరియల్స్ మాదిరిగా చార్జిషీట్లు వేస్తున్నారు. కస్టడీ పేరుతో రోజుకో చోటుకి మారుస్తూ.. అది ఎల్లో మీడియాకు లీక్ చేస్తున్నారు. జగన్‌ను డొక్కు వ్యానులో కోర్టుకు తరలించడం లాంటివి దేనికి సంకేతం..’’ అని ప్రశ్నించారు.

జేడీ పాత్రపై అనేక అనుమానాలున్నాయి..

సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న జేడీ లక్ష్మీనారాయణ పాత్రపై అనేక అనుమానాలున్నాయని గట్టు అన్నారు. ఒక వర్గం మీడియా ప్రతినిధులతోనే గంటల తరబడి సంభాషించడం, ఆ తర్వాత రోజు జగన్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం కావడాన్ని బట్టి చూస్తే ఆయన దర్యాప్తులో ఎంత చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతుందని పేర్కొన్నారు. 

‘‘ఈనాడు, ఈటీవీలను చూస్తే సెప్టెంబర్-డిసెంబర్ 2011 మధ్య జేడీ స్వయంగా 23 కాల్స్ చేశారు. 27 కాల్స్‌ను ఆన్సర్ చేశారు. 148 ఎస్‌ఎంఎస్‌లు స్వయంగా ఆయనే ఇచ్చారు. అదే విధంగా ఇద్దరు ఆంధ్రజ్యోతి రిపోర్టర్లకు స్వయంగా 4 కాల్స్ చేశారు. వాళ్లు ఫోన్ చేసినప్పుడు 23 కాల్స్ లిప్టు చేశారు. 68 ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చారు. అయితే సాక్షికి చెందిన ఇద్దరు రిపోర్టర్లకు జేడీ నుంచి ఒక్క ఔట్ గోయింగ్ కాల్ కూడా వెళ్లలేదు. వీళ్లిద్దరి నుంచి వెళ్లిన ఇన్‌కమింగ్ కాల్స్‌లో రెండింటిని మాత్రమే ఆయన లిప్టు చేశారు. ఈ ఇద్దరికీ కలిపి జేడీ 26 ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చారు. జేడీ ఇలా వివక్ష ప్రదర్శించడంలో మతలబు ఏంటి? అంతేకాదు.. దివంగత సీఎం వైఎస్సార్ హెలికాప్టర్ దుర్ఘటనకు సంబంధించిన దర్యాప్తును కూడా ఆగమేఘాల మీద ముగించింది ప్రస్తుత జేడీ లక్ష్మీనారాయణే కనుక మాకు మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ తిరిగి అధికారంలోకి వస్తే వైఎస్ మృతి వెనుక కుట్ర బయటపడుతుందనే ఉద్దేశంతోనే జేడీ ఈ విధంగా చేస్తున్నారా? అందుకే జగన్‌ను రాజకీయంగా ఏదో విధంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారా?’’ అని నిలదీశారు. సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరించిన జేడీ లక్ష్మీనారాయణపై సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, ప్రధానితో పాటు కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

చంద్రబాల ఎవరో మాకు తెలియదు..

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్ లిస్ట్‌లో వందల కాల్స్ ఉన్న వాసిరెడ్డి చంద్రబాల ఎవరో తెలుసుకోవడం కోసం పేరు బయటపెట్టినట్లు గట్టు తెలిపారు. ఆ ఫోన్ నంబర్ చుట్టూ నెలకొన్న వివాదాలనే తాము పేర్కొన్నామే తప్ప చెడుగా ఎక్కడా మాట్లాడలేదని వివరించారు. చంద్రబాల పురుషుడా... మహిళా... అన్న విషయం కూడా తమకు ముందుగా తెలియదని, జగన్‌పై కుట్రలు జరుగుతున్న దృష్ట్యా వాటిని బయటపెట్టడంలో భాగంగానే పేర్లను వెల్లడించినట్లు పేర్కొన్నారు. ‘‘జేడీ కాల్ లిస్టులో కొన్ని వందలసార్లు చంద్రబాల అనే పేరు గల వ్యక్తికి ఫోన్ వెళ్లడం, అక్కడి నుంచి జగన్ కేసుకు సంబంధించిన వారు... అంటే విదేశాల్లో ఉన్న డెలాయిట్ సంస్థ ప్రతినిధులకు కాల్స్ వెళ్లడం, జగన్‌కు వ్యతిరేకంగా నిత్యం విషప్రచారం సాగించే ఆంధ్రజ్యోతి ఎండీతో, ఒక పోలీస్ ఉన్నతాధికారితో తరచుగా సంభాషించడం పట్ల ఆ నంబర్ గల వ్యక్తిని బయటపెట్టాం’’ అని వివరించారు. 

చంద్రబాలను తెరపైకి తెచ్చి ఆమెకు మానవ సంబంధాలు, ఇతర అనవసర విషయాలను ఆపాదిస్తూ చెడుగా చిత్రీకరిస్తున్నది ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణనే అని అన్నారు. వివాదంలో ఉన్న వారిద్దరే సొంత డబ్బా ఉంది కదాని ఒకరికొకరు క్లీన్‌చిట్ ఇచ్చుకోవడం ఎంతవరకు సమంజసమని గట్టు ప్రశ్నించారు. చంద్రబాల చెబుతున్న సమాధానాలు పొంతనలేని విధంగా ఉన్నాయన్నారు. లీడ్ ఇండియా ప్రచారం కోసమే వారితో ఫోన్ సంభాషణలు జరిపానంటున్న ఆమె సమాధానానికి, లభించిన ఆధారాలకు పొంతనే లేదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాల.. లీడ్ ఇండియాకు యాహూ ద్వారా పంపిన ఈ మెయిల్‌ను గట్టు బయటపెట్టారు. లీడ్‌ఇండియా కార్యక్రమం నిర్వహిద్దామంటూ మార్చి 14న నిర్ణయిస్తే.. అంతకుముందే సెప్టెంబర్ నుంచే ఫోన్ సంభాషణలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

జేడీకి రాజకీయ పార్టీ ఫ్లెక్సీలు కట్టడమా?

రాష్ట్రంలో 18 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఒక రాజకీయ పార్టీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు ప్లెక్సీలు పెట్టగా, ఆయన వాటిపై పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడంలో ఉన్న అంతర్యమేమిటని గట్టు ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ రాధాకృష్ణ జర్నలిజం విలువలకు మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తన స్టింగ్ ఆపరేషన్ల కోసం తరచూ మహిళలను ఉపయోగించుకునే వ్యక్తి, వారికోసం పాటుపడుతున్నానని చెప్పడం విడ్డూరమన్నారు. చంద్రబాల అనే మహిళను స్టూడియోలో కూర్చోబెట్టి అవమానపరిచింది ఆయనేనన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చేత, ఆయన బినామీ పెట్టుబడులతో పత్రికను నిర్వహిస్తున్న రాధాకృష్ణ నీతులు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఆయన చరిత్ర ఏంటో.. ఎలా ఎదిగారో జర్నలిస్టు మిత్రులందరికీ తెలుసునన్నారు. ‘‘ప్రజలను అమ్ముడుపోయారని కించపరిచే విధంగా మాట్లాడటం సిగ్గుచేటు. నమ్ముకున్న వ్యక్తికి జనాలు ఓట్లు వేశారు. కానీ రాధాకృష్ణ మాత్రం తన సంస్థలో పెట్టుబడులు పెట్టిన వ్యక్తికి, ఆ పార్టీకి ఊడిగం చేస్తున్నారు’’ అని గట్టు మండిపడ్డారు.

