YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 18 August 2012

India Today-Nielson survey Predicts Jagans Victory in 2014 AP

అనర్హతపై కొండా మురళి న్యాయ పోరాటం

- చైర్మన్ పక్షపాతంతో ఉత్తర్వులు జారీ చేశారని కోర్టుకు నివేదన
- విచారణకు స్వీకరించిన హైకోర్టు
- పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని మండలి చైర్మన్, ఇతర ప్రతివాదులకు ఆదేశం.. విచారణ 27కు వాయిదా 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు వేస్తూ శాసన మండలి చైర్మన్ గత నెల 30న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఉత్తర్వుల అమలును తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ఇందులో మండలి చైర్మన్, కార్యదర్శిలతోపాటు మండలి చైర్మన్ చక్రపాణి, కాంగ్రెస్ విప్ శివరామిరెడ్డిలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభాను శుక్రవారం విచారించారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎ.ప్రభాకరరావు వాదనలు వినిపిస్తూ.. మండలి చైర్మన్ ఉత్తర్వులు ఏకపక్షంగా ఉన్నాయని వివరించారు. పిటిషనర్ వాదనలు పూర్తిస్థాయిలో వినకుండానే అనర్హత వేటు వేశారని తెలిపారు. 

అనర్హత వేటుకు చైర్మన్ చెప్పిన కారణాలేవీ సహేతుకంగా లేవని చెప్పారు. మరో ఎమ్మెల్సీ పుల్లా పుద్మావతిపై కూడా అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ దాఖలైనప్పటికీ, దాని జోలికి వెళ్లకుండా కేవలం పిటిషనర్‌పై మాత్రమే అనర్హత వేటు వేశారని తెలిపారు. పిటిషనర్ విషయంలో చైర్మన్ పూర్తిగా వివక్షాపూరితంగా వ్యవహరించారన్నారు. మండలి చైర్మన్ చక్రపాణిస్వతంత్రంగా వ్యవహరించడానికి బదులు మండలిలో కాంగ్రెస్ విప్ శివరామిరెడ్డి చెప్పినట్లు నడుచుకున్నారని వివరించారు. కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాననే కక్షతో ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా, వివరణ అడగకుండానే అనర్హత వేటు వేశారని చెప్పారు. మరికొందరు నేతలు కూడా జగన్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగా తనపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారని కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించారు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.

విద్యార్థుల అర్ధాకలి చదువులు.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల పస్తులు

నిత్యావసరాల ధరలు మూడింతలు 
పెరగని హాస్టళ్ల మెస్ చార్జీలు
మూడు పూటలకు.. రూ.17
చాలీచాలని అన్నం, నీళ్ల చారు..
విద్యార్థుల అర్ధాకలి చదువులు..
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల పస్తులు 
ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచి నాలుగేళ్లు 
ఇప్పటికి మూడింతలు పెరిగిన నిత్యావసరాల ధరలు 
అయినా పాత చార్జీలతోనే సరిపెడుతున్న సర్కారు 
అర్ధాకలితో అలమటిస్తున్న 8 లక్షల మంది విద్యార్థులు 
విద్యార్థులు ఉద్యమించినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
చార్జీలు చాలక మూతపడుతున్న కళాశాలల హాస్టళ్లు 
రివ్యూ కమిటీ వేసి ఏడాది దాటి నా ఫలితం శూన్యం

హైదరాబాద్, న్యూస్‌లైన్: సాధారణంగా హోటల్‌లో ప్లేట్ ఇడ్లీ ధర 15 రూపాయలపైనే ఉంటుంది. కానీ కేవలం 17 రూపాయలు ఇచ్చి మూడు పూటల భోజనం పెట్టాలంటోంది మన రాష్ట్ర సర్కారు. ఇలా దాదాపు ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 17తో ముప్పూటలా భోజనం పెట్టటమే కాదు.. ప్రతి రోజూ స్నాక్స్ అందించాలి. అప్పుడప్పుడూ కోడిగుడ్లు కూడా పెట్టాలి. ఇది సాధ్యమయ్యేదేనా?! నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో.. ఈ ధరతో ఒక్క పూట భోజనం పెట్టటమూ గగనమే! ఫలితం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకుంటున్న దాదాపు ఎనిమిది లక్షల మంది విద్యార్థులు అర్థాకలితో వెళ్లదీస్తున్నారు. వీరికోసం ప్రభుత్వం ఇచ్చే మెస్ చార్జీలు ఏ మూలకూ చాలటంలేదు. జైల్లో ఖైదీలకు ఇస్తున్న మెస్ చార్జీల్లో సగమైనా ఈ విద్యార్థులకు ఇవ్వటం లేదు. మెస్‌చార్జీలను చివరిసారిగా నాలుగేళ్ల కిందట పెంచారు. ఈ నాలుగేళ్లలోనిత్యావసరాల ధరలు రెండు మూడు రెట్లు పెరిగాయి. కానీ మెస్‌చార్జీల పెంపు గురించి పాలకులు పట్టించుకోవటం లేదు. ఫలితంగా చాలీచాలని అన్నం, పప్పు, నీళ్లచారే బడుగు విద్యార్థులకు దిక్కవుతోంది. మెస్‌చార్జీలు పెంచాలని ఎన్నిసార్లు అడిగినా.. విద్యార్థులు నిరసనలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేసినా.. ఆఖరుకు ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు అడ్డం పడుకున్నా.. ప్రభుత్వం కరుణించటం లేదు. ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు సంక్షేమ హాస్టళ్లలో రాత్రిళ్లు బస చేస్తున్నారు కానీ.. పిల్లలు ఏం తింటున్నారు? ఎలాంటి అన్నం వారికి పెడుతున్నారు? అనే అంశాలపై దృష్టి సారించటం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 

ఒక్కో చోట ఒక్కో తీరు... 

జైళ్లలో ఖైదీలకు నెలకు రూ. 1,500, ఆసుపత్రుల్లో రోగులకు నెలకు రూ. 1,200 చొప్పున మెస్‌చార్జీలు ఇస్తున్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అధికంగా ఉండే సంక్షేమ హాస్టళ్లు, కళాశాల హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు మాత్రం నెలకు సగటున రూ. 505 మాత్రమే చెల్లిస్తున్నాయి. మూడు నుంచి ఏడో తరగతి చదువుతున్న వారికి నెలకు రూ. 475, ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ. 535 ఇస్తున్నారు. దివంగత వైఎస్‌అధికారంలో ఉండగా మెస్‌చార్జీలను రెండుసార్లు పెంచారు. ఒకసారి 25%, మరోసారి 45% పెంచారు. ఆయనే ఉంటే ఇప్పటికి మరో రెండుసార్లు మెస్‌చార్జీలు పెరిగేవని ఆయా సంఘాల నేతలు చెప్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఇప్పుడున్న ధరల వల్ల.. చాలీచాలని నిధులతో విద్యార్థులకు అన్నం వండి పెట్టటం కష్టంగా మారుతోందని హాస్టల్ వార్డెన్లు వాపోతున్నారు. మెనూ ప్రకారం అన్ని పదార్థాలూ వండిపెట్టలేకపోతున్నారు. కొన్ని చోట్ల అదనంగా విద్యార్థుల సంఖ్య చూపించి, మరికొన్ని చోట్ల ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు కూడా ఉన్నారని చెప్పి వార్డెన్లు నెట్టుకొస్తున్నారు. కొన్ని చోట్ల నాసిరకం బియ్యం.. అదీ పురుగులు పట్టిన బియ్యం వండిపెడుతున్న ఉదంతాలూ ఉన్నాయి. ఇక ఈ ఏడాది నుంచి ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని హాస్టళ్లలో కాకుండా వారు చదువుకుంటున్న పాఠశాలల్లోనే పెట్టిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు మాత్రమే వండిపెడుతున్నారు. తద్వారా ఒక్కపూటకు మిగిలే నిధులతో మజ్జిగ, పండ్లు లాంటివి అందజేయాల్సి వస్తోంది. ఇక విద్యార్థులయితే హాస్టల్ భోజనం తినలేకపోతున్నామని చెప్తున్నారు. నీళ్లచారు, ఉడకని పప్పు, దొడ్డుబియ్యం తింటున్నామని.. వీటివల్ల అనారోగ్యాల పాలవుతున్నామని వాపోతున్నారు. హాస్టల్ విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం కొట్టొచ్చినట్టు కనపడుతోందని సర్వేలు చెప్తున్నాయి. 

మూతపడుతున్న కళాశాల హాస్టళ్లు... 

