YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 30 July 2012

సీబీఐ జేడీపై దాఖలైన పిల్ కొట్టివేత

సీబీఐ జేడీ వి.వి.లక్ష్మీనారాయణపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం కొట్టివేసింది. తాను గానీ, తన సహచరులుగానీ మీడియా ప్రతినిధులతో మాట్లాడలేదంటూ కోర్టును తప్పుదోవ పట్టించడమే కాకుండా, మోసం కూడా చేశారని, అందుకు సీబీఐ జేడీపై చర్య తీసుకోవాలని పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. లక్ష్మీనారాయణ ఫోన్ నుంచి వెళ్లిన, ఆయనకు ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల వివరాలను సమర్పించేలా బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్‌ను ఆదేశించాలంటూ గుంటూరు జిల్లా పట్టాభిపురానికి చెందిన భూషణ్ బి.భవనం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇటీవల విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని ధర్మాసనం.. మీడియా ప్రతినిధులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ లక్ష్మీనారాయణను ఆదేశించింది. దీంతో సీబీఐ జేడీ తన వాదన వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేస్తారని అందరూ భావించారు. 

అయితే ఆశ్చర్యకరంగా ఆయన హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను అస్సలు పట్టించుకోలేదు. హైకోర్టు కోరిన వివరణ ఇవ్వనేలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ధర్మాసనం సైతం.. తాము కోరిన వివరణ గురించి ప్రస్తావించలేదు. ఈ అంశాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తుచేసినా ప్రయోజనం లేకపోయింది. అంతేకాక పిటిషనర్ తీరునే ధర్మాసనం తప్పుబట్టింది. అసలు ప్రజాప్రయోజన వ్యాజ్యానికి ఉండాల్సిన లక్షణాలేవీ ఈ వ్యాజ్యానికి లేవని తేల్చి చెప్పింది. తాము గతంలోనూ ఇదే రకమైన వ్యాజ్యాన్ని కొట్టివేశామని, పిటిషనర్ తన వ్యాజ్యంలో ఆరోపణలు చేసిన మీడియా సంస్థలను ప్రతివాదులుగా చేర్చలేదని తెలిపింది. గత విచారణ సమయంలో లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయగా, తాజాగా పిటిషనర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. చివరకు ఇటువంటి నిష్ర్పయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసినందుకు పిటిషనర్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తి మేరకు దానిని రూ.25వేలకు తగ్గించింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!