YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 4 August 2012

Sakshi News Maker With YSRCP Leader "Konda murali"

బైరెడ్డి దీక్ష బాబు నాటకమే: జీవన్‌రెడ్డి

టీడీపీ నేత బైరెడ్డి రాజ శేఖరరెడ్డి చేస్తున్న దీక్ష వెనుక ఆ పార్టీ అధినేతచంద్రబాబు ఉన్నారని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణపై కచ్చితమైన అభిప్రాయంతో కేంద్రానికి టీడీపీ లేఖ రాయాలని ఈ ప్రాంతనేతలు ఒత్తిడి చేస్తుండటంతోనే చంద్రబాబు కొత్త నాటకానికి తెరదీశారన్నారు. సీఎల్పీ కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. 

‘‘రాయలసీమ వాళ్లు ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. కానీ బెరైడ్డి మాత్రం రాష్ర్టం ఉంటే సమైక్యంగా ఉండాలి. లేకుంటే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాంటూ రెండు తలల పాము మాదిరిగా మాట్లాడుతుండు. సీమకు అన్యాయం జరిగిందని చెబుతున్న బైరెడ్డి .. సమైక్య రాష్ట్రం కావాలని ఎందుకు కోరుకుంటున్నారో అర్థంకావడం లేదు. ఈ రాష్ట్రాన్ని పాలించిన నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, బాబు, వైఎస్, కిరణ్‌కుమార్ రెడ్డి వంటి నేతలంతా రాయలసీమ వాళ్లే. ఇంకా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందంటే ఎట్లా? ’’ అని పేర్కొన్నారు. ఆయనకు రాయలసీమ రాష్ట్రంపట్ల చిత్తశుద్ధి ఉంటే సమైక్య రాష్ర్టం గురించి మాట్లాడకుండా ఉద్యమిస్తే తాము మద్దతిస్తామన్నారు. 

జనం నెత్తిన పిడుగు

నగరవాసులపై ‘గ్రేటర్’ పన్నుల కత్తి.. అభివృద్ధి పనులు చేయకున్నా.. నగరవాసులు నిత్యం నరకం చవిచూస్తున్నా.. పట్టించుకోని అధికారులు.. పన్నుల పేరిట దండుకోవడానికి మాత్రం వెనుకాడట్లేదు. ఇప్పటి దాకా వృత్తిపన్ను పరిధిలో లేని వారందరి నుంచి దీన్ని ముక్కుపిండి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఏటా ఒక్కో ఉద్యోగిపై కనిష్టంగా రూ.700 నుంచి గరిష్టంగా రూ.2500 వరకు.. మొత్తంగా రూ.300 కోట్ల మేర వడ్డించడానికి కసరత్తు చేస్తోంది. హేతుబద్ధీకరణ పేరిట ఇప్పటికే ఆస్తిపన్ను వసూళ్లను పెంచిన జీహెచ్‌ఎంసీ త్వరలోనే దీన్ని రివిజన్ చేయనున్న నేపథ్యంలో అవీ పెరగనున్నాయి.

నెల జీతం రూ.5 వేలు దాటితే బాదుడే..
మీ నెల జీతం రూ.5 వేలు దాటిందా? మీరు పనిచేసే సంస్థ రిజిస్టర్‌లో మీ పేరు నమోదై ఉందా? ఈ రెండూ ఉన్నా.. మీరు ఇప్పటి వరకు వృత్తిపన్ను చెల్లించలేదా? అయితే ఇకపై చెల్లించకుండా తప్పించుకోలేరు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సంస్థలతో పాటు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద పేరు నమోదైన అన్ని వృత్తి, వ్యాపార రంగాల్లో పనిచేసే వారు వృత్తిపన్ను చెల్లించాల్సిందే. గ్రేటర్‌లో వృత్తిపన్నును వసూలు చేస్తోన్న వాణిజ్యపన్నుల శాఖ నుంచి ఈ బాధ్యతను సర్కారు జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. 

అత్యధిక ఆదాయమే లక్ష్యం..
జీహెచ్‌ఎంసీ ఆదాయ మార్గాల్లో ఆస్తిపన్ను, టౌన్‌ప్లానింగ్, ట్రేడ్ లెసైన్సుల ఫీజులు ముఖ్యమైనవి. వీటిలో ఆస్తిపన్ను ద్వారా అత్యధికంగా గతేడాది రూ. 625 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది డిమాండ్ రూ. 800 కోట్లకు పెరిగింది. దీని తర్వాత వృత్తిపన్ను ద్వారా అత్యధిక ఆదాయం ఏటా రూ. 300 కోట్లు రాగలవని అధికారుల అంచనా. ఇప్పటిదాకా వృత్తిపన్నును వసూలు చేస్తున్న వాణిజ్యపన్నుల శాఖ అం దులో ఏటా 95 శాతం స్థానిక సంస్థ అయిన జీహెచ్‌ఎంసీకి అందజేయాల్సి ఉండగా, రూ.50 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. నగరంలోని చాలా ప్రైవేటు సంస్థలు ఉద్యోగుల వృత్తిపన్నును చెల్లించట్లేదనేది జీహెచ్‌ఎంసీ అంచనా. వీటన్నింటి నుంచీ పన్ను వసూలు చేస్తే ఏటా కనీసం రూ.300 కోట్లయినా రాగలవని భావిస్తున్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, ఇంకా పలు ఉద్యోగ వర్గాల నుంచి ఈ పన్ను వసూలవుతున్న దాఖలాల్లేవు. వీరందరినీ వృత్తిపన్ను పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న వారి వివరాలనూ వాణిజ్యపన్నుల శాఖ నుంచి తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. 

త్వరలో కసరత్తు.. 
వృత్తిపన్ను వసూళ్లపై సర్కిళ్ల వారీగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ను గుర్తించి, వృత్తిపన్ను చెల్లించని సంస్థలకు నోటీసుల జారీ తదితరమైన పనుల నిర్వహణకు బిల్ కలెక్టర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. అవసరమైన మేర అదనపు సిబ్బందిని నియమించడంతో పాటు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిం చనున్నారు. అక్టోబర్ నుంచి వృత్తిపన్ను వసూళ్లు ప్రారంభిస్తామని కృష్ణబాబు తెలిపారు.

ఆరోగ్యశాఖకు సుస్తీ!

ఉన్నవి ఖర్చు చెయ్యరు.. రావాల్సినవి ఇవ్వరు
వాడుకోలేకపోయిన నిధులు రూ.700 కోట్లు!
సర్కారు మొండిచేయి చూపినవి మరో రూ.394 కోట్లు
నిధుల్లేకే ఎంబీబీఎస్, పీజీ సీట్లు కోల్పోయిన వైనం
పారిశుధ్యం, నిర్వహణా వ్యయాలకు కూడా దిక్కు లేదు
మూడేళ్లలో ఒక్క బోధనాసుపత్రిలోనూ మౌలిక వసతులు కల్పించలేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అమ్మ పెట్టదు, అడుక్కూ తిననివ్వదు అన్న చందంగా తయారైంది వైద్య ఆరోగ్యశాఖలో నిధుల పరిస్థితి. ఉన్న నిధులను ఖర్చు చేయకపోగా ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదు. మూడేళ్లుగా ఇదే తంతు! దాంతో వైద్య ఆరోగ్య శాఖకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రులు, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్యశ్రీ వార్డులు.. ఇలా అన్ని విభాగాలూ మూడేళ్లుగా వసతుల లేమితో కుదేలవుతున్నాయి. నిధుల లేమి వల్లే చివరకు 350 ఎంబీబీఎస్ సీట్లనూ కోల్పోవాల్సి వచ్చింది! పైగా రాష్ట్రానికి రావాల్సిన పీజీ సీట్లనూ తెచ్చుకోలేకపోయారు. బోధనాసుపత్రుల్లోనైతే సౌకర్యాలు రోజురోజుకూ మృగ్యమవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన నిధులనే కాదు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నిధులనూ సకాలంలో ఖర్చు చేయక పనులన్నీ ఆగిపోయాయి. ఇలా 2011-12లోనే సుమారు రూ.700 కోట్ల కేంద్ర నిధులను ఖర్చు చేయలేకపోయినట్టు ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశే అందరి కంటే వెనకబడిందని కేంద్రం చెప్పడం మన చేతగానితనానికి ప్రత్యక్ష ఉదాహరణ!

వచ్చినవి వాడుకోలేదు

ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద రాష్ట్రానికి 2011-12లో రూ.960 కోట్లు నిధులొస్తే ఇప్పటిదాకా ఖర్చు చేసింది రూ.560 కోట్లు మాత్రమే. అలా రూ.400 కోట్లు మురిగిపోయాయి. దాంతో ఎన్నో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు. 2011-12కు 145 పీజీ వైద్య సీట్ల కోసమంటూ కేంద్రం మనకు రూ.200 కోట్లు కేటాయించింది. తొలివిడతగా రూ.60 కోట్లిచ్చింది. వాటికి 25 శాతం మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ.15 కోట్లను రాష్ట్రం ఇప్పటికీ ఇవ్వలేదు. దాంతో రెండో విడత నిధులు ఇవ్వలేమని కేంద్రం తెగేసి చెప్పింది. అలా పీజీ వైద్య విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకూ గండిపడింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 10 బోధనాసుపత్రుల అభివృద్ధి కోసమంటూ రూ.120 కోట్లు కేటాయించారు. వాటిని నేరుగా ప్రిన్సిపళ్లే ఖర్చు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. కానీ వారికి చెక్ పవర్ లేక 7 నెలలుగా ఆ నిధులన్నీ అలాగే ఉండిపోయాయి. పైగా ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు మౌలిక వసతుల కల్పన కోసం రివాల్వింగ్ ఫండ్‌గా 2009లో వైఎస్ హయాంలో ఇచ్చిన రూ.55 కోట్లకు ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయలేని దుస్థితి! గతేడాది మందుల కొనుగోలుకు రూ.324 కోట్లు కేటాయించినా చివరకు రూ.70 కోట్లు ఖర్చు చేయలేక మురిగిపోయాయి.

ఇవ్వాల్సిన వాటికి దిక్కే లేదు: ఇలా ఒకవైపు వచ్చిన నిధులను వాడుకోలేక చేతులెత్తేసిన రాష్ట్రం, తానివ్వాల్సిన నిధులను కూడా అసలే ఇవ్వలేదు. మౌలిక వసతులకు రూ.79.6 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రానికి మరో 350 ఎంబీబీఎస్ సీట్లు వచ్చేవి. కానీ సర్కారు పైసా కూడా ఇవ్వలేదు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి రూ.200 కోట్లిస్తామని రెండేళ్లు గడిచినా పైసా కూడా ఇవ్వలేదు. ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్‌లకు సకాలంలో నిధులు మంజూరు చేయక మూడేళ్లుగా నిర్మాణాలే పూర్తవలేదు. దాంతో ఎంబీబీఎస్ సీట్లు కూడా పోయే పరిస్థితి ఎదురైంది. రాష్ట్రంలోని మూడు ఫ్రభుత్వ ఆయుర్వేద, హోమియో కాలేజీలకు నిధులు మంజూరు చేయకపోవడంతో రెండేళ్లుగా వాటికి సీట్ల కేటాయింపును ఆపేశారు. ఏపీవీవీపీ, డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులకు నిర్వహణ ఖర్చుల కింద ఏటా ఇవ్వాల్సిన రూ.50 కోట్లు ఇవ్వకపోవడంతో చాలా ఆస్పత్రుల్లో బల్బులు, ఫ్యాన్లు మార్చుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది!

కాంగ్రెస్‌లో కుంపట్లు

* రాష్ట్ర నాయకత్వం తీరుపై పార్టీలోనే విమర్శల వెల్లువ 
* ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, ఎంపీల మధ్య సమన్వయం లేదంటున్న నేతలు..