అంతా పథకం ప్రకారమే ,జగన్ కేసులో సీబీఐ తీరు ఆక్షేపణీయం

 హైకోర్టు సీనియర్ న్యాయవాది రామచంద్రరావు
* ములాయం, మాయావతి, జయలలితపైనాఆదాయానికి మించిన ఆస్తుల కేసులు
* కానీ అవన్నీ ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి
* జగన్ కేసులోనే సీబీఐ దృష్టినంతా కేంద్రీకరించింది 
* విచారణకు జస్టిస్ కక్రూ ఆదేశించడంపైనే న్యాయవర్గాల్లో అనుమానాలు
* ఆ తర్వాత ఆయనను హెచ్‌ఆర్సీ చైర్మన్ చేశారు
* సీబీఐ జేడీ లక్ష్మీనారాయణపై రాజకీయ ఒత్తిళ్లు
* ఆయన ఫోన్ సంభాషణలు, మీడియాకు లీకులూ సందేహాస్పదమే
* కోర్టులను ప్రభావితం చేసేలా మీడియా సమాంతర దర్యాప్తు
* బొత్స అవినీతిపరుడు.. కిరణ్ అసమర్థుడు
* అవినీతిని అడ్డుకోకపోగా, ప్రోత్సహిస్తున్నాడు
* కేంద్రం కల్పించుకుని రాష్ట్రపతి పాలన విధించాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసు దర్యాప్తు తీరుతెన్నులను హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీరామగిరి రామచంద్రరావు తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘యూపీ మాజీ ముఖ్యమంత్రులు ములాయంసింగ్ యాదవ్, మాయావతి, తమిళనాడు సీఎం జయలలిత వంటి ఎందరో రాజకీయ నాయకులపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులున్నా, అవన్నీ ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒక్క జగన్ కేసులో మాత్రమే సీబీఐ రోజువారీ పద్ధతిలో దృష్టినంతా కేంద్రీకరించి దర్యాప్తు చేస్తోంది. పైగా దర్యాప్తులో ఆద్యంతం వింతగా వ్యవహరిస్తోంది. అందులో పలు అవలక్షణాలు, తమాషాలు కొట్టొచ్చినట్టుగా కన్పిస్తున్నాయి. నేరాన్ని ఒప్పుకుంటున్నాననే రీతిలో సమాధానాలు చెప్పాలన్న సీబీఐ తీరు రాజ్యాంగ విరుద్ధం’’ అంటూ విమర్శించారు. 

జగన్‌ను శిక్షించాలన్న తాపత్రయమే దర్యాప్తులో అడుగడుగునా కన్పిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిపై మాత్రమే పెట్టాల్సిన కేసును జగన్‌పై పెట్టారని, కాబట్టి అసలీ కేసే చెల్లనిదని తేల్చిచెప్పారు. అసలు జగన్ కేసుపై అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ సీబీఐ విచారణకు ఆదేశించిన తీరుపైనే న్యాయ వర్గాలకు ఎన్నో అనుమానాలున్నాయని ఆయన తెలిపారు. విచారణ జరుపుతున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణపై రాజకీయ ఒత్తిళ్లున్నాయని అభిప్రాయపడ్డారు. 

‘‘సీబీఐ దర్యాప్తు, కోర్టులో వాదిస్తున్న తీరు తదితరాలను పరిశీలిస్తే అంతా ఒక పథకం ప్రకారమే జరుగుతోందన్న అనుమానం బలపడుతోంది. దర్యాప్తు పూర్తవకుండానే చార్జిషీట్లు దాఖలు చేయడం, అదీ ఒకే ఎఫ్‌ఐఆర్‌పై పలు చార్జిషీట్లు వేయడం జగన్ కేసులో మాత్రమే జరుగుతున్నాయి. దర్యాప్తు అధికారి ఫోన్ సంభాషణల తీరుతెన్నులు, విచారణ వివరాలను ఎంపిక చేసిన కొన్ని పత్రికలకే ఆయన లీక్ చేయడం వంటివన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయి. పైగా ఒక వర్గం మీడియా కూడా కోర్టు విచారణకు సమాంతరంగా విచారణ జరుపుతూ న్యాయస్థానాలను ప్రభావితం చేయజూస్తోంది’’ అని శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. 

బినామీ పేర్లతో వందలాది మద్యం దుకాణాలు నడుపుతున్న బొత్సకు మంత్రి పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగే అర్హత లేదని ఆయనన్నారు. సీఎం కిరణ్ కూడా అవినీతిని అడ్డుకోకపోగా, ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో అవినీతి హద్దు మీరిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. అందుకే కేంద్రం కల్పించుకుని రాష్ట్రపతి పాలన విధించాలని తన క్లయింట్ గిరి యాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

‘‘జగన్ కేసులో సీబీఐ దర్యాప్తు తీరు వింత పోకడలు పోతోంది. పుకార్లు, అనుమానాలు ఉండొచ్చు. కానీ హైకోర్టు ఆదేశాల మేరకు ఒకసారి దర్యాప్తు ప్రారంభమైన తర్వాత చట్టం ముందు అందరూ సమానమే...చట్టం అందరికీ సమానమే అన్నట్లుగా దర్యాప్తు కొనసాగాలి. దర్యాప్తు న్యాయపరంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగడమేకాక జరిగినట్లు కూడా కనిపించాలి. ఆధారాల ఆధారంగానే దర్యాప్తు కొనసాగాలి. ఇతర కేసులు, నిందితుల తరహాలోనే ఆయన్ను విచారించాలి. నేరం రుజువైతే శిక్ష విధించవచ్చు. కానీ సీబీఐ దర్యాప్తులో అనేక అవలక్షణాలు, తమాషాలు కనిపిస్తున్నాయి. సాక్ష్యాల ఆధారంగా కోర్టు విచారణ సాగాలి. కానీ కోర్టులను ప్రభావితం చేసేలా మీడియా ట్రయల్ నడుస్తోంది. ఆయన నేరస్తుడంటూ మీడియా ప్రచారం చేస్తూ కోర్టు ట్రయల్‌కు సమాంతరంగా మీడియా ట్రయల్ చేస్తోంది. కోర్టులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. 

