YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 1 December 2012

నోటికొచ్చినట్లు మాట్లాడితే.. ఖబడ్దార్!

పయ్యావులకు భూమా నాగిరెడ్డి హెచ్చరిక

 ‘‘నీపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించుకో... లేదంటే నోరు అదుపులో పెట్టుకో... అంతేగానీ నోటికొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది’’ అంటూ వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఓ ప్రజాప్రతినిధిగా ఉన్నా తోటి మహిళా నాయకురాలిపై ఎలా మాట్లాడాలో కూడా తెలియని స్థితిలో కేశవ్ ఉన్నారని భూమా ధ్వజమెత్తారు. కేశవ్ సన్నిహితుడికి చెందిన ఎస్‌ఆర్ మినరల్స్‌కు ఓబుళాపురం గనులను కట్టబెట్టేందుకు ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చేసిన ఆరోపణల్లో నిజానిజాలేమిటో వెల్లడించాల్సింది పోయి... వాస్తవాలను కప్పిపుచ్చుకొనేందుకు ఆమెపై సంస్కారహీనంగా విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కేశవ్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు చంద్రబాబు తలొగ్గొచ్చేమోగానీ తమకు ఆ అవసరం లేదన్నారు. శోభానాగిరెడ్డి, గట్టు రామచంద్రరావు తదితర వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించినట్లుగా ఎస్‌ఆర్ మినరల్స్ సంస్థ యజమానితో తనకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేశవ్‌కే ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానన్నట్లు చంద్రబాబును బెదిరించి... ఓబుళాపురం గనుల లీజ్ స్నేహితుడి కంపెనీకి కట్టబెట్టించే ప్రయత్నం చేసిందెవ్వరని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూలేనివిధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సభలకు కేశవ్ హాజరైంది ఈ గనులను కట్టబెట్టించుకోవడానికే అనేది బహిరంగ రహస్యమేనని వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీలో చోటుచేసుకున్న కఠోర వాస్తవాలనే శోభ ప్రస్తావించారని, అవి నిజం కాదని నిరూపించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. 

ఎస్‌ఆర్‌పై స్పందించలేదేమి చంద్రబాబూ?: ఓబుళాపురం గనులను ఎస్‌ఆర్ మినరల్స్‌కు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే, ప్రతిపక్షనేతగా చంద్రబాబు కానీ, టీడీపీ నేతలు కానీ ఎందుకు స్పందించట్లేదని నాగిరెడ్డి ప్రశ్నించారు. ‘మీకు దక్కితే ఒక న్యాయం... వేరొకరికైతే ఇంకో న్యాయమా...’’ అని విమర్శించారు. గతంలో టీడీపీలో ఉన్న తాము ఆ పార్టీకి అన్ని వేళలా సేవ చేస్తే, ఫలితంగా అందిన ఫలాలను కేశవ్‌లాంటి వాళ్లు అనుభవించారని ఆరోపించారు. తామెప్పుడూ టీడీపీపై ఆధారపడి రాజకీయం చేయలేదని, తమపై ఆధారపడే ఆ పార్టీ రాజకీయాలు కొనసాగించిందని గుర్తు చేశారు. దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనన్నారు. పాదయాత్ర కన్నాముందు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటో చంద్రబాబు తెలుసుకోవాలని, అలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలుపు మాట దేవుడెరుగు, కనీసం గ్రామాల్లో టీడీపీకి బ్యానర్లు కట్టేవారన్నా మిగులుతారని సూచించారు. తెరమరుగైన పార్టీల జాబితాలో టీడీపీ కూడా చేరిపోనుందని, కార్యకర్తలను మభ్యపెట్టడానికే ఇంకా వైద్యం చేస్తూ బతికి ఉన్నట్లుగా మభ్య పెడుతున్నారని నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.

sakshi news

పాలకులపై మండిపడ్డ ప్రజానీకం


వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి వస్తేనే తమ బతుకులు బాగుపడతాయన్న జనం
బీటీ పత్తి కంపెనీలు మళ్లీ రెచ్చిపోతున్నా.. ఈ పాలకులకు పట్టడం లేదు: పత్తి రైతులు
మాకు ఉన్న ఒక్క ఆసరానూ తీసేస్తున్నారు: వికలాంగులు
గిట్టుబాటు ధర ఇవ్వాలని అడిగితే నేరస్తులమని జైల్లో పెట్టించారు: ఆముదాల రైతులు
కార్మికుల సమస్యలు ఈ పాలకులకు పట్టడం లేదు: బీడీ కార్మికులు
ఇన్ని సమస్యలు చూస్తూ కూడా ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టనంటున్నారు: షర్మిల
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 45, కిలోమీటర్లు: 624.50

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ బతికున్నప్పుడు తోక ముడిచిన బీటీ విత్తన కంపెనీలు ఇప్పుడు జూలు విదిలించాయి. విత్తనాల ధరలు పెంచి అడ్డంగా దోచుకుంటున్నారు. సర్కారేమో.. పట్టించుకోదు.. జనం పట్టని సర్కారు ఉన్నా ఒకటే పోయినా ఒకటే.’’

‘‘ఎరువులు లేవు.. కరెంటు లేదు.. గిట్టుబాటు ధర లేదు.. గిట్టుబాటు ధర ఇవ్వమని అడిగితే మమ్ములనే నేరస్తులన్నారు.. కేసులు పెట్టారు.. జైలుకు పంపారు.. ఈ పాలన మాకొద్దు.. ’’

‘‘సర్కారోళ్లు పావలా వడ్డీకే రుణాలని చెప్పి తీరా వడ్డీ కట్టబోతే మా నడ్డి విరిచేస్తున్నారు. బ్యాంకు అధికారులు నిలబెట్టి రూ.2.50 వడ్డీలు కట్టించుకున్నారు. ఈ వడ్డీలు మేం కట్టలేం.. ఈ సర్కారు పోవాలి.. జగనన్న రావాలి.’’

ఇడుపులపాయ నుంచి పాలమూరు వరకు కార్మిక లోకమైనా, కర్షక లోకమైనా.. అందరిదీ ఒకటే మాట.. జనం బాధలు పట్టని ప్రభుత్వం తమకు వద్దని, ప్రజలను ప్రాణంగా చూసుకున్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డే కావాలని వారంతా నినదిస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 45వ రోజు శనివారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో సాగింది. దారి వెంట ప్రజలు ఆమెతో కలిసి కదంతొక్కారు. తమ సమస్యలు, బాధలు ఆమెకు చెప్పుకొన్నారు. జగనన్న రావాలని, తమ కష్టాలు తీరాలని కాంక్షించారు. శనివారం మొత్తం 18.5 కి.మీ. మేర సాగిన షర్మిల పాదయాత్రలో పలు వర్గాల ప్రజలు ఆమెను కలిసి విన్నవించిన కష్టాలు, కన్నీళ్లు అక్షరాల రూపంలో..

దొంగతనంగా అమ్ముకుంటుండ్రు.. 

‘‘చంద్రబాబు ఉన్నప్పుడు అరకిలో బీటీ పత్తి విత్తనాలు సంచికి రూ.1,800 ఉండేది. వైఎస్సారొచ్చి కోర్టుల కలబడి అదే సంచిని రూ.600కే ఇప్పించిండు. ఎన్ని కావాలనుకుంటే అన్ని సంచులు దొరికినయి. ఆ దేవుడు పోయినంకా వచ్చినోళ్లు రూ.950 ఎక్కించిండ్రు. ఊరికి ఐదు, పది సంచులు ఇచ్చి మిగతా సంచులకు దొంగతనంగా రూ.2,000కు అమ్ముకుంటుండ్రు. అంత ధర పెట్టి ఇత్తనాలు కొనలేక దొరికిన ఇత్తనాలు తెచ్చి పెట్టినా.. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు రూ.250 ఉన్న యూరియా ఈ రోజు రూ.850, రూ.300 ఉన్న డీఏపీ ఇయ్యాల రూ.1,250.. అప్పో, సప్పో చేసి సాగు చేసినా కరెంటు లేక పంట పండలేదు. ఎకరాకు 10 క్వింటాళ్లు.. వచ్చే పత్తి ఈ ఏడు 3 క్వింటాళ్లు ఎల్లింది(దిగుబడి వచ్చింది). ఈ పంటతో అప్పులెట్టా కట్టాలి? నేను నా పిల్లలు ఏం తినాలక్కా? నాయిన ఉన్నట్టు లేదక్కా.. అన్న రావాలక్కా.. జగనన్న వస్తేనే అప్పుల నుంచి బయటపడి మా రైతులు బతుకుతారక్కా’’ అని సీసీకుంటకు చెందిన రైతు కుర్మన్న షర్మిలతో అన్నారు. పత్తి తీస్తున్న ఈ రైతును షర్మిల పలకరించినప్పుడు కుర్మన్న పై విధంగా చెప్పుకొని బాధపడ్డారు.

రైతుల మీద కేసులు పెట్టారు.. 

‘‘ఆముదాలు దేవరకద్ర మార్కెట్‌కు తీసుకొనిపోతే క్వింటాల్ ధర రూ.2,500 కూడా పలకలేదక్కా. వైఎస్సార్ ఉన్నప్పుడు ఇవే ఆముదాలు క్వింటాల్‌కు రూ.4,500 పలికింది. గిట్టుబాటు లేకుండా ధాన్యం ఇచ్చేది లేదని అధికారులకు తెగేసి చెప్పినా.. నాకు గిట్టుబాటు కావాలని పట్టుబట్టినా.. ధర్నాకు కూచున్నా.. నాకు మద్దతుగా మిగిలిన రైతులు నిలబడ్డారు. మమ్మల్ని క్రిమినల్స్ అని 40 మంది రైతుల మీద కేసులు పెట్టారు. రెక్కల కష్టానికి గిట్టుబాటు కావాలంటే మమ్ములను ఈ సర్కారు దొంగలని అన్నది.. చంద్రబాబు జమానాల కరెంటు బిల్లులు కట్టలేదని ఆయనొకసారి మమ్ములను జైల్లో పెట్టించాడు. ఈ పాలన ఇంకా ఉంటే మళ్లీ చంద్రబాబు జమానా ఒత్తదక్కా..’’ అని పెదవడ్డెమాన్‌కు చెందిన రైతు ఇంద్రసేనారెడ్డి షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

బీడీ ఉత్తర్వు అమలు చేయట్లేదు..

‘‘మా సేతికి తొమ్మిది ఆకుల కట్టలిస్తరు. 1,000 బీడీలు సుట్టాలే.. వెయ్యి బీడీలకు రూ.100 ఇత్తన్నారు. ఆకుల తరుగుబోయి తక్కువ బీడీలు వస్తే మాకు జురుమాన (జరిమానా) ఏస్తరు. నూరు రూపాయలలో రూ.30.. రూ.40 వరకు జురుమాన తీసుకుంటరు. వైఎస్సార్ ఉన్నప్పుడు నిండా నూరు ఇప్పించిండు. కట్టకు రూ.149 కట్టియ్యాలని ఆ దేవుడు సర్కారు ఆర్డరు(జీవో) కూడా ఇప్పించాడు. ఇప్పుడున్న సర్కారు దమ్ము లేక దాన్ని అమలు కానిత్తలేదు. అక్కా... మా మండలంలో 20 వేల కుటుంబాలు బీడీలు సుట్టే బతుకుతం. అందరం జగనన్నకు ఓటేసి గెలిపించుకుంటామక్కా.. అన్న రావాలే.. మా బతుకులు మారాలే’’ అని సీసీ కుంటకు చెందిన గుర్రం లలితమ్మ, గుర్రం భారతమ్మ, కర్నూలు లింగమ్మ, గుర్రం సుజాత, కర్నూలు రోజమ్మ.. షర్మిల వద్ద తమ గోడు చెప్పుకున్నారు.

తప్పు మాట్లాడితే ఇక్కడే సంపండి.. 