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర కాంగ్రెస్‌లో ‘గ్యాస్’ ప్రకంపనలు మొదలయ్యాయి. కృష్ణా-గోదావరి బేసిన్ గ్యాస్‌ను కేంద్రమంత్రి షిండే మహారాష్ట్రకు తరలించుకుపోవటంపై ఎలా స్పందించాలో అర్థంకాక కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడిపోయారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా ఎంపీలున్నప్పటికీ కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోలేకపోయారన్న విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి, పార్లమెంట్ సభ్యులకు మధ్య సమన్వయం లేకపోవటం ప్రధాన లోపంగా నేతలు చెప్తున్నారు. ఒకవైపు విద్యుత్ కొరతతో రాష్ట్రం అల్లాడుతోంటే.. కేజీ బేసిన్ గ్యాస్‌కు గండి కొట్టటంతో రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల నుంచి రోజూ 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నష్టపోవటం దారుణం అంటున్నారు. 

ఇదే విషయంపై మాజీమంత్రి ఒకరు మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో ఇప్పటికే 2,700 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలున్నాయి. గ్యాస్ కొరత వల్ల ఆయా ప్రాజెక్టుల్లో సగం విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు మరో మూడు వేల మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసే గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయి. కేంద్రం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాల వల్ల అవి పనిచేసే అవకాశాల్లేకుండాపోతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం మనుగడకు రాష్ట్రంలోని 31 మంది కాంగ్రెస్ ఎంపీలే కారణమని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను ఆ ఎంపీలు కానీ, కేంద్రం కానీ ఏ మాత్రం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. 

కేంద్రంలో కేబినెట్ మంత్రులుగా ఎస్.జైపాల్‌రెడ్డి, కిషోర్‌చంద్రదేవ్‌లు ఉన్నా.. కేంద్ర సహాయ మంత్రులుగా పళ్లంరాజు, పనబాక లక్ష్మి, పురందే శ్వరిలు కొనసాగుతున్నా.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ‘‘రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. నీటి కేటాయింపుల్లోనూ దారుణమే జరుగుతోంది. చివరకు మన రాష్ట్రంలోనే వెలికితీస్తున్న గ్యాస్‌ను కూడా ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు’’ అని సీనియర్ ఎమ్మెల్సీ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తేవటంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 

సోనియా జైలుకెళ్లటం ఖాయం: గాలి

ఏదో ఒక రోజున కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జైలుకెళ్లటం ఖాయమని టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం ఎన్‌టీఆర్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీని ఏర్పాటు చేయటం వల్లే జగన్ ఆస్తులపై విచారణ జరుగుతోందన్నారు.

మహారాష్ట్రకు గ్యాస్ మళ్లింపుపై ప్రధానికి విజయమ్మ లేఖ


* లేదంటే వీధి పోరాటం మినహా ప్రజలకు గత్యంతరం లేదు
* మహారాష్ట్ర కోసం మేం త్యాగం చేయాలనడం ఏ మేరకు సబబు?
* ఇష్టానికి కేటాయింపులు చేసే హక్కు మంత్రుల బృందానికెక్కడిది?
* రత్నగిరి ప్రాజెక్టుకు అసలు సహజవాయువు పొందే అర్హతే లేదు
* కేంద్రం వల్లే రాష్ట్రానికి నిత్యం ఇక్కట్లు..

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర విద్యుత్ ప్రాజెక్టులకు కేటాయించిన గ్యాస్‌ను మహారాష్ట్రకు మళ్లించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయం కోసం ప్రజలు వీధులకెక్కడం తప్ప గత్యంతరం లేదన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేటాయించిన గ్యాస్‌ను మహారాష్ట్ర రత్నగిరి విద్యుత్కేంద్రానికి మళ్లించడంతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, ఆ ఆదేశాలను తక్షణం రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు శనివారం విజయమ్మ లేఖ రాశారు. వివరాలిలా ఉన్నాయి..

గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి,
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల రోదన. మా రాష్ట్రానికి చెందిన విద్యుత్ ప్రాజెక్టులకు కేటాయించిన సహజవాయువు వాటాను మహారాష్ట్రలోని రత్నగిరి విద్యుత్ ప్రాజెక్టుకు మళ్లించడంపై మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ మేరకు ఆగస్టు 1న పెట్రోలియం, సహజవాయువుల శాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయకపోతే న్యాయం కోసం రాష్ట్ర ప్రజలు వీధుల్లోకి రావడం తప్ప గత్యంతరం లేదు. కృష్ణా-గోదావరి బేసిన్‌లోని డీ6 బ్లాకు నుంచి వెలువడే సహజవాయువును నిజాయతీగా, హేతుబద్ధ రీతిలో వివిధ ప్రాజెక్టులకు కేటాయించేందుకు కేంద్రంలో మంత్రుల సాధికారిక బృందాన్ని (ఈజీఓఎం) ఏర్పాటు చేశారు.

కొన్ని రాష్ట్రాలకు, కొన్ని ప్రాజెక్టులకు తమ ఇష్టానుసారం సహజవాయువును కేటాయించే అధికారం ఈ బృందానికి అసలే లేదు. దేశంలో ఇప్పటికే నెలకొల్పిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల కంటే రత్నగిరిని ప్రత్యేకంగా ఈ మంత్రులు ఎలా పరిగణిస్తారు? దాన్ని ఒక్కదాన్ని మాత్రమే ఎరువుల ఫ్యాక్టరీలతో సమానంగా ఎలా చూస్తారు? మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ త్యాగం చేయడం సబబేనంటారా? రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్‌కు నెలలో 12 రోజుల పాటు కోత విధించారు. మంత్రుల బృందం నిర్ణయం వల్ల రాష్ట్ర పరిశ్రమలు ఇకపై నెలంతా కోతలను భరించాల్సి ఉంటుంది!

ఎల్‌ఎన్‌జీ ఆధారిత ప్రాజెక్టది..
వాస్తవానికి రత్నగిరి ప్రాజెక్టుకు ఒక్క క్యూబిక్ మీటర్ సహజవాయువును కూడా కేటాయించడానికి వీల్లేదు. ఎందుకంటే దాన్ని నిర్మించిందే విదే శాల నుంచి ఎగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీ ఆధారంగా. ఈ ప్రాజెక్టుకు కేజీ బేసిన్ గ్యాస్ నుంచి ఎలాంటి లింకేజీ (కేటాయింపు) లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులన్నింటికీ గ్యాస్ కేటాయింపులపై కేంద్రం ఆధ్వర్యంలోని గ్యాస్ లింకేజీ కమిటీయే 1989-2002 మధ్య లిఖితపూర్వక హామీలిచ్చింది. అప్పట్లో తూర్పు-పశ్చిమ ప్రాంతం గ్యాస్‌పైప్ లైన్ లేని నేపథ్యంలో కేజీ బేసిన్ నుంచే ప్రత్యేకంగా ఈ లింకేజీనిచ్చింది. కృష్ణా జిల్లా కొండపల్లి దాటాక గ్యాస్ పైప్‌లైన్ లేదు గనుక కేజీ బేసిన్ గ్యాస్‌ను రాష్ట్ర ప్రాజెక్టులే వినియోగించుకోవాల్సిన పరిస్థితి దానికి కారణం. రాష్ట్రంలో విద్యుత్కేంద్రాలతో పాటుగా కేజీ బేసిన్ గ్యాస్ ఆధారంగా నిర్మితమైనది ఒక్క నాగార్జున ఫెర్టిలైజర్స్ మాత్రమే.

కేంద్రం వల్లే ఇక్కట్లు
కేజీ బేసిన్ గ్యాస్ ఆధారంగా దేశంలో మరెక్కడా గ్యాస్ ఆధారిత ఎరువుల ఫ్యాక్టరీ గానీ, విద్యుత్ ప్రాజెక్టు గానీ నిర్మితం కాలేదనేది ఇక్కడ అతి ముఖ్యమైన అంశం. 1999-2002 మధ్య కేజీ బేసిన్ నుంచి లభ్యమయ్యే 16 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ ఆధారంగానే రాష్ట్రంలోని విద్యుత్, ఎరువుల ప్రాజెక్టులను నిర్మించారు. 2009కి ముందు కేజీ బేసిన్ ఓఎన్‌జీసీ బావుల్లో గ్యాస్ ఉత్పాదన బాగా తగ్గినప్పుడు రాష్ట్ర ప్రాజెక్టులన్నీ ఉత్పాదక సామర్థ్యం కన్నా చాలా తక్కువగా విద్యుదుత్పత్తి చేశాయి. దాంతో ఖజానాకు విపరీతమైన నష్టం వాటిల్లింది. కేంద్రం తన వాగ్దానాన్ని నిలుపుకోలేకపోవడమే అందుకు కారణం. ఆ ఇబ్బందులను అధిగమించడానికి కూడా కేంద్రం అప్పట్లో సహకరించలేదు.

ఎప్పుడూ మాకే అన్యాయం
కేజీ బేసిన్‌లో రిలయన్స్‌కు చెందిన డీ6 బ్లాకు నుంచి మళ్లీ ఉత్పాదన మొదలైనప్పుడు సహజంగా ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు గ్యాస్ ఇవ్వడం పూర్తిగా న్యాయం. ముందు రాష్ట్ర ప్రాజెక్టులకు ఇచ్చాకే ఇతర ప్రాజెక్టులకివ్వాలి. మంత్రుల బృందం కూడా ముందుగా హామీ ఉన్న ప్రాజెక్టులకే గ్యాసివ్వాలి. గతంలో గ్యాస్ ఉత్పాదన లేనపుడు రాష్ట్ర ప్రాజెక్టులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 16 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను మాకివ్వాలి. కానీ ఆశ్చర్యకరంగా అప్పుడూ మేమే ఇబ్బందులకు గురయ్యాం. ఇప్పుడూ మేమే సంక్షోభంలో ఉన్నాం.

రత్నగిరికి గ్యాస్ కేటాయిస్తూ పెట్రోలియం, సహజ వనరుల శాఖ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలి. కేజీ బేసిన్ గ్యాస్ ఆధారంగా నిర్మితమైనవి మా రాష్ట్ర ప్రాజెక్టులే గనుక ముందుగా వాటికే 16 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత మిగిలే గ్యాస్‌ను మాత్రమే వేరే రాష్ట్రాలకివ్వాలి. ముందుగా మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం. మా కోరిక రాజ్యాంగంలోని 297 అధికరణను ఉల్లంఘించినట్లు ఎంతమాత్రమూ కాదని మనవి చేస్తున్నాం.

మీ విశ్వాస పాత్రురాలు
-వైఎస్ విజయమ్మ

విద్యార్థులపైనే ఫీజు భారం!

* ఏటా పెరగనున్న రూ.500 కోట్ల భారం పేద విద్యార్థులపైనే!
* ప్రస్తుతానికి ఇదే అత్యుత్తమ ప్రత్యామ్నాయమని సూచన
* పథకంలో విద్యార్థుల సంఖ్య తగ్గించడం సరికాదు
* ప్రతిభ ఆధారిత చెల్లింపు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు
* కామన్ ఫీజు హేతుబద్ధతను మరోసారి పరిశీలించాలి
* కమిటీ భేటీలో వీటిపైనే చర్చ.. ఖరారు కాని సిఫారసులు
* రేపు మరోసారి సమావేశం తర్వాత ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్, న్యూస్‌లైన్: వృత్తివిద్యా కళాశాలల్లో పెరగనున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ భారాన్ని విద్యార్థులపై మోపడమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్రత్యామ్నాయమని ఫీజులపై సీఎం కిరణ్ నియమించిన నిపుణుల కమిటీ అభిప్రాయానికి వచ్చింది. పెరగనున్న ఫీజులతో ప్రభుత్వంపై ఏటా రూ.500 కోట్ల చొప్పున అదనపు భారం పడుతున్నందున ఇదే సరైన మార్గమని కమిటీ భావిస్తోంది. ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులకు చెల్లిస్తున్న రూ.31 వేలే ప్రభుత్వం భరించి.. ఆపై ఎంత పెరిగినా.. ఆ మొత్తాన్ని విద్యార్థే భరించేలా చూడాల్సి ఉంటుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డట్టు సమాచారం. 