సంక్షేమ శాఖల పరిధిలో నడిచే కళాశాల హాస్టళ్ల పరిస్థితి మరీ దయనీయం. ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు కళాశాల హాస్టళ్లలో ఉండి చదువుకుంటుండగా.. వారికి ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌ల ద్వారా వార్డెన్లు అన్నం వండి పెట్టాలి. ప్రతి మూడు నెలలకోసారి స్కాలర్‌షిప్ ఇవ్వాల్సి ఉండగా.. ప్రస్తుతం ఏడాది దాటినా ఇచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడో ఏడాది చివర్లోనో, ఈ ఏడాది స్కాలర్‌షిప్ వచ్చే ఏడాదో ఇవ్వటం మూడేళ్లుగా ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో కళాశాల హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులకు అన్నం పెట్టటం హాస్టల్ వార్డెన్లకు తలకు మించిన భారంగా మారింది. ఒక్కో వార్డెన్ నె త్తిమీద లక్షల రూపాయల అప్పులు పేరుకుపోయాయి. డబ్బుల కోసం కిరాణా దుకాణాల వ్యాపారులు ఒత్తిడి తేవటం, ప్రభుత్వం స్కాలర్‌షిప్ ఇవ్వకపోవటంతో ఏకంగా హాస్టళ్లు మూతపడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని సీతాఫల్‌మండి, ఎల్‌బీనగర్, కోఠి, హిమాయత్‌నగర్, బోయగూడ, ఉప్పుగూడ బీసీ హాస్టళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని కొన్ని హాస్టళ్లలో కూడా మెస్ బంద్ చేశారు. విద్యార్థులు ఇంటికెళ్లిపోతున్నారు.

ఆ కమిటీ ఏం చేస్తోంది?

కళాశాల హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు మెస్‌చార్జీల పెంపు, సకాలంలో చెల్లింపు అంశాలపై అధ్యయనం చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులతో ఏడాది కిందట కమిటీని నియమించారు. ఆయా శాఖల కమిషనర్లు తీవ్ర కసరత్తు చేసి మూడు రకాల మెస్‌చార్జీలు, మెనూను ప్రతిపాదిస్తూ ముఖ్య కార్యదర్శుల కమిటీకి నివేదిక అందజేశారు. నెలకు రూ. 1,090 చొప్పున కళాశాల విద్యార్థులకు ఇవ్వాలని, ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థుల తరహాలోనే కళాశాల విద్యార్థులకు కూడా నెలనెలా మెస్‌చార్జీల రూపంలో చెల్లించాలని అందులో ప్రతిపాదించారు. అయితే, ఈ నివేదికపై చర్చించేందుకు కూడా అధికారులకు సమయం లేకుండా పోయింది. ముఖ్యకార్యదర్శుల ఆమోదం పొందిన తర్వాత ఆర్థికశాఖకు, ఆ తర్వాత ముఖ్యమంత్రి వద్దకు ఫైలు వెళ్లి రావాలంటే మరో ఏడాది పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని సంక్షేమ శాఖల అధికారులే అంటున్నారు. 

పెద్దలు వెళుతున్నా ప్రయోజనం సున్నా..!

సీఎం కిరణ్ ఇందిరమ్మ బాట పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న ప్పుడు హాస్టళ్లు, గురుకులాలను సందర్శిస్తున్నారు. అక్కడే రాత్రిళ్లు బస చేస్తున్నారు. సీఎంతో పాటు పలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లలో రాత్రి బస చేశారు. కానీ ఏ ఒక్కరూ విద్యార్థుల మెస్‌చార్జీల గురించి మాట్లాడకపోవటం విశేషం. పెద్దలు వెళ్లినప్పుడు పుష్టికరమైన భోజనాన్ని వండిపెడుతున్నారని.. దోమలు కుట్టకుండా ఫ్యాన్లు, ఏసీలు బిగించి, మరుగుదొడ్లను శుభ్రపరిచి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నందునే సంక్షేమ హాస్టళ్ల సమస్యలు వారికి అర్థం కావటం లేదని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. రోజువారీగా హాస్టళ్లలో వండిపెట్టే నీళ్లచారు, దొడ్డుబియ్యం తింటేనే విద్యార్థుల కష్టాలు అవగతమవుతాయని విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మీకు జీతాలు పెంచుకున్నారు.. పేద విద్యార్థుల మెస్ చార్జీలు ఎందుకు పెంచరు?

హాస్టళ్లలో మెస్ చార్జీలు సరిపోక విద్యార్థులు అన్నమో కిరణ్ అంటున్నారు. భావి భారత పౌరులు, ఐఏఎస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లకు నాసిరకం ఆహారం పెడితే దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? మెస్ చార్జీల విషయంలో సీఎంకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడం దుర్మార్గం. నిత్యావసరాలు ఎన్నో రెట్లు పెరిగినా మెస్ చార్జీలు పెంచకపోవటం దారుణం. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులకు జీతాలు పెంచిన వారు పేద కులాల విద్యార్థులకు అన్నం పెట్టే మెస్ ఛార్జీలు ఎందుకు పెంచరు? మెస్ చార్జీలు వెంటనే పెంచకపోతే ఉద్యమిస్తాం. 
- ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

శాశ్వత వార్షిక సమీక్ష కమిటీని ఏర్పాటు చేయాలి

గతంలో మెస్‌చార్జీలు పెంచినదానికన్నా నిత్యావసర వస్తువుల ధరలు 200 శాతం పెరిగాయి. కానీ మెస్‌చార్జీలు పెంచనేలేదు. ఉద్యోగులకు పీఆర్‌సీ ఉన్నట్టు మెస్‌చార్జీల సమీక్షకు కూడా శాశ్వత వార్షిక కమిటీని ఏర్పాటు చేయాలి. కాలేజీ హాస్టళ్ల విద్యార్థులకు నెలకు రూ. 1,500, ప్రీమెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు రూ. 1,000 నుంచి రూ. 1,200 వరకూ పెంచాలి. అడక్కుండానే రేషన్ బియ్యం ధరను రూ. 2 నుంచి రూ. 1కి తగ్గించిన ముఖ్యమంత్రి సంక్షేమ హాస్టళ్లకు మాత్రం కిలో రూ. 4 ధరకు బియ్యం సరఫరా చేస్తుండటం దారుణం - కె.చంద్ర మోహన్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

అన్నం బాగోలేదంటే.. పస్తులే! 

అన్నం బాగోలేదని వార్డెన్‌కు ఫిర్యాదు చేస్తే నానా దుర్భాషలాడారు. ఒక పూట భోజనం పెట్టకుండా పస్తులు ఉంచారు. - జి.సురేష్, విద్యార్థి (శ్రీకాకుళం)

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు! 
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గ్రామస్తులు వచ్చి అడిగితే ఏం చేస్తారో చేసుకోండని వార్డెన్ అన్నారు. - బి.శేఖర్, విద్యార్థి, ఎర్రముక్కాం

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌దే హవా!


‘‘రాజకీయ ప్రత్యర్థులను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టే ప్రయత్నాలను వ్యవస్థీకృతం చేసిన కాంగ్రెస్‌పార్టీ అం దుకు తగిన మూల్యాన్ని చెల్లించబోతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోబోతున్నది.’’

ఈ వ్యాఖ్యలు చేసింది ఏ రాజకీయపార్టీ నాయకుడో కాదు. ప్రముఖ ఆంగ్ల వారపత్రిక ‘ఇండియా టుడే’ అభిప్రాయమిది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీ చావుదెబ్బ తిన బోతున్నదని అది అంచనా వేసింది. విఖ్యాత ప్రజాభిప్రాయసేకరణ సంస్థ ఏసీ నీల్సన్‌తో కలసి ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు రాజ కీయకక్షతో సాగుతున్నదేనని రాష్ర్టంలో 64 శాతం మంది విశ్వసిస్తున్నట్లు సర్వే పేర్కొంది. 2009లో కాంగ్రెస్‌కు ఓటు వేసిన వారిలో అత్యధికులు పార్టీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లారని సర్వే అంచనా వేసింది. లోక్ సభ ఎన్నికలలోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఘనవిజ యాలు నమోదు చేస్తుందని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ సీట్లలో అధిక భాగం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అది పేర్కొంది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కి 23 నుంచి 27 వరకూ సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. 2009 ఎన్నికల్లో 33 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 8 మాత్రమే వస్తాయని, 18 శాతానికి మించి ఓట్లు రావని సర్వే అంచనా వేసింది. 

కాంగ్రెస్, పీఆర్‌పీలకు కలిపి గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 52.6 శాతం ఓట్లలో 34.6 శాతం వరకూ కోతపడతాయని సర్వే పేర్కొంది. బీజేపీకి 2009లో 3.8 శాతం ఓట్లు రాగా ఇప్పుడు అవి 4 శాతం వరకు రావచ్చునని సర్వే అంచనావేసింది. రాష్ర్టంలో కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలకు... (ప్రధానంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీలకు) 78 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. ఈ పక్షాలకు 34 నుంచి 39 వరకూ సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 23 నుంచి 27 వరకు వస్తాయని సర్వేలో తేలిం ది కాబట్టి మిగిలిన 11 నుంచి 12 సీట్లు టీఆర్‌ఎస్, టీడీపీ లకు వచ్చే అవకాశం ఉందన్నమాట. 