‘‘మీ అందరికీ దండం పెట్టి ముసలోణ్ణి చెప్తున్నా.. రాజన్నంత మంచి మనిషి ఎవ్వడూ లేడు. ఈ సర్కారు ఉంటే మనం బతకలేం. నాకు 85 ఏళ్లు. నా తరం అయిపోయింది. ఈ సర్కారు సోర పిల్లగాండ్లను(యువకులను) బతకనీయదు. మన సర్కారు రావాలే.. అందరం కలిసి రాజయ్య కొడుకును నిలబెట్టుకుందాం.. నేను తప్పు మాట్లాడితే నన్ను ఇక్కడే సంపండి’’ అని పెదవడ్డెమాన్‌కు చెందిన 85 ఏళ్ల వృద్ధుడు మమ్మద్ సయ్యద్.. గ్రామస్తుల వద్ద ఉద్వేగంతో చెప్పాడు. కర్ర సహాయంతో మాత్రమే నడవగలిగే ఈయన వైఎస్సార్ కూతురు షర్మిలను చూసేందుకు ఒంట్లో ఉన్న జవసత్వాలను కూడదీసుకొని జనం మధ్యకు వచ్చాడు.

కిరణ్.. నా పింఛను ఊడపీకిండు.. 

‘‘నేను వికలాంగురాలిని.. రాజశేఖరరెడ్డి ఫస్టు సీఎం అయినప్పుడు రూ. 200 పింఛన్ ఇచ్చిండు. మళ్లా వచ్చినప్పుడు రూ. 500 జేసిండు. కిరణ్‌కుమార్‌రెడ్డి సారు వచ్చి నా పింఛన్ ఊడ పీకిండు. నన్ను చూడక్కా.. నాకు 25 ఏళ్లు.. ఐదేళ్ల పిల్లలా లేనా? నేను ఏం పని చేసుకుంటానక్కా.. బుద్ధి లేనోళ్లు సర్కారులో ఉండొద్దక్కా..’’ అని నెల్లికొండి గ్రామంలో వెంకటేశ్వరమ్మ అనే వికలాంగురాలు.. షర్మిల వద్ద కన్నీరు పెట్టింది.

ఈ బియ్యమెట్టా సరిపోతాయి..? 

‘‘కుటుంబానికి 16 కిలోల బియ్యం ఇత్తున్నారు. ఐదుగురం ఉన్న కుటుంబానికి నెలకు 16 కిలోలు సరిపోతాయా? కిరణ్‌కుమార్‌రెడ్డి నెలకు 16 కిలోల బియ్యమే తిని బతుకుతున్నాడా? బయట కిలో బియ్యం రూ.25 ఉన్నయి. ఆయన రూ. 16 రూపాయలు తగ్గించి రూ.100 భారం పెంచిండు. పావలా వడ్డీ అని చెప్తాడు కానీ బ్యాంకుకు పోతే రూ. రెండున్నర వడ్డీ పడుతోంది. ఇదేం సర్కారక్కా.. దీన్ని కూలగొట్టాలక్కా.. జగనన్న వత్తేనే మా బతుకులు బాగుపడ్తాయి’’ అని అల్లీపురం గ్రామానికి చెందిన శ్రీ పాయి ఆంజనేయ మహిళా గ్రూపునకు చెందిన మహిళలు వడ్ల లక్మి, వాకిట మణెమ్మ, సత్తెమ్మ, వెంకటేశ్వరమ్మ అనే మహిళలు షర్మిలతో తమ బాధలు పంచుకున్నారు.


జగనన్న వస్తారు.. రాజన్న రాజ్యం తెస్తారు

ప్రజల బాధలు విన్నాక షర్మిల స్పందిస్తూ.. ‘‘ప్రజలు ఇన్ని సమస్యలతో సతమతమవుతుంటే.. చూస్తూ కూడా చంద్రబాబు.. ఆ ప్రభుత్వంతోనే కుమ్మక్కై దానిపై అవిశ్వాసం పెట్టనంటున్నారు. ప్రాణాలు.. చెలకలు చాలా విలువైనవి. దయచేసి వాటిని పోగొట్టుకోవద్దు.. నిలబడి సాధించుకుందాం. ఒక్క ఏడాది ఓపిక పడితే మీరు కోరినట్టే జగనన్న అధికారంలోకి వస్తారు. మనలను రాజన్న రాజ్యం దిశగా తీసుకొని పోతారు. రాజన్న రాజ్యంలో రైతును రాజులాగా చూసుకుంటారు. గుడిసెలు లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారు. ప్రతి ఇంటినీ జగనన్న సంతోషంగా ఉంచుతారు’’ అని భరోసా ఇచ్చారు.

పశువుల కోసం 103
‘‘జగనన్న అధికారంలోకి రాగానే గొర్రెలు, పశువులకు వైద్య సేవలు అందించడం కోసం 103 అంబులెన్స్ ఏర్పాటు చేస్తారు’’ అని షర్మిల శనివారం యాత్రలో ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద వడ్డెమాన్ గ్రామానికి చెందిన కురుమూర్తి.. షర్మిలకు గొర్రె పిల్లను బహూకరించిన సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారు.

sakshi news

ఏ చట్టం లేకుండానే వైఎస్ ఎన్నో చేశారు...

అన్ని రకాలుగా సమస్యల్లో చిక్కుకున్న కాంగ్రెస్ ఊపిరాడని స్థితిలో ఉంది 
మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనగా ‘సబ్‌ప్లాన్’ బిల్లు తెచ్చారు 
రాజ్యాంగ భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ఎందుకు కృషి చేయదు?
‘సబ్‌ప్లాన్’పై ప్రధానికి సోనియా లేఖ రాసినా కేంద్రం చట్టం చేయలేదేం? 
సంకల్పబలం ఉండాలి కానీ.. చట్టాలు ప్రధానం కాదని వైఎస్ చూపారు 
ఏ చట్టం లేకుండానే దళిత, గిరిజనుల అభివృద్ధికి అనేక పథకాలు తెచ్చారు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం మంచిదే అయినా.. ఎన్నికలకు ఏడాది ముందు హడావుడిగా తీసుకురావటం వెనుక కాంగ్రెస్ పార్టీ స్వార్థప్రయోజనమే తప్ప.. దళితులు, గిరిజనుల మేలు ఆశించి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకురాలు వై.ఎస్.విజయమ్మ విమర్శించారు. అన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఊపిరాడని స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధం చేస్తే ఆ వర్గాలు తమవైపు వస్తాయన్న ఆశతోనే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిందని ధ్వజమెత్తారు. యూపీఏకి, జాతీయ సలహా మండలికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న సోనియాగాంధీ.. సబ్‌ప్లాన్‌పై ప్రధానమంత్రికి లేఖ రాసి ఏడాదైనా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసే దిశగా ఎందుకు ప్రయత్నించలేదని విజయమ్మ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రాజ్యాంగపరమైన భరోసా ఏదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సబ్‌ప్లాన్‌కు రాజ్యాంగ భరోసా కల్పించేందుకు ఎందుకు కృషి చేయటం లేదని నిలదీశారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే.. ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుందని విరుచుకుపడ్డారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏ చట్టాలు లేకుండానే దళితులు, గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక పథకాలు చేపట్టారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేస్తే తప్ప వారికి మేలు జరగదనే స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. దళితుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేయాలన్న సంకల్పం ఉండాలే కానీ.. చట్టాలు ప్రధానం కాదని, వైఎస్ దానిని ఆచరణలో చేసి చూపించారని ఆమె పేర్కొన్నారు. సబ్‌ప్లాన్ బిల్లుపై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో విజయమ్మ మాట్లాడుతూ.. విద్యుత్, ఆర్‌టీసీ, వంట గ్యాస్, పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచేసి ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం.. పేదలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులపై పడుతున్న భారాన్ని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఏ చట్టం లేకుండానే వైఎస్ ఎన్నో చేశారు... 

ఏ చట్టం లేకుండానే దివంగత వైఎస్సార్ విద్య, వైద్యం, ఆహారం, గూడు, ఉపాధి కార్యక్రమాలను అమలు చేశారని విజయమ్మ గుర్తుచేశారు. దళితులు, గిరిజనులు పారిశ్రామికవేత్తలు కావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడల్లో ప్లాట్లు రిజర్వ్ చేయటం, వ్యాట్‌లో యాభై శాతం రీయింబర్స్ చేయటం, ఒక రూపాయికే యూనిట్ విద్యుత్ సరఫరా, పెట్టుబడుల్లో ఎస్సీలకు 35 శాతం సబ్సిడీ కల్పించటం, మహిళా పారిశ్రామిక వేత్తలకు 40 శాతం సబ్సిడీ ఇవ్వటం వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు. దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో పథకాలు అమలు చేశారని, కుల, మత, వర్గ, వర్ణ వివక్ష లేకుండా సంతృప్త స్థాయిలో పనులు చేసేలా బడ్జెట్‌కు రూపకల్పన చేశారని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌కు దళితులు రూ. 1,120 కోట్లు బకాయి పడితే రాజశేఖరరెడ్డి రద్దు చేసి ఆదుకున్నారని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా వైఎస్ ఎస్సీలకు 14.26 శాతం, ఎస్టీలకు 8 శాతం నిధులు బడ్జెట్‌లో కేటాయించి, ఖర్చు చేయించారని విజయమ్మ చెప్పారు. చంద్రబాబు కేవలం 3.09 శాతం నిధులు కేటాయించారని గుర్తు చేశారు. రాజశేఖరరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పేదలకు రేషన్ బియ్యం కోటా పెంపు, రైతాంగానికి ఏడు నుంచి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని.. ఈ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని తప్పుపట్టారు. 

వ్యయ వర్గీకరణ ఎలా చేస్తారు? 

ఈ ప్రభుత్వం ప్రజలపై మోయలేని ఆర్థిక భారం మోపుతూ ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తోందే తప్ప.. వారిని కనికరించటం లేదన్నారు. సబ్సిడీ సిలిండర్లను ఆరుకు కుదించారని విమర్శించారు. ‘‘మూడేళ్లలో కొత్తగా ఇళ్లు, భూములు, పరిశ్రమలు ఇచ్చారా..? పెన్షన్ 200 నుంచి 500 చేశారా..? వికలాంగులకు పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచారా? మెస్‌చార్జీలు పెంచారా..? ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నారా..?’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దళితులు, గిరిజనులు వేల సంవత్సరాలుగా అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని.. ఇలా చట్టాలు తేవటం కేవలం సంతృప్తిపరచటానికే పనికివస్తాయని.. వాటి అమలులో చిత్తశుద్ధి కావాలని సూచించారు. ఈ బిల్లు తేవటం మంచిదే అయినా.. ఇందులో వ్యయ వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దళిత, గిరిజనుల అభ్యున్నతిపై చంద్రబాబు పాలనకు కొనసాగింపుగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉందని విమర్శించారు. దళితులు అన్ని వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలన్నట్లు కాకుండా అనుసూచిత కులాల్లో అభివృద్ధి సాధించాలనే విధంగా పేర్కొన్నారని తెలిపారు. 

sakshi

10 రోజులు - 157.3 కిలోమీటర్లు

పాలమూరులో మరో ప్రజాప్రస్థానం
10 రోజులు - 157.3 కిలోమీటర్లు 

‘‘వెయ్యి బీడీలు చుడుతున్నా రూ.100 మాత్రమే కూలి ఇస్తున్నారు. ఉప్పు, పప్పు, కారం, నూనెల ధరలు పెరిగాయి. పూట గడవడం భారంగా మారిందమ్మా.. మా పిల్లలను పెద్ద చదువులు చదివించుకోవడం కూడా కష్టంగా ఉంది. మాకు ఇచ్చే కూలిని రూ.150కు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలమ్మా..’’అని చిన్నచింతకుంటలో బీడీ కార్మికుల తమ సమస్యలను షర్మిల దృష్టికితెచ్చారు. ‘‘మీ ఇబ్బందులను గుర్తించి యాజమాన్యాలను ఒప్పించి వైఎస్ హయాంలో రూ.150 చెల్లించే విధంగా జీఓజారీ చేసినా అమలయ్యేలోగా ఆయన మరణించడం దురదృష్టకరం’’అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: దివంగ త నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి చావులేదు.. ఆయ న అమరుడు..పేదప్రజల గుండెల్లో ఉన్నంతకా లం బతికిఉన్నట్లేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అ ధినేత వైఎస్ జగన్‌మోహన్ సోదరి షర్మిల అ న్నారు. జగనన్నను ఆశీర్వదించి ముఖ్యమంత్రి ని చేస్తే వైఎస్ ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలన్నీ తిరిగి అమలవుతాయని హామీఇచ్చారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా శనివారం ష ర్మిల దేవరకద్ర మండలం అల్లీపురం గ్రామం నుంచి నెల్లికొండి గ్రామం వరకు పాదయాత్ర కొనసాగించారు. 