శనివారం సచివాలయంలో కమిటీ తొలిసారిగా భేటీ అయింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేయడం, విద్యార్థుల సంఖ్య తగ్గించడం సమంజసమైన నిర్ణయాలు అనిపించుకోవని, ప్రతిభ ఆధారిత ఫీజుల చెల్లింపు విద్యార్థుల పరిమిత సంఖ్యకు మాత్రమే పనికొస్తుందని, అది కూడా తక్షణ అమలు సాధ్యం కాదని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది. అయితే సిఫారసులు మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. సోమవారం మరోసారి సమావేశమై సిఫారసులను ఖరారుచేస్తారు.

గణాంకాల విశ్లేషణ..
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కమిటీ సమావేశంలో తొలుత ఉన్నత విద్య కార్యదర్శి ఎం.జి.గోపాల్ సుప్రీంకోర్టు తీర్పును, దాని ప్రభావంతో మారనున్న ఫీజుల సరళిని, అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) ప్రతిపాదించిన ఫీజులను వివరించారు. అనంతరం నిపుణుల కమిటీ కన్వీనర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జె.రేమండ్ పీటర్ గతేడాది వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

కోర్సుల వారీగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థుల సంఖ్య, ప్రభుత్వం భరిస్తున్న మొత్తం, ఫీజుల పెరుగుదల వల్ల పడే భారాన్ని విశ్లేషించారు. గత ఏడాది ఈ పథకం ద్వారా 25 లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందారని, రూ.2900 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందని తెలిపారు. పెరిగే ఫీజుల వల్ల రూ.500 కోట్ల భారం పడనుందని వివరించారు.

భారం తగ్గించుకునేందుకు ఏం చేద్దాం..?
ఫీజుల పథకం వల్ల పడే భారాన్ని తగ్గించుకునేందుకు ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై కమిటీ సభ్యులంతా చర్చించారు. సమావేశంలో నిపుణుల కమిటీలోని సభ్యులు రీమ్యాప్ చైర్మన్ కె.సి.రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి డి.సాంబశివరావు, ఐఐటీహెచ్ డెరైక్టర్ యు.బి.దేశాయ్, జేఎన్టీయూ కాకినాడ వీసీ తులసీరాందాస్, ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ రామకృష్ణయ్య పాల్గొన్నారు. నిపుణులంతా వారి సూచనలు, అభిప్రాయాలను వివరించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశంలో వ్యక్తమైన ప్రధాన సూచనలు, అభిప్రాయాలివీ..

*ప్రస్తుతం చెల్లిస్తున్న ఫీజు వరకే ఇచ్చి.. పెరిగిన భారాన్ని విద్యార్థులపైనే వేయాలి. మెజారిటీ సభ్యులు మొగ్గు చూపిన అంశం ఇది. అయితే అదనంగా రూ.500 కోట్లే అవుతున్నందున మొత్తం చెల్లిస్తే నష్టమేంటని ఇద్దరు సభ్యులు అభిప్రాయపడ్డారు.

*అసలు ఎంసెట్, ఐసెట్ తదితర అడ్మిషన్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌లో.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే విద్యార్థులు ఫీజులు కట్టాల్సిన పనిలేదు అనే నిబంధన పెట్టడం సమంజసంగా లేదని నిపుణులు పేర్కొన్నారు. దీనివల్ల కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌లో జాప్యం చోటుచేసుకుంటోందని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గం చూడాలన్నారు. అయితే కళాశాలలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఈ నిబంధన అవసరమేనని మరి కొందరు సభ్యులు అన్నారు.

*చదువుతున్న కోర్సులో విద్యార్థి ఉత్తీర్ణత శాతాన్ని లింక్ పెట్టడం ద్వారా పథకాన్ని పరిమితం చేయొచ్చన్న సూచన వచ్చింది. అయితే దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

*అంతకుముందు చదివిన కింది కోర్సులో టాపర్లను ఎంచుకుని ప్రతిభ ఆధారిత ఉపకార వేతనాలు చెల్లించాలన్న సూచన కూడా వచ్చింది. అయితే ఇది ఇప్పటికిప్పుడు సాధ్యపడదని కొందరు, లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

*ఇంజనీరింగ్ కామన్ ఫీజు రూ.50,200గా నిర్ధారించడానికి ఉన్న హేతుబద్ధతను మరోసారి పరిశీలించాలని నిపుణులు సూచించారు.

*విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే కాబట్టి.. ఆరు నుంచి పది సిఫారసులను సోమవారం కేబినెట్ సబ్ కమిటీ భేటీకి ముందు సమర్పించాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు సోమవారం ఉదయం 10 గంటలకు కమిటీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

సిఫారసులు ఇంకా ఖరారు కాలేదు: ఎంజీ గోపాల్
కమిటీ సమావేశంలో చర్చించామే తప్ప.. ఇప్పటివరకు ఫీజులపై ఎలాంటి సిఫారసులు తయారుచేయలేదని, సోమవారం మరోసారి సమావేశమవుతామని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.

ఫీజులపై ఏలూరులో విజయమ్మ దీక్ష

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచేందుకు చేస్తున్న కుట్రలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 12, 13 తేదీల్లో ఏలూరులో రెండ్రోజులపాటు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

పేదలకు పెద్ద చదువులు అందాలన్న ఉన్నత ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకాన్ని నీరుగార్చడంపై పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సంతృప్త స్థాయిలో వ ర్తింపజేయాలని, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం ప్రాతిపదికగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.

సోనియాను విజయమ్మ కలవలేదు

రైతు సమస్యలు, సీబీఐ కక్షసాధింపుపై వివరించడానికే ఢిల్లీ వెళ్లాం
కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలను ఆపుకోవడానికే దుష్ర్పచారం జరుగుతుండవచ్చు
మా పార్టీలోకి ఎవరు వచ్చినా జగన్ స్క్రీనింగ్ చేసే తీసుకుంటారు
మొదట వచ్చినవారికి మొదటి అవకాశం.. 

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారంటూ వచ్చిన వార్తలను ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ‘‘జూలై 4వ తేదీన విజయమ్మతో పాటు నేను, మాజీ ఎంపీ మైసూరారెడ్డి, మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు సుచరిత, శోభానాగిరెడ్డి కలిసి ఢిల్లీలో ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర మంత్రి పవార్, లెఫ్ట్ నేతలు బర్ధన్, ప్రకాష్ కారత్, టీఎంసీ నేత సుల్తాన్ అహ్మద్‌ను కలుసుకున్నాం. చివరిగా మేమంతా విజిలెన్స్ కమిషనర్‌ను కూడా కలిశాం. అక్కడ విజయమ్మ వారికి తొలుత చెప్పింది రాష్ట్రంలో రైతుల సమస్యల గురించి. ఆ తరువాత సీబీఐ తమపై ఎలా కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందో వివరించారు. 

వాస్తవం ఏమిటంటే సోనియాను విజయమ్మ కలవలేదు. (ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ) అందులోనే వచ్చింది కదా, కాంగ్రెస్ నుంచి వలసలను ఆపుకోవడానికి ఇలాంటి వార్తను ప్రచారం చేసి ఉండొచ్చని’’ అంటూ మేకపాటి వివరించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు. టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా ‘‘కాంగ్రెస్ మాదిరిగానే టీడీపీ కూడా వలసలను ఆపుకోవడానికి ఆయనతో అలా మాట్లాడించి ఉండవచ్చు’’ అని మేకపాటి అన్నారు. ఆ రెండు పార్టీలూ స్వీయ రక్షణలో పడి ఇలాంటి విమర్శలు చేస్తున్నాయన్నారు.

జగన్ గెలుపును ఆపలేరు: అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదని రాజమోహన్‌రెడ్డి అన్నారు. అలాగే ఏ పార్టీ కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గెలుపును రాష్ట్రంలో ఆపలేదని విశ్వాసం వ్యక్తంచేశారు. మొన్నటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పోరాడింది కనుక చాలా చోట్ల రెండో స్థానంలోకి వచ్చిందని, 2014లో మాత్రం ఆ పార్టీ మూడో స్థానానికి దిగజారుతుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీయే జగన్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌ను పెట్టించిందన్న విమర్శలకు ఆయన నవ్వుతూ అవి పూర్తిగా హాస్యాస్పదమైన వ్యాఖ్యలని, కాంగ్రెసే జగన్‌తో పార్టీని పెట్టించి ఉంటే ఇన్ని రోజుల పాటు ఆయన జైలులో ఎందుకు ఉండాల్సి వస్తుంది? అని అన్నారు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న విమర్శలను ఆయన తోసి పుచ్చుతూ రాష్ట్రంలో ఎవరు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారో ప్రజలకు తెలుసునని, శంకర్‌రావు జగన్‌పై పిల్ వేయడం, అందులో టీడీపీ నేతలు వాదులుగా చేరడం అందరికీ తెలిసిందేనన్నారు. మన రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎంపీలున్నా కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్‌పై శీతకన్ను వేస్తోందని మేకపాటి విమర్శించారు. సహజవాయువు కేటాయింపులో మన రాష్ట్రానికి కోత విధించడాన్ని ఉద్దేశించి ఆయన పై వ్యాఖ్య చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 35 నుంచి 40 స్థానాల వరకూ గెల్చుకుంటే జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తుందని, అప్పుడు రాష్ట్రానికి కావాల్సినవి డిమాండ్ చేసి తెచ్చుకోవడానికి అవకాశముంటుందని అన్నారు. 

ప్రభుత్వాన్ని పడగొట్టం: రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న తొందర తమ పార్టీకి ఏ మాత్రం లేదని, అసలు తాము ఆ ప్రయత్నం చేయడం లేదని ఎంపీ మేకపాటి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వస్తున్నారని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, మంత్రులెవరైనా తమ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రావాలనుకుంటూ ఉండొచ్చన్నారు. ‘‘మా పార్టీలోకి రావాలని చాలా మంది ఉబలాటపడుతున్నారు... తొలుత వచ్చిన వారికి తొలుత (ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్) అనే ప్రాతిపదికన అవకాశాలుంటాయి. ఇప్పటికే రద్దీ ఎక్కువైంది. కొన్ని చోట్ల మా పార్టీ తలుపులు మూసేస్తున్నాం.. అలాంటి చోట్ల తమ స్థానాలు ఫిలప్ అయి పోయాయే.. అని కూడా బయట ఉన్న వారు కొందరు ఆవేదన చెందుతున్నారు. మా పార్టీలోకి రావాలనుకున్న వారిని జగన్ కచ్చితంగా స్క్రీనింగ్ చేసే తీసుకుంటారు. ఫలానా వ్యక్తి మా పార్టీలోకి రావాలనుకుంటే ప్రజల్లో ఆయనకున్న ప్రతిష్టను కూడా పరిగణనలోకి తీసుకుంటాం’’ అని అన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు పాల్గొన్నారు.

కేంద్రానిది సవతి ప్రేమ: వైఎస్సార్‌సీపీ

 గ్యాస్ సరఫరా విషయంలో రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రధానికి విజయమ్మ రాసిన లేఖను శనివారం వారు విడుదల చేశారు. ‘మనకు 16 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ రావాల్సి ఉంటే 3.4 ఎంఎంఎస్‌సీఎండీయే రావడం దారుణం. 

మన వాటాలో కోత పెట్టి రత్నగిరికివ్వడంతో రాష్ట్రం 400 మెగావాట్ల విద్యుదుత్పాదనను కోల్పోతోంది. ప్రస్తుతం ఇంకా ఉత్పాదన తగ్గితే పరిస్థితి దారుణంగా మారుతుంది’’ అంటూ మండిపడ్డారు. మన గ్యాస్‌ను మళ్లిస్తున్నారని సాక్షి పత్రిక ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని మేకపాటి విమర్శించారు. వైఎస్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు బలహీనంగా ఉండటం వల్లే రాష్ట్రం తన వాటా గ్యాస్‌ను సాధించుకోలేకపోతోందని సోమయాజులు ఆవేదన వెలిబుచ్చారు.