పతనం దిశగా కాంగ్రెస్

రాష్ర్టంలోనే కాదు దేశవ్యాప్తంగానూ కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత యూపీఏ పతనం దిశగా పయనిస్తోంది. యూపీఏ ముఖ్యంగా కాంగ్రెస్ వచ్చే ఎన్నికల నాటికి కోలుకోలేనంతగా పతనమవుతుందని సర్వే అంచనా వేసింది. ఆరునెలల క్రితం జరిగిన సర్వేతో పోల్చిచూస్తే యూపీఏ కన్నా ఎన్డీయే 15 నుంచి 20 సీట్లు పైకి ఎగబాకింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే అధికారంలోకి వస్తుం దని సర్వేలో తేలింది. 2009 ఎన్నికల్లో 259 సీట్లు గెలుచుకున్న యూపీఏ ఇప్పుడు 171 నుంచి 181 సీట్లలో మాత్రమే విజయం సాధించగలదని సర్వే అంచనా వేసిం ది. గత ఎన్నికల్లో 159 స్థానాలు నెగ్గిన ఎన్డీయే ఇప్పుడు 195 నుంచి 205 స్థానాలలో విజయం సాధించగలదని సర్వే పేర్కొంది. 

యూపీఏకి ఆక్సిజన్ అందిస్తున్న పార్టీలు కూడా సమస్యలతో సతమతమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి దన్నుగా నిలిచిన ఓటర్లలో 15శాతం మంది బీజేపీకి అనుకూలంగా మారారని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ ఓట్లలో కూడా 11 శాతం బీజేపీకి అనుకూలంగా మారాయని తేలింది. ఇక్కడ ఎస్‌పీకి 23 నుంచి 27 సీట్లు, బీఎస్‌పీకి 17 నుంచి 21 సీట్లు వస్తాయని అంచనా. తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకేల పరి స్థితి అంతగా మెరుగుపడలేదు. ఇప్పటికీ జయలలిత ప్రభావం బాగానే ఉంది. అయితే తమిళనాడులో కాంగ్రెస్ బాగా నష్టపోనున్నదని సర్వే అంచనా వేసింది. 16 శాతం కాంగ్రెస్ ఓట్లు డీఎంకేకి మారడం ఇక్కడి విశేషం. 

గుజరాత్‌లో నరేంద్రమోడీ పాపులారిటీ ముందు కాంగ్రెస్ వెలవెలపోతోంది. గత ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లను నిలబెట్టుకోవడం కష్టమని సర్వేలో తేలింది. 6 నుంచి 10 సీట్లు మాత్రమే వస్తాయని, బీజేపీ 16 నుంచి 20 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. మహారాష్ర్ట, రాజస్థాన్‌లలో కూడా కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా లేదు. మహారాష్ర్టలో ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య గొడవలు యూపీఏ ఓట్లకు గండికొట్టనున్నాయి. ఇక్కడ యూపీఏకి 20 నుంచి 23 సీట్లు, ఎన్డీయేకి 23 నుంచి 28 సీట్లు వస్తాయని అంచనా. రాజస్థాన్‌లో అవినీతి ఆరోపణల కారణంగా కాంగ్రెస్ ఓట్లు బాగా తగ్గనున్నాయి. యూపీఏకి 5 నుంచి 10 సీట్లు, ఎన్డీయేకి 10 నుంచి 15 సీట్లు వస్తాయి. కర్ణాటకలో మాత్రం బీజేపీ అంతఃకలహాల వల్ల కాంగ్రెస్‌కు కొద్దిగా లాభంచేకూరే అవకాశాలున్నాయి. బీజేపీ 9 శాతం ఓట్లు కోల్పోతుందని సర్వే పేర్కొంది. 

రాహుల్‌కు తగ్గిన మద్దతు

ప్రధానిగా ఎవరయితే బాగుంటుందన్న ప్రశ్నకు 21 శాతం మంది నరేంద్రమోడీకి ఓటేశారు. జనవరిలో జరిగిన సర్వేలో 24 శాతం మంది మోడీకి అనుకూలంగా ఓటేయగా ఇప్పుడు అది 3 శాతం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ భావి ప్రధానిగా ప్రచారంలో ఉన్న రాహుల్‌గాంధీకి ప్రజల మద్దతు మరింతతగ్గిపోయిందని ఈ సర్వే అంచనా వేసిం ది. జనవరి సర్వేలో 17 శాతం మంది రాహుల్‌గాంధీకి అనుకూలంగా ఓటేయగా అది ఇప్పుడు 10 శాతానికి పడిపోయింది. అద్వానీకి 8 శాతం, మన్మోహన్‌సింగ్‌కు 6 శాతం, సోనియాగాంధీకి 6 శాతం మంది ఓటేశారు. నితీశ్‌కుమార్ ప్రధాని అయితే బాగుంటుందని 2 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు.

కొన్ని ముఖ్యాంశాలు...

ప్రధాని మన్మోహన్‌సింగ్ అంచనాలకనుగుణంగా పని చేస్తున్నారా అంటే లేదని 54 శాతం మంది, పనిచేస్తున్నారని 38 శాతం మంది జవాబిచ్చారు.

ఆర్థిక సంస్కరణలను బీజేపీ అయితే బాగా అమలుచేయగలదని 66 శాతం మంది భావించారు.
యూపీఏ ధరలను అదుపుచేయలేదని 55 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ద్రవ్యోల్బణానికి ఎన్డీయే కళ్లెం వేయగలదని 47 శాతం మంది, కళ్లెం వేయలేదని 36 శాతం మంది ఓటేశారు.

గత ఏడాదితో పోల్చితే తమ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని 21 శాతం మంది చెప్పారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే నరేంద్రమోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా చేయవచ్చా అన్న ప్రశ్నకు 55 శాతం మంది అనుకూలంగా, 25 శాతం మంది వ్యతిరేకంగా ఓటేశారు.

కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని బరిలో నిలపాలని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. 19 శాతం మంది సోనియాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని పేర్కొన్నారు.

2014 ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రధానిగా నితీశ్‌కు 26 శాతం, జయలలితకు 8 శా తం, శరద్‌యాదవ్‌కు 7 శాతం, నవీన్‌పట్నాయక్‌కు 4 శాతం, ప్రకాశ్‌సింగ్‌బాదల్‌కు 3 శాతంమంది ఓటేశారు.

ఇప్పటివరకూ ఉత్తమ ప్రధాని ఎవరన్న ప్రశ్నకు ఇంది రాగాంధీకి 30 శాతం మంది, వాజ్‌పేయికి 24 శాతం, జవహర్‌లాల్‌నెహ్రూకు 13 శాతం, రాజీవ్‌గాంధీకి 12 శాతం, లాల్‌బహదూర్‌శాస్త్రికి 7 శాతం ఓట్లు పడ్డాయి. 

ఉత్తమ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గతసర్వేలో మాదిరిగా ఈసారీ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నా రు. తర్వాత స్థానంలో నితీశ్‌కుమార్ ఉన్నారు. మూడో స్థానంలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ ఉన్నారు. తర్వాత స్థానాలలో షీలాదీక్షిత్, జయలలిత, పృధ్వీరాజ్‌చవాన్, మమతాబెనర్జీ, కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

-నీల్సన్ - ఇండియాటుడే సర్వే 

కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు!

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడమే యూపీఏ దుస్థితికి ప్రధాన కారణం. కాంగ్రెస్ కంచుకోటల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ ఇమేజ్ బాగా దిగజారిపోయింది. రాష్ర్టంలో జగన్‌మోహన్‌రెడ్డి వల్లే కాంగ్రెస్ కంచుకోట బద్దలు కాబోతున్నదన్నది నిర్వివాదాంశం. యూపీఏ పతనానికి మూడు కారణాలున్నా యి. ధరల పెరుగుదల మొదటిది. ఈ విషయంలో ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. రెండోది అవినీతి. దీనిని కూడా ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మూడోది పరిపాలన. కాంగ్రెస్ పార్టీ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ప్రత్యర్థులను భయకంపితం చేస్తూ పరిపాలన సాగిస్తోంది. తనను వ్యతిరేకించిన వాళ్లను జైలుపాల్జేస్తోంది. మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత రాజ్యంలో ఉన్నామా అన్న సందేహం వస్తోంది. ఇలా వ్యవహరించిన చోటల్లా కాంగ్రెస్ పార్టీ పతనం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించబోతున్నది. రాష్ర్టంలో కాంగ్రెస్ స్థానాన్ని జగన్ భర్తీ చేయబోతున్నారు. రాజశేఖరరెడ్డి వారసత్వం ఆయన కుమారుడు జగన్‌కే చెందుతుం దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడి విషయంలో కేంద్రంలోనూ, రాష్ర్టంలోనూ కాంగ్రెస్‌పార్టీ అనుసరిం చిన కక్షపూరిత వైఖరి ప్రజలను బాగా కదిలించివేసింది. ఆయనకు ప్రజల మద్దతు పెరగడానికి అది కూడా కారణమైంది. తమలాగే ఆయన కూడా కష్టాలు పడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ర్టప్రజల ఆశ, ఆకాంక్ష ఆయనే. ఆయన వారి నాయకుడిగా ఎదిగారు. ఇక టీడీపీ విషయానికొస్తే ప్రతిపక్ష పార్టీగా కూడా అది అర్హత కోల్పోయింది. రాజీ అనే ఉచ్చులో చిక్కుకున్న రోజునే దాని పతనం ప్రారంభ మైంది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం, ప్రతిపక్షంగా పోరాడుతున్నట్లు నాటకమాడటం... ఇలా రెండు రకాలుగా నడుచుకోవడాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తారు. తీవ్రంగా శిక్షిస్తారు. ప్రతి ఎన్నికలోనూ ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