కూలి పెంచడమ్మా: బీడీ కార్మికుల వినతి
అనంతరం చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో బీడీ కార్మికులు మాట్లాడుతూ వెయ్యి బీ డీలు చుడుతున్నా రూ.100 మాత్రమే కూలి ఇస్తున్నారని, ఆ మొత్తాన్ని రూ.150లకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

‘‘మీ ఇబ్బందులను గుర్తించి వైఎస్ రాజశేఖరరె డ్డి హయాంలో యాజమాన్యాలను ఒప్పించి రూ. 150లు చెల్లించే విధంగా జీఓజారీ చేసినా అమలయ్యేలోగా ఆయన మరణించడం దురదృష్టకరం’’అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. పలువు రు విద్యార్థులు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సక్రమంగా అమలు చేయకపోవడంతో తాము మధ్యలోనే చదువు మానేశామని ఆవేదన వ్యక్తం చేశారు. సుచరిత అనే బాలిక మాట్లాడుతూ పేదలపట్ల వైఎస్ జాలి చూపి పథకాలు అమలు చేయడం వల్లే మా అన్న ప్రస్తుతం బాసర త్రిపుల్ ఐటీలో బీటెక్ చదువుతున్నాడని గుర్తుచేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్నా కూలి రూ.50 నుంచి రూ.60కు మించి రావడం లేదని కూలీలు మొరపెట్టుకున్నారు. ఇకముందు మంచి కాలం వస్తుందని జగనన్న ముఖ్యమంత్రి అయ్యేవరకు ఓపికపట్టాలని కోరారు. 

ప్రాజెక్టులను మరిచారు
వైఎస్ హయాంలో మంజూరు చేసిన ప్రాజెక్టులను కూడా ఈ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయిందని దుయ్యబట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మండలాలకు ఫేజ్-2 ద్వారా సాగునీరు అందించేందుకు, మక్తల్ పట్టణంలో భీమా మొదటి దశ పనులకు వైఎస్ రూ. 2158 కోట్లు కేటాయించి రూ. 1740 కోట్లు ఖర్చు చేసి 85 శాతం పనులు పూర్తిచేసినా మిగిలిన 15 శాతం పనులు చేయకుండా ఈప్రభుత్వం మూడేళ్లు గడిపిందన్నారు. ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడంతో.. ఈ ప్రాంతంలో పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని, అంతేకాకుండా కుటుంబ జీవనం కోసం పాఠశాలలకు వెళ్లే పిల్లలను సైతం కూలికి తీసుకెళ్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కారణంగానే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరుగుతుందన్నారు. 

ఇది రాబందుల రాజ్యం
పెద్దవడ్లమాను గ్రామంలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో రూ.60 వచ్చే విద్యుత్ బిల్లులు ప్రస్తుతం రూ.300 నుంచి రూ.400 వరకు వస్తుందన్నారు. అదికూడా రోజుకు నాలుగు గంటలకు మించి కరెంట్ ఇవ్వలేకపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను పీక్కుతినే రాబందుల రాజ్యంగా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యాత్ర వెంట మహిళలు పెద్దఎత్తున తరలొచ్చి హారతులు పట్టి షర్మిలకు ఘన స్వాగతం పలికారు. మద్దూరు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను షర్మిల ఆవిష్కరించారు. రచ్చబండలో స్థానిక మహిళలు చెప్పిన సమస్యలను షర్మిల ఓపిగ్గా విన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఏడాది పాటు ఓపికపట్టాలని, ఆ తర్వాత జగనన్న సీఎం అయితే సమస్యలు తీరుతాయని హామీ ఇచ్చారు. 

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా....

వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సో దరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం నెల్లికొండి గ్రామ శివారు ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు.

దేవరక ద్ర నియోజకవర్గంలోని లాల్‌కోట, బండరువల్లి, రాకొండ స్టేజ్, గోప్లాపూర్, దేవరకద్ర గ్రామాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. రాత్రికి దేవరకద్ర గ్రామ శివార్లలో షర్మిల బస చేస్తారన్నారు. ఆదివారం 15.5 కి.మీ మేర యాత్ర కొనసాగిస్తారని వారు వివరించారు. 

ఆ సమయంలో చంద్రబాబు ఎక్కుడున్నారు..


Unmasking Chandrababu Naidu Contributions
హైదరాబాద్‌ను తానే అభివృద్ది చేశానని, ప్రపంచంలో హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చానని, తాను ఐటి విప్లవానికి నాంది పలికానని, సెల్ ఫోన్ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తెచ్చానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారు. చంద్రబాబు మాటలనే ఆయన అనుచరులు నమ్మి ప్రచారం చేస్తుంటారు. చంద్రబాబు మాటల్లో ఏ మాత్రం నిజం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాత్రమే తప్ప మరేమీ కాదు.
హైదరాబాద్ 1956లో ఐదో పెద్ద నగరంగా ఉండేది. 2004లో, 2012లో కూడా ఐదో స్థానంలోనే ఉంది. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్దం క్రితానిది. అప్పటికే ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలను హైదరాబాదులో స్థాపించింది. బిహెచ్ఇఎల్, హెచ్ఎంటి, హెచ్ఎఎల్, బిఇఎల్, హిందూస్తాన్ కేబుల్స్, ఐడిపియల్, ఎన్ఆర్ఎస్ఎ, న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్, ఇసిఐఎల్, ఎన్ఎండిసి, ఎస్టీపి, సిఎంసి, ఎన్ఎఫ్డిబి వచ్చాయి.
వాటికి తోడు, పౌర, రక్షణ రంగాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ లాబోరేటరీలు హైదరాబాదులో వెలిశాయి. డిఎంఆర్ఎల్, డిఆర్‌డిఎల్, డిఎల్ఆర్ఎల్, డిఆర్‌డివో, ఐఐసిటి, సిసిఎంబి వంటి వచ్చాయి. మిగతా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తే మన రాష్ట్రంలో మాత్రం హైదరాబాద్, దాని పరిసరాల్లోనే కేంద్రీకరించారు. ఇందుకు గల కారణమేమిటో తెలియదు. ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధంగా వచ్చిన ప్రైవేట్ సంస్థలు సహజంగానే వాటికి సమీపంగా వెలిశాయి.
ఐడిపియల్ కారణంగానే హైదరాబాద్ భారత బల్క్ డ్రగ్ రాజధానిగా రూపుదిద్దుకుంది. 90 శాతానికి పైగా ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు హైదరాబాదులోని వచ్చాయి. ఈ అభివృద్ధి అంతా చంద్రబాబు నాయుడు హైస్కూల్లో ఉన్నప్పుడే జరిగింది. పిచ్చి వాళ్ల స్వర్గంలో ఉన్నవారు మాత్రమే హైదరాబాద్ అభివృద్ధి తమదని చెప్పుకుంటారు.
దేశంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ విస్తృతికి దోహదం చేసిన ఇసిఐఎల్, కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పోరేషన్ (సిఎంసి) కేంద్ర కార్యాలయాలు హైదరాబాదులో ఉన్నాయి. దానివల్లనే పివి నరసింహారావు ప్రభుత్వం దేశంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమను అభివృద్ధి చేయవచ్చునని భావించి, 1991లో ఆరు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులను (ఎస్టిపిలను) ఏర్పాటు చేసింది. మొదటి ఎస్టీపి హైదరాబాదుకు వచ్చింది. చెన్నైకి ఇటీవల దాకా అది రాలేదు. ప్రపంచంలో నాలుగో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ సత్యం కంప్యూటర్స్ 1990 ప్రారంభంలో ఏర్పడింది. ఆ సమయంలో చంద్రబాబు ఎక్కుడున్నారు.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి తానే కర్తనని చెప్పుకునే హక్కు చంద్రబాబుకు లేదు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వై2కెలో పాశ్చాత్య దేశాల్లో భారత సాఫ్ట్‌వేర్ నిపుణులకు మంచి అవకాశాలు లభించాయి. చంద్రబాబుకు అవకాశాన్ని అందిపుచ్చుకునే సమర్థత ఉంటే, బల్క్ డ్రగ్స్‌లో మాదిరిగా దేశంలో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి కేంద్రంగా రాష్ట్రాని తీర్చిదిద్ది ఉండేవారు. అది జరగలేదు. పైగా 1995లో సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో రాష్ట్రం మూడో స్థానాన్ని పొందింది. అది కాస్తా 2004 నాటికి ఐదో స్థానానికి పడిపోయింది.
సాఫ్ట్‌వేర్ ఎగుమతుల విలువ బెంగళూర్, హైదరాబాద్ మధ్య అంతరం 1995 - 96లో 250 కోట్ల రూపాయలు ఉండేది, అది 2003 - 2004 నాటికి 2,500 కోట్ల రూపాయలకు పెరిగింది. చంద్రబాబు అధికారం కోల్పోయేనాటికి పరిస్థితి అది. భారత సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 9 శాతం మాత్రమే కాగా, కర్ణాటక వాటా 38 శాతం. హైదరాబాద్ భారత ఐటి రాజధానిగా రూపుదిద్దుకుందని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. దాన్ని మీడియా ఊదరగొట్టింది. కర్ణాటక, తమిళనాడు సాఫ్ట్‌వేర్ రంగంలో అద్భుతమైన కృషి చేశాయి. ఆ రాష్ట్రాలు ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. సాఫ్ట్‌వేర్ ఎగుమతులు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 9 శాతం నుంచి 2008 - 2009 నాటికి 14 శాతానికి పెరిగాయి. దాన్ని వైయస్ ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు.
చంద్రబాబు చెప్పుకునేదొకటే, తాను ఐసిబి (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)ని హైదరాబాద్‌కు తెచ్చానని. ఐసిబి వల్ల ఆర్థికంగా, సామాజికంగా రాష్ట్రానికి, పోనీ హైదరాబాదుకు ఏమైనా ప్రయోజనం కలిగిందా, దానితో ప్రయోజనం పొందింది ఎవరు అనేది ప్రశ్న. చంద్రబాబు మాదిరిగా కాకుండా వైయస్ రాజశేఖర రెడ్డి ఐఐటిలను ప్రోత్సహించారు. 18 కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఆ క్రెడిట్ అంతా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, ఐటి శాఖకు చెందుతుందని వైయస్ చెప్పేవారు. ఈ అభివృద్ధి అంతా రాజకీయ నాయకుల వల్ల జరగలేదని, పిల్లలూ వారి తల్లిదండ్రులు చెమటోడుస్తున్నారని, ప్రభుత్వం వారికి సౌకర్యాలు, వెసులుబాటు కల్పిస్తోందని అనేవారు. చంద్రబాబుకు, వైయస్‌కు మధ్య ఉన్న పెద్ద తేడా అదే.
చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ మఖ్యమంత్రిగా ఉండి చిత్తూరు జిల్లాకు చెందిన తన సన్నిహిత మిత్రుడు బిల్లీరావుకు 2500 కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన హైదరాబాదులోని అత్యంత ముఖ్యమైన 850 ఎకరాల భూమిని 400 కోట్ల రూపాయలకే కట్టబెట్టారు. అలాగే, 535 ఎకరాల భూమిని మార్కెట్ విలువ ఎకరానికి 3 కోట్ల రూపాయలు ఉండగా 29 లక్షల రూపాయల ధరకే ఎమ్మార్‌కు ఇచ్చారు.
ఆల్విన్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతకు చంద్రబాబు నాయుడే బాధ్యుడు. వాటిని చాలా వరకు తనకు అత్యంత సన్నిహితులైనవారికే కట్టబెట్టారు.
- డి.ఎ సోమయాజులు (వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల, కేంద్ర పాలక మండలి సభ్యుడు)గురువారెడ్డి (అట్లాంటా). సివిఆర్ మూర్తి (హైదరాబాద్)లతో కలిసి.