భవిత జగన్‌దే... కాంగ్రెస్‌ది గతమే!


ఏడుపుగొట్టు ప్రవక్తలూ, భవిష్యవాణులూ ఇటీవల బహిరంగంగా వాపోవడం ఎక్కువైపోయింది. వార్తలకు, వినోదానికి మధ్య తేడాయే లేకుండా పోయిందని లేదా అతి వేగంగా అంతరించిపోతోందని వారి బాధ. వారి వగపుకు కారణం వారిలోని గందరగోళమే తప్ప మరేమీ కాదు. వార్తలంటే రాజకీయాలకు పర్యాయ పదం కాదు. మనకు ఆసక్తిని కలిగించే ఏ అంశానికి సంబంధించిన కొత్త సమాచారమైనా వార్తే. నిరుత్సాహకరమైన రంకెల రాజకీయాల కంటే ఫ్యాషన్‌ల నుంచి అభూత కల్పనల వరకు ఆనందదాయకమైన ప్రతి అంశంపైనా ప్రజలు ఆసక్తిని చూపుతున్నారనేది వాస్తవం. అలా అని రాజకీయ కథనాలకు చోటు లేకుండానూ పోలేదు. అసంఖ్యాకమైన ఆసక్తికరమైన అంశాలను జోడించే వంతెనల్లాగా వాటి స్థానం వాటికి ఉంది. ఎందుకంటే స్వాభావికంగానే రాజకీయాలు వినోదాన్ని పంచేవి. కాకపోతే మనం చేయాల్సిందల్లా కాస్త ఆగి, ఆలోచించడమే. ఒక్కోసారి ప్రత్యేక వార్తకూ, వ్యంగ్యానికి మధ్య విభజన రేఖ చాలా సన్నగా ఉంటుంది.

ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తన తాజా బద్ధ శత్రువు జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి తమ పార్టీలోకి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆ కథనం సారాంశం. కాంగ్రెస్ కాళ్ల దగ్గర పడి ఉండకుండా దూరంగా పోయిన జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు. ఈ కథనం రాస్తుండే సరికి ఆయన జైలులో ఉన్నారు. సీబీఐ ఆయనపై తనకు చేతనైన అన్ని రకాల ఆర్థిక నేరాలను మోపింది. ఆ జగన్‌కే ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతామని వాగ్దానం చేసి కాంగ్రెస్ తిరిగి తమ పార్టీలోకి తేవాలని ప్రయత్నిస్తోందని ఆ ప్రత్యేక కథనం చెబుతోంది.

ఎప్పటికో ఒకప్పటికి ఆ కథనం నిజమవుతుందనే అనుకుందాం. అప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఏం చెబుతుంది? ఇలా చెప్పాల్సిందేగా? ‘‘చూడండి! ఈయన తండ్రి కోటాను కోట్ల డాలర్లు, పౌండ్లు, యూరోలు పోగేసుకున్నారనే ఆరోపణతో మేం ఇతన్ని జైలుకు పంపాం. జగన్ మాకు అప్పుడు పనికి రాకుండా పోయినా ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. కాబట్టి ఆ ఆరోపణలన్నీ ఉత్తుత్తివేనని, పూర్తిగా అభూతకల్పనలేనని ఇప్పుడు మేం హామీ ఇస్తున్నాం!’’ సీబీఐ పట్టుబట్టడంతో జగన్‌కు చట్టబద్ధంగా ఉన్న బెయిల్ హక్కును నిరాకరించిన పట్టువిడుపుల్లేని న్యాయమూర్తికి అది ఏం చెబుతుంది? ‘‘న్యాయ ప్రభువులు మన్నించాలి, జగన్ కార్యాలయాలపై జరిపిన దాడులన్నీ ఉత్త ఆటపట్టింపు చర్యలే. పిల్లలు కౌమారం దాటే క్లిష్టమైన ప్రాయంలో చిన్నచిన్న మొట్టికాయలు వేయడం ఎలా అవసరమో ఇదీ అంతే. ఇక కోర్టులో జగన్‌కు వ్యతిరేకంగా బుర్రలు బద్దలు కొట్టుకున్న న్యాయవాదులకు సంబంధించి... వాళ్లకు ముట్టాల్సిందేదో కవర్లలో అందుతుందని తమరు ఎరగనిది కాదు. మేమేదో ఇంత క్లుప్తంగా ఉప్పందిస్తే, వాళ్లు దాన్ని పూర్తిస్థాయి కేసుగా మార్చారు. అహ్హ హ్హ హ్హ హ!హ’’

ఎవరో కొందరు రాజకీయవేత్తలు ఒక పాత్రికేయుని చెవి కొరికారనేది ముఖ్యం కాదు. ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే ఆ కథనం చక్కర్లు కొడుతుండటమే అసలు సిసలైన జోక్. కొట్టవచ్చినట్టుగా కనిపిస్తున్న ప్రశ్ననే మొదటగా చూద్దాం. అలాంటి ఒప్పందానికి అసలు సమర్థన అంటూ ఉంటుందా? ఇరుపక్షాల నుంచి తీవ్రాతి తీవ్రమైన వాద, ప్రతివాదాలను విన్న ఓటర్లు దాన్ని ఆమోదిస్తారా? జగన్ తల్లి విజయమ్మ ఉక్కుముక్కలాంటి దృఢమైన వ్యక్తిత్వం గలిగిన వ్యక్తి. కాంగ్రెస్, తన కుమారుణ్ణి జైలు పాలు చేయాడాన్ని, శిక్షించడాన్ని కళ్లారా చూసిన ఆమె దీనిపై ఏం మాట్లాడగలుగుతారు? తన తండ్రి విషాదకరమైన అకాలమరణం తదుపరి జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు.

కాంగ్రెస్ అప్పుడే ఆయనకు ఆ పదవిని ఇచ్చి ఉంటే తీసుకునేవారే. కానీ అందుకు అప్పుడు ససేమిరా అంది. జగన్‌కు బదులుగా రాజకీయ పరిణతి ఏమాత్రం లేదని చూస్తేనే తెలిసిపోయే ఎవరికీ తెలియని కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టింది. పైగా జగన్‌ను వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ కూడా నామరూపాల్లేకుండా చేయాలని ప్రయత్నించింది. తద్వారా అది తన అవకాశాలను తానే చేజేతులారా కాలదన్నుకుంది. అన్ని విషయాల్లోనూ దారుణంగా విఫలమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఇక మిగిలింది గతం. కాగా, జగన్‌కు ఉన్నది భవిష్యత్తు. జగన్ ఏరికోరి గతించిపోయిన గతాన్ని ఎందుకు ఎంచుకోవాలి?

భారత రాజకీయాలు అసాధారణమైన వినోదం దిశగా పయనిస్తుంటే, జాతీయ ప్రతిష్టను ఇనుమడింపజేయగల భారత క్రీడలు అథఃపాతాళానికి దిగజారుతున్నాయి. ఒలింపిక్స్‌లో ఓ కాంస్య పతకాన్ని సాధిస్తే దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడాన్ని, లేదా అరుదుగా ఓ రజత పతకం లభిస్తే ఆకాశానికెత్తేయడాన్ని చూస్తుంటే వళ్లు జలదరిస్తుంది. భారతదేశపు క్రీడా దారిద్య్రం పూర్తిగా అర్థం చేసుకోదగినదే. భారతీయుల మేథస్సులన్నీ ఆర్థికంగా ఉన్నత స్థానాలకు ఎగబాకాలన్న ఆశలపైనే కేంద్రీకరించి ఉన్నాయి. అసాధారణమైన శారీరక ప్రతిభాపాటవాలపైన దృష్టే లేదు. ఊగిసలాడే శక్తిసామర్థ్యాలతోనే అయినా మనం పోటీ పడే ఒకే ఒక్క క్రీడ క్రికెట్. క్రికెట్ నుంచి డబ్బును దూరం చేసి చూడండి. ఆ గాలి బుడగ సైతం బద్దలయిపోక తప్పదు.

ఇతర క్రీడలకు కూడా ఏదో ఓ ప్రతిఫలం లేకపోలేదు, కానీ శారీరకంగా అనుభవించాల్సిన అసౌకర్యానికి సంబంధించిన వ్యయాలు చాలా ఎక్కువ. తల్లి చేతివంట హాయిగా తిని పెరిగిన మన యువతకు ఆ అసౌకర్యం గురించిన ఆలోచనే ఇబ్బంది కలిగిస్తుంది. కదలగలుగుతున్నామంటే అదే చాలు. లావుగా ఉన్నా సన్నగా ఉన్నా డ్యాన్స్ చేయగలం. శాస్త్రీయ నాట్యానికి సైతం నడుము కొలత ముఖ్యం కాదు. దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ కు వర్షం వల్ల అంతరాయమేర్పడ్డంతో ఛానళ్లను అటూ ఇటూ మార్చసాగాను. అలా ట్రాంపోలైన్‌పై చైనా వ్యాయామ క్రీడాకారుడు డాంగ్ డాంగ్ అద్భుత ప్రతిభను చూడగలిగాను. డాంగ్ డాంగ్ కనబరచిన అద్భుత ప్రతిభాపాటవాలు కలిగిన అరడజను మంది భారతీయులు తయారుకావాలంటే యుగాలు గడవాల్సిందే.

భారతీయులందరిలాగే నేను కూడా మనం ఒలింపిక్ మెడల్స్‌ను గెలుచుకోవడమనే ఆలోచనను ప్రేమిస్తాను. అలా అని మనం బ్యాడ్మింటన్‌లోనో లేదా ఆర్చరీలోనో ఓడిపోయామని చింతించను. భాగ్యదేవత కరుణించి మనకో బఠానీ గింజను ప్రసాదించినప్పుడల్లా సంబరపడిపోవడాన్ని చూస్తుంటేనే కడుపులో దేవేసినట్టవుతుంది. నమ్మశక్యం కానంతటి కష్టమైన, కళ్లు మిరుమిట్లుగొలిపే జిమ్నాస్టిక్ కళను ప్రదర్శించిన జపనీస్ జిమ్నాస్ట్ కోహీ ఊచిముర కాంస్య పతకాన్ని సాధించి, మూడో స్థానమే దక్కిందని బావురుమన్నాడు. అదేగాని అతడు ఐదడుగుల దూరంలోని తేలికపాటి లక్ష్యాన్ని ఛేదించి కాంస్యాన్ని సాధించిన భారతీయుడై ఉంటే... ఆ దేశోద్ధారకుని రాకకు గౌరవార్థంగా కార్పొరేట్ సంస్థలు మొదటి పేజీ పత్రికా ప్రకటనలను గుప్పించేవి. భారతీయులు తమను తాము గొప్పగా అభినందించుకున్నట్టుగా మరెవరూ అభినందించరు. అదో వ్యాధి.

ఒక్కసారి ఒలింపిక్స్ వైపు దృష్టిసారించి రాజకీయాల కోసం అన్వేషిస్తాను. రాజకీయాలపైకి ఒక్కసారి దృష్టిసారించి, మళ్లీ ఒలింపిక్స్‌కు మళ్లుతాను. 

Stop AP gas transfer to Maharashtra: Vijayamma writes Open Letter to PM

ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ

ప్రధాని మన్మోహన్ సింగ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన గ్యాస్ వాటాని తమకు ఇవ్వాలని ఆ లేఖలో ఆమె కోరారు. తమ గ్యాస్ కేటాయింపులను వేరే రాష్ట్రానికి ఇవ్వడం సరైంది కాదన్నారు. తమ రాష్ట్ర వాటాను మహారాష్ట్రలోని రత్నగిరికి కేటాయించడం అన్యాయం అని పేర్కొన్నారు. దీనిపై జారీ అయిన ఉత్తర్వులను రద్దుచేయమని కోరారు. తమ సమస్యపై వెంటనే స్పందించాలన్నారు. లేకుంటే వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. న్యాయంగా తమకు రావాల్సిన గ్యాస్ వాటా ఇవ్వాలని, తాము చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనదేనని ఆ లేఖలో విజయమ్మ పేర్కొన్నారు.