-ఎం.జె.అక్బర్, సీనియర్ పాత్రికేయులు

'అస్సాం' వదంతుల గుట్టురట్టు


అస్సాంలో చెలరేగిన అల్లర్ల సెగ దేశవ్యాప్తంగా తగిలింది. దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఉంటున్న ఈశాన్య ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించిన వదంతుల గుట్టు రట్టయింది. పుకార్ల విషయంలో ప్రభుత్వం అనుమానాలు నిజమయ్యాయి. వాటికి మూలం పాకిస్థాన్‌లో ఉందని తేలిపోయింది. పాక్‌లో 76 వెబ్‌సైట్లలో గంపగుత్త ఎస్‌ఎంఎస్‌లు, మార్పులు చేసిన చిత్రాలను అప్‌లోడ్ చేసినట్లు గుర్తించినట్లు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ శనివారం (18.08.2012) ఢిల్లీలో వెల్లడించారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు తుపాన్లు, భూకంపాల మృతుల ఫొటోలకు మార్పులు చేసి, వాటిని మయన్మార్ హింసాకాండ మృతులవిగా పేర్కొంటూ ఈ వెబ్‌సైట్లలో ఉంచారని ఆయన వివరించారు. ‘ఇది అత్యంత గర్హనీయం. ఈ వెబ్‌సైట్లను బ్లాక్ చేశాం. మరో 34 వెబ్‌సైట్లను గుర్తించాం. వాటినీ త్వరలో బ్లాక్ చేస్తాం’ అని ఆయన చెప్పారు. ‘వదంతుల ప్రచారం పాక్ నుంచే జరిగిందని ప్రతి ఒక్కరికీ తెలియాలి. దీన్ని పాక్ ముందు లేవనెత్తుతాం. వాళ్లు కచ్చితంగా తోసిపుచ్చుతారు. అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయో మా సాంకేతిక నిపుణుల బృందానికి కచ్చితంగా తెలుసు’ అని అన్నారు.

నివురుగప్పిన నిప్పులా ఉన్న అస్సాం ఒక్కసారి భగ్గుమంది. ఎప్పటినుంచో జాతుల విద్వేషంతో రగులుతున్న కక్ష్యలు ఇప్పుడు బుసకొట్టాయి. ఒకదాని వెంట ఒకటి జరిగిన హత్యాకాండలతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కేంద్ర ప్రభుత్వం సమయానికి స్పందించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శ సర్వత్రా వినవస్తోంది. అస్సాంలో జరిగిన హింస ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకూ పాకింది. బతుకుదెరువు కోసం దేశంలో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఈశాన్య రాష్ట్రాల వారు భయంతో వణికిపోతున్నారు. దాడుల పుకార్లతో సొంత రాష్ట్రం బాట పట్టారు. ఇద్దరి హత్యతో మొదలైన ఘర్షణలు అస్సాంను నిప్పుల కుంపటిగా మార్చేశాయి. దాడుల్ని ఆపడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలమయ్యాయి.

అల్లర్ల నేపధ్యం:

అస్సాంలో స్థానిక బోడో గిరిజనులకు, ముస్లిం మైనారిటీ వలసవాదులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు బలమైన కారణాలే ఉన్నాయి. గత జూలై 10న కోక్రాఝర్‌లో ఇద్దరు బోడో విద్యార్థి సంఘాల నేతలపై కాల్పులు జరిగాయి. వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతం చిలికిచిలికి గాలివానలా మారి పలు జిల్లాల్లో ఘర్షణలకు దారితీసింది. జులై 19న ఇద్దరు బంగ్లాదేశీ వలసదారులపై దాడి చేసి హత్య చేశారు. ఆ హింసాగ్ని మొత్తం అస్సాంకు పాకింది. జులై 20న బొడోలాండ్‌ పీపుల్‌ ఫ్రంట్‌ వర్కర్స్‌ నలుగురు నమాపారా గ్రామం వద్ద హత్యకు గురయ్యారు. జులై 21 కొక్రాఝర్‌ జిల్లా దురామరి వద్ద గన్‌మేన్‌ విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఒకరు చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ రోజు నుంచి కోక్రాఝర్‌ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. అదే రోజు ముగ్గురు బోడోలు హత్యకు గురయ్యారు. గొసైన్‌గావ్ లో ఇద్దర్ని కాల్చి చంపారు. జులై 22న కోక్రాఝర్‌ జిల్లాలో నాలుగు మృతదేహాలు లభించాయి. ఈ హింస ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వ్యాపించింది. జులై 22నే చిరాంగ్‌ జిల్లాలోని బిజిని పట్టణంలోమంగోలియన్‌ బజార్‌లో మరో ఇద్దరు హత్యకు గురయ్యారు.

ఇంత జరుగుతున్నా అస్సాం ప్రభుత్వం వెంటనే తగిన రీతిలో స్పందించలేదు. ఆలస్యంగా తేరుకుంది. జులై 24న కేంద్ర సాయాన్ని అర్థించింది. ఆ రోజే గౌహతికి వెళ్లాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలుపై దాడులు జరిగాయి. నాలుగు బోగీలు దెబ్బతిన్నాయి. కేంద్ర బలగాల సాయంతో రైలు సర్వీసుల్ని జులై 25న పునఃప్రారంభించారు. ఈ దాడులు వ్యాపించడానికి కేంద్రం ప్రభుత్వమే కారణమని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ జులై 27న కేంద్రంపై మండిపడ్డారు. సరైన సమయంలో బలగాల్ని పంపలేదని విమర్శించారు.

ఇప్పటివరకు జరిగిన హింసాకాండలో మొత్తం 77 మంది మరణించారు. దాదాపు నాలుగు లక్షల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మొత్తం 270 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొక్రాఝర్‌, చిరాంగ్‌, ధుబ్రి, కామ్‌రూప్‌, బక్సా జిల్లాలు అల్లర్లతో దెబ్బతిన్నాయి. 400 పైగా గ్రామాలు అల్లర్లతో అట్టుడికాయి. జులై 28న పీఎం మన్మోహన్ కోక్రాఝర్‌ జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో పర్యటించారు. జరిగిన సంఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆగస్టు 7న సీఎం గొగోయ్‌ డిమాండ్‌ చేశారు.

అల్లర్లు సద్దుమణిగాయనుకుంటున్న సమయంలో దాడుల భయం మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లకు వ్యాపించాయి. ఆగస్టు 11న మహారాష్ట్రలో చెలరేగిన అల్లర్లు హింసకు దారితీశాయి. ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న అస్సామీయులపై దాడులు చేస్తామంటూ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పుకార్లు వ్యాపించాయి. తమ జీవనోపాధిని వదులుకొని, సొంతరాష్ట్రాలకు తిరుగుముఖం పడుతున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణె, కోయంబత్తూరు, మదురైల నుంచి వారు ఇళ్లకు మళ్లుతున్నారు. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ పుణ్యమా అని వందంతులు శరవేగంగా వ్యాపించడం కూడా ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. భద్రతపై రాజకీయ నాయకులతోపాటు, పోలీసు ఉన్నతాధికారుల హామీలిస్తున్నా, ఉపయోగం లేనంత తీవ్రస్థాయికి వదంతులు ప్రచారమైపోయాయి. దీనితో ఈ పుకార్లు వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం 15 రోజులపాటు బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, ఎంఎంఎస్‌లపై నిషేధం విధించింది. ఎంత ధైర్యం చెప్పినా అస్సామీయులను భయం వీడలేదు. వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతూనే ఉన్నారు. వారంతా 18-25 సంవత్సరాల మధ్య వయసువారే. వీరందరూ సెక్యూరిటీ గార్డులుగా, రెస్టారెంట్లలో పనులు చేసేవారు. దక్షిణాది నుంచి అస్సాంకు వెళ్లే రైళ్లు కిక్కిరిసిన జనాలతో వెళ్తున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలలో ప్రైవేటు సంస్థలకు తీవ్రమైన సెక్యూరిటీ సిబ్బంది కొరత ఏర్పడుతుంది.

అసోం అంశంపై ఆగస్టు 17న పార్లమెంట్‌ దద్దరిల్లింది. పూణే, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి పెద్ద సంఖ్యలో ఈశాన్యారాష్ట్రాల ప్రజలు సొంత ఊళ్ళకు వెళ్ళిపోతుండటంపై ఉభయసభలూ ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవ్వరూ స్వస్థలాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రక్షణ కల్పిస్తాయని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. బెదిరింపులకు పాల్పడేవారిని, పుకార్లు సృష్టిస్తోన్న వారిని కఠినంగా శిక్షించాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఈశాన్య రాష్ట్ర ప్రజలు దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించే, పనిచేసే, చదువుకునే హక్కు కలిగి ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా దేశమంతా ఒకే తాటిపై నిలబడి ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సంఘీభావం తెలపాలని ఆమె కోరారు. ప్రభుత్వం ఎవరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుందో స్పష్టం చేయాలని జెడియూ నేత శరద్‌యాదవ్‌ కోరారు.