ముగిసిన షర్మిల 45వ రోజు పాదయాత్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిల చేప‌ట్టిన `మ‌రో ప్రజాప్రస్థానం` 45వ రోజు పాదయాత్ర శ‌నివారం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా నెల్లికొండిలో ముగిసింది. అల్లీపురం గ్రామ శివారు నుంచి ప్రారంభమైయిన పాద‌యాత్ర దేవరకద్ర నియోజకవర్గంలోని మద్దూరు, చిన్న చింతకుంట, ఎద్దులాపురం, చిన్న వడ్డేమాను, పెద్ద వడ్డేమాను, నెల్లికొండి గ్రామాల మీదుగా కొన‌సాగింది. ఈ రోజు ష‌ర్మిల 18.6 కిలోమీట‌ర్ల మేర యాత్ర కొనసాగించారు. ఇప్పటి దాకా షర్మిల 624.5 కిలోమీట‌ర్ల వ‌ర‌కు న‌డిచారు.

బీడీ కార్మికుల‌ను ఆదుకుంటాం : ష‌ర్మిల

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిల చేప‌ట్టిన `మ‌రో ప్రజాప్రస్థానం` పాద‌యాత్రలో భాగంగా శ‌నివారం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా నెల్లికొండిలో ర‌చ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ ర‌చ్చబండ కార్యక్రమంలో ష‌ర్మిల అక్కడి ప్రజ‌ల‌ స‌మ‌స్యల‌పై ఆవేద‌న వ్యక్తం చేశారు. జ‌గ‌న‌న్న సీఎం అయితే బీడీ కార్మికుల‌ను ఆదుకుంటార‌ని ష‌ర్మిల చెప్పారు. మ‌హిళ‌ల‌కు వ‌డ్డీలేని రుణాలు ఇస్తార‌ని చెప్పారు. క‌రెంట్ కోత‌ల‌కు సీఎం నిర్లక్ష్యమే కార‌ణ‌మ‌నిన్నారు. వైఎస్ఆర్ కోయిల్‌సాగ‌ర్ ప్రాజెక్టును 70 శాతం పూర్తిచేశార‌నిన్నారు. మిగిలిన 30శాతం ప‌నుల‌ను కూడా ఈ ప్రభుత్వం చేయ‌లేక‌పోతోంద‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు.

source:sakshi

YS Vijayamma speech on SC,ST subplan bill in Assembly

Sharmila's Conducts Rachabanda at Mulamalla,

Chief Minister Jaganmohan Reddy by 2014, says Roja

షర్మిల పాదయాత్రకు లభిస్తోన్న ఆదరణను చూస్తేనే వైఎస్ఆర్‌పై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో తెలుస్తోందని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా అన్నారు. షర్మిలతో కలిసి 44వ రోజు పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. షర్మిల అడుగులో అడుగేసే ప్రతి ఒక్కరూ కుమ్మక్కు, నీచ రాజకీయాలను చీల్చి చెండాడే యోధులు అని కొనియాడారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభంజనాన్ని చూసి టీఆర్‌ఎస్‌ నాయకులు భయపడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు విశ్వసించడంలేదన్నారు. ప్రజలు కోరుకున్న వాళ్లే నాయకులు అవుతారని విమర్శలు చేసేవాళ్లు నాయకులు కాలేరన్నారు. వైఎస్ఆర్‌ కుటుంబం వెంట ఉండి మనోధైర్యమిస్తున్న ప్రజలకు రోజా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

Ambati Rambabu fire on Congress,TDP

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీని పిల్ల కాంగ్రెస్ అని విమర్శిస్తున్న చంద్రబాబు అదే పార్టీ దెబ్బకు హెలికాప్టర్లు వదిలేసి పాదయాత్ర మొదలుపెట్టారని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే గుండె దడ పట్టుకున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో పెద్ద దెబ్బ చూపించబోతున్నామని అన్నారు. విశాఖలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అంబటి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ మరణంపై ఇప్పటికీ ఎన్నో సందేహాలున్నాయని.. హెలికాఫ్టర్ ప్రమాదంపై త్యాగి ఇచ్చిన నివేదికను తాము ఖండిస్తున్నామని చెప్పారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపడానికి ఎందుకు వెనకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్న చింతకుంట చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ బతికుంటే కోయిల్‌సాగర్‌ ద్వారా తాగునీరు, సాగునీరు అందేదని అన్నారు. వైఎస్‌ఆర్‌ హయాంలో రైతులకు భరోసా ఉండేదని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, జిట్టా బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరోవైపు బీడీ కార్మికులు తమ గోడును షర్మిలకు వెళ్లబోసుకున్నారు. వారి సమస్యలను షర్మిల శ్రద్ధగా విన్నారు. జగనన్న అధికారంలోకి వస్తే వడ్డీలేని రుణాలిస్తామని వారికి హమీయిచ్చారు.

source:sakshi

షర్మిల పాదయాత్రలో పాల్గొన్న లాయర్లు

మరో ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్రకు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన న్యాయవాదులు షర్మిలతో కలిసి అడుగులు కలిపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్ జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని న్యాయవాదులు తెలిపారు. చంద్రబాబు తనకోసం పాదయాత్ర చేసుకుంటున్నారని వారు విమర్శించారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం అల్లీపురం శివారు నుంచి ప్రారంభం అయ్యింది. వేలాదిమంది వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు మద్దతు తెలుపుతూ వెంటరాగా షర్మిల 45వ రోజు యాత్రకు ముందుకు కదిలారు. మద్దూరు, చిన్న చింతకుంట, ఎద్దులాపురం, పెదవడ్లమాను, నెల్లికొండిల మీదగా పాదయాత్ర కొనసాగనుంది.




వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే దళితులకు న్యాయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లుపై చర్చలో భాగంగా ఆమె సభలో మాట్లాడారు. కిరణ్‌ కుమార్ రెడ్డి పాలన చంద్రబాబు సర్కారుకు కొనసాగింపుగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఎస్టీలు అక్షరాస్యత విషయంలో అట్టడుగున ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్టీల అభివృద్ధికి సరైన చర్యలు అవసరమనిఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని విజయమ్మ ప్రశ్నించారు.

Friday 30 November 2012

Palamuru Basatagaa..1st Dec 2012

జగన్ నేరమేంటి?

చేయని తప్పుకు ఇంకెంత కాలం జైల్లో పెడతారు?
దర్యాప్తునకు కాల పరిమితి లేదా?
ఎప్పట్లోగా పూర్తవుతుందో సీబీఐ చెప్పాలి
సీసీ నంబర్ 8లో దర్యాప్తు పూర్తయినందున బెయిలివ్వండి
దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తామో చెప్పలేం: సీబీఐ
వాదనలు పూర్తి.. డిసెంబర్ 4న కోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వం జారీ చేసిన జీవోలు సక్రమమే అయినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తప్పేమిటి? చేయని తప్పుకు ఇంకా ఎంత కాలం జైల్లో పెడతారు?’’ అని జగన్ తరఫున హైకోర్టు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. తనను రిమాండ్ చేసిన సీసీ నంబర్ 8లో దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 437 కింద జగన్ దాఖలు చేసిన సాధారణ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం విచారించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కీలక వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. ‘‘జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారెవరూ ఆయన మోసం చేశారని ఫిర్యాదు చేయలేదు. రాజకీయ పలుకుబడి, హోదా కారణంగా జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో గతంలో బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కానీ నిందితునిగా ఉన్న ఓ మంత్రికి మాత్రం ఈ కారణాన్ని వర్తింపజేయలేదు. ఆయనకు సమన్లు మాత్రమే జారీచేశారు’’ అంటూ వాదనలు వినిపించారు.

ఎంపీగా ప్రజల సమస్యలు పరిష్కరించాలి

‘‘సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తిచేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పింది. దాంతో దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఎలాంటి కాల పరిమితీ విధించలేదు. కానీ సీబీఐ తీరు చూస్తుంటే కొన్నేళ్లకు గానీ దర్యాప్తు పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. దర్యాప్తు త్వరగా పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పిన రెండు నెలల తర్వాత మేం బెయిల్ కోసం అడుగుతున్నాం. ఇంకెంత కాలం జగన్ జైల్లో ఉండాలి? ఇదేమీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కాదు. అక్రమాలు జరిగాయని చెబుతున్న సమయంలో జగన్ పబ్లిక్ సర్వెంట్ కూడా కాదు. ప్రభుత్వాధికారులతో కుమ్మక్కై ప్రజాధనాన్ని జగన్ దుర్వినియోగం చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు మంత్రిమండలి నిర్ణయాలు, అధికారులు జారీ చేసిన జీవోలు సక్రమమేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

నిందితునిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పటికీ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఆయన ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులతో పాటు ఇతరులను సీబీఐ కస్టడీలోకి తీసుకోలేదు. జగన్‌ను అరెస్టు చేయకుండా కూడా దర్యాప్తు చేసుకోవచ్చు. కానీ వివక్షపూరితంగానే ఆయనను అరెస్టు చేశారు. పార్లమెంట్ సభ్యునిగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జగన్‌పై ఉంది. అకారణంగా నెలల తరబడి ఆయన్ను జైల్లో పెట్టడం తగదు’’ అని నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

జగన్‌ను మాత్రమే జైల్లో పెట్టాలనుకుంటున్నారు: జగన్‌ను మాత్రమే జైల్లో పెట్టాలని సీబీఐ భావిస్తోందని, దర్యాప్తు పేరుతో ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ‘‘సీసీ నంబర్ 8 కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. మిగతా అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని చెబుతోంది. సీసీ నంబర్ 8లో దర్యాప్తు చేయాల్సిందేమీ లేదు కాబట్టి బెయిల్ ఇవ్వండి. సీబీఐ దర్యాప్తు పూర్తి చేయడానికి ఇంకెంత సమయం పడుతుంది? అందుకు కాల పరిమితి ఎంత? ఏపీఐఐసీ కేటాయించిన భూముల్ని ప్రభుత్వం ఇంతవరకూ వెనక్కు తీసుకోలేదు. అందులో పొరపాట్లు జరిగి ఉంటే భూ కేటాయింపుల్ని రద్దు చేసి ఉండేది.

సాక్షులను ప్రభావితం చేస్తాననడంలో వాస్తవం లేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో ఎక్కడా ఆ అభిప్రాయాన్ని ప్రస్తావించలేదు. దర్యాప్తునకు ఆయన సహకరిస్తారు. ఎలాంటి షరతులు విధిం చినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నాం. బెయిలివ్వండి’’ అని కోరారు.