YSRCP leader Somayajulu addressing Media 4th Aug

పాతిక లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టగల శక్తి

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అసంఖ్యాకమయిన సంక్షేమ పథకాల్లోకెల్లా విశిష్టమయినది ‘ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకం’. లక్ష రూపాయల కన్నా తక్కువ వార్షికాదాయం కలిగి ఉన్న పేదల పిల్లలకు ప్రొఫెషనల్ కోర్సుల నిమిత్తం చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వడమన్నది ఈ పథకం సారాంశం. వాస్తవానికి పేదల పిల్లలకు ప్రొఫెషనల్ చదువులను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం వల్ల పాతిక లక్షల మంది పేద విద్యార్థులు లబ్ధిపొందగలరని అంచనా. పథకం ప్రారంభించిన సంవత్సరమే -2008లో- రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. 2009లో ఈ మొత్తం మరో అయిదు వందల కోట్ల రూపాయల మేరకు పెరిగింది. 2010 నాటికి ఈ పథకం కింద కేటాయించిన మొత్తం 3,500 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ వివరాలు చూస్తే చాలు- ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్న పేద విద్యార్థుల సంఖ్య ఎంత బహుళంగా ఉంటోందో అర్థమయిపోతుంది.

అలాంటి పథకాన్ని అయోమయావస్థలోకి నెట్టేశారు ప్రస్తుత పాలకులు! ఇటీవల రెండు సందర్భాల్లో రాష్ట్ర గవర్నర్ కూడా ఉచిత విద్యా పథకాలను తప్పెన్నుతూ మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిభతో నిమిత్తంలేని ఉచిత విద్యా పథకాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ‘టిస్’ కోర్సుల ప్రారంభోత్సవంలో పాల్గొంటూ వ్యాఖ్యానించారు గవర్నర్. అలాగే, ఉచిత విద్యా పథకాలను ‘నిరంతరం కొనసాగించరా’దని కూడా ఆయన హితవు చెప్పారు. దాంతో, వైఎస్‌ఆర్ రూపొందించిన ఈ పథకం ఇకపై కొనసాగుతుందో లేదో తెలియని గందరగోళ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ వచ్చే వారం -ఈ నెల 12, 13 తేదీల్లో- విద్యార్థుల కోసం దీక్ష చెయ్యనున్నట్లు ప్రకటించారు. ఈ దీక్ష పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం ఏలూరులో జరుగుతుంది.

నిజానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం విశిష్టత ఏమిటి? దీన్ని మామూలు సంక్షేమ పథకాల్లో ఒకటిగా చూడకూడదు. మహానేత వైఎస్‌ఆర్ అన్నట్లుగా ఇది జాతి భవిష్యత్తుకోసం పెడుతున్న పెట్టుబడి మాత్రమే! ఆ రకంగా చూస్తే ఇది అక్షరాలా సమాజ సంక్షేమ పథకం. విద్యావేత్తలెందరో ఈ పథకాన్ని ‘విప్లవాత్మకమయినది’గా కీర్తించారు. అలాంటి పథకానికి మోకాలు అడ్డం పెట్టడమన్న కార్యక్రమం వైఎస్‌ఆర్ మరణించిన వెంటనే మొదలయిపోయింది. అతిధి నటుడిగా ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించిన కె.రోశయ్య తన ఏడాది హయాంలోనే -సంస్కరణల పేరుతో- ఈ పథకానికి గొయ్యి తవ్వడం మొదలుపెట్టారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్తూ పగ్గం బిగించారు. దానికి తోడుగా మరికొన్ని షరతులు కూడా విధించారాయన. ఇక చుక్కతెగి రాలినట్లు హటాత్తుగా ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తొలి మీడియా సమావేశంలోనే ఈ పథకం ‘అర్హులకు మాత్రమే అందుతుం’దని అతి గడుసుగా మాట్లాడారు.

ఉల్లోపల ఏమేం చెప్తున్నారో ఏమో తెలియదు కానీ, బహిరంగంగా అధికార పక్షంతో సహా అన్ని పార్టీల పెద్దలూ ఈ పథకం గురించి సానుకూలంగానే మాట్లాడి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. పేద ప్రజల నట్టింటి దీపం లాంటి ఈ పథకం గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారికి రాజకీయ భవిష్యత్తు శూన్యమేననే స్పృహ లేనివారు తప్ప ఎవరూ ఇందుకు భిన్నంగా మాట్లాడలేరు. అయితే, వట్టిమాటలతో కాగల కార్యం ఏముంటుంది? ఈ అవగాహనతోనే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో దీక్షకు కూర్చోవాలని నిర్ణయించారు. పాతిక లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టగల శక్తి ఈ ఒక్క పథకానికే ఉంది. అందుకే విజయమ్మ దీక్ష విజవంతం కావాలని -పేదల సంక్షేమం కోరుకునేవారంతా- కోరుకోవాలి!

YS Vijayamma deeksha on Fee reimbursement from Aug 12, 13 at Eluru

ప్రభుత్వం పునరాలోచించుకోవాలి: మేకపాటి

 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పధకాన్ని ఆపే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే తక్షణం పునరాలోచించుకోవాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదన్న గొప్ప ఆశయంతో మహనేత వైఎస్‌ ప్రవేశపెట్టిన పధకాన్ని ఆపేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

సుప్రీం కోర్టు తీర్పును కుంటిసాకుగా చూపి ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తిరగబడాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి రోజా పిలుపునిచ్చారు. ప్రజల తిరుగుబాటుకు, విద్యార్థుల తరపున వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అండగా నిలుస్తుందని ఆమె హమీ ఇచ్చారు.

విద్యార్థుల కోసం విజయమ్మ దీక్ష ప్రకటన

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష చేయనున్నారు. ఈ నెల 12,13 తేదీల్లో ఏలూరు వేదికగా ఆమె నిరహారదీక్ష చేస్తారు. సంతృప్తస్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంని అమలుచేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.

వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దివంగత మహనేత వైఎస్‌ విగ్రహనికి నేతలు నివాళులు అర్పించారు. 

కమలాపురి కాలనీలో పార్టీ సేవాదళం రాష్ట్ర కన్వీనర్‌ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు నడుంబిగించాలని నేతలు విజ్ఙప్తి చేశారు.ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ ముఖ్యనేతలు హజరయ్యారు.

Friday 3 August 2012

జగన్‌తో సయోధ్యకు ప్రయత్నించటం లేదు: ఏఐసీసీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోన్‌రెడ్డితో సయోధ్యకు కాంగ్రెస్ ఏవైనా ప్రయత్నాలు చేస్తోందా? అన్న ప్రశ్నలకు అలాంటిదేం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్‌తివారీ స్పష్టంచేశారు. ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన తివారీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు ముక్తసరిగా జవాబిచ్చారు. ఏపీతో సహా ప్రధాన రాష్ట్రాల్లో ఎన్నికల విజయావకాశాలపై కాంగ్రెస్ పార్టీ సవివరమైన సమీక్ష నిర్వహిస్తోందని, జగన్‌తో సయోధ్యకు ప్రయత్నిస్తోందని, ఇందుకోసం జగన్ తల్లి వై.ఎస్.విజయలక్ష్మి, కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ మధ్య ఓ సమావేశం జరిగిందని వార్తలొచ్చాయి. ఇవి ఏమేరకు నిజమని ప్రశ్నిం చగా తివారీ స్పందిస్తూ.. ‘‘మీరు ఏ కథనాన్ని అయితే ప్రస్తావిస్తున్నారో అందులోనే దీనికి జవాబు ఉంది. 

కథనం రాసేముందు ధ్రువీకరణ కోసం పంపిన కొన్ని ఎస్‌ఎంఎస్‌లకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్‌తివారీ స్పందించలేదని కూడా ఆ కథనంలో రాశారు. అందువల్ల.. ఇప్పుడు మీ ప్రశ్నకు అదే నా సమాధానం’’ అని ముగించారు. ఇదిలావుంటే.. ఓ ఆంగ్ల పత్రికలో ప్రముఖంగా వచ్చిన సదరు కథనంలో ఎలాంటి పసా లేదని ఏఐసీసీ వర్గాలు స్పష్టంచేశాయి. ఏవో కొన్ని సర్వేలు పార్టీ పరంగా నిర్వహిస్తుండటం సహజమే కానీ ఎన్నికల విజయావకాశాలపై పార్టీ పరంగా ఇంతముందుగా సమీక్ష జరపటం ఉండదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ధ్రువీకరించని సమాచారం ఆధారంగా కథనం ఇచ్చినట్టు సదరు ఆంగ్లపత్రిక స్పష్టంగా పేర్కొన్నందున దానిపై ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదన్నాయి. 

హెల్త్‌కార్డుల ప్రక్రియ ఘరూ!

*తొలి రెండేళ్లు సర్వీస్ ప్రొవైడర్‌గా ఆరోగ్యశ్రీ ట్రస్టు
*పథకం అమలుకు ఏటా రూ. 350 కోట్లు
*ప్రభుత్వ వాటా రూ.210 కోట్లు.. ఉద్యోగుల వాటా రూ.140 కోట్లు
*ఒక్కో కుటుంబానికి చికిత్స గరిష్ట పరిమితి రూ.3 లక్షలు
*రెండు రకాల ప్రీమియం.. రూ.120, రూ.150 
*నవంబర్ 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం
*పథకం అమలు పర్యవేక్షణకు సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యంపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. నవంబర్ 1 నుంచి హెల్త్‌కార్డుల పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన వివరాల (డేటా) సేకరణ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం జీవో జారీ చేయనుంది. శుక్రవారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రత్నకిషోర్, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో శ్రీకాంత్, ట్రెజరీ శాఖ డెరైక్టర్ నాగార్జునరెడ్డి, జీఏడీ (సర్వీసెస్) కార్యదర్శి వెంకటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీఎన్జీవో, టీఎన్జీవో, టీజీవో, సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎస్టీయూ, పీఆర్టీయూ, తెలంగాణ, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, యూటీఎఫ్, ఏపీజీవో, గ్రూప్-4 ఉద్యోగుల సంఘాలు, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యాంశాలు ఇవీ..
డేటా సేకరణ ఇలా..

ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక శాఖ నిర్వహించే హెచ్‌ఆర్‌ఎంఎస్ (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం)లో ట్రెజరీ శాఖ వెబ్‌సైట్ ద్వారా హెల్త్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ట్రెజరీ శాఖ వెబ్‌సైట్లో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫార్మా ఉంది.

ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో జత చేయాలి. ఐసీఏవో (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) సూచించిన ప్రమాణాల మేరకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోనే వినియోగించాలి. ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్‌లోని తొలి రెండు పేజీలను స్కాన్ చేసి అటాచ్ చేయాలి. పూర్తి చేసిన ఫారాన్ని అప్‌లోడ్ చేస్తే.. ఈ-ఫామ్, దరఖాస్తు నంబర్ లభిస్తాయి. ‘ఈ-ఫామ్’ను ఉద్యోగులు సంబంధిత డీడీవో (డ్రాయింగ్ అండ్ డిస్‌బర్సింగ్ ఆఫీసర్)కు, పెన్షనర్లు అయితే ఎస్టీవో (సబ్ ట్రెజరీ ఆఫీసర్) లేదా ఏపీపీవో (అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ ఆఫీసర్)కు సమర్పించాలి.

దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఏవైనా లోపాలుంటే సవరించి ‘వ్యాలిడేట్’ చేయాలి. ఎక్కువ లోపాలుంటే వాటిని సవరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉద్యోగికి తిప్పి పంపించాలి.
కంప్యూటర్ పరిజ్ఞానంలేని ఉద్యోగులు, పెన్షనర్లు.. డీడీవో, ఎస్టీవోల సహకారంతో దరఖాస్తును అప్‌లోడ్ చేయాలి.