ఈశాన్య రాష్ట్రాల శాంతిభద్రతల పరిస్థితిపై పార్లమెంట్‌ ఉభయసభలూ చర్చించాయి. పుకార్లు, బెదిరింపులకు పాల్పడుతోన్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అన్ని పార్టీల నేతలూ డిమాండ్‌ చేశారు. అసోం సహా ఈశాన్య రాష్ట్రాల ప్రజలందరికీ పార్లమెంట్‌ సంఘీభావం తెలిపింది. పుకార్లు సృష్టించడంలో విదేశీయుల పాత్ర ఉందేమో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామని ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రాంతాలలో ఉండే అస్సామీయులు అభద్రతతో అస్సాం తరలి వెళ్లడానికి కేంద్రం నిర్లక్ష్యం, కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు విధానాలే కారణమని బీజేపీ ఆరోపించింది. ఇదంతా పకడ్బందీ ప్రణాళికతో జరుగుతోందని, ఇంటెలిజెన్స్‌ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు.

అసలు కారణాలు:
అస్సాంలోకి విదేశీయుల వలస ఎక్కువైంది. వలసలను అరికట్టేందుకు ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. స్థానిక బోడో తెగలకు, మైనారిటీ వలసవాదులకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ విభేదాలు ఘర్షణకు దారి తీసి పరిస్థితి ఇక్కడికి వరకు వచ్చింది. ఘర్షణలకు అసలు కారణాలు అన్వేషించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఈశాన్య ప్రాంతంలోని మిగతా రాష్ట్రాల్లాగానే, అస్సాంకు కూడా విభిన్నమైన సాంస్కతిక నేపథ్యం ఉంది. దేశ ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న అస్సాం పలు దేశాల అంతర్జాతీయ సరిహద్దులకు దగ్గరగా ఉంది. బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ వంటి దేశాల సరిహద్దులకు దగ్గరగా ఉంది. అందువల్ల ఈ రాష్ట్రంలో విభిన్న జాతుల ప్రజలు జీవిస్తున్నారు. అస్సామీల అసలు జాతి ఏదో నిర్వచించడం కూడా సాధ్యం కాదు. ఆయా దేశాల నుంచి ఇక్కడకు బతుకుదెరువు కోసం వలస వచ్చిన ప్రజలు, తమపై ఎప్పుడు ఎవరు దాడి చేస్తారోఅన్న ఆందోళనతో ఉంటున్నారు. వారికి వ్యతిరేకంగా స్థానిక వాదం బాగా బలపడుతోంది. దానికి తోడు ఇక్కడ ఉన్న ఉగ్రవాదం కారణంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి దేశంలోని ఇతర ప్రాంతాల వారెవరూ ఆసక్తి చూపడంలేదు. ఈ రాష్ట్రంలో పెట్రోలియం నిక్షేపాలున్నా, తేయాకు విస్తతంగా పండుతున్నా అభివద్ధి మాత్రం అంతంతమాత్రమే.

అస్సాంలో ప్రతిభ గలవారు మంచి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన పేద ప్రజలు, బీహార్, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి పేద కార్మికులు ఉపాధి కోసం ఇక్కడకు వస్తున్నారు. దాంతో స్థానికులు, స్థానికేతరులు అన్న సమస్య తలెత్తింది. బంగ్లాదేశ్‌ నుంచి నిరాటంకంగా సాగుతున్న వలసల వల్ల ఇక్కడ ముస్లిం ప్రాబల్యం పెరుగుతోంది. దిగువ అస్సాం జిల్లాల్లో నెలకొన్న ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అయా ప్రాంతాలను బంగ్లాదేశ్‌తో కలిపేయాలని ముస్లింలు డిమాండ్ చేయవచ్చేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోడోలు, ఇతర స్థానికుల ప్రయోజనాల గురించి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించకపోవడం సమస్యను మరింత జటిలంగా మార్చింది. అస్సాంలోని తీవ్రవాద సంస్థలు, గ్రూపులు గతంలో తమ రాష్ట్ర సార్వభౌమత్వం కోసం పోరాడేవి. అవి ఇప్పుడు వలసవాదులతో పోరుకే ప్రాధాన్యమిస్తున్నారు. మరో వైపు వలసవాదుల తరపున పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి హుజీ, ఐఎస్‌ఐ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దీనితో సమస్య మరింత జటిలమైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లు, హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు రెండు కోట్లకు పైనే ఉంటారని ప్రభుత్వ అంచనా. ఈ వలసలు దేశ భద్రతకే ముప్పు అన్నది కాదనలేని సత్యం. 1998లో అప్పటి అస్సాం గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ కె సిన్హా రాష్ట్రపతికి ఇచ్చిన నివేదికలో ఈ విషయాలన్నింటిని తెలియజేస్తూ కేంద్రంని హెచ్చరించారు. ఆయన హెచ్చరికలను కేంద్రం ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. పార్లమెంటులో ఆగస్టు 17న జరిగిన చర్చలో దేశంలో 83 వేల 400 మంది బంగ్లాదేశ్ శరణార్థులున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత మూడేళ్లలో 23వేల 600 మంది బంగ్లాదేశ్ వాసులను వారి దేశానికి పంపించినట్లు కేంద్రం పార్లమెంటుకు వివరించింది.

అస్సాం రాష్ట్రంలో చెలరేగిన అల్లర్ల సెగ దేశవ్యాప్తంగా హింసాకాండకు దారితీసిన పరిస్థితులలోనైనా కేంద్ర ప్రభుత్వం మేలుకోవలసిన అవసరం ఉందని గుర్తించాలి. తమ వైఫల్యాన్ని అర్ధం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు వాస్తవిక దక్పథంతో వ్యవహరించాలి. అక్రమ వలసలను అరికట్టడానికి కఠినమైన నిబంధనలను రూపొందించి అమలు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికీ కేంద్రం మేలుకోకపోతే ఈ సమస్య దేశ భద్రతకే సవాలుగా మారే ప్రమాదం ఉంది.

విద్యుత్ కోతపై వైఎస్సార్‌సీపీ నేత‌ల ధ‌ర్నా

ఖమ్మం: అశ్వారావుపేటలో విద్యుత్ కోతను నిర‌సిస్తూ వైఎస్ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజేయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేత‌లు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ధ‌ర్నాకు దిగారు. సబ్‌స్టేషన్ ఎదుట బ‌య‌టాయించి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

నక్కపల్లి పోర్టును తరలించొద్దు: బాబూరావు

విశాఖపట్టణం: నక్కపల్లి పోర్టు తరలింపు ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. పోర్టు తరలిస్తే సీఎం కిరణ్, మంత్రి గంటా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి 24 గంటల అంతర్జాతీయ విమాన సర్వీసులను తక్షణమే ప్రారంభించాలని కోరారు. తమ డిమాండ్లపై స్పందించకుంటే అన్ని శ్రేణులు కలుపుకుని పెద్దఎత్తున ఉద్యమిస్తామని గొల్ల బాబురావు తెలిపారు.

YSRCP Activists Warning to V.Hanumantha Rao

'రంగరాజన్‌ కమిటీ సిఫార్సులు ఒప్పుకోం'

సబ్సిడీలు ఎత్తివేయాలని ప్రధానికి రంగరాజన్‌ కమిటీ ప్రతిపాదించిన సిఫార్సులను ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ సలహాదారు సోమయాజులు డిమాండ్ చేశారు. ఎకనమిక్ అవుట్‌లుక్‌ సిఫార్సులను తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. సబ్సిడీలు ఎత్తేస్తే వ్యవసాయరంగం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదముందని అన్నారు. వ్యవసాయరంగం గురించి ఏమీ తెలియనివాళ్లే ఇలాంటి నివేదికలు ఇస్తారని విమర్శించారు. వ్యవసాయరంగంలో సగటు వార్షిక వృద్ధిరేటు 20ఏళ్లల్లో దారుణంగా పడిపోయిందని తెలిపారు. బొగ్గు గనుల కేటాయింపులో కాగ్ రిపోర్టును ఇంకా అధ్యయనం చేయలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

వైఎస్సార్ సీపీ వినూత్న నిరసన

జగన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం బషీర్‌బాగ్‌లో వినూత్న నిరసన చేపట్టింది. చెత్తకుండీకి వీహెచ్‌ ఫొటోపెట్టి పినాయిల్‌తో నోరుకడిగి వైఎఆర్‌సీపీ నేతలు నిరసన తెలిపారు. వీహెచ్ నోటి దురుసు తగ్గించుకోకుంటే బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు హెచ్చరించారు. రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని సూచించారు.

కుప్పంలో చంద్రబాబుకు చుక్కెదురు


సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబుకు చుక్కెదురైంది. అన్నదమ్ముల్లా ఉన్న మాల- మాదిగలను వర్గీకరిస్తామని చంద్రబాబు ప్రకటించడాన్ని మాలలు తప్పుపట్టారు. చిత్తూరు పర్యటనలో ఉన్న బాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ఎస్సీల ఓట్లు టీడీపీకి పడటం లేదన్న అక్కసుతోనే మాల- మాదిగలను విడదీసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎబిసిడి వర్గీకరణకు మద్దతు పలికితే చంద్రబాబు రాజకీయంగా అంతమవుతారని మాలలు హెచ్చరించారు.

YSRCP leader Somayajulu Press Meet 18th Aug 2012

Shock to Chandrababu in kuppam constituency

రోజుకో రికార్డు బద్దలు కొట్టేస్తున్న రంగం ?