జస్టిస్ కక్రూ ఆదేశాలపైనే అనుమానాలు
హైకోర్టు ఆదేశాలతోనే సీబీఐ దర్యాప్తు ప్రారంభించిందని అందరూ అంటున్నా..హైకోర్టు ఆదేశాలపైనే న్యాయవర్గాలకు అనుమానాలున్నాయి. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే ముందు హైకోర్టు విచారణ సక్రమంగా జరగలేదనే అభిప్రాయం న్యాయవాద వర్గాల్లో ఉంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ కొన్ని వందల కేసులను కొట్టేసినా, కేవలం రెండు కేసుల్లో మాత్రమే తీర్పులు ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ దర్యాప్తు అందులో ఒకటి. రెండోది స్థానిక సంస్థల ఎన్నికల కేసు. జగన్‌పై వచ్చిన ఫిర్యాదుపై కక్రూ ఎందుకు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారనే దానిపై అనేక అనుమానాలున్నాయి. జగన్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాక జస్టిస్ కక్రూకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవిచ్చారనే విమర్శలూ ఉన్నాయి.

నిప్పులాంటి మనిషనుకున్నాం
సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ నిప్పులాంటి మనిషి అనుకున్నాం. అవినీతిపరుడు కాదని ఇప్పటికీ నమ్ముతున్నాం. కానీ ఆయన మీద రాజకీయ ఒత్తిడి, లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి పని చేసి ఉండవచ్చు. దర్యాప్తులో భాగంగా విలేకరులు ఫోన్లు చేయవచ్చు. దాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళతో లక్ష్మీనారాయణ మాట్లాడటం, తర్వాత ఆమె మళ్లీ ఓ పత్రికాధిపతితో పాటు అనేక మందితో మాట్లాడటమే అనేక అనుమానాలకు తావిస్తోంది. సేవా కార్యక్రమాల కవరేజీ కోసమే మీడియా అధిపతితో మాట్లాడానన్న చంద్రబాల మాటలు నమ్మశక్యంగా లేవు. కొన్ని వందల కాల్స్ మాట్లాడడం, మాట్లాడిన సమయాన్ని పరిశీలిస్తే ఆరోపణలు నిజమేనన్నట్టుగా ఉంది. లక్ష్మీనారాయణ ఇచ్చిన సమాచారాన్ని చంద్రబాల ఇతరులకు ఇచ్చినట్టు ఆమె కాల్ డేటాను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. 

అలాగే జగన్ కేసు దర్యాప్తు, కోర్టులో సీబీఐ వాదనల తీరు.. వీటన్నింటినీ పరిశీలిస్తే ఈ కేసు దర్యాప్తు ఒక పథకం ప్రకారమే కొనసాగుతోందన్న అనుమానం కలుగుతోంది. దర్యాప్తు తీరుపై దోషభూయిష్టంగా ఉందనే అనుమానాలకు తావిచ్చేలా ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు 2011 ఆగస్టులో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు 9 నెలల తర్వాత, అదీ ఉప ఎన్నికలు సమీపించిన తరుణంలో జగన్‌ను అరెస్టు చేయడం, దర్యాప్తు పూర్తవకుండానే చార్జిషీట్లు దాఖలు చేయడం, ఒకే ఎఫ్‌ఐఆర్‌పై అనేక చార్జిషీట్లు దాఖలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఏ కేసులోనూ ఇలా జరగదు. జగన్ కేసులో అసాధారణంగా ఎందుకిలా జరుగుతోందన్నదే అనుమానాస్పదం. జేడీపై రాజకీయ ఒత్తిడి పని చేస్తోందా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు ఆయన పని చేస్తున్నారా అన్నది సందేహాస్పదంగా ఉంది.

అలాంటి కేసులన్నీ పెండింగ్‌లోనే..
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, ములాయంసింగ్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితలపై కూడా ఆదాయానికి మించి ఆస్తుల కేసులు పెట్టారు. కానీ అవన్నీ కొన్నేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ ఒక్క జగన్‌పై నమోదు చేసిన కేసులోనే సీబీఐ దర్యాప్తు రోజువారీ పద్ధతుల్లో కొనసాగుతోంది. నిజానికి ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కేసును ప్రభుత్వ పదవులు అనుభవించిన వారిపై మాత్రమే పెట్టాలి. కాబట్టి అసలు జగన్‌పై పెట్టిన కేసే చెల్లనిది. నేరం జరిగిందని చెప్పిన సమయంలో జగన్ ఏ ప్రభుత్వ పదవిలోనూ లేరు. 

జగన్‌పై కేసు పెట్టే ముందు లోక్‌సభ స్పీకర్ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ ఇలాంటివేవీ సీబీఐ పట్టించుకోలేదు. దర్యాప్తుకు జగన్ సహకరించలేదని, తామడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదని కారణాలు చూపుతూ ఆయనకు సీబీఐ కస్టడీని పొడిగించాలని గతంలో అడిగింది. కానీ నేరం ఒప్పుకోవాలనే విధంగా సమాధానాలు చెప్పాలన్న సీబీఐ తీరు రాజ్యాంగ విరుద్ధం. పౌరులకు రాజ్యాంగం కల్పించిన 23వ అధికరణానికి ఇది విరుద్ధం. నిందితుడు తనకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే చెబుతాడు. అలాగాక తమను సంతృప్తిపర్చేలా సమాధానాలు చెప్పాలనడం చట్టబద్ధం కాదు.

జగన్‌ను ఎలాగైనా శిక్షించాలన్నదే లక్ష్యం
పోలీసులు, సీబీఐ ఎంత దిగజారినా జగన్ భౌతిక భద్రతకు భంగం కల్గిస్తారని అనుకోను. పైగా జగన్‌ను సాధారణ వ్యాన్‌లో తీసుకురావడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి, సరైన భద్రత కల్పించాలని ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలోనైనా వారు జాగ్రత్త పడతారని, భవిష్యత్తులో ఆ దిశగా తగిన చర్యలు తీసుకుంటారనే ఆశిస్తున్నాం. అయితే జగన్‌పై ఎలాగైనా నేరం నిరూపించి ఆయనను శిక్షించాలన్న తాపత్రయం బాగా కనిపిస్తోంది. శిక్షించాలనే పట్టుదలతో చేస్తున్న రాజకీయ ఒత్తిడికి సీబీఐ దోహదం చేస్తోంది. చెల్లని కేసులు పెట్టడం, అందులోనూ కొందరినే అరెస్టు చేయడం, దర్యాప్తు అధికారి ఫోన్ సంభాషణలు, దర్యాప్తు సమాచారాన్ని ఎంపిక చేసిన కొన్ని పత్రికలకే లీక్ చేయడం.. ఇలా సీబీఐ దర్యాప్తులో ప్రతి అంశమూ అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు ఒక పథకం ప్రకారమే సాగుతోందన్న అనుమానం కలుగుతోంది.

బొత్సకు పదవిలో కొనసాగే అర్హత లేదు
వందలాది మద్యం దుకాణాలను బినామీల పేర్లతో నిర్వహిస్తున్న పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణకు ఒక్క క్షణం కూడా మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టేప్పుడు చేసిన ప్రమాణానికి విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వందలాది మద్యం దుకాణాలను బొత్స నిర్వహిస్తున్నారు. తనకు 30 మద్యం దుకాణాలున్నాయని ఆయనే స్వయంగా అంగీకరించారు. వచ్చే ఏడాది వ్యాపారం చేయనని చెబుతున్నారు. కానీ తన దగ్గర పనిచేసే గుమాస్తాల పేరుతో బొత్స దుకాణాలు పొందారు. నెల జీతాలు తీసుకునే గుమాస్తాలు కోటి, రెండు కోట్లు చెల్లించి దుకాణాలు పొందారు! 