వివరాల సమర్పణకు అక్టోబర్ 20 వరకు గడువు ఇచ్చారు.
ఆధార్ నంబర్లు లేని వారి కోసం జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఆధార్ వద్ద ఉన్న ఉద్యోగుల డేటాను హెల్త్‌కార్డుల వినియోగానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డేటా సెంటర్‌కు బదిలీ చేయనున్నారు.

పథకంలో ముఖ్యాంశాలివీ..

8 లక్షల మంది ఉద్యోగులు, 6 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాలను ఈ పథకం కిందికి తీసుకురానున్నారు. అంటే దాదాపు 48 లక్షల మందికి ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఉద్యోగుల వేతన శ్రేణిని బట్టి మూడు గ్రేడ్లుగా విభజించి ప్రీమియం నిర్ణయించాలని ప్రభుత్వం భావించింది. అయితే రెండు గ్రేడ్లుగా విభజించాలన్న ఉద్యోగుల డిమాండును ప్రభుత్వం అంగీకరించింది. గ్రేడును బట్టి రూ.120, రూ.150గా రెండు రకాల ప్రీమియం నిర్ణయించారు. నవంబర్ 1 నుంచి పథకం అమల్లోకి వస్తుంది. ప్రీమియం వసూలు నవంబర్ నెల జీతం నుంచి ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలు, ఒక్కో వ్యక్తికి రూ.2 లక్షలు విలువైన చికిత్స చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. గరిష్ట పరిమితి మించితే.. ప్రత్యేకంగా రూ.175 కోట్లతో ఏర్పాటు చేయనున్న బఫర్ ఫండ్ నుంచి మంజూరు చేస్తారు.

పథకం అమలుకు ఏటా రూ.350 కోట్లు అవసరమని అంచనా. అందులో 60 శాతం (రూ.210 కోట్లు) ప్రభుత్వం, మిగతా 40 శాతం(రూ.140 కోట్లు) ఉద్యోగులు భరించనున్నారు. మొత్తం నిర్వహణ వ్యయం 5.7 శాతానికి మించకుండా పరిమితి విధించారు.

సర్వీసు ప్రొవైడర్‌గా తొలి రెండేళ్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు వ్యవహరిస్తుంది. ట్రస్టు సేవల పట్ల ఉద్యోగులు సంతృప్తిగా ఉంటే రెండేళ్ల తర్వాత కూడా కొనసాగిస్తారు. లేదంటే మరో ట్రస్టుకు అప్పగిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉండే స్టీరింగ్ కమిటీ.. పథకం అమలు తీరును పర్యవేక్షిస్తుంది. కమిటీలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, జీఏడీ (సర్వీసెస్) కార్యదర్శి, కుటుంబ సంక్షేమ కమిషనర్, వైద్య విద్య డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, ట్రెజరీ శాఖ డెరైక్టర్, సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సభ్య సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

ఎయిడెడ్ సిబ్బందికి నో..

ఎయిడెడ్ ఉపాధ్యాయులు, యూనివర్సిటీ అధ్యాపకులకు హెల్త్‌కార్డుల పథకాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు చేసినప్పుడు అవి పీఆర్సీ సిఫార్సుల్లో లేవని తప్పించుకొనే ప్రభుత్వం.. తొమ్మిదో పీఆర్సీ సిఫార్సుల మేరకు ‘ఎయిడెడ్’ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల పథకాన్ని అమలు చేయడానికి వెనకాడుతోంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతున్న సంస్థ (పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలు)ల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉచిత వైద్య సేవలు అందించాలని తొమ్మిదో పీఆర్సీ సిఫార్సు (259వ పేజీ 13వ పాయింట్) చేసింది. ఈ సిఫార్సును అమలు చేస్తామని 2008 నవంబర్ 3న జాక్టోతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ప్రస్తుతం మాత్రం హెల్త్‌కార్డుల పథకంలో వారికి అవకాశం కల్పించడం లేదు. ఎయిడెడ్ ఉపాధ్యాయులను ఈ పథకంలోకి తీసుకొచ్చే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద వచ్చే వారం జరగనున్న స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులనూ ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

రాష్ట్రానికి మరోసారి కేంద్రం మొండిచేయి

కొత్తగా 4,000 కి.మీ.కు జాతీయ హోదా
కానీ మన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలే
ఎంపీల అనైక్యత, విభేదాలే కారణం
సీఎం సిఫార్సునూ పట్టించుకోని వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: జాతీయ రహదారుల గుర్తింపులో మన రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగింది. మిగతా రాష్ట్రాల ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్రం, మన రాష్ట్రానికి మాత్రం మొండిచేయి చూపింది. కేంద్ర ఉపరితల రవాణా, రహదారి మంత్రి సీపీ జోషీ నేతృత్వంలో గురువారం జరిగిన భేటీలో దేశంలో కొత్తగా 4,000 కి.మీ. రోడ్లకు జాతీయ హోదా కల్పించారు. పంజాబ్, హర్యానా, కర్ణాటక, గుజరాత్, బీహార్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే 4,500 కి.మీ. రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించగా, మిగతా రాష్ట్రాల ప్రతిపాదనలను కూడా క్లియర్ చేస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. కానీ ఈ జాబితాలో రాష్ట్ర ప్రతిపాదనలను మాత్రం పట్టించుకోలేదు. ప్రాంతీయ అసమానతలను సాకుగా చూపి మన జాబితాను అటకెక్కించింది. ఎంపీల్లో అనైక్యత, ప్రాంతాలవారీగా విభజన రేఖ ఏర్పడడంతో మన రోడ్డు ప్రాజెక్టులకు గ్రహణం పట్టుకుంది. ఇతర రాష్ట్రాలు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఎగరేసుకుపోతుంటే మనకు మాత్రం రిక్తహస్తమే మిగులుతోంది.

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సిఫార్సులను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్‌హెచ్‌ల ప్రతిపాదనలపై ఎంపీలు ప్రాంతాలవారీగా విడిపోవడంతో పరిష్కార బాధ్యతను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు కేంద్రం అప్పగించింది. 

ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు ప్రతిపాదించిన 1,981.77 కి.మీ. నిడివితో కూడిన 11 రోడ్లలో మూడు ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిస్తూ 1,100 కి.మీ.ను ఎన్‌హెచ్‌లుగా ప్రకటిస్తామని ఉపరితల రవాణా, ర హదారి శాఖ గతంలోనే హామీ ఇచ్చింది. దాంతో రెండు రోజుల క్రితం జరిగిన కేంద్ర భేటీలో మన ప్రతిపాదనలను ఆమోదిస్తారని ఆశిస్తే నిరాశే ఎదురైంది. దాంతో కిరణ్, రోడ్లు, భవనాల మంత్రి ధర్మాన ప్రసాదరావు నేరుగా మంత్రి జోషీతో ఫోన్‌లో మాట్లాడినా.. ఆజాద్ చెబితే తప్ప రాష్ట్ర ప్రాజెక్టులను క్లియర్ చేయలేమని ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం. అజాద్ విదేశీ పర్యటనలో ఉన్నారు గనుక ఆయన అనుమతిచ్చిన వాటికైనా ఆమోదముద్ర వేయాలని విజ్ఞప్తి చేసినా కుదరదన్నారాయన. అసలు మనకు కేటాయించిన ప్రాజెక్టులను కూడా ఇతరులు తన్నుకుపోయారని అధికారులు మాత్రం అనుమానిస్తున్నారు. నిజానికి దేశవ్యాప్తంగా 10,000 కి.మీ.లను మాత్రమే ఎన్‌హెచ్‌లుగా గుర్తిస్తామని, రాష్ట్ర ప్రతిపాదనలను 2,000 కి.మీ.కి కుదించాలని కేంద్రం ఆదేశించింది. ఆ మేరకు జాబితాను సవరించి పంపినా, రోడ్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆ ప్రాంత ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. చివరికి రాష్ట్ర ప్రతిపాదనలను పక్కన పెట్టారు. రోడ్ల కేటాయింపులో ప్రాంతాలవారీ సమతుల్యత పాటిస్తూ 1,100 కి.మీ.లను ఓకే చేస్తూ ఆజాద్ నెరిపిన మధ్యవర్తిత్వాన్నీ జోషీ పట్టించుకోలేదు.

నాలుగేళ్లుగా నాన్చుడే: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత చాలా తక్కువ. దేశవ్యాప్తంగా ఉన్న 70 వేల కి.మీ. రోడ్లలో రాష్ట్రంలో 4,730 కి.మీ. మాత్రమే ఉన్నాయి. అందుకే 6,571 కి.మీ. మేరకు 23 రోడ్లకు జాతీయ హోదా కోసం నాలుగేళ్ల క్రితం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదనలు పంపారు. కానీ ఆయన మరణంతో అవి కాస్తా పక్కదారి పట్టాయి.

రీయింబర్స్‌మెంట్ రద్దుకు సర్కారు యోచన?


సుప్రీం తీర్పు సాకుగా నిపుణుల కమిటీ నియామకం
కామన్ ఫీజుతో పథకంపై పడే ప్రభావం విశ్లేషణకంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన
కమిటీ సిఫారసుల పేరిట పేద విద్యార్థుల నోట్లో మట్టికొట్టేందుకేనంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు
ప్రభుత్వ కళాశాలలోనే ఇంటర్ చదవాలనే ఆంక్ష పెట్టాలని యోచన.. 
విద్యార్థుల మార్కులతోనూ పథకానికి లింకు? 
ఇన్సెంటివ్‌లు లేదా మెరిట్ స్కాలర్‌షిప్పుల పేరిట 
కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చే యత్నం

విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభుత్వం
దృష్టిసారించిన మూడు కీలకాంశాలు...
ఎలాగైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యయాన్ని తగ్గించుకోవడం
సమూలంగా ఈ పథకం రూపురేఖలు మార్చడం
మేం కూడా విద్యార్థులకు మేలు చేస్తున్నామని చెప్పుకునేందుకు మార్పులతో కొత్త పథకం

హైదరాబాద్, న్యూస్‌లైన్: లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు సంతృప్తస్థాయిలో వారు కోరుకున్న కోర్సును ఉచితంగా చదివేందుకు అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రభుత్వం మంగళం పాడనుందా? ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును సాకుగా తీసుకుంటుందా? కామన్ ఫీజు వ్యయాన్ని తప్పించుకునేందుకే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుందా? నిపుణుల కమిటీ సిఫారసుల పేరిట తన చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలని భావిస్తోందా? రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటన వీటన్నిటికీ పరోక్షంగా అవుననే చెబుతోంది. ‘వృత్తివిద్యా కళాశాలలకు కామన్ ఫీజు ఉండాలన్న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చినందున దీని ప్రభావం ఎలా ఉండబోతుందన్న అంశంపై ‘నిపుణుల కమిటీ’ ఏర్పాటు అవసరమైంది. కామన్ ఫీజు వల్ల ప్రస్తుత రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌పై ఉండే ప్రభావాన్ని విశ్లేషించడంతోపాటు, ఆర్థికంగా భరించగలిగిన విద్యను అందించడానికి ప్రభుత్వం వద్ద ఉన్న విభిన్న అవకాశాలను సిఫారసు చేసేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ కమిటీని నియమించారు...’ ఇదీ ఆ ప్రకటన సారాంశం. 

ఈ ప్రకటనను నిశితంగా పరిశీలిస్తే.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవుతున్న వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని స్పష్టమవుతోంది. వాస్తవానికి ఈ వ్యయంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. కానీ ప్రభుత్వంపై వచ్చే విమర్శలను కొంతవరకైనా ఎదుర్కోవచ్చనే భావనతో... నిపుణుల కమిటీ వేసి ఆ కమిటీ సిఫారసుల పేరిట పథకం రద్దు చేసేందుకు సర్కారు యత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కామన్ ఫీజు అమలు చేస్తే రీయింబర్స్‌మెంట్ కింద ఒక్క ఏడాదికే రూ.482 కోట్ల అదనపు వ్యయం అవుతుందని సాంఘిక సంక్షేమ శాఖ ఇప్పటికే ప్రాథమిక అంచనాలను ప్రభుత్వం ముందు పెట్టింది. దీనిపై నిర్ణయం తీసుకోకుండా కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన సమయంలో కమిటీ వేసిందంటే... ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేందుకేనని స్పష్టమవుతోంది. 