నేరం రుజువు కానంతవరకు అమాయకులే: నేరం రుజువు కానంత వరకు నిందితులు అమాయకులేనని సుప్రీంకోర్టు పలు తీరుల్లో స్పష్టం చేసిన విషయాన్ని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. ‘‘బెయిల్ నిబంధనలను సంజయ్‌చంద్ర కేసులో ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. బెయిల్ తప్పనిసరి. జైలు అనేది మినహాయింపు. బెయిల్ తిరస్కరించడం వ్యక్తి స్వేచ్ఛను హరించడమే. సీసీ నంబర్ 8లో జగన్ అరెస్టును హైకోర్టు సమర్థించలేదు. అన్ని అంశాల్లో పెండింగ్ దర్యాప్తులో భాగంగానే జగన్‌ను అరెస్టు చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. సీసీ నంబర్ 8లో జగన్‌కు బెయిలివ్వండి. దర్యాప్తు పూర్తయినా ఆయనను జైల్లో ఉంచడం వివక్షాపూరితమే కాక రాజ్యాంగ విరుద్ధం’’ అని ఆయన పేర్కొన్నారు.

జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసు దర్యాప్తుకు సుప్రీంకోర్టు నిర్దిష్ట గడువేమీ విధించలేదని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వైజర్ బళ్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపించారు. ఇది ఆర్థిక నేరమని, ఇందులో దర్యాప్తు కొన్ని నెలల్లో, ఏడాదిలోనే పూర్తి చేసే అవకాశం లేదని అన్నారు. ‘‘జగన్ కేసు దర్యాప్తును ఎప్పట్లోగా పూర్తి చేస్తామో చెప్పలేం. జగన్‌ను వాన్‌పిక్ కేసులోనే అరెస్టు చేశాం. 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేశాం. ఇదేమీ అంత సులువైన కేసు కాదు. పెట్టుబడులకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి తుది చార్జిషీట్ దాఖలు చేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పాం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణార్హం కాదు. కొట్టివేయండి’’ అని కోరారు.

source:sakshi

చట్టబద్ధంగా బెయిల్‌కు అర్హుడిని

సుప్రీం ఉత్తర్వులను సీబీఐ కోర్టు తప్పుగా అర్థం చేసుకుంది
సెక్షన్ 167(2) విషయాన్ని అసలు సుప్రీంకోర్టు చెప్పనేలేదు
అయినా సీబీఐ కోర్టు సుప్రీం ఉత్తర్వులను కారణంగా చూపింది
నిర్దేశించిన గడువులోపు సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయలేదు
కాబట్టే నేను సెక్షన్ 167(2) కింద బెయిల్ కోరుతున్నా
అది నాకు చట్టం ప్రసాదించిన రాజ్యాంగపరమైన హక్కు
పిటిషన్‌పై సోమవారం విచారణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: తనకు బెయిల్ నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కడప పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తప్పుగా అర్థం చేసుకున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. చట్ట ప్రకారం తనకు నేరశిక్షాస్మృతి(సీఆర్‌పీసీ) సెక్షన్ 167(2) ప్రకారం రావాల్సిన బెయిల్‌ను నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దు చేసి, తనకు 167(2) కింద బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి విచారించనున్నారు. 

సీసీ నంబర్ 8లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆర్‌సీ 19(ఎ)కు అన్వయించిందని, ఈ రెండూ కూడా వేర్వేరు కేసులన్న విషయాన్ని ప్రత్యేక న్యాయస్థానం విస్మరించిందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) ప్రకారం ఏదైనా కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు, అప్పటి నుంచి 90 రోజుల్లోపు చార్జిషీట్ దాఖలు చేయని పక్షంలో, ఆ వ్యక్తి బెయిల్ పొందేందుకు అర్హుడని.. దీని ప్రకారం సీబీఐ ఈ మొత్తం కేసులో ఇప్పటి వరకు పూర్తిస్థాయి చార్జిషీట్ చేయలేదని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును కోరారు. 167(2) కింద నిందితునికి బెయిల్ పొందే హక్కు గురించి సుప్రీంకోర్టు ఇప్పటికే పలు స్పష్టమైన తీర్పులనిచ్చిందని, అయితే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తన విషయంలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వివరించారు. నిర్దిష్ట కాలపరిమితిలోపు చార్జిషీట్ దాఖలు చేయకుంటే, నిందితుడు ఆటోమేటిక్‌గా బెయిల్ పొందుతాడని సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పుల ఆధారంగానే, తాను ప్రత్యేక న్యాయస్థానంలో సెక్షన్ 167(2) కింద చట్టబద్ధమైన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశానని ఆయన వివరించారు. 

‘నా కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, ఆర్‌సీ నంబర్ 19(ఎ)లో సీబీఐ నన్ను ఈ ఏడాది మే 27న అరెస్టు చేసింది. ఇదే వ్యవహారంలో మరో నిందితుడిగా ఉన్న ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావుతోపాటు ఇతర నిందితులను సీబీఐ అరెస్టు చేయలేదు. సీబీఐ అధికారులు వారందరినీ కూడా నిందితులుగా పేర్కొన్నారు. కానీ వారిని అరెస్ట్ చేయలేదు. దీన్ని బట్టి నిందితులను అరెస్టు చేయకుండా, రిమాండ్‌కు తరలించకుండా కూడా దర్యాప్తు కొనసాగించవచ్చే అవకాశం ఉన్నప్పటికీ, నన్ను అరెస్ట్ చేసి, మిగిలిన వారిని మాత్రం సీబీఐ వదిలేసింది. దీన్ని ఏమని భావించాలి. దీని అర్థం ఏమిటి? నా అరెస్టును సవాలు చేస్తూ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశా. అయితే హైకోర్టు నా అరెస్ట్‌ను సమర్థించింది. అదే సమయంలో ఈ మొత్తం వ్యవహారంలో 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని సీబీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా సీబీఐ ఇప్పటి వరకు దర్యాప్తు చేయలేదు. అంతేకాక నిర్దేశించిన గడువు లోపు చార్జిషీట్ దాఖలు చేయని పక్షంలో నాకు సెక్షన్ 167(2) కింద బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు చెప్పినట్లు సీబీఐ చట్టం నిర్దేశించిన కాలంలోపు చార్జిషీటు దాఖలు చేయలేదు కాబట్టే నేను సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద బెయిల్ పొందేందుకు అర్హుడిని. అయితే ఈ విషయాన్ని సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను కారణంగా చూపుతూ నాకు బెయిల్ నిరాకరించింది. అందుకే నా చట్టబద్ధ హక్కును సాధించుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాను. దీనికి ముందు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు, దర్యాప్తు పూర్తయిన తరువాత బెయిల్ కోసం రావాలని చెప్పింది. అయితే సీబీఐ ప్రధాన కేసులో 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయలేదు కాబట్టి సెక్షన్ 167(2) విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. 

అసలు సుప్రీంకోర్టు ఉత్తర్వులకే సీబీఐ వక్రభాష్యం చెబుతోంది. దర్యాప్తు పూర్తి చేసే విషయంలో సుప్రీంకోర్టు ఎటువంటి గడువు విధించలేదని సీబీఐ డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్ మీడియా ముఖంగా చెప్పారు. దీనిని బట్టి సీబీఐకి ఇప్పట్లో దర్యాప్తు పూర్తి చేసే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. ఒక వ్యక్తి తాలూకు హోదాను, స్థాయినీ ఆయనకు వ్యతిరేకంగా ఉపయోగించకూడదు. నేను ఎంపీని కాబట్టి, నాకున్న పలుకుబడితో సాక్ష్యాలు తారుమారు చేయగలనని, సాక్షుల్ని ప్రభావితం చేయగలనని సీబీఐ వాదిస్తోంది. నేను ఎంపీగా ఎన్నికయింది ఇప్పుడు కాదు. ఈ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేనాటికే నేను ఎంపీని. అలాంటిది నన్ను కనీసం విచారణ కూడా చేయకుండా మూడు చార్జిషీట్లు వేసింది. నా పదవి వారి దర్యాప్తునకు ఆటంకమై ఉంటే, వారు మూడు చార్జిషీట్లు దాఖలు చేసేవారా..? సీబీఐ చేస్తున్న అర్థం లేని వాదన ఆధారంగా నాకు బెయిల్ నిరాకరించడం సరికాదు’ అని జగన్‌మోహన్‌రెడ్డి తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

source:sakshi

జవాబు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతారేం?

ఓబుళాపురం గనులను ఏపీఎండీసీకి కేటాయించాలని వైఎస్ నిర్ణయించారు.. అది ఆయన నిబద్ధతకు నిదర్శనం 
ఆ గనులను ఎస్‌ఆర్ మినరల్స్‌కు లీజుకు ఇవ్వాలన్న సర్కారు యత్నాల వెనుక మతలబు ఏమిటి? 
ఇవి కాంగ్రెస్ - టీడీపీ కుమ్మక్కు వ్యవహారాలు కావా? 
ఎస్‌ఆర్ మినరల్స్‌కు అటవీ అనుమతులెలా వచ్చాయి? 
జవాబు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతారేం? 
సీఎం కిరణ్ ధీమా వెనుక చంద్రబాబు భరోసా లేదా?
బాబుపై టీడీపీ నాయకులకే విశ్వాసం లేకుండాపోయింది 
టీడీపీ నేతపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలి ధ్వజం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓబుళాపురం ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు కేటాయించాలని నాటి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సర్కారు నిర్ణయించిన అత్యంత నాణ్యమైన ఇనుప ఖనిజ గనులను ప్రస్తుత ప్రభుత్వం ఎస్‌ఆర్ మినరల్స్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేయటం వెనుక కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు రాజకీయాలే కారణమంటూ తాము చేసిన ఆరోపణలకు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సూటిగా సమాధానం ఎందుకు చెప్పరని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. తాము చేసిన ఆరోపణలు అవాస్తవమనో, కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు కాలేదనో, అసలు ఆ వ్యవహారంతో తమకు సంబంధం లేదనో కేశవ్ నేరుగా జవాబు చెప్పకుండా డొంకతిరుగుడుగా మాట్లాడుతూ సంబంధం లేని విషయాలు ప్రస్తావిస్తూ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. శోభానాగిరెడ్డి శుక్రవారం పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, సీజీసీ సభ్యుడు మూలింటి మారెప్పలతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

‘‘దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏపీఎండీసీకి కేటాయించాలని నిర్ణయించిన 25 హెక్టార్ల అత్యంత నాణ్యమైన ఇనుప ఖనిజ గనులను ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ అనుయాయులకు చెందిన ఎస్‌ఆర్ మినరల్స్ అనే ప్రైవేటు సంస్థకు ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. అటవీశాఖ అనుమతులు లేవనే సాకుతో ఏపీఎండీసీ దరఖాస్తును తిరస్కరించి ఎస్‌ఆర్ మినరల్స్‌కు ఇవ్వాలని సర్కారు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీఎండీసీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్ - టీడీపీ కుమ్మక్కైన ఫలితంగానే జరుగుతోంది. ఎస్‌ఆర్ మినరల్స్ సంస్థ యజమానికి, కేశవ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని కూడా చెప్పాం. దీనిపై స్పందించిన కేశవ్ ఈ విషయాలకు సమాధానం చెప్తారేమోనని మేం భావించాం. ఈ వ్యవహారంతో టీడీపీకి సంబంధం లేదని చెప్తారేమో అనుకున్నాం. కానీ ఆయన ఆ విషయాలేమీ చెప్పకుండా దాటవేసే యత్నం చేశారు. ఏవో సంబంధం లేని విషయాలు చెప్పుకొచ్చారు’’ అని ఆమె విమర్శించారు. 