ఒక్క విజయనగరం జిల్లాలోనే 230 దుకాణాల్లో 130 దుకాణాలు బినామీల పేర్లతో ఉన్నాయి. సిండికేట్ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారు. మద్యం సిండికేట్లు, బినామీలపై ఏసీబీ దర్యాప్తును బొత్స అడ్డుకున్నారు. నిష్పాక్షికంగా దర్యాప్తు చేసిన ఏసీబీ జాయింట్ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయాలంటూ సోనియాగాంధీ, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జికి బొత్స లేఖ రాశారు. ఆయన్ను బదిలీ చేసేలా సీఎంపై ఒత్తిడి తెచ్చారు. 

ఇటీవలి దాకా ఆర్టీసీ చైర్మన్‌గా పని చేసిన ప్రసాదరావును ఏసీబీ చీఫ్‌గా వేశారు. మంత్రిగా బొత్స నిర్వహిస్తున్న రవాణా శాఖ పరిధిలోనే ఆర్టీసీ పని చేస్తుంది. అలాంటి సంస్థ నుంచి ప్రసాదరావును ఏసీబీకి బదిలీ చేయడం అనుమానాస్పదంగా ఉంది. ప్రసాదరావు మంచి అధికారే కావచ్చు. కానీ ఆయనను ఏసీబీ చీఫ్‌గా వేయడమే అభ్యంతరకరం. బొత్స అవినీతిపై దర్యాప్తు జరగాలి. ఆయన్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాం.

ముఖ్యమంత్రి కిరణ్ అసమర్థుడు..
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతిపరుడు కాకపోవచ్చు. కానీ అవినీతిపై చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహిస్తున్నారు. అవినీతి నిరోధక విభాగానికి అధిపతి అయిన ఆయన సక్రమంగా స్పందించడం లేదు. మద్యం మాఫియా కారణంగా ప్రభుత్వం రూ.15 వేల కోట్లు నష్టపోయిందని ఏసీబీ పీపీ కోర్టుకు నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,000 మద్యం దుకాణాల్లో ఏకంగా 3,000 బినామీ పేర్లతో ఉన్నాయని కూడా ఏసీబీ తేల్చింది. మద్యం వ్యాపారుల నుంచి అప్పటి ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ రూ.10 లక్షలు తీసుకున్నారని కూడా ఓ నిందితుని రిమాండ్ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది. మద్యం మాఫియా వెనుక 15 మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు, వందలాది మంది ప్రభుత్వాధికారులు ఉన్నారని తేలింది. అయినా సీఎం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. 

రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి విరుద్ధంగా మంత్రివర్గం వ్యవహరిస్తున్నా ఆయన నిశ్చేష్టుడిగా ఉన్నారు. అవినీతికి పాల్పడుతున్న వారిని వదిలి, దానిపై దర్యాప్తు చేసి, అవినీతికి బాధ్యులైన వారిని బయట పెట్టేందుకు ప్రయత్నించిన ఏసీబీ ఉన్నతాధికారులు భూపతిబాబు, శ్రీనివాసరెడ్డిలను సాగనంపారు. రాష్ట్ర ప్రభుత్వాల్లో అవినీతి హద్దు మీరినప్పుడు, శాంతిభద్రతలు క్షీణించినప్పుడు 355వ అధికరణం ప్రకారం కేంద్రం జోక్యం చేసుకొని సరిదిద్దాలి. పరిస్థితులు సర్దుకునేదాకా రాష్ట్రపతి పాలన పెట్టాలి. కానీ ఇవేవీ జరగలేదు. అందుకే హైకోర్టులో పిల్ దాఖలు చేశాం. అవి జూలై 2న విచారణకు రానున్నాయి.

ఆగని సీబీఐ వేధింపులు .జిల్లాల్లో ‘సాక్షి’ బ్యాంకు ఖాతాల స్తంభన

* అధికారికంగా సమాచారమివ్వని సీబీఐ, బ్యాంకు అధికారులు
* సాక్షిని ఆర్థికంగా దెబ్బతీసి.. ఉద్యోగులను రోడ్డున పడవేయడమే సీబీఐ లక్ష్యం
* హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహారశైలి
* ఏ చర్యా సాక్షి మూతపడే విధంగా ఉండకూడదన్న హైకోర్టు.. అయినా ఆ దిశగానే పావులు కదుపుతున్న దర్యాప్తు సంస్థ
* హైకోర్టును ఆశ్రయించనున్న సాక్షి యాజమాన్యం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తగదని చెప్పినా కూడా సాక్షి దినపత్రికపై సీబీఐ అధికారులు తమ వేధింపులను కొనసాగిస్తూనే ఉన్నారు. సాక్షిని ఆర్థికంగా దెబ్బతీసి, దాని ఉద్యోగులను రోడ్డునపడవేసే దిశగా ముందుకెళుతున్నారు. సాక్షి రోజువారీ వ్యవహారాలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని హైకోర్టు స్పష్టం చేసినా, సీబీఐ అధికారులు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నారు. స్తంభింప చేసిన ఖాతాల నిర్వహణకు హైకోర్టు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా, సీబీఐ అధికారుల తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా సీబీఐ అధికారులు తిరిగి సాక్షి దినపత్రిక ఖాతాలను స్తంభింపజేశారు. 

గతంలో సాక్షి ప్రధాన కార్యాలయానికి చెందిన ఖాతాలను స్తంభింప చేసిన సీబీఐ అధికారులు, ఇప్పుడు సాక్షికి సంబంధించి అన్ని జిల్లాల కార్యాలయాలకు చెందిన ఖాతాలను నిలుపుదల చేయించారు. అన్ని జిల్లాల్లోని సాక్షి ఖాతాలను స్తంభింప చేయాలంటూ సీబీఐ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్‌బీఐ) ఈ నిర్ణయం తీసుకుంది. ఖాతాల స్తంభన విషయంలో సాక్షి న్యాయపోరాటంతో ఖంగుతిన్న సీబీఐ అధికారులు, ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఖాతాల స్తంభనకు సంబంధించి సాక్షి యాజమాన్యానికి శనివారం రాత్రి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సీబీఐ అధికారుల ఆదేశంతో బ్యాంకు అధికారులు కూడా ఇప్పటి వరకు ఖాతాల స్తంభనపై సాక్షి యాజమాన్యానికి అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

సంస్థ నడిచేదెట్లా... గతంలోనే అడిగిన హైకోర్టు
జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, ఇందిరా టెలివిజన్‌లకు హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐఓబీ)ల్లో ఉన్న కరెంట్ ఖాతాలను గత నెలలో సీబీఐ అధికారులు స్తంభింప చేశారు. దీంతో ఈ మూడు కంపెనీల ప్రతినిధులు సీబీఐపై హైకోర్టులో న్యాయపోరాటం ప్రారంభించారు. వాదనల సమయంలోనే హైకోర్టు సీబీఐకి పలుమార్లు చీవాట్లు పెట్టింది. ఖాతాలను స్తంభింప చేస్తే సంస్థ పని చేసేదెట్లా..? అందులోని ఉద్యోగుల మాటేమిటి..? అంటూ సీబీఐని న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ సూటిగా ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, మూడు కంపెనీల ఖాతాలను నిర్వహించుకునేందుకు కొన్ని షరతులతో అనుమతిని మంజూరు చేసింది. 