ఈ కమిటీకి కనీసం నిర్దిష్ట కాలవ్యవధిని కూడా నిర్ణయించకపోవడం అనుమానాలకు మరింత ఊతం ఇస్తోంది. సాధ్యమైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని చెప్పినా.. ఈనెల 6వ తేదీన ఫీజు రీయింబర్స్‌మెంట్ సబ్ కమిటీ సమావేశంలోపు సమర్పించాలని మౌఖికంగా మాత్రమే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. అయితే రెండే రెండు రోజుల్లో కమిటీ ఏం అధ్యయనం చేసి.. ఏ నివేదిక సమర్పిస్తుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏం కోరుకుంటే అదే సమర్పించడం తప్ప కమిటీ ప్రత్యేకంగా విశ్లేషించేదేమీ ఉండదని చెబుతున్నారు. ఏదిఏమైనా ప్రస్తుతం ఉన్న విధానంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించరాదనేదే ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆలోచనగా అధికారవర్గాలు చెబుతున్నాయి.

ఇదీ వ్యూహం 
ప్రస్తుత ఫీజును ఇస్తాం.. కానీ పెరిగే ఫీజును ఇంటర్ విద్యార్థులు భరించుకోవాలన్న ఆంక్షలు విధించడం..
ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారికే పథకాన్ని వర్తింపజేయడం

ఇంజనీరింగ్ కోర్సులో వచ్చే మార్కులను బట్టి ప్రోత్సాహకాల రూపంలో విద్యార్థికి నగదు ఇవ్వడం. లేనిపక్షంలో విద్యార్థి చదివిన కోర్సులో సాధించిన ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇవ్వడం.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తున్న ‘ఇన్‌స్పైర్’ వంటి పథకాన్ని ప్రకటించడం. ఉదాహరణకు ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో చేరే విద్యార్థికి.. ఇంటర్‌మీడియెట్‌లో వచ్చిన అత్యుత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఏటా రూ.50 వేల వరకు ఉపకార వేతనం ఇవ్వడం. తద్వారా ఆ విద్యార్థి ఎక్కడైనా చదువుకునేందుకు వీలు కల్పించడం.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగించి (ఇది కేంద్రం భరిస్తుంది) బీసీ, ఈబీసీ వర్గాలకు మాత్రం ఈ ప్రోత్సాహక పథకం గానీ, ప్రతిభ ఆధారిత ఉపకారవేతనాల పథకం కానీ ప్రవేశపెట్టడం. తద్వారా రాజకీయ విమర్శలకు అడ్డుకట్ట వేయడం.

సవరణలకు, కొత్త పథకాలకు సమయం సరిపోదనుకుంటే.. భారాన్ని విద్యార్థుల పైనే మోపడం.

ఉద్దేశపూర్వకంగానే ఇంటర్‌తో లింకు! 

లక్ష రూపాయలలోపు ఆదాయం ఉన్న నిరుపేద విద్యార్థుల్లో ఎక్కువమంది ఇంటర్మీడియెట్ ప్రభుత్వ కళాశాలల్లోనే చదువుతున్న విషయాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోంది. జూనియర్ కళాశాల ల్లో లెక్చరర్ పోస్టులు 7 వేలకు పైగా ఖాళీగా ఉన్నాయి. వసతులే లేవు. ఈ పరిస్థితుల్లో ఎంతమంది ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధిస్తారు? ఇది కీలకమైన అంశం. కేవలం ప్రతిభనే ఆధారంగా మిగతావారంతా ఏం కావాలి? ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి మూల సూత్రం ఇదే. విద్యార్థులు తగ్గితే ఆ మేరకు ప్రభుత్వానికి వ్యయమూ తగ్గుతుంది.

ఇంటర్‌లో అరకొర చదువుతో ఉత్తీర్ణులై, ఎంసెట్‌లో ఏదో ఒక ర్యాంకు సాధించి ఇంజనీరింగ్‌లో చేరాక.. కోర్సులో ప్రతిభకు లింకు పెడితే ఉన్నఫళంగా ఆ విద్యార్థి ప్రతిభ సాధిస్తాడా? బీటెక్ అర్హత గల ప్యాకల్టీతో ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్న రాష్ట్రంలో.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన ఒక సాధారణ నిరుపేద విద్యార్థి ఇంజనీరింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచగలడా? కార్పొరేట్ కళాశాలల్లో చదివిన వారికే ప్రతిభ ఆధారిత స్కాలర్‌షిప్పుల ద్వారా ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. 

అర్హత కోర్సులో ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పరిమితం చేస్తే.. పోటీ ప్రపంచంలో కష్టనష్టాలకోర్చి గ్రామీణ ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ ముగించినవారి పరిస్థితి ఏంటి? 

ఇప్పటివరకు చెల్లిస్తున్న రూ. 31 వేలు మాత్రమే చెల్లిస్తామని, మిగిలినది విద్యార్థులే మోయాలని చెబితే.. లక్షా 25 వేలు ఫీజుగా ఉండే ఇంజినీరింగ్ కళాశాలలో రూ. లక్షలోపు ఆదాయం ఉన్న విద్యార్థి చేరగలడా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం గానీ, నివేదిక ఇవ్వబోయే కమిటీ గానీ జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.

కమిటీ కూర్పు భలే..! 
నిపుణుల కమిటీలో 9 మంది సభ్యులు ఉన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాజీవ్ యువకిరణాల బాధ్యతలు చూస్తున్న రీక్యాప్ చైర్మన్ కె.సి.రెడ్డి దీనికి ప్రత్యేక ఆహ్వానితులు కాగా సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఉన్నత, సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్, ఆర్థిక శాఖ కార్యదర్శి డి.సాంబశివరావు, ఉస్మానియా మాజీ వీసీలు ప్రొఫెసర్ వి.రామకిష్టయ్య, ప్రొఫెసర్ ఎం.డి.సులేమాన్ సిద్దిఖీ, ఐఐటీ-హైదరాబాద్ డెరైక్టర్ యూబీ దేశాయ్, జేఎన్టీయూ-కాకినాడ వీసీ ప్రొఫెసర్ తులసీదాస్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ శనివారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. కమిటీ కూర్పును నిశితంగా పరిశీలిస్తే... పాలనలో భాగంగా పనిచేస్తున్న వారే ఎక్కువమంది ఉన్నారు. ప్రభుత్వ ఆలోచనను కమిటీ ముందు పెట్టే బాధ్యతను కె.సి.రెడ్డి తీసుకుంటారని, ఆర్థిక భారానికి ప్రత్యామ్నాయ మార్గాలను ముగ్గురు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు అన్వేషిస్తారని, ఇక కళాశాలలను కట్టడి చేసేందుకు వర్సిటీల్లో ఉప కులపతులుగా పనిచేసిన వారు తగిన సూచనలు చేస్తార ని కళాశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధి ఒకరు ‘న్యూస్‌లైన్’తో విశ్లేషించారు.

ఇజాలను మించిన వైఎస్ హ్యూమనిజం


ఖమ్మం, న్యూస్‌లైన్: కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం కంటే దివంగత నేత వైఎస్‌ఆర్ చెప్పిన హ్యూమనిజం గొప్పదని నమ్మి పలు పార్టీల నుంచి నేతలు వైఎస్‌ఆర్ సీపీలోకి వస్తున్నారని ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ బాడీ సభ్యులు కెకె మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విసృ్తతస్థాయి సమావేశంలో జిల్లా కన్వీనర్‌గా పువ్వాడ అజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చిన మహేందర్‌రెడ్డి ప్రసంగిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను తట్టుకోలేని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సైకిల్ కాంగ్రెస్‌గా మారి ఆయనపై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. 

పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎస్‌ఏ రెహమాన్ మాట్లాడుతూ మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని, అందుకే రాష్ట్రంలోని 99 శాతం మైనార్టీలు వైఎస్ జగన్‌కు అండగా ఉన్నారని తెలిపారు.కాగా, రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకొని శుక్రవారం రాత్రి భక్తరామదాసు కళాక్షేత్రంలో పువ్వాడ అజయ్‌కుమార్ ముస్లిం సోదరులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ సెంట్రల్ గవర్నింగ్ బాడీ సభ్యులు డి.రవీంద్రనాయక్, చందాలింగయ్యదొర కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యులు బాణోత్ మదన్‌లాల్, వి.లక్ష్మీనారాయణ రెడ్డి, రాష్ట్ర ఎస్సీవిభాగం క న్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌రావు, కార్మిక విభాగం కన్వీనర్ జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

భూపందేరం ఇక ఇష్టారాజ్యం!


... ఇప్పుడు ప్రధానమంత్రి సడలింపుల మధ్య, అదే కేంద్ర నాయకత్వం కక్షకొద్దీ ‘వాయిదా’ల పద్ధతిపై చార్జిషీట్ల ప్రహసనాన్ని సీబీఐ కొండవీటి చాంతాడులా కొనసాగిస్తూనే ఉండటం హాస్యాస్పదంగా మారింది. ప్రధాన మంత్రి ప్రకటన ప్రకారం, వైఎస్ కేబినెట్ ఆమోదించిన 26 జీఓలు కూడా సబబైనవే కావాలి. మన్మోహన్ ప్రస్తా వించిన పీపీపీలు సక్రమమైనవే అయినప్పుడు అదే కాంగ్రెస్‌కు చెందిన వైఎస్ జీఓలు కూడా దోషరహితాలే కావాలి. న్యాయ సూత్రం హస్తినకూ, హైదరాబాద్‌కూ ఒకటే కావాలి!

‘పెద్దవాళ్ల బొంకులు తెలియ రావు’ అని తెలుగు వాళ్లలో ఒక నానుడి. గత రెండు రోజుల్లో కేంద్రంలోని కాంగ్రెస్-యూపీఏ సర్కారు ‘విధానాల’కు ఏదో ఆకస్మికమైన కుదుపు వచ్చినట్టు కనిపిస్తోంది! చడీచప్పుడు లేకుండా ఇంతవరకూ సర్కారు అనుసరిస్తున్న ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక ‘సంస్కరణల’లో ఆకస్మిక ‘సవరణల’కు లేదా ‘సర్దుబాట్లకు కారణం ఏమై ఉంటుంది? నిజానికి అసలవి సవరణలా? కావు. ఒకే రోజున ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చెప్పినట్లు సాధికారికంగా వెలువడిన రెండు ప్రకటనలు సరికొత్త అనుమానాలకు చోటు కల్పిస్తున్నాయి.

బ్యాంకు సంస్కరణల అనంతరం బహుళజాతి కంపెనీల గుత్తపెట్టుబడులను యథేచ్ఛగా దేశంలోకి అనుమతించేందుకు వీలుగా, పరిశ్రమాభివృద్ధి పేరిట దేశీయ, విదేశీసంస్థలకు వందల వేల ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వాలు సిద్ధమ య్యాయి. సదరు కేటాయింపులూ జరిగిపోయాయి. అందుకు అనుగుణంగా చివరికి పంటపొలాలకు అనువైన సుక్షేత్రాలను కూడా బడా పారిశ్రామికులకు కట్టబెట్టడానికి వీలుగా ‘పీ.పీ.పీ.లు’ బిళ్లబీటుగా దూసుకువచ్చాయి.