మౌనమెందుకంటే.. మాట్లాడరేం?: ‘‘ఓబుళాపురం గనుల లీజు వ్యవహారంలో గాలి జనార్దన్‌రెడ్డికి వైఎస్ దోచి పెట్టారంటూ తనకున్న మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నానా యాగీ చేశారు. అసెంబ్లీలో ఎంతో రాద్ధాంతం చేశారు. లీజు రద్దు చేసే దాకా వదల్లేదు. అలాంటిది ఇపుడు ఎస్‌ఆర్ మినరల్స్ విషయంలో ఎందుకు మౌనం వహించారు? ఎందుకు మాట్లాడటం లేదు? అని మేం ప్రశ్నిస్తే కేశవ్ దానికి సమాధానమే ఇవ్వలేదు’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) 2004లో ఈప్రాంతంలోని 93.5 హెక్టార్ల మైనింగ్ లీజు కోసం మొదట దరఖాస్తు చేసింది. ఇదే ప్రాంతంలో 25 హెక్టార్ల మైనింగ్ లీజు కోసం తర్వాత ఏపీఎండీసీ దరఖాస్తు చేసింది. మొదట దరఖాస్తు చేసినందున మొత్తం 93.5 హెక్టార్లను వైఎస్ సర్కారు ఓఎంసీకి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయవచ్చు. అయితే నాడు వైఎస్ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థకు ప్రయోజనం చేయాలన్న లక్ష్యంతోనే ఏపీఎండీసీకి 25 హెక్టార్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన 68.5 హెక్టార్లు మాత్రమే ఓఎంసీకి లీజుకు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ పరిరక్షణ, ప్రయోజనాల పరిరక్షణ పట్ల వైఎస్‌కు ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ప్రస్తుత ప్రభుత్వం ఈ 25 హెక్టార్లలోని 18 హెక్టార్లు (45 ఎకరాలను) ఏపీఎండీసీకి కాకుండా ప్రైవేటు సంస్థ అయిన ఎస్‌ఆర్ మినరల్స్‌కు కేటాయించేందుకు రంగం సిద్ధం చేయటం వెనుక మతలబు ఏమిటి? అని మేం ప్రశ్నించాం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కేశవ్ డొంక తిరుగుడుగా మాట్లాడుతూ వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు’’ అని ఆమె ధ్వజమెత్తారు. వ్యక్తిగత విషయాలకు వస్తే తామూ చాలా మంది గురించి చెప్పగలమని ఆమె హెచ్చరించారు. అటవీశాఖ నుంచి అనుమతి తెచ్చుకోలేదనే కుంటి సాకుతో ఏపీఎండీసీ దరఖాస్తును తిరస్కరించి ఎస్‌ఆర్ మినరల్స్‌కు గనులు కేటాయించే ప్రయత్నాలనే తాము ప్రశ్నిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. అసలు ఎస్‌ఆర్ మినరల్స్‌కు అటవీశాఖ అనుమతులు ఎలా వచ్చాయని ఆమె సూటిగా ప్రశ్నించారు. వీటికి సమాధానం చెప్పకుండా షర్మిల, విజయమ్మ రోడ్ల మీద తిరుగుతున్నారని ఏవేవో మాట్లాడుతున్న టీడీపీ నేతలకు బాలకృష్ణ, లోకేష్, జూనియర్ ఎన్‌టీఆర్ తిరగటం కనిపించడం లేదా? అని ఆమె నిలదీశారు. 

సూటిగా ఎందుకు సమాధానం చెప్పరు?: ‘‘అసలు ఈ మాటలన్నీ ఎందుకు? ఎస్‌ఆర్ మినరల్స్‌కు ఈ గనులను లీజుకు ఇవ్వాలని ఏ విధంగా సంకల్పించారు? అని సూటిగా ప్రశ్నిస్తుంటే సమాధానం ఎందుకు చెప్పరు? మేం చేసిన ఆరోపణలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. లీజు ఇవ్వటం లేదంటే ఆ మాట చెప్పాలి.. లేదంటే చర్యలు తీసుకోవాలి.. అది చెప్పకుండా సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు’’ అని శోభ డిమాండ్ చేశారు. కేశవ్ చేసిన ఆరోపణల్లో కొత్తవేమీ లేవని.. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఏరోజైతే కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చారో, ఏరోజైతే ఎంపీగా గెలిచారో ఆ రోజు నుంచే ఇవే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘‘తన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టుకుంటే పెట్టుకోండని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అంత ధీమాగా చెబుతున్నారంటే దాని వెనుక చంద్రబాబు ఇచ్చిన భరోసా ఉన్నందువల్లనే కదా?’’ అని శోభ వ్యాఖ్యానించారు. జగన్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయిస్తున్న ప్రభుత్వం.. తాము చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ఎందుకు స్పందించదని ఆమె ప్రశ్నించారు. బాబుపై దర్యాప్తు జరపకుండా కాంగ్రెస్ చూస్తోందని ప్రభుత్వం పడిపోకుండా టీడీపీ అధినేత కాపాడుతున్నారని ఇలా పరస్పరం మేలు చేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. 

ఎన్‌టీఆర్‌పైనే పోటీచేస్తానని చంద్రబాబు అనలేదా?: తాను టీడీపీలో ఉండగా చంద్రబాబును పొగిడానని చెప్తున్న కేశవ్‌కు వారి పార్టీ అధినేత చంద్రబాబు గతంలో అన్న మాటలు గుర్తుకు రాలేదా? అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. ‘‘బాబు కాంగ్రెస్‌లో ఉన్నపుడు మామ ఎన్‌టీఆర్‌పైనే పోటీ చేస్తానని అనలేదా? ఆ తరువాత టీడీపీలో చేరి ఎన్‌టీఆర్ తనకు దేవుడని చెప్పలేదా? మళ్లీ వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులేయించి వెన్నుపోటు పొడిచి గద్దె దించలేదా? అధికారం పోయాక ఇపుడు మళ్లీ ఎన్‌టీఆరే తమ దేవుడని బాబు అనటం లేదా?’’ అని ఆమె దుయ్యబట్టారు. తన గురించి మాట్లాడే ముందు ఇవే ప్రశ్నలు చంద్రబాబుకు కేశవ్ వేస్తే మంచిదని ఆమె హితవు పలికారు. తాము ఏ పార్టీలో ఉన్నా చిత్తశుద్ధితో పనిచేశామని, పైరవీలు చేసి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తమ నాయకత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంది కనుకనే ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నారని పేర్కొన్నారు. నిజంగా టీడీపీకి బలం ఉంటే గత రెండు ఎన్నికల్లో ఆ పార్టీకి తన నియోజకవర్గంలో డిపాజిట్ ఎందుకు పోయిందని ఆమె ప్రశ్నించారు.

బాబుపై టీడీపీ నేతలకే విశ్వాసం లేదు: బాబు పాదయాత్రను చూసి వణుకుపుట్టటం వల్లనే షర్మిల పాదయాత్ర చేపట్టారని కేశవ్ చెప్పటం అసంబద్ధమని ఎవరిని చూస్తే ఎవరికి వణుకు పుడుతోందో పరిస్థితులను పరిశీలిస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘‘నిజంగా బాబు యాత్రపై ప్రజలకు విశ్వాసం ఉందో లేదో కాసేపు పక్కనపెట్టండి. టీడీపీ నాయకులకే ఆయనపై విశ్వాసం లేదు. అందుకే బాబు యాత్ర ఓవైపు జరుగుతూ ఉంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి సీనియర్ నేత పార్టీని వీడి వెళ్లిపోయారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి వంటి యువ ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పారు. క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు, సాధారణ కార్యకర్తలు కూడా పార్టీపై నమ్మకం కోల్పోయి వెళ్లిపోతున్నారు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘ఇప్పటికి రెండుసార్లు ప్రతిపక్షంలో ఉన్న బాబు మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశమే ఉంటే ఇలా నేతలు పార్టీ వీడి వెళ్లిపోతారా?’’ అని ఆమె ప్రశ్నించారు. తమ సోదరుడు ఎమ్మెల్సీగా ఎన్నికైనపుడు అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే లేదని అలాంటపుడు కాంగ్రెస్‌తో తమకు లాలూచీ ఎలా ఉంటుందని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కావటంతో పాటుగా ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు ఉన్నచోట్ల ఒకరికొకరు మద్దతు నిచ్చుకున్నారని గుర్తుచేశారు.

source:sakshi

వైఎస్ దయ వల్లే ఈ స్థాయి



 ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శుక్రవారం చంచల్‌గూడ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ములాఖత్‌లో కలుసుకున్నారు. అనంతరం ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తమ అభీష్టాన్ని వెల్లడించారు. త్వరలో నిర్మల్, సిర్పూర్ శాసనసభా నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటుచేసి ప్రజల సమక్షంలో పార్టీలో చేరాలనుకుంటున్నట్లు వారు విజయమ్మకు తెలిపారు. అలాగే ఆ సభలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. మూడు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో కొనసాగుతూ లోక్‌సభ సభ్యుడిగా, శాసనసభ్యునిగా ఇంద్రకరణ్ పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడైన కోనప్ప ఒకసారి సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణపై అధిష్టానం నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నందుకు నిరసనగా వారిద్దరూ ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

జగన్‌తోనే వైఎస్ పథకాల అమలు: ఇంద్రకరణ్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమవుతుందని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్‌ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో వైఎస్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలను పూర్తిగా మర్చిపోయారని, తన కుర్చీని కాపాడుకోవడానికే ఆయనకు సమయం సరిపోతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని.. అన్ని పార్టీల్లోనూ తెలంగాణవాదులున్నట్లే తాము వైఎస్సార్ కాంగ్రెస్‌లో తెలంగాణవాదులుగా కొనసాగుతామని తెలిపారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమని, ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తాను అడ్డుపడబోనని జగన్ స్పష్టత ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాల వల్లే జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారని విమర్శించారు. 

వైఎస్ దయ వల్లే ఈ స్థాయి: కోనప్ప

వైఎస్ రాజశేఖరరెడ్డి దయ వల్లే తాను రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నానని, ఆయన తనను రాజకీయాల్లో ఎంతగానో ప్రోత్సహించారని కోనేరు కోనప్ప తెలిపారు. ఆదిలాబాద్ అభివృద్ధికి, తన నియోజకవర్గమైన సిర్పూర్ అభివృద్ధికి వైఎస్ ఎంతగానో కృషి చేశారన్నారు. కాగా, బోథ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ తుల శ్రీనివాస్, సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన కొముర గౌడ్ (మాజీ జెడ్పీటీసీ), డోకె వెంకన్న (సింగిల్ విండో చైర్మన్-బెజ్జూర్), సంతోష్‌గౌడ్, బుచ్చి పంతులు, బ్రహయ్య (సర్పంచ్‌లు), ఇతర నేతలు విశ్వనాథ్ బసార్కర్, కొమురం మహంతయ్య, దుబ్బుల వెంకన్న కూడా విజయమ్మను ఆమె నివాసంలో కలిశారు.

source:sakshi

Sharmila fire on Chandrababu

ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు ...

‘‘జిల్లాలో ఎక్కడికి వెళ్లినా మహిళలు తాగునీటి సమస్యలే చెబుతున్నారు. కనీసం తాగునీటి ఇబ్బందులు తీర్చలేని ఈ ప్రభుత్వం ఉన్నట్టా..చచ్చినట్టా.. జిల్లా రైతాంగం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆత్మకూరు మండలంలో 240 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు జెన్‌కో ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ నిధులు కేటాయిస్తే ఆ నిధులను కూడా సకాలంలో ఖర్చుచేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది’’ అని షర్మిల ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలను ఎండిగడుతూ.. ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగారు. 

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం మక్తల్ నియోజకవర్గంలోని మూలమళ్ల గ్రామం నుంచి అల్లీపురం వరకు మరో ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న రాజీవ్ భీమా ప్రాజెక్టు నిర్మాణానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవంపోసి 2004 సెప్టెంబర్ 24న మక్తల్ పట్టణంలో మొదటిదశ పనులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. దాదాపు రూ.2100 కోట్లు కేటాయించి రూ.1700 కోట్లు ఖర్చుచేసి 85 శాతం పనులు పూర్తిచేస్తే మిగిలిన 15 శాతం పనులను ఈ ప్రభుత్వం మూడేళ్లు గడిచినా పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1.11 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. 