జీతాలు ఇవ్వాలి కదా...
అంతేకాక సాక్షి పత్రిక, టీవీ, జనని ఇన్‌ఫ్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు అందకుండా ఉండే పరిస్థితులు తలెత్తకూడదని న్యాయమూర్తి గతంలోనే తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉద్యోగులు కేవలం జీతంతోనే బతుకు వెళ్లదీయగలరని, వారిపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని తెలిపారు. బ్యాంకు ఖాతాల స్తంభన వల్ల వారు వీధులపాలయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకు ఈ కోర్టు అంగీకరించదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. సాక్షిని నమ్ముకున్న ఉద్యోగులను, ఉద్యోగులపై ఆధారపడి ఉన్న వారి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అందుకు సంస్థ కార్యకలాపాలు ఏదో రకంగా నడపాల్సిన అవసరం ఉందని తెలిపారు. చర్య ఏదైనా సాక్షి దినపత్రిక, టీవీ మూతపడే విధంగా ఉండకూడదని జస్టిస్ చంద్రకుమార్ సీబీఐకి తేల్చి చెప్పారు. 

అంతేకాక సాక్షికి వచ్చే మొత్తం ఆదాయం నెలవారీ ఖర్చుల నిమిత్తం సరిపోవచ్చునని కూడా న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైకోర్టు ఇంత స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసినా సీబీఐ మాత్రం ఆ ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరిస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు తమకు ఏ మాత్రం వర్తించవనే విధంగా వ్యవహరిస్తూ.. నెలాఖరు సమీపిస్తున్న దశలో... మరో ఐదారు రోజుల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉన్న తరుణంలో సీబీఐ ఖాతాలను నిలుపుదల చేయడం గమనార్హం. సీబీఐ చర్యలపై సాక్షి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించనున్నది.

మూడు లక్షల ఎకరాలకు నీరంటూ మూడేళ్లుగా ఉత్తుత్తి మాటలు

* సాగునీటి ప్రాజెక్టులపై సర్కారు చిన్నచూపు
* చివరి దశలో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపైనా నిర్లక్ష్యమే
* 7 ప్రాజెక్టులు పూర్తిగా, 17 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తిచేస్తామని మూడేళ్లుగా చెప్తున్న సర్కారు 
* ఈ 7 ప్రాజెక్టుల పూర్తికి కావలసింది రూ. 300 కోట్లే 
* వాటి కింద లక్ష ఎకరాల వరకూ కొత్త ఆయకట్టుకు నీరు 
* అయినా ఇప్పటివరకూ ఏ ప్రాజెక్టుకూ పైసా విదల్చని వైనం 
* ధరలు పెంచాలని కాంట్రాక్టర్ల డిమాండ్.. ఏడాదిన్నరగా ఫలించని సర్కారు చర్చలు 
* ధరలు పెంచితే ప్రాజెక్టులపై మొత్తం రూ. 10 వేల కోట్ల అదనపు భారమంటూ సర్కారుకు ఈఎన్‌సీ కమిటీ నివేదిక 
* ఆ భయంతో నిర్ణయం తీసుకోకుండా నాన్చుతున్న సర్కారు
* ఈ ఖరీఫ్ సీజన్‌లోనూ కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందటం మృగ్యమే
* వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు 
* ఆయన మరణం తర్వాత ఒక్క ప్రాజెక్టూ పూర్తికాని వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: కేవలం మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తే.. చివరి దశలో ఉన్న ఏడు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిపోయి.. దాదాపు లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది.. ఆ మేరకు సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఈ ఏడు ప్రాజెక్టులనూ పూర్తి చేసేస్తున్నాం అంటూ సర్కారు వారు గత మూడేళ్లుగా చెప్తూనే ఉన్నారు. కానీ.. ఆచరణలో మాత్రం అడుగు ముందుకు వేయటం లేదు. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తి చేయటానికి ఇక అవసరమైంది కేవలం రూ. 95 కోట్లు మాత్రమే. అది పూర్తయితే.. 20,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. 

అలాగే.. గురురాఘవేంద్ర లిఫ్టును పూర్తి చేయటానికి మరో రూ. 66 కోట్లు ఇస్తే చాలు.. దాని కింద 23,000 ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. రూ. 38 కోట్లు ఖర్చు పెడితే భూపతిపాలెం ప్రాజెక్టు పూర్తయి.. 14,000 ఎకరాల భూమిలో సాగు నీరు ప్రవహిస్తుంది. అంతెందుకు.. వంశధార-1, మత్తడివాగు ప్రాజెక్టులను పూర్తిచేయటానికి ఒక్కోదానికి కావలిసింది కేవలం రెండంటే రెండు కోట్లు మాత్రమే. ఆయా ప్రాజెక్టుల కింద ఐదు వేల ఎకరాల చొప్పున భూమి కొత్తగా సాగులోకి వస్తుంది. కానీ.. ఆ నిధులివ్వటానికీ సర్కారుకు మనసు రావటం లేదు. అదిగో ఇదిగో అంటూ ప్రతిసారీ ఖరీఫ్ సీజన్‌కు ముందు.. కొత్తగా 3 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని హామీ ఇవ్వటమే తప్ప దానిని ఆచరణలో పెట్టిన పాపాన పోలేదు. 

నిర్మాణం చివరి దశలో ఉన్న 7 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 17 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉత్తుత్తి మాటలు చెప్పటం తప్ప.. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టటం లేదు. ఇటీవలి ఉప ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు అంటూ ఆగమేఘాల మీద వందల కోట్లు మంజూరు చేసింది. కానీ లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే సాగునీటి ప్రాజెక్టులను.. అందునా తుది దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయటానికి రూ. 300 కోట్లు భారమయ్యాయా? అని రైతాంగం, సాగునీటి రంగ నిపుణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైఖరినిబట్టే సర్కారు ప్రాధాన్యాలేమిటన్నది తేలిపోతోందని వారు విమర్శిస్తున్నారు.

అన్నీ ఆర్భాటపు ప్రకటనలే... 
మూడేళ్లుగా సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఖరీఫ్ నాటికి కొత్తగా మూడు లక్షల ఎకరాలకు నీరందిస్తామని నాలుగు నెలల కిందట మరోసారి ఆర్భాటంగా ప్రకటించింది. కానీ.. అది కూడా అమలు చేయలేకపోయింది. నిర్మాణం చివరి దశలో ఉన్న వంశధార-1, భూపతిపాలెం, ముసురుమిళ్లి, గురురాఘవేంద్ర లిప్టు, గుండ్లకమ్మ, మత్తడివాగు, చౌటుపల్లి హన్మంతరెడ్డి లిప్టు ప్రాజెక్టులను ఖరీఫ్ నాటిని పూర్తి చేస్తామని ఏడాది కిందట ప్రకటించారు. వాస్తవానికి ఈ ఏడు ప్రాజెక్టులకూ కలిపి రూ. 300 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. 