యూపీయే-2 హయాంను ఒక్కసారి పరకాయించి చూస్తే ఓ విషయం అర్థమవుతుంది. మనకి ఆటపాటల్లో రికార్డులు బద్దలుగొట్టే అలవాటు లేదు. మొన్న ముగిసిన ఒలింపిక్స్ ఈ విషయాన్నే రుజువు చేసింది. కళలకు పుట్టినిల్లు మన పవిత్రభూమి అంటారు గదా, ఆ రంగంలో ఏడాదికో రికార్డయినా బద్దలుకొట్టగలమా? ప్చ్.. సారీ! పోనీ ఏ వైజ్ఞానిక రంగంలోనో సరదాగా నెలకో రికార్డు బద్దలగొట్టగలమా? అదీ లేదు. ఏ ఆర్థికాభివృద్ధి రంగంలోనో వారానికో కొత్త రికార్డు స్థాపించగలమా? అబ్బే అదికూడా లేదు!

అంటే, మనమింతేనా ఇంక?
హలో...లో అంతగా నిరుత్సాహపడి నీరసపడిపోకండి! మనం రోజుకో రికార్డు బద్దలు కొట్టేస్తున్న రంగం ఒకటుంది! అదే కుంభకోణాల రంగం. 2012లోనే, మనం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కుంభకోణాలుగా పరిగణించే ఘనకార్యాలను -42కు మించి- సాధించాం తెలుసా? ఇవి పెద్ద వ్యవహారాలు. ఇక చిన్నా చితకా రికార్డులను కూడా లెక్కలోకి తీసుకుంటే, రోజుకో రికార్డు అలవోకగా బద్దలు కొట్టేస్తున్నామని అర్థమయిపోతుంది.

ఉదాహరణకు, తాజాగా రచ్చకెక్కిన బొగ్గు కుంభకోణమే తీసుకోండి. 2జీ కుంభకోణంలో లక్షా డెబ్బయ్యారు వేల కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని కాగ్ నివేదిక పేర్కొనగా, ఆ రికార్డును మన తాజా కుంభకోణం బద్దలు కొట్టేసింది. బొగ్గు బ్లాకుల కుంభకోణంలో జరిగిన అవినీతి విలువ లక్షా ఎనబయ్యారు వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని కాగ్ అంచనా! 2004-09 సంవత్సరాల మధ్య కాలంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు క్రమాన్ని పారదర్శకంగా కొనసాగించక పోవడం వల్లనే ఈ నష్టం ఇంత భారీ ప్రమాణానికి చేరిందని కాగ్ అక్షింతలేసింది.

ఇంతకీ, కాగ్ వేసిన ఈ అక్షింతలు ఎవరి నెత్తిన పడ్డాయో తెలుసా? ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానంలో అంతర్జాతీయ ఖ్యాతి సొంతంచేసుకున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ మీదే ఈ అక్షింతలు పడ్డాయి! కాగ్ పరిశీలించిన కాలంలో బొగ్గు మంత్రిత్వ శాఖ మన్మోహన్ సింగ్ పర్యవేక్షణలోనే ఉండేది. ఇంతవరకూ, ఎన్ని కుంభకోణాలు బయటపడినా ఎవ్వరూ మన్మోహన్ సింగ్ వైపు వేలెత్తి చూపించలేకపోయారు. ఇప్పుడు ఆ లోటూ తీరిపోయింది. ప్రతిపక్షమూ, పత్రికలూ, పరిశీలకులూ తమ కత్తులకు పదును పెట్టుకునే సౌలభ్యం సాక్షాత్తూ మన్మోహన్ సింగే కల్పించారు.

2004 సంవత్సరంలోనే బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రధానమంత్రి కార్యాలయానికి ఓ లేఖ రాస్తూ, బొగ్గు తవ్వుకుంటున్న ప్రైవేట్ కంపెనీలు కుప్పలుతెప్పలుగా లాభాలు పోగేసుకుంటున్నాయని పేర్కొన్నారు. అంచేత, బొగ్గు బ్లాకుల కేటాయింపు క్రమాన్ని పునఃపరిశీలించాలని ఆయన సూచించారు. ఆనాటి మార్కెట్ పరిస్థితులకు తగిన రీతిలో టెండర్ల ప్రక్రియ తిరిగి నిర్వహించాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. అయితే, ప్రధాన మంత్రి కార్యాలయం ఈ సూచన విషయంలో నిర్ణయం తీసుకోవడంలో విపరీతమయిన జాప్యం చేసింది. దాంతో, అంతవరకూ అమల్లో ఉన్న నిబంధనల మేరకే బొగ్గు బ్లాకుల కేటాయింపులు కొనసాగాయి.

అంటే, ప్రైవేటు బొగ్గు కంపెనీల భారీ లాభాలు యథాపూర్వం కొనసాగాయి. ఈ వ్యవధిలో సగటు బొగ్గు ఉత్పత్తి వ్యయాన్నీ, సగటు అమ్మకం ధరనూ లెక్కగట్టి వాటి మధ్య తేడాను లాభంగా పరిగణించింది ‘కాగ్’. ఆ మొత్తం ఎంతో లెక్కగట్టి దాన్ని ఆయా ప్రైవేటు బొగ్గు కంపెనీలకు అప్పనంగా ముట్టిన సొమ్ముగా పరిగణించింది కాగ్. అలా బొగ్గు లాభాలను దోచేసిన కంపెనీల్లో టాటా, రిలయెన్స్, జిందాల్, అభిజిత్, భూషణ్, ఎలెక్ట్రో స్టీల్, ఆధునిక్, రుంగ్టా, సజ్జన్ జిందాల్, గోదావరి ఇస్పాత్, గెయెంకా తదితర గ్రూపులు ఉన్నాయని కాగ్ తేల్చింది. ఈ కంపెనీలకు దక్కిన లాభాల మొత్తం 1,86,000 కోట్ల రూపాయల మేరకు ఉంటుందన్నది కాగ్ అంచనా.

దీన్ని బట్టి తప్పంతా ప్రధాన మంత్రి కార్యాలయంలోనే జరిగినట్లు స్పష్టమయింది. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక వేత్త. ఆయన కార్యాలయానికి ఈ లెక్కలన్నీ తెలియవని అనుకోడానికి ఆస్కారం లేదు. అంటే, అర్థమేమిటి? ఇది తెలిసితెలిసి జరిగిన తప్పు! దీనికి బాధ్యత వహించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. అది మన్మోహన్ సింగ్ అయినా, మరొకరయినా. ఈ పరిణామానికి తర్కబద్ధమయిన ముగింపు అంటూ ఏదన్నా ఉంటే, అది ఇదే!

విద్యుత్ కోతలపై రోడ్డెక్కిన రైతన్న

విద్యుత్ కోతలకు నిరసనగా పలు జిల్లాల్లో రైతన్నలు రోడ్డెక్కారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్ల్ సబ్ స్టేషన్ ను శనివారం రైతులు ముట్టడించారు. నల్గొండ జిల్లా మోత్కూర్ మండలం దత్తప్పగూడెం సబ్ స్టేషన్ ను రైతులు ముట్టడించి ఆందోళకు దిగారు. వరంగల్ జిల్లా ఎల్లంపేట సబ్ స్టేషన్ కు రైతులు తాళం వేసి తమ నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను రైతులు ముట్టడించారు. 

కాగా ప్రకాశం జిల్లా పెదారవీడులో విద్యుత్ కోలతకు నిరసనగా రైతులు ధర్నా చేపట్టారు. శ్రీశైలం-మార్కాపురం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపటంతో ఆమార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారామపురంలో రైతులు ధర్నాకు దిగారు.

Friday 17 August 2012

నిలోఫర్‌లో మరణమృదంగం

హైదరాబాద్, తిరుపతి, వరంగల్, న్యూస్‌లైన్: దేశంలోనే రెండో అతిపెద్ద రెఫరల్ సెంటర్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రి నిలోఫర్‌లో మరణమృదంగం మోగుతోంది. రోజుకు సగటున 7 నుంచి 10 మంది చిన్నారులు మృత్యువాత పడుతుండగా వైద్యులు, నర్సులు, ఇతర సేవల కొరత వల్ల తాజాగా ఈ సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం ఒక్క రోజే 16 మంది శిశువులు మృతి చెందారు. కేవలం 500 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రి అవుట్‌పేషంట్ విభాగానికి ప్రతిరోజూ 1,200 నుంచి 1,500 మంది వస్తుండగా, ఆస్పత్రిలో నిత్యం 1,000 నుంచి 1,200 మంది నవజాత శిశువులు ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతుంటారు. 


రుయాలో మరో నలుగురు చిన్నారుల మృతి

తిరుపతి రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో శుక్రవారం వివిధ కారణాలతో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం వివిధ రకాల జబ్బులతో 69 మంది చిన్నారులను ఆస్పత్రిలో చేర్చుకున్నట్లు సూపరింటెండెంట్ వీరాస్వామి చెప్పారు. ఇందులో పీడియాట్రిక్ ఇంటెన్సివ్‌కేర్ యూనిట్‌లో 29 మందిని చేర్చుకోగా 9 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నియో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో 40 మంది చిన్నారులను చేర్చుకున్నామని 16 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 

ఎంజీఎంలో ముగ్గురు చిన్నారుల మృతి

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం ఒకేరోజు ముగ్గురు పిల్లలు మృతి చెందారు. వేర్వేరు కారణాలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతూ ప్రాణాలొదిరారు.