నాడే రైతే రాజు 
‘యాత్రలో భాగంగా చెన్నయ్య అనే రైతు నా అడుగులో అడుగు వేస్తూ మీ నాన్న కన్న తండ్రి లాంటి వాడమ్మా అన్నారు. ఎందుకన్నా అని అడిగితే మా పరిస్థితి చూడమ్మా.. పొలంలో పత్తి వేశాను. నష్టం వచ్చింది. అయినా తిరిగి మరోసారి పంట వేస్తున్నా. ఏమొస్తుందో ఏమో.. మీ నాన్న ఉన్నప్పుడు అప్పులు తీరి గడ్డనపడ్డాను. ఆయన పోయిన తర్వాత రైతులను ఎవరూ ఆదుకోలేదు. రూ.3 లక్షల అప్పులయ్యాయి’ అంటూ చెబుతున్న ఆ రైతు బాధను వింటుంటే ఓ వైపు సంతోషంగా ఉంది, మరోవైపు బాధగా ఉందని షర్మిల అన్నారు. వైఎస్ హయాంలో రైతు రాజులా బతికాడని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో యాదవ కులస్తులను ఆదుకునేందుకు వైఎస్ సొసైటీలను ఏర్పాటుచేసి ఆర్థిక సహాయం అందిస్తే ప్రస్తుతం వారి ఇబ్బందుల గురించి అడిగేనాథుడే లేరన్నారు. ఆ తరువాత మార్గమధ్యంలో గొర్రెలకాపరులతో మాట్లాడారు. 
పేదలను చదువులకు దూరం చేశారు!
ఈ ప్రభుత్వం ఆదుకోకపోవడంతో కుటుంబ జీవనం గడిచేందుకు పాఠశాలకు వెళ్లే పిల్లలను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు కూలిపనులకు తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మరికొందరైతే ప్రభుత్వం చదివిస్తుందనే భరోసా లేకపోవడంతో చదువును మధ్యలోనే ఆపివేస్తున్నారని అన్నారు. ఇటువంటి ఇబ్బందులను ముందుగానే గుర్తించిన వైఎస్ రాజశేఖరరెడ్డి చదువుకోలేని పేదవిద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేశారని గుర్తుచేశారు. ఈ పథకాన్ని అమలుచేయకుండా పాలకులు పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు.

జగనన్నను ఆశీర్వదించండి
షర్మిల అంతకుముందు మూలమళ్ల గ్రామ శివారులో ఉన్న వలస కార్మికుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘‘మా ప్రాంతంలో పనులు లేక అయిజ మండలం నుంచి వరికోత పనుల కోసం ఇక్కడికి వచ్చామని’’ మహిళలు తమ కష్టాలను వివరించారు. ‘నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు పూర్తయితే మాకు ఇలా వలస వచ్చి పనులు చేసుకునే పరిస్థితి తప్పుతుందని’ వైఎస్‌ను గుర్తుచేశారు. అనంతరం మూలమళ్ల గ్రామంలో రచ్బబండ కార్యక్రమంలో పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తదితర వాటి అమలు సరిగా లేదని షర్మిల వద్ద పలువురు మహిళలు మొర పెట్టుకున్నారు. రాజన్నరాజ్యం వస్తే అన్ని సమస్యలు తీరుతాయని అందుకు రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలకు బుద్ధిచెప్పి జగనన్నను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

Sharmila's 45thday Maro Prajaprasthanam padayatra

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం అల్లీపురం గ్రామ శివారు నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మద్దూరు, చిన్న చింతకుంట, ఎద్దులాపురం, చిన్న వడ్డేమాను, పెద్ద వడ్డేమాను, నెల్లికొండి గ్రామాల మీదుగా యాత్ర కొనసాగించి ఆ రాత్రికి నెల్లికొండి గ్రామ శివారు ప్రాంతంలో షర్మిల బస చేస్తారన్నారు. శనివారం 18.6 కి.మీ మేర యాత్ర కొనసాగిస్తారని వారు వివరించారు.

ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం లేదు: టీడీపీ

రాష్ట్రప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి లేదని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు. ఐదేళ్లు పాలించాలని కాంగ్రెస్‌కు ప్రజలు తీర్పు ఇచ్చారని, మంచిపాలనో, చెడ్డపాలనో వారి తీర్పును గౌరవించాలన్నారు. లేదంటే ప్రజా తీర్పును అవమానపరిచినట్లేనని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే లింగారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

"ఓబుళాపురం" వెనుక ఒప్పందం ఏమిటి?


http://www.ysrcongress.com/news/news_updates/obulapuram_venuka_oppamdam_emiti_.html

 టీడీపీకి సన్నిహితమైన ఎస్ఆర్ మినరల్స్‌కు ఓబుళాపురం భూముల కేటాయింపు జరగడానికి వెనుక ఉన్నఒప్పందం ఏమిటో బయటపెట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. టిడిపి నాయకుడు పయ్యావుల కేశవ్ సమాధానం దాటవేసే రీతిలో ఉందని ఆమె విమర్శించారు.  కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అయ్యాయనేందుకు ఎస్ఆర్ మినరల్స్‌-ఓబుళాపురం భూముల వ్యవహారం మరో నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. డొంకతిరుగుడు మాటలు మాని భూముల కేటాయింపులోని అసలు ఉద్దేశ్యాలేమిటో బయటపెట్టాలని ఆమె అన్నారు.  టీడీపీతో కుమ్మక్కు కాలేదని చెప్పుకోవాలంటే ప్రభుత్వం ముందు ఎస్ఆర్ మినరల్స్‌కు కేటాయించిన భూములను రద్దు చేసి, వాటిని ఏపీఎండీసీకి మంజూరు చేసి, మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలన్నారు.
 ఆ రోజు  25 హెక్టార్ల భూమిని రాజశేఖర్ రెడ్డిగారి ప్రభుత్వం ఏపీఎండీసీకి ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పుడు కిరణ్ కుమార్ ప్రభుత్వం అందులోని 18 హెక్టార్లను ఎస్ఆర్ మినరల్స్‌కు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారని ఆమె ఆరోపించారు. ఎస్ఆర్ మినరల్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ సురేంద్రబాబు టీడీపీ నేతలకు సన్నిహితుడని శోభా నాగిరెడ్డి ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. 

నానా యాగీ చేసిన బాబు!
"ఓబుళాపురం మైనింగ్ విషయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు నానా యాగీ చేశారు. తనకు వంత పాడే మీడియాను అడ్డం పెట్టుకుని మహానేత వైయస్ నాడు జనార్దనరెడ్డికి దోచిపెట్టారనీ, అక్రమంగా లీజులిచ్చారనీ అవాకులూ చవాకులూ మాట్లాడారు. మరి ఇవాళ నాడు ప్రభుత్వానికి చెందిన ఏపీఎండీసీకి కేటాయించిన భూములను రద్దు చేసి ప్రైవేటు సంస్థ అయిన ఎస్ఆర్ మినరల్స్‌కు కేటాయిస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదు?" అని ఆమె ప్రశ్నించారు. 
ఏపీఎండీసీ 27-10-2004న దరఖాస్తు చేస్తే, ఎస్ఆర్ మినరల్స్‌ దరఖాస్తు చేసింది 12-10-2004న అని ఆమె వివరించారు. 2005 అక్టోబర్ 26న  ఎస్ఆర్ మినరల్స్‌కు ఫారెస్టు క్లియరెన్స్ ఇచ్చారనీ, ఎస్ఆర్ మినరల్స్ అటవీ అనుమతులు తెచ్చుకుంది కాబట్టి, ఏపీఎండీసీకి భూముల కేటాయింపును ఎందుకు రద్దు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఒక షోకాజ్ నోటీసు ఇచ్చిందని ఆమె విమర్శించారు. గనుల లీజు పొందని ఎస్ఆర్ మినరల్స్‌కు అసలు అటవీ అనుమతులు ఎలా ఇచ్చారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఏపీఎండీసీకి అటవీ అనుమతులు ఇప్పించవలసింది ప్రభుత్వమేనన్నారు. ప్రభుత్వమే ఒక ప్రభుత్వ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం పట్ల ఆమె అభ్యంతరం తెలిపారు.  దీంట్లో ఉన్న"మతలబు" ఏమిటో చెప్పాలని ఆమె నిలదీశారు. ఇది జరిగిన మాట వాస్తవమా కాదా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఎస్ఆర్ మినరల్స్‌వాళ్లు తనకు వ్యక్తిగతంగా తనకు సన్నిహితులని పయ్యావుల కేశవ్ ఒప్పుకున్నారనీ, ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో చెప్పాల్సింది ప్రభుత్వమేననీ శోభా నాగిరెడ్డి అన్నారు. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఎస్ఆర్ మినరల్స్‌కు కూడా ఉందన్నారు.
" శ్రీ జగన్మోహన్ రెడ్డిగానికి రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అయ్యాయనీ, చంద్రబాబుకు మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందనీ, దానికి ప్రతిఫలంగా చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారనీ, అలా ఒకరికొకరు మేలు చేసుకుంటున్నారనీ మేం ఆరోపించాం. ఆరోపణలే కాదు, ఉదాహరణలూ రుజువులూ చూపాం. ఎస్ఆర్ మినరల్స్‌కు ఓబుళాపురం భూముల కేటాయింపు అన్నది ఆ కుమ్మక్కులో భాగమే." అని శోభాగారిరెడ్డి వ్యాఖ్యానించారు. రోశయ్య ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని జీఎన్ నాయుడుకు కేటాయించడం దగ్గరి నుంచి ఎంఎల్‌సి ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో పరస్పరం సహకరించుకోవడం వరకు అన్ని పరిణామాలూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను వెల్లడి చేస్తున్నాయన్నారు. 
కేటాయింపులపై మాట్లాడమంటే వైయస్ఆర్ సీపీ నేతలైన శ్రీమతి విజయమ్మగారు, శ్రీ జగన్మోహన్ రెడ్డిగారు, శ్రీమతి షర్మిలగారు తదితరులపై వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని ఆమె పయ్యావుల కేశవ్‌ తీరు పట్ల అభ్యంతరం తెలిపారు. తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, లోకేశ్ కూడా తిరుగుతున్నారన్నారు. 
"టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును నేను పొగిడానన్నారు. మరి చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌పై పోటీ పెడతామన్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరాక ఎన్టీఆర్‌ను దేవుడన్నారు. ఆ తర్వాత ఆయనపై చెప్పులేయించారు. మళ్లీ ఇప్పుడు దేవుడంటున్నారు. నేను ఎక్కడ ఉన్నానిజాయితీగానే ఉన్నా. మా నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉండడం వల్లే ఆళ్లగడ్డ నుండి ఏ పార్టీలో ఉన్నా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తూనే వచ్చారు. నేను బయటకు వచ్చాక టీడీపీకి రెండు సార్లు డిపాజిట్లు పోయాయి"అని శోభానాగిరెడ్డి గుర్తు చేశారు.

సోనియా కంటే బాబు భరోసాయే ఎక్కువ!
"ప్రజలు ఐదేళ్ల కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం లేదంటూ టీడీపీ నేత ముద్దు కృష్ణమనాయుడు అంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదంటూ చంద్రబాబుగారు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కంటే ఎక్కువ భరోసా ఇస్తున్నారు." అని ఆమె ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిగారు అవిశ్వాసం పెట్టుకోమంటు న్నారంటే దాని వెనుక ఉన్న ధైర్యం తెలుగుదేశం పార్టీ ఇస్తున్న భరోసానేనని ఆమె అన్నారు.  
చంద్రబాబు పాదయాత్ర మొదలు పెట్టాక ఎందరో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీ మారారని ఆమె గుర్తు చేశారు. టిడిపిలో నాయకత్వంపై ఉన్న విశ్వాసమేమిటో దీన్ని బట్టే తెలుస్తోందన్నారు.  ఉప ఎన్నికలు జరిగితే సగం స్థానాలలో డిపాజిట్లు పోగొట్టుకున్నారని, ఎన్నికలయ్యాక 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడారనీ ఆమె గుర్తు చేశారు. వైయస్ఆర్ సీపీ నాయకులు శ్రీ గట్టు రామచంద్రరావు, శ్రీ మూలింటి మారెప్ప కూడా ఈ మీడియా సమావేశంతో పాల్గొన్నారు.