అలాగే మరో 17 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి వాటి ద్వారా కూడా నీరు అందిస్తామన్నారు. వీటిని కూడా కలిపితే.. సుమారు రూ. 4,000 కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేశారు. కానీ వీటిని పూర్తి చేయటంలో ప్రభుత్వం విఫలమైంది. పనులు జరిగే సీజన్‌లో నిధుల కొరత అంటూ సమస్య సృష్టించారు. నిధుల విడుదల ఆలస్యం అవుతున్న కొద్దీ సిమెంటు, ఇనుము తదితరాల ధరలు పెరగటంతో.. పెరిగిన ధరలను తమకు వర్తింపజేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ పెట్టారు. సాధారణంగా ఈపీసీ ప్రకారం.. స్టీలు, సిమెంటు, ఫ్యూయల్ వంటి వాటికే పెరిగిన రేట్లు వర్తిస్తాయి. అయితే.. వీటితో పాటు చాలా రకాల ధరలు పెరిగాయని, ముఖ్యంగా కూలీ రేట్లు, ఇతర వ్యయం భారీగా పెరిగిందని.. కాబట్టి వాటికి కూడా రేట్లు పెంచాలని కాంట్రాక్టర్లు పట్టుపడుతున్నారు. పైగా ఒప్పంద కాలం కూడా అయిపోయింది కాబట్టి కొత్త ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు నిర్మాణాలు చేపట్టబోమని తేల్చిచెప్తున్నారు. కానీ.. అందుకు ప్రభుత్వం ధరలు పెంచేందుకు అంగీకరించటం లేదు. 

దాంతో రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. గత ఏడాదిన్నర కాలం నుంచి ఇదే అంశంపై ప్రభుత్వానికి, కాంట్రాక్టర్లకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. తప్ప పనులు మొదలుపెట్టే దిశగా అడుగులు పడలేదు. ఈ సమస్యపై ఇఎన్‌సీ (ఇంజనీర్స్ ఇన్ చీఫ్) కమిటీ ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి అందించింది. పెరిగిన ధరలను వర్తింప చేస్తే.. సర్కారుపై దాదాపు రూ. 8,000 నుంచి 10,000 వరకూ అదనపు భారం పడుతుందని ఆ నివేదిక పేర్కొంది. అంతేగాక.. ఈ ధరల పెంపును అన్ని కాంట్రాక్టులకూ వర్తింప చేయాల్సి ఉంటుంది. ఈ భయంతో సర్కారు ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది. 

మరోవైపు.. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు కూడా కాంట్రాక్టర్లకు సర్కారుపై నమ్మకం సన్నగిల్లేలా చేశాయి. తాము పనులు చేసినా ప్రభుత్వం బిల్లులు చెల్లింస్తుందన్న ఆశలు వారిలో అడుగంటాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. కనీసం చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులైనా పూర్తయి.. ఎంతోకొంత కొత్త ఆయకట్టుకు నీరందటం అనేది ఇప్పట్లో కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపించటం లేదు. 

ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే ప్రయోజనం పొందే ప్రాంతాలివీ

నెట్టెంపాడు (మహబూబ్‌నగర్) 
ఈ రిజర్వాయర్ పరిధిలో మొదటి లిఫ్టు ద్వారా 6,000 ఎకరాలకు తొలి దశలో నీరివ్వాల్సి ఉంది. ధరూరు మండలంలో ద్యాగదొడ్డి, ఉప్పేరు, మాల్‌దొడ్డి, నీలహళ్లి, మీర్జాపురం గ్రామాలకు ప్రయోజనం కలగనుంది.

కల్వకుర్తి ఎత్తిపోతలు (మహబూబ్‌నగర్) 
ఎల్లూరు రిజర్వాయర్, సింగోటం శ్రీవారి సముద్రం పరిధిలోని మొత్తం 14 గ్రామాల్లో 13,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. సింగోటం, ఎన్మన్‌బెట్ల, మాచినేనిపల్లి, జావాయిపల్లి, తాళ్లనర్సింహ్మాపూర్, చౌటబెట్ల, రామాపురం, నర్సింగరావుపల్లి, ఎల్లూరు, కొల్లాపూర్, కుడికిళ్ల, అంకిరావుపల్లి, చుక్కాయిపల్లి, నార్లాపూర్ గ్రామాలకు మేలు జరిగేది.

బీమా ప్రాజెక్టు (మహబూబ్‌నగర్) 
మక్తల్ మండలంలో సంగంబండ రిజర్వాయర్ ద్వారా మాగనూరు మండలంలో మొత్తం పది గ్రామాలకు సాగునీరు లభించాల్సి ఉంది. వీటిలో నేరడ్‌గం, వర్కూర్, మాగనూరు, కున్సి, హిందుపూర్, నేరడ్‌గందొడ్డి, మందీపల్, గజరందొడ్డి, పర్మాన్‌దొడ్డి తదితర గ్రామాల రైతులకు ప్రయోజనం కలుగుతుంది. మక్తల్ మండలంలో కర్ని, ఖానాపూర్, పంచలింగాల్, రుద్రసముద్రం, గోలపల్లి, మంథన్‌గోడ్, యర్నాగన్‌పల్లి, కాట్రేవ్‌పల్లి; బూత్‌పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నర్వ మండలంలో యాంకి, రాయికోడ్, నర్వ, రాంపూర్, రాజ్‌పల్లి, పెద్దకడ్మూర్, కల్వాల, చిన్నకడ్మూర్, నాగల్‌కడ్మూర్ తదితర గ్రామాలకు సాగునీరు లభిస్తుంది. 

భూపతిపాలెం ప్రాజెక్టు (తూ.గో.) 
ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించే ఆయకట్టును 14,000 ఎకరాలకు కుదించారు. రంపచోడవరం మండలంలో 16 గ్రామాలు, గంగవరం మండలంలో 8 గ్రామాలకు నీరందని పరిస్థితి. సకాలంలో నీటిని అందిస్తే.. రంపచోడవరం మండలంలో రంప, చెరువూరు, పందిరిమామిడి, తాటివాడ, గోగుమిల్లి, బందపల్లి, టి.బూరుగుబంద, ఐ.పోలవరం, బీరంపల్లి, ఉసిరజొన్నల, మునిచిడుగుల, జగమెట్లపాలెం, నల్గొండ, బి.వెలమలకోట, ధరమడుగుల, ఊట్ల; గంగవరం మండలం గంగవరం, గార్లపాడు, వి.రామన్నపాలెం, కుసుమరాయి, పండ్రపొట్టుపాలెం, లక్కొండ, కొత్తాడ, ఆముదాలబంద గ్రామాలు ప్రయోజనం పొందనున్నాయి.

ముసురుమిల్లి ప్రాజెక్టు (తూర్పుగోదావరి)
మురుసుమిల్లి ప్రాజెక్టు ద్వారా రెండు మండలాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రతిపాదించగా, ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో దేవీపట్నం మండలం ఇందుకూరుపేట, దేవారం, పోతవరం, శరభవరం, రామన్నపాలెం, కోరుకొండ మండలం గరగలంపాలెం; గోకవరం మండలం తంటికొండ, గోపాలపురం గ్రామాలలోని ఆయకట్టుకు నీరందదు.

తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం
తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం కింద తూర్పుగోదావరిలోని రౌతులపూడి, శంఖవరం, గొల్లప్రోలు, పిఠాపురం, తొండంగి, తుని మండలాల్లో ఆయకట్టు ఉంది. అయితే.. ఖరీఫ్‌కు నీరు అందే పరిస్థితి కనిపించటం లేదు. 

వెంకటనగరం పంపింగ్ స్కీమ్ (తూర్పుగోదావరి) 
నీరు అందక మొత్తం ఆయకట్టులో 40 శాతం ఆయకట్టు పరిధిలో భూములను రైతులు రియల్ ఎస్టేట్ కోసం ప్లాట్‌లుగా మార్చేశారు. గోదావరిపై నిర్మిస్తున్న నాలుగో వంతెన పరిధిలోకి కొన్ని భూములు వెళ్లటంతో దానికి భూ సేకరణ చేశారు. మిగిలిన కోరుకొండ మండలం గాడాల, రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామాల ఆయకట్టుకు నీరందటం లేదు. 

తాడిపూడి (పశ్చిమగోదావరి) 
జిల్లాలోని గుండంపల్లి, వెంకటరామగూడెం, ద్వారకాతిరుమల, డుండ్లపల్లి, లక్ష్మీపురం, దండాపురం, దేవరపల్లి వంటి గ్రామాల్లోని రైతులకు ప్రయోజనం కలగనుంది.

వంశధార (శ్రీకాకుళం) 
అనుకున్న విధంగా పూర్తి చేసినట్టయితే.. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా తిమ్మాపూర్, అక్కిలిపేట, కాలపర్తి, లక్ష్మడ్‌పేట, తుంకరపేట, నెల్లిపర్తి, కొత్తవలస వంటి గ్రామాలకు మేలు జరిగేది. 

కొమరం భీమ్ (ఆదిలాబాద్) 
ఈ ప్రాజెక్టు పనులు పూర్తయినా.. డిస్ట్రిబ్యూటరీల పనులు పెండింగ్‌లో ఉండటంతో రైతులకు నీరు అందటం కష్టంగా మారింది. నీరు ఇచ్చినట్టయితే.. కాగజ్‌నగర్, వాంకిడి, సిరిపూర్ వంటి మండలాల్లోని సుమారు 25 గ్రామాలకు మేలు జరగనుంది. 

మత్తడివాగు (ఆదిలాబాద్) 
కేంద్ర ఆటవీశాఖ నుంచి అవసరమైన అనుమతులు రాకపోవటం ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ప్రాజెక్టు వల్ల వద్దాడి, బండనగర్‌పూర్, కంపర్ల, జామిడి, సవర్‌గాం, గంగాపూర్, ఘాట్‌కూర్, దోరజ్ వంటి గ్రామాలకు మేలు జరిగే అవకాశం ఉండేది. 

గొల్లవాగు (ఆదిలాబాద్) 
ఈ ప్రాజెక్టు ద్వారా జైపూర్ మండలంలోని కొత్తపల్లి, మద్దిగల్, ఎల్ కేశారం, బీమారం, చెన్నూరు మండలంలోని చెన్నూరు, దుగిలపల్లి, రాయపూర్, కుంజర్ల వంటి గ్రామాలకు మేలు. 

ఏఎంఆర్‌పీ (నల్లగొండ) 
సియాపల్లి, పెద్దాపూర్, అనుమాడ, కలకల్లు, గుర్రంపోడు వంటి ప్రాంతాలకు మేలు జరిగే అవకాశం ఉంది. 

చౌటుపల్లి హన్మంతరెడ్డి (నిజామాబాద్) 
మోర్తాడు మండలంలోని రామన్నపేట, సుంకేట్, డోన్‌పాల్ గ్రామాలతో పాటు, కమ్మరిపల్లి మండలంలోని బషీరాబాద్, కొనసముందర్, నర్సాపూర్ గ్రామాలకు మేలు జరిగేది.

గుండ్లకమ్మ (ప్రకాశం) 
స్థానిక రాజకీయ కారణాల వల్ల నీటి విడుదలను నిలుపుదల చేశారు. ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తే.. మద్దిపాడు మండలంలోని మల్లవరం, పలచర్లపేట, వెల్లంపల్లి, మద్దపాడు, రాచవారిపాలెం, ఎనమల నెల్లూరు, నందిపాడు, కీర్తిపాడు, అన్నంగి, గుండ్లపల్లి గ్రామాలతో పాటుగా నాగుఉప్పలపాడు మండలంలోని తక్కెళ్లపాడు, కొత్తకోట, అనుమాపురం, ఎడమనూరు, కోతవరం, కొల్లకుండ, చదలవాడ, మూచారం, అమ్ములబ్రోలు వంటి గ్రామాలకు మేలు జరగనుంది.

హంద్రీ - నీవా (కర్నూలు)
పత్తికొండ నియోజకవర్గంలోని పందికోన, దూదేకొండ, కనకదిన్నె, కోతిరాల, కొత్తపల్లి, మద్దికెర, బురుజుల, పెరవలి, హంప, అగ్రహారం, క్రిష్ణగిరి, పుట్లూరు, అమకతాడు, గోగులపాడు, కంబాలపాడు, గూడెంపాడు, కోయిలకొండ, లక్కసాగరం అదేవిధంగా కర్నూలు, ఓర్వకల్లు మండలాల్లోని గార్గేయపురం, దిగువపాడు, బి.తాండ్రపాడు, ఓర్వకల్లు, నన్నూరు, పూడిచెర్ల, కేతవరం గ్రామాల్లోని పొలాలు కొత్తగా సాగులోకి వస్తాయి.

గురురాఘవేంద్ర (కర్నూలు)
ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తే ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం, పూలచింత, మాచాపురం, కనకవీడు, సోగనూరు, పేట, టి.యస్.కూలూరు, ఇబ్రహీంపురం, నది కైరవాడి, నాగలదిన్నె, చిలకలడోన గ్రామాల్లోని రైతులు లబ్ధిపొందే అవకాశం. 

దేవాదుల ప్రాజెక్టు (వరంగల్) 
ధర్మసాగర్, ఎలుకుర్తి, రాంపూర్, ఉనికిచర్ల, టేకులగూడెం, మునిపల్లి, మడిపల్లి, మడికొండ, దేవునూర్, సోమదేవరపల్లి; కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామోర, గోపాల్‌పూర్, వల్భాపూర్, కోతులనడుమ; భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి, కొప్పూర్, మాణిక్యాపూర్, ఘన్‌పూర్, చాగల్లు, రాఘవాపూర్, పామునూర్, చిన్న పెండ్యాల, తిడుగు, గర్నపల్లి, ఉప్పుగల్, కోనూరు, రఘునాథపల్లి, వెంకటాపూర్ గ్రామాలకు ఉపయోగం. 