ఈఎన్‌టీ స్థలం కబ్జాలో సీఎంకు పాత్ర!


రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో కోఠిలోని ఈఎన్‌టీ స్థలం కబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇతర అధికారులు తమ నిజాయతీ ఏమిటో నిరూపించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆ స్థలాన్ని కాపాడాలని ఆందోళన చేసినందుకు కబ్జాకోరులు తమపై నిందలు వేశారని, ఆ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు పార్టీ నాయకుడు ఎం.శ్రీనివాసరావుతో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈఎన్‌టీ స్థలం వ్యవహారంలో డాక్టర్లు, సిబ్బంది, వివిధ రాజకీయ పక్షాలు కూడా ఆందోళన చేశాయి. 

మేం ఇంకా ఆందోళన కొనసాగిస్తుండటంతో కబ్జాదారులైన ఎ.రమేష్, టీకే శ్రీనివాసులు మాపై నింద మోపారు. ఈ మేరకు గత నెల 2న వైద్య శాఖ మంత్రికి రహస్యంగా లేఖ కూడా పంపారు. ప్రభుత్వానికి ధైర్యం లేకపోవడంతో ఆ లేఖను బయటపెట్టలేకపోయింది. అందువల్లే ఆ లేఖ ప్రతిని మేం విడుదల చేస్తున్నాం. ఇందులో నాతో పాటు మాజీ ఎంపీ పి.మధు, మరో రెండు పత్రికల అధిపతుల పేర్లను ఉదహరించారు. డబ్బులు ఇవ్వకపోతే కబ్జాకోరులను చంపుతామని బెదిరించినట్టు అందులో పేర్కొన్నారు’’ అని వివరించారు. 

జగన్ లక్ష్యంగా ఢిల్లీ స్థాయిలో సాగుతున్న కుట్రకు మరికొందరు మంత్రులూ బలి?

తదుపరి టార్గెట్‌పై మంత్రుల్లో చర్చోపచర్చలు
జగన్ లక్ష్యంగా ఢిల్లీ స్థాయిలో సాగుతున్న కుట్రకు 
మరికొందరు మంత్రులూ బలికాక తప్పదనే అభిప్రాయం
సీనియర్లలో అసంతృప్తి జ్వాలలు.. 
ధర్మాన రాజీనామా ఆమోదంతో పాటు ప్రాసిక్యూషన్‌కూ గ్రీన్‌సిగ్నల్!.. 
ముఖ్యమంత్రి వైఖరితో కుంగిన ధర్మాన
లీకులిచ్చి పత్రికల్లో కథనాలు రాయిస్తున్నారనే అనుమానాలు
బొత్సతో ప్రసాదరావు భేటీ... ధర్మానను కలిసిన చిరంజీవి, పొన్నాల, కొండ్రు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చుట్టూ సీబీఐ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఆయన రాజీనామాను ఆమోదించడంతో పాటు ప్రాసిక్యూషన్‌కూ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడానికి రంగం సిద్ధం అవుతోంది. ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ గవర్నర్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీబీఐ రాసిన లేఖలపై త్వరలోనే నిర్ణయం వెలువడనున్నట్లు సమాచారం. ఇదంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా ఢిల్లీ స్థాయిలో సాగుతున్న కుట్ర కనుక.. ధర్మానతో పాటు మరికొంతమంది మంత్రులూ బలికాక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధిష్టానం ఆదేశాల మేరకు సాగుతున్న ఈ వ్యవహారం సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రుల్లో పెద్దయెత్తున గుబులు రేపుతుండగా మరికొందరు సీనియర్ మంత్రులు సహా అనేకమంది నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగిలిస్తోంది. వాన్‌పిక్ భూ కేటాయింపుల విషయంలో ధర్మానపై సీబీఐ చార్జిషీట్, ఆయన రాజీనామా, ప్రాసిక్యూషన్‌కు సీబీఐ లేఖలు... ఇలా ఒకదాని వెంబడి మరొకటిగా చోటు చేసుకున్న పరిణామాలతో వేడెక్కిన వాతావరణం శుక్రవారానికి మరింతగా రాజుకుంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కేంద్రంగా మంత్రులు, సీనియర్ నేతలు సుదీర్ఘ చర్చలు సాగించారు. 

ధర్మాన ప్రసాదరావు బొత్స నివాసానికి పలుమార్లు వచ్చి సీబీఐ ఛార్జిషీట్ తదనంతర పరిణామాలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. ఉదయం బొత్స నివాసానికి మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో కలిసి వచ్చిన ధర్మాన చాలాసేపు చర్చలు సాగించారు. మధ్యలో కొద్దిసేపు డిప్యుటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి కొండ్రు మురళి ఆ చర్చల్లో వేర్వేరుగా పాల్గొన్నారు. తిరిగి సాయంత్రం మరోసారి ధర్మాన బొత్స నివాసానికి వచ్చారు. అంతకుముందు పలువురు మంత్రులు ధర్మానను కలసి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ సమన్వయ సంఘం సభ్యులు చిరంజీవి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, కొండ్రుమురళి, బస్వరాజ్ సారయ్య బీసీ సంఘం నేత ఆర్.కష్ణయ్య తదితరులు ధర్మానను ఆయన నివాసంలో కలిశారు. సీబీఐ ఛార్జిషీట్లలో పేర్కొన్న అంశాలపై బొత్స, ధర్మానలు... సంబంధిత శాఖల ఉన్నతాధికారులు అనిల్‌చంద్ర పునీత, సుతీర్థ భట్టాచార్యలను పిలిచి మాట్లాడినట్లు సమాచారం. ధర్మానతో చిరంజీవి దాదాపు ఇరవై నిమిషాలకు పైగా భేటీ అయ్యారు. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట్రమణారెడ్డిలు కూడా శుక్రవారం ధర్మానను కలిశారు. 

గత రెండురోజుల పరిణామాలతో శుక్రవారం ధర్మాన చాలా డీలా పడినట్లు కనిపించారని ఆయన్ను కలసిన నే తలు చెప్పారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తన శాఖ పరంగా పొరపాట్లు జరిగినట్లు తేలితే దానికి సంబంధిత శాఖల అధికారులదే తప్ప తనకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొన్ని జీఓలు కేబినెట్‌కు తెలియకుండా జారీ అయ్యాయని, సీబీఐ ఛార్జిషీట్లో 1110, 1115, 233, 346, 270, 871 జీఓలను పేర్కొనగా వాటిపై కేబినెట్లో చర్చించాకనే నిర్ణయం తీసుకున్నామని ధర్మాన తెలిపారు. మంత్రిమండలి నిర్ణయాల తరువాత జీఓలు విడుదల చేసే బాధ్యత ప్రభుత్వ కార్యదర్శిదే తప్ప తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

సీఎం తీరుతో కుంగిపోయిన ధర్మాన!: ఈ నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ధర్మాన వర్గం తీవ్రస్థాయిలో మండిపడుతోంది. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన క్షణంనుంచి సంబంధిత మంత్రులు సీఎంను కలసి తమకు ఇబ్బందులు రాకుండా చూడాలని వేడుకున్నారు. న్యాయసహాయం కోసం కూడా అర్థించారు. న్యాయసహాయానికి కూడా సీఎం చాలా కాలం తటపటాయించి ఇటీవలే ఓకే చేశారు. ఛార్జిషీట్‌లో ధర్మాన పేరుండదని ముందునుంచి సీఎం భరోసా కల్పించినా చివరకు సీబీఐ తన పేరును చేర్చడంతో ధర్మాన ఒక్కసారిగా షాక్ తిన్నారని ఆయనకు అత్యంత సన్నిహితుడొకరు చెప్పారు. సీబీఐ ఛార్జిషీట్ విషయం ఆరోజు ఉదయాన్నే సీనియర్ మంత్రి ఒకరికి తెలియగా ఆయన ధర్మానకు ఫోన్‌చేసి చెప్పారు. సీఎంను నమ్ముకుంటే ఇంతే అవుతుందనీ ఆ మంత్రి ధర్మానతో పేర్కొన్నారు. 