అయితే ‘2-జి స్పెక్ట్రమ్’ పథకం అమలులో భారీ ఎత్తున అవినీతి కుంభకోణం బట్టబయలైన తరువాత సుప్రీంకోర్టు ఒక విశిష్టమైన తీర్పు చెప్పింది. ‘సహజ వన రులు దేశం సంపద కనుక’ కొలదిమంది దానిని కొల్ల గొట్టుకుని పోవడానికి అనుమతించేది లేదని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించినప్పటి నుంచీ కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ‘కుడితిలో పడిన ఎలుక’ చందంగా మారింది. అయితే తాజాగా మన్మోహన్‌సింగ్ ‘రూటు’ మార్చినట్టు కనిపిస్తూ తిరిగి భూబదలాయింపులను మరింత సులభ తరం చేయడానికే నిర్ణయించుకున్నారు. ఇందుకు తగినట్టు గానే గుంభనంగా ఆయన ప్రభుత్వం సుప్రీంలో వాదించ డానికి ముందు చేసిన పని - ఎగ్జిక్యూటివ్ చేసే నిర్ణయా లలో న్యాయస్థానాల జోక్యాన్ని మెత్తగానే అయినా మంద లించడానికి పూనుకుంది. విదేశాలతో కుదుర్చుకునే ఏ ఒప్పందాలైనా లెజిస్లేచర్ అనుమతిలేకుండా పాలకులు ఆమోదించడానికి వీల్లేదని రాజ్యాంగం నిర్దేశిస్తోంది.

ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను ఒక ప్రభుత్వ శాఖ నుంచి మరొక ప్రభుత్వశాఖకు బదలాయించుకో వచ్చే తప్ప ఏ ఇతర సంస్థకూ బదలాయించడంపై ప్రభు త్వం నిషేధం విధించింది. కానీ కథ ఇప్పుడు మళ్లీ మొద టికి వచ్చింది! మౌలిక సౌకర్యాల కల్పనకు తోడ్పడే ప్రైవే ట్ రంగానికి ప్రభుత్వ భూములను బదలాయించడంపై ఉన్న ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలని ప్రధాని (ఆగస్టు 2వ తేదీన) తాజాగా ప్రకటించేశారు! మౌలిక సౌకర్యాల కల్ప నకు ముందుకు దూసుకువస్తున్న పథకాలకు సంబంధించి ముఖ్యంగా ‘ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యం’తో (పీపీపీ-పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్) నిర్వహించే పథకాల విషయంలో రాయితీలు కల్పించడంలో ఇంతవరకూ అం తూపొంతూ లేకుండా జరుగుతున్న జాప్యాన్ని తొలగించ డానికే ప్రభుత్వ భూముల బదలాయింపుపై ఉన్న ఆంక్షలను తొలగించాలని నిర్ణయించారు! దీని ప్రకారం, అన్ని పీపీపీ ప్రాజెక్టులకూ ఈ సడలింపు వర్తిస్తుంది.

‘పీపీపీ అప్రూవల్ కమిటీ ద్వారా సంబంధిత మంత్రుల సమ్మతిలోగాని లేదా సంబంధిత మంత్రి మండలి అనుమ తితో సదరు ప్రభుత్వ భూముల్ని కౌలుకిగాని లేదా అద్దెకు గాని లేదా లెసైన్సుపైనగానీ రాయితీలపైన బదలాయిం చడం లేదా కేటాయించడం జరుగుతుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రాజెక్టులను వేగాతివేగంగా పూర్తిచేసేందుకు వీలుగా సర్కారు భూములను ప్రైవేట్ సంస్థలకు కేటా యించేందుకు సంబంధించిన నియమ నిబంధనలను సడ లించేయడానికి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం నిర్ణయిం చింది. నిజానికి ప్రధాని ప్రకటనలో కొత్త ఏమీలేదు, ఒక వేళ ఉన్న అవకాశవాదపు ‘కొత్తదనం’ ఏదైనా ఉందంటే అది- భూకేటాయింపులకూ, బదలాయింపులకూ ఇక మీదట మంత్రిమండలి (కేబినెట్) ఆమోదం కూడా అక్క ర్లేదట! అంటే, ప్రధాన మంత్రి అనుమతి ‘తాతాచార్యుల ముద్ర’ కింద సమానమన్న మాట!

ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంత్రిమండలి ఆమోదంతో సమష్టి బాధ్యత తోనే అనుమతులు, 26 జీఓలు జారీచేసింది. ప్రధాని ప్రక టన ప్రకారం ఇక ఈ కేసులేవీ ఉనికిలో ఉండే అవకాశం లేదు. అయినా అవన్నీ ఎవరికో ‘లాభ లబ్ధి’ కలిగించడం కోసమని వైఎస్ ఆ జీవోలు తీసి, వాటి చాటున ఎవరెవరో ‘సాక్షి’లోనో, లేదా జగన్ కంపెనీల్లోనో పెట్టుబడులు పెట్టా రన్న ఆరోపణలు ఇంకా నిరూపణ కాలేదు. మరీ విశేషమేమంటే పెట్టుబడులు పెట్టినవారిలో ఎవరూ ఫలానా వాళ్లవల్ల తామింత నష్టపోయాం, నష్ట పరిహారం కోసం కేసులు పెడతామని ఇప్పటిదాకా ముందుకు రాలేదు. అయినా అరెస్టులు, వేధింపుల నాటకా నికింకా తెరపడలేదు!

ఇప్పుడు ప్రధానమంత్రి సడలింపుల మధ్య, అదే కేంద్ర నాయకత్వం కక్షకొద్దీ ‘వాయిదా’ల పద్ధతిపై చార్జి షీట్ల ప్రహసనాన్ని సీబీఐ కొండవీటి చాంతాడులా కొనసా గిస్తూనే ఉండటం హాస్యాస్పదంగా మారింది. ప్రధాన మంత్రి ప్రకటన ప్రకారం, వైఎస్ కేబినెట్ ఆమోదించిన 26 జీఓలు కూడా సబబైనవే కావాలి. మన్మోహన్ ప్రస్తా వించిన పీపీపీలు సక్రమమైనవే అయినప్పుడు అదే కాం గ్రెస్‌కు చెందిన వైఎస్ జీఓలు కూడా దోషరహితాలే కావాలి. న్యాయ సూత్రం హస్తినకూ, హైదరాబాద్‌కూ ఒకటే కావాలి! ప్రపంచ బ్యాంకు ‘సంస్కరణ’లను బేషరతుగా తలకెత్తుకున్న పాలకవర్గాలు (కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు) 1948 నాటి, 1956 నాటి నెహ్రూ పారిశ్రా మిక విధాన ప్రకటనలకూ, కనీస మిశ్రమార్థిక వ్యవస్థకూ కాలదోషం పట్టించాయి. ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్య వాద కూటమి తమ ఆర్థిక సంక్షోభానికి పరిష్కారంగా ఇండియా లాంటి వర్ధమాన దేశాల్ని ‘ప్రపంచీకరణ’ మం త్రంతో లోబరచుకున్నది. అందులో భాగంగానే మల్టీ నేష నల్ కంపెనీలు, విదేశీ గుత్తసంస్థల మదింపుదార్లు, విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబెడులూ భారత ఆర్థికరంగంలోని సర్వ శాఖలకూ విస్తరించాయి. ఆ విస్తరణలో భాగమే ‘పారిశ్రా మికీకరణ’, ‘ఆధునిక వ్యవసాయీకరణ’ పేరిట విదేశీ గుత్త పెట్టుబడులు భారీ ఎత్తున దిగుమతి అయ్యాయి. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు లేదా కాంట్రా క్టులకూ దారాదత్తం చేయాలన్న ప్రతిపాదన ఇంకా చావ లేదు. వ్యవసాయ భూముల్ని క్రమంగా సేద్యం నుంచి దూరం చేస్తూ విదేశీ, స్వదేశీ రేట్‌లకు వేల ఎకరాలు కట్ట బెట్టి క్రమంగా ఆహార సంక్షోభానికి దారితీశాయి.

ఆ మాటకొస్తే... విదేశీ గుత్తపెట్టుబడుల చాటున విదేశీ పెట్టుబడుల అండదండలు లేకుండా బతకలేని పరా ధీన స్వదేశీ గుత్తవర్గాలు కూడా పాలకపక్షాల భూపందా రాలు లేదా భూముల బదలాయింపులను అనుభవిస్తున్న వారే! బలవంతంగా సేదపు భూముల్ని పరిశ్రమాభివృద్ధి పేరిట రైతుల నుంచి నష్టపరిహారం ఎరచూపి ప్రభు త్వాలు గుంజుకున్నందుకే ఇటీవల మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో పలు రాష్ట్రాల్లో రైతులు, వ్యవసాయ కార్మి కులు అనేకచోట్ల పోరాటాలు చేయవలసివచ్చింది.

వీటిలో ప్రధానంగా పేర్కొనదగినవి - కళింగనగర్, పోస్కో, కాశీపూర్, నియాంగిరి, నందిగ్రామ్, సింగూర్, జైతాపూర్, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, శ్రీకాకుళం, హైదరా బాద్, విశాఖ పోరాటాలు. ఆ సందర్భంగా రైతాంగ ప్రజ లు పోలీసు దాష్టీకాలకూ, నిర్బంధాలకూ గురయ్యారు. ఈ దౌర్జన్యకాండ వెనక ఎవరి కోసం భూముల్ని బలవం తంగా బదలాయిస్తున్నారో ఆ కార్పొరేషన్లు - టాటా స్టీల్, పోస్కో, హిండాల్కో, సలీమ్ గ్రూపు, టాటా మోటార్స్, భారత అణుశక్తి నిర్వహణ సంస్థ, జేపీ ఇన్ ఫ్రాటెక్ వగైరా కంపెనీలున్నాయి. పెట్టుబడి ప్రపంచీకరణ చాటున క్రమంగా దారిద్య్ర ప్రపంచీకరణ సాగుతూ వచ్చింది. ‘కార్పొరేషన్’ అంటే దాని ‘ప్రమోటర్ల’ రూపంలో ఉండే టాటాలు, బిర్లాలు, అంబానీలు వగైరా మాత్రమే కాదు, నాటక కళలో ‘దశరూప’ ఎలాగో విదేశీ గుత్తద్రవ్య సంస్థల దోపిడీ కూడా దశ రూపాల్లోనే ఉంటుంది. ఒరిస్సాలో భూకబ్జాదారైన కొరియన్ కార్పొరేషన్ ‘పోస్కో’లో బడా వాటాదారు ఎవరు? బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్. అదీగాక అనేక మంది అమెరికన్ గుత్త పెట్టుబడిదారులూ అందులో భాగస్వాములు! ‘సంస్కరణల’ ప్రవేశంతో యావత్తు భారతదేశమూ దోచుకునేవారి ‘చేతిఎత్తుబిడ్డ’గా మారి పోయింది!

ఇటీవల అమెరికన్ ‘టైమ్’ పత్రిక మన్మోహన్‌సింగ్‌పై ప్రకటించిన వ్యంగ్య పూర్వకమైన ఆగ్రహానికి కారణం- ఇండియాలో ఇప్పుడున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విస్తరణ చాలదనీ, బ్యాంకింగ్, బీమా లాంటి ద్రవ్య సేవలందించే సంస్థల్లో కూడా బహుళజాతి కంపెనీలకు గణనీయమైన స్థానం వెంటనే కల్పించలేదని మాత్రమే! అయితే ఈ సేవా సంస్థలలో కూడా ఐటీ రంగంలో మాదిరే విదేశీ గుత్తేదార్లు బలంగా దూరారు, లేదా దూరం నుంచే మన సంస్థల్ని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకుంటున్నారు. ఈ విదేశీ సంస్థల ఆధిపత్యంలో లేదా స్వదేశీ సంస్థలతో ఉన్న మిలాఖత్ ఒప్పందాల ద్వారా జరుగుతున్న పెద్ద నాటకం - మన స్వదేశీ కార్మికుల జీవితాలను, జీతనాతాలను శాసించబోవడం, కార్మికులు ఎదురుతిరిగిన చోట, పని భారం పెరిగిన చోట నిరసన తెలిపిన సందర్భాలలో దారు ణమైన నిర్బంధ విధానానికి గురిచేయడం! యూపీఏ సర్కార్ బాహాటంగా అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధా నాలు యథేచ్ఛగా కొనసాగినంత కాలం ఈ పరాయీకరణ తప్పదని చెప్పవచ్చు! 
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!