ఎస్‌ఆర్‌ఎస్‌పీ - 2 (వరంగల్) 
ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్-2 పరిధిలోని 31,000 ఎకరాలకు సాగునీరు వస్తే.. రాయపర్తి మండలం మొరిపిరాళ్ల, కొత్తూర్, రాయపర్తి, కాందార్‌పల్లి గ్రామాలతో పాటు నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందించవచ్చు. 

పులిచింతల 
ఈ ప్రాజెక్టు పూర్తయితే.. కృష్ణా డెల్టాలో సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. 

ఎల్లంపల్లి 
ఈ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేస్తే.. ఎన్‌టీపీసీకి నీటిని సరఫరా చేయటానికి వీలు కలుగుతుంది. 

ప్రాజెక్టుల నిర్మాణం సాగింది వైఎస్ హయాంలోనే... 
సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ జలయజ్ఞం ప్రారంభించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు. జలయజ్ఞం కింద మొదలు పెట్టిన 86 ప్రాజెక్టుల్లో 12 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే పూర్తి చేశారు. వీటిద్వారా సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించారు. ఆయన మృతి తర్వాత ప్రాజెక్టుల నిర్మాణ పనులు మందగించాయి.

Anam Viveka Halchal with Nithya Menon in Jewellery shop opening

జగన్ మెమోను తిరస్కరించిన కోర్టు

తాను కోర్టుకు హాజరవుతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన మెమోని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఈ నెల 25న వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణకు హాజరవ్వాలని కోర్టు తెలిపింది.

ఆదర్శరైతులను అచ్చోసిన ఆబోతులన్న ధర్మాన


నరసన్నపేటలో ఆదర్శరైతులపై మంత్రి ధర్మాన మండిపడ్డారు. ఆదర్శరైతులను అచ్చోసిన ఆబోతులుంటూ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయం, ఇరిగేషన్ అధికారులతో సమావేశమైన మంత్రి సాగునీరు, ఎరువులు, విత్తనాలపై రివ్యూ జరిపారు. అధికారులకు, రైతులకు మధ్యవర్తిగా పనిచేసే ఆదర్శరైతుల గురించి అడిగి తెలుసుకున్నారు . నరసన్నపేట ఉప ఎన్నికల్లో తమకు సహకరించలేదన్న నెపంతో వారిని తోలగించాలని ధర్మాన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

Gattu Ramachandra Rao Press Meet 23rd June

కుట్ర బయటకు రాకుండా కొత్తకథనం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై జరుగుతున్న కుట్ర బయటకు రాకుండా కొత్త కథనం మొదలు పెట్టారని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. సిబిఐ అధికారులు వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు చేస్తున్నారన్నారు. జగన్ పేరు చెప్పమని పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారన్నారు. ఒక వ్యాపారి ఈ విషయాన్ని స్వయంగా జడ్జికే చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. జగన్ కు భౌతికంగా హానికలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తాజా పరిస్థితులు ఈ రకమైన ఆలోచనలకు బలం చేకూరుస్తున్నాయన్నారు. 

సిబిఐ జెడి లక్ష్మీనారాయణ వ్యవహార శైలిని ఆయన తప్పుపట్టారు. లక్ష్మీనారాయణ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జెడ్ కేటగిరీలో ఉన్న ఒక ప్రజానేతని, ఎంపిని ఒక సాధారణ వ్యాన్ లో కోర్టుకు తీసుకు వచ్చిన తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ కుట్రని బయటపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతున్నారన్నారు. అసలు విషయం బయటకు రాకుండా ఒక వర్గం మీడియా తప్పుడు కథనాలు రాస్తున్నాయన్నారు. ఆ కుట్ర బయటకు రాకుండా కొత్త కథనం మొదలు పెట్టారని చెప్పారు. మీడియాని రెచ్చగొడుతున్నరన్నారు. విలేకరులపైన, మీడియాపైన తమకు నమ్మకం ఉందన్నారు. విలేకరుల స్వేచ్ఛని తామ ప్రశ్నించడంలేదని చెప్పారు. వారు సమాచార సేకరణ కోసం ఒక వ్యక్తితో వందసార్లైనా మాట్లాడవచ్చని అన్నారు. ఇక్కడ జరుగుతున్న కుట్రవేరన్నారు. ఒక సిబిఐ అధికారి వందల సార్లు ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో స్వయంగా మాట్లాడటం చట్టవిరుద్ధం అన్నారు. ఒకరి తరువాత ఒకరికి ఫోన్ చేసి మాట్లాడటం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. జగన్మోహన రెడ్డిని మొదటి రోజు విచారణ జరిపిన రోజున అంత బిజీగా ఉండి, మరో పక్క లక్ష్మీనారాయణ చేసిన ఫోన్ కాల్స్ ని పరిశీలిస్తే కుట్ర బయటపడుతుందన్నారు. 

జగన్ ని లక్ష్యంగా చేసుకొని ఒక పత్రిక నీచాతి నీచంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పత్రిక ఉందికదా అని రాధాకృష్ణ అడ్డగోలుగా రాస్తే ప్రజలు నమ్మరన్నారు. జెడి లక్ష్మీనారాయణకు, రాధాకృష్ణకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. జెడిని కాపాడటానికి రాధాకృష్ణ ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

ఉప ఎన్నికలలో తమ పార్టీ అపూర్వమైన ప్రజాధరణతో విజయం సాధించిందని చెప్పారు.

నాంపల్లి కోర్టులో జగన్ మెమో దాఖలు

తాను కోర్టుకు హాజరవుతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ నెల 25న రిమాండ్ పొడిగింపు రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా తనని ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు.

లాస్ ఏంజెల్స్ లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆందోళన

లాస్ ఏంజెల్స్ : వైఎస్ జగన్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ అభిమానులు సోనియాగాంధీ దిష్టి బొమ్మని కర్రలతో కొట్టి నిరసన తెలిపారు. అమెరికా చరిత్రలో ఇలాంటి నిరసన తెలపడం ఇదే తొలిసారి. ఇలాంటి నిరసనలకు అక్కడ అనుమతి ఉండదు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం జగన్‌పై కుట్రపన్ని కేసుల రూపంలో వేధిస్తుందని అభిమానులు ఆరోపించారు. జగన్‌ను విడుదల చేయాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో అరాచకాలు ఉండేవని, ఇప్పుడు రాష్ట్రంలో ఇటలీ పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నిరసన కార్యక్రమంలో నంద్యాల వీరారెడ్డి, గుమ్మడి ధర్మారెడ్డి, నాగేశ్వరావు, శ్రీకాంత్, కోమటిరెడ్డి, వేణు, రాజారెడ్డి, సందీప్, రాజశేఖర్, లక్ష్మ రెడ్డి పాల్గొన్నారు.

తిరుపతిలో మద్యం నిషేధించాలి: భూమన

 తిరుపతి పవిత్రతను కాపాడేందుకు మద్యపానాన్ని నిషేధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందు కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన శనివారమిక్కడ కోరారు. లేకుంటే రేపటినుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని భూమన హెచ్చరించారు. తిరుపతిలో మద్య నిషేధం అమలు చేసేవరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. తిరుపతి అభివృద్ధి నిధులను పదిహేను రోజుల్లో విడుదల చేయాలన్నారు.
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!