ముగిసిన ష‌ర్మిల 44వ‌రోజు పాద‌యాత్ర

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ 44వ రోజు పాదయాత్ర శుక్రవారం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని అల్లీపురంలో ముగిసింది. ఈరోజు ష‌ర్మిల 17 కిలోమీట‌ర్లు న‌డిచారు. మూలమళ్ల గ్రామశివారు ప్రాంతం నుంచి ష‌ర్మిల పాద‌యాత్రను ప్రారంభించారు. అనంత‌రం ఆత్మకూరుకు చేరుకుని బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. అల్లీపురం గ్రామంలో ష‌ర్మిల రాత్రికి బ‌స చేయ‌నున్నారు. ఇప్పటివ‌ర‌కు ష‌ర్మిల 606 కిలోమీట‌ర్లు న‌డిచారు.

maro praja prasthanam images

వైఎస్సార్‌సీపీలోకి కొన‌సాగుతున్న వ‌ల‌స‌లు

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు క్రమంగా కొన‌సాగుతున్నాయి. రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి ప్రజ‌లు అధిక‌శాతం వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. లోక్‌స‌త్తా మ‌హిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి శ్రీ‌దేవి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

జగన్ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తరపున హైకోర్టులో స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ 90 రోజుల గడువుకు సంబంధించినది. అరెస్టు చేసి 90 రోజులు దాటితే చట్టప్రకారం బెయిలు తప్పనిసరిగా ఇవ్వాలి. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై ఏ కోర్టులోనూ జగన్ వాదనలు వినిపించలేదు. జగన్ సుప్రీంకోర్టులో బెయిల్ దాఖలు చేసేనాటికి 90 రోజుల గడువు పూర్తికాలేదు. అందుకే సర్వోన్నత న్యాయస్థానం ఆ అంశంపై విచారణ చేపట్టలేదు. ఇప్పుడు గడువు ముగియటంతో జగన్ హై కోర్టును ఆశ్రయించారు.

source:sakshi

ప్రభుత్వాన్ని కాపాడుతున్న బాబు:షర్మిల

శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే బలం ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల విమర్శించారు. ఆత్మకూరు సభలో ఆమె ప్రసంగించారు. దివంగత మహానేత వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రతి పేదవాడు ధైర్యంగా కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లేవాడన్నారు. జూరాల వద్ద జెన్‌కో ప్రాజెక్టు నిర్మిస్తే జిల్లాకు న్యాయం జరుగుతుందని వైఎస్ సంకల్పించారన్నారు.


source:sakshi

YSRCP MLA Shobha Nagi Reddy press meet in ysrcp office

తుది తీర్పు డిసెంబర్ 4కు వాయిదా

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన రెండో బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం నాంపల్లి సీబీఐ కోర్టు వాదనలు ముగిశాయి. తుది తీర్పును కోర్టు డిసెంబర్ 4కు వాయిదా వేసింది.

ఈనెల 16న రెండు బెయిల్ పిటిషన్‌లను జగన్ దాఖలు చేయగా, రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టు మొదటి పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. 

ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ

ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీ సీనియర్‌ నేతలు మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప త్వరలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను చంచల్ గూడ జైల్లో కలిశారు. 

YSRCP leader Golla Baburao comments on Sub plan

Protests against CBI way in Pulivendula

Thursday 29 November 2012

మూలమల్ల నుంచి షర్మిల పాదయాత్ర

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం మూలమల్ల నుంచి యాత్రను ప్రారంభించారు. వైఎస్ అభిమానులు, కార్యకర్యల ఆదరణ మధ్య ఆమె పాదయాత్ర 44వ రోజుకు చేరింది. షర్మలకు మద్దతుగా వేలాదిమంది వైఎస్ అభిమానులు మూలమల్ల చేరుకున్నారు. ఆత్మకూరు సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం అల్లీపురంల్లో షర్మిల పాదయాత్ర చేస్తారు.

Sakshi Vedika with YSRCP minority cell convener Rehman

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై వైఎస్సార్ సీఎల్పీ డిమాండ్

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులకు చట్ట బద్ధత కల్పిస్తే సరిపోదని, ఆ వర్గాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం డిమాండ్ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్షం నాయకురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును సీఎల్పీ సమావేశం ఆహ్వానించింది. సమావేశం వివరాలను శాసన సభాపక్ష ఉప నాయకులు భూమా శోభా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని కోరిన విజయమ్మ

శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏర్పాటు చేసిన బీఏసీ(సభా కార్యక్రమాల సలహా మండలి) భేటీలో విజయమ్మ పాల్గొన్నారని, సబ్‌ప్లాన్ బిల్లుపై చర్చకు ఈ సమయం చాలదని, కనీసం మరో రెండు రోజులు పొడిగించాలని కోరారని తెలిపారు. అన్ని పక్షాలు కోరిన మీదట మరో రోజు అసెంబ్లీని పొడిగించారని వెల్లడించారు. గతంలో ఏ పార్టీ గాని, ఏ ముఖ్యమంత్రి గానీ చేయని విధంగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించారని, గత 20 ఏళ్ల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని శోభా నాగిరెడ్డి అన్నారు. ఆయన పాలనలోనే ఆ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా బలపడ్డాయని, అందుకే వైఎస్సార్ కాంగ్రెస్‌కు వారంతా మద్దతుగా నిలిచారన్నారు. ఈ బిల్లుపై తమ పార్టీ ఎమ్మెల్యేలు చురుగ్గా చర్చలో పాల్గొని నిర్మాణాత్మక సూచనలు చేస్తారని చెప్పారు. 

కాగితాలకే పరిమితం చేయొద్దు..

శ్రీనివాసులు మాట్లాడుతూ.. చట్టబద్ధత కల్పించే ప్రయత్నాన్ని తాము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని, అయితే దీనిని కాగితాలకే పరిమితం చేయరాదని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధుల వ్యయానికి సంబంధించి ఏ విధమైన చట్టబద్ధత ఇస్తారనే విషయంలో స్పష్టత లేదన్నారు. శాసనసభాపక్షం సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ముఖ్య నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, తెల్లం బాలరాజు, భూమన కరుణాకర్‌రెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు.

ఓఎంసీకి మొదట ఇనుప ఖనిజ లీజు ఇచ్చింది ఆయనే


*ఓఎంసీకి బాబు బదలాయింపును సీబీఐ విచారించదేం?
*బాబు-కాంగ్రెస్ చీకటి ఒప్పందానికి ఇదే నిదర్శనం

చంద్రబాబు హయాంలో లెక్కలేనన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి. వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ న్యాయస్థానాల్లో కేసులు కూడా దాఖలయ్యాయి. అయినా సరే.. బాబు అవినీతి, అక్రమాలు కేంద్రానికి గానీ, దాని కనుసన్నల్లో నడుస్తున్న సీబీఐకి గానీ పట్టవు! కాంగ్రెస్-టీడీపీ చీకటి ఒప్పందమే ఇందుకు కారణమనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఓబుళాపురంలో గాలి జనార్దనరెడ్డికి చెందిన ఓఎంసీకి మొదట ఇనుప ఖనిజ లీజును బదలాయించింది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబే. దాన్ని రామ్మోహన్‌రెడ్డి నుంచి ఓఎంసీకి బదలాయిస్తూ బాబు సర్కారే 2002 ఫిబ్రవరి 18న జీవో నంబర్ 80ని జారీ చేసింది. తర్వాత కొన్ని నెలలకే గాలి జనార్దనరెడ్డి ఆ సంస్థలో చేరారు.

ఓఎంసీకి తానెలాంటి ప్రయోజనం చేకూర్చలేదని, వైఎస్ మాత్రం ఆ సంస్థకు గనులు దోచిపెట్టారని చంద్రబాబు ఎన్నోసార్లు ఆరోపించారు. కానీ నిజానికి ఓఎంసీకి చంద్రబాబే 64.2 ఎకరాల లీజును బదలాయించారంటూ 2011 నవంబరు 4న సీబీఐకి జగన్ స్పష్టంగా వివరించారు. అందుకు సంబంధించి ఆధారాలనూ సమర్పించారు. జీవో కాపీలను మీడియాకు కూడా అందజేశారు. ఓఎంసీ వ్యవహారంలో బాబే తొలి ముద్దాయి గనుక ఆయనను కూడా ఈ కేసు విచారణ పరిధిలో చేర్చాలని అప్పట్లో సీబీఐ జాయింట్ డెరైక్టర్‌కు ఆధారాలతో సహా జగన్ లేఖ సమర్పించారు.

గాలి ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రచారం చేయలేదా?
1999లో కర్ణాటకలోని బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి సుష్మా స్వరాజ్, అసెంబ్లీ స్థానం నుంచి శ్రీరాములు బీజేపీ తరఫున పోటీ చేసిన సందర్భంగా గాలి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలోనే చంద్రబాబు అక్కడికి వెళ్లి ప్రచారం చేశారు. ఇది జగమెరిగిన సత్యం. ఎమ్మార్ కేసులోనూ అన్ని వేళ్లూ చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున విలాసవంతమైన బంగళాలు కట్టుకుని అమ్ముకునేదానికి, గోల్ఫ్ కోర్టులు కట్టుకోవడానికి ఎకరా నాలుగు కోట్ల పై చిలుకు చేసే భూమిని అన్ని నిబంధనలను కాలరాసి అడ్డగోలుగా, కారుచౌకగా, ఉచితంగా ఎమ్మార్‌కు బాబు సర్కారు కట్టబెట్టింది. అయినా ఆయనపై సీబీఐ విచారణ జరపదు.

*ఎకరాకు రూ. 29 లక్షలు వెలకట్టి ఎమ్మార్‌కు భూములు కట్టబెట్టిన బాబు, అంతకు మూడేళ్ల క్రితమే అదే ప్రాంతంలో తన భార్య పేరిట ఉన్న భూమిని ఎకరా కోటి రూపాయలకు డాక్టర్ రెడ్డీస్ సంస్థకు విక్రయించారు. అక్కడి ప్రభుత్వ భూమికి ధరను పెంచాల్సింది పోయి మరింత తగ్గించినా.. చెనక్కాయలకు, బెల్లానికి కేటాయించిన చందంగా కట్టబెట్టినా సీబీఐ ఆయనవైపు కన్నెత్తి కూడా చూడకపోవడానికి కాంగ్రెస్-టీడీపీ చీకటి ఒప్పందమే కారణమన్నది బహిరంగ రహస్యం.

ఎల్లో మీడియా దృష్టికి రావా?
* ఓఎంసీకి తొలుత ఓబుళాపురంలో హైగ్రేడ్ మైనింగ్ లీజు బదలాయించింది, ఎమ్మార్‌కు అప్పనంగా ప్రభుత్వ భూములు కట్టబెట్టింది చంద్రబాబేనని తెలిసినా ఎల్లో మీడియా మాత్రం ఎన్నడూ వాటిని పొరపాటున కూడా ప్రస్తావించదు. టీడీపీ అధినేత-ఎల్లో మీడియా అనుబంధమే అందుకు కారణం. బాబు జీవోపైనా దర్యాప్తు జరుపుతామని అప్పట్లో మీడియా సమావేశంలో ప్రకటించిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ... అందులో ఏమీ లేదని, విచారణ జరపాల్సిన అవసరం లేదని తర్వాత తేల్చేశారు!
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!