అయితే ఛార్జిషీట్ దాఖలైన మరునాడు, ధర్మాన రాజీనామా సమర్పించిన సందర్భంలో కూడా సీఎం ఆయనకు హామీ ఇచ్చారు. కానీ ఆ మరునాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతలు సీఎంను కలసి రాజీనామా ఆమోదించవద్దని కోరిన సమయంలో మాత్రం తన చేతుల్లో ఏమీలేదని, అంతా అధిష్టానం చూస్తోందని, న్యాయసలహాల ప్రకారమే నడుస్తామని చెప్పడంతో ఆనేతలు అవాక్కయ్యారు. ఇది తెలిసిన ధర్మాన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అంతవరకు కొంత ధీమాతో ఉన్న ఆయన ఒక్కసారిగా కుంగిపోయారు. గురువారం అర్థరాత్రి వరకు ఆయన పలువురు సీనియర్ న్యాయవాదులతో చర్చించారు. తీవ్ర ఆందోళనకు గురైన ఆయన బొత్స నివాసానికి పలుమార్లు వెళ్లి చర్చలు సాగించారు. సీఎంను కలిసిన కొందరు నేతలు ఒక సీనియర్ మంత్రితో ఫోన్లో మాట్లాడుతూ... ‘‘సీఎం ఇంతలా వంచిస్తారని మేము అనుకోలేదు. నిన్న హామీ ఇచ్చినట్లే ఇచ్చి ఇపుడు చేతులెత్తేసినట్లుగా మాట్లాడుతున్నారు’’ అని అసంతృప్తి వ్యక్తంచేశారు. ధర్మాన విషయంలో సీఎం మాటమారుస్తుండటంతో ఆయన వర్గానికి చెందిన జిల్లా నేతలు.. మంత్రి కొండ్రు మురళితో కలిసి మంగళవారం ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలవాలని నిర్ణయించారు. కాగా తనపై ఛార్జిషీట్లో సీబీఐ పేర్కొన్నట్లు పత్రికల్లో వస్తున్న అభియోగాలు పెద్ద సీరియస్‌వి కావని, తనను ఇరికించేందుకు వీలుగా అందులో పెద్ద ఆరోపణలే ఉండి ఉండవచ్చని ధర్మాన భావిస్తున్నారు. ఒకవేళ ఇవి బలమైన అభియోగాలు కావని సీబీఐ భావిస్తే.. అది రెండో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ ముఖ్యనేత ఒకరు శుక్రవారం న్యూస్‌లైన్‌తో వ్యాఖ్యానించారు. అధిష్టానం ఆదేశానుసారం నడుస్తున్న కేసు కనుకనే ఇది తప్పదన్నారు.

తదుపరి లక్ష్యం బీసీయేతర మంత్రి? 

తాజా పరిణామాల నేపథ్యంలో అసంతృప్త నేతలందరూ ధర్మానకు అనుకూలంగా ఏకతాటిపైకి చేరుకుంటున్నారు. ఇప్పటికే డిప్యుటీ సీఎం దామోదర రాజనర్సింహ సహా పలువురు మంత్రులు ధర్మానతో, బొత్సతో కలసి చర్చలు సాగించారు. మంత్రులు సబితారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీఎల్ రవీంద్రారెడ్డి, విశ్వరూప్, బస్వరాజ్ సారయ్య తదితరులు శుక్రవారం ధర్మానను కలసి మాట్లాడారు. జగన్ లక్ష్యంగా పార్టీ అధిష్టానం ఆడుతున్న ఈ గేమ్‌లో తదుపరి బలయ్యే మంత్రులెవరనే దానిపైనా చర్చ సాగుతోంది. జగన్‌ను వేధించే క్రమంలో మంత్రులు, నాయకులు ఎవరు బలైనా సరే అధిష్టానం పట్టించుకొనే పరిస్థితి కనిపించడం లేదని పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత ఎక్కువ కాలం జగన్ బయటకు రాకుండా చూడడం ద్వారా పార్టీని రక్షించుకోవచ్చన్న అభిప్రాయం అధిష్టానంలో ఉందని, అందుకే ఇలా చేస్తోందని చెప్పారు. సీబీఐ అరెస్టు చేసిన మోపిదేవి వెంకటరమణ, ఛార్జిషీట్ దాఖలైన ధర్మాన ప్రసాదరావులు బీసీలు కావడం, ఆ వర్గాల్లో అసంతృప్తి రేగుతుండడంతో తదుపరి గురి హోం మంత్రి సబితారెడ్డిపై, ఆపై పొన్నాల లక్ష్మయ్యపై ఉండవచ్చని ఆ నేత విశ్లేషించారు. 

పథకం ప్రకారమే ఆ పత్రికలో కథనాలు

ధర్మానపై ఛార్జిషీట్ దాఖలుతో వివిధ పత్రికల్లో రెండు రోజులుగా వచ్చిన కథనాలు వాస్తవానికి ఆయనకు ఒకింత సానుభూతి కలిగించేవిగా వచ్చాయి. అయితే శుక్రవారం ఒక పత్రికలో ధర్మానకు వ్యతిరేకంగా కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో పనిగట్టుకుని లీకులిచ్చి ఈ కథనాలు రాయించారన్న అనుమానాలు ధర్మానతో పాటు పలువురు మంత్రుల్లోనూ నెలకొన్నాయి. సానుభూతి లభిస్తున్న సమయంలో రాజీనామాను ఆమోదించడమో, లేదా ప్రాసిక్యూషన్‌కు అనుమతించడమో జరిగితే అది ప్రజల్లో ప్రభుత్వంపై ఒకింత వ్యతిరేకతకు దారితీస్తుందన్న ఉద్దేశంతోనే ఇలా లీకులిచ్చి కథనాలు రాయించి ఉంటారని ధర్మాన అనుచరులు, మంత్రులు అనుమానిస్తున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో తనకు స్థలమున్నట్లు వచ్చిన కథనం తప్పని, తాము దానికి అడ్వాన్సు చెల్లించినా అదింకా తమ పేరిట రిజిస్ట్రేషన్ కాలేదని ధర్మాన చెబుతున్నారు. ఆ విషయం ఇదివరకెప్పుడో సీబీఐకి వివరించామని, కానీ అప్పుడెప్పుడూ దానిపై రాని కథనం ఛార్జిషీట్ అనంతరం ఆ ప్రముఖ పత్రికలో వచ్చిందంటే దీని వెనుక కుట్రే ఉన్నట్లు అర్థమవుతోందని వారనుమానిస్తున్నారు. ధర్మాన తప్పు చేశాడు కనుకనే సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతించిందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించడానికి ఇలా పథకం ప్రకారమే కథనాలు రాయించినట్లు వారు గట్టిగా చెబుతున్నారు.

అధిష్టానానికి నివేదికలు

ఇలా ఉండగా ధర్మానపై సీబీఐ ఛార్జిషీట్, రాజీనామా తదితర సంఘటనలతో రాష్ట్రంలోని పరిణామాలపై నివేదికలు ఇవ్వాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సమన్వయ కమిటీ సభ్యుడు షబ్బీర్ అలీలను ఆదేశించారు. ఆమేరకు ఇద్దరు నేతలు శుక్రవారం వేర్వేరుగా నివేదికలు పంపారు. ధర్మాన సంబంధిత పరిణామాలు, రాజకీయంగా మారనున్న సమీకరణాలు తదితర అంశాలపై వారు అధిష్టానానికి నివేదించారు. ఈ వ్యవహారాలపై చర్చించేందుకు వారిని ఢిల్లీ రావాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. శనివారం లేదా సోమవారం బొత్స ఢిల్లీ వె ళ్లే అవకాశముంది. మరో సీనియర్ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి శనివారం ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఇదిలావుండగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రతి ధర్మానకు ఇంకా అందలేదు. అది అందితేనే అందులోని విషయాలు పూర్తిగా పరిశీలించేందుకు అవకాశముంది.

జీఎంఆర్‌కు అనుచిత లబ్ధి

ఢిల్లీ విమానాశ్రయ అభివృద్ధి ఉదంతంపై కాగ్
తద్వారా రూ.3,415 కోట్లు లాభపడ్డ జీఎంఆర్
కన్సార్షియానికి కారుచౌక భూ కేటాయింపులు
తద్వారా మరో రూ.1,63 లక్షల కోట్ల
ఆదాయార్జనకు అవకాశమిచ్చారు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణ పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందం అమలు తీరును కాగ్ తన నివేదికలో నిశితంగా విమర్శించింది. విమానాశ్రయంతో పాటు, రూ.1,63,557 కోట్ల ఆదాయం ఆర్జించే సామర్థ్యమున్న దాని తాలూకు భూమిని కూడా జీఎంఆర్ సంస్థ నేతృత్వంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) కన్సార్షియానికి ఈ ఒప్పందం కింద 60 ఏళ్ల పాటు కారుచౌకగా కట్టబెట్టారని ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం ఒక నివేదికను పార్లమెంటుకు కాగ్ సమర్పించింది. ఢిల్లీ విమానాశ్రయానికి కేటాయించిన 4,800 ఎకరాల్లో 240 ఎకరాలను షాపులు, మాల్స్ వంటి పూర్తి వాణిజ్య అవసరాలకు వాడుకోవచ్చంటూ కన్సార్షియానికి అనుమతిచ్చారు. సదరు భూమి వాణిజ్య విలువే రూ.24 వేల కోట్లుంటుంది. లీజు కాలంలో దాని ఆదాయార్జన సామర్థ్యం రూ.1,63,557 కోట్లని జీఎంఆర్ సంస్థే అంచనాలు కట్టింది’’ అని వివరించింది. పైగా విమానాశ్రయంలో ప్రయాణికులపై రూ.220 నుంచి రూ.1,200 దాకా అభివృద్ధి రుసుం (డీఎఫ్) విధింపును కూడా కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. 

పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రెండూ బిడ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ కన్సార్షియానికి ఇందుకు అనుమతులిచ్చాయని ఆరోపించింది. తద్వారా డీఎఫ్ రూపంలో జీఎంఆర్ ఏకంగా రూ.3,415.35 కోట్లు వసూలు చేసుకుని అనుచిత లబ్ధి పొందిందని వివరించింది. పైగా ఈ మొత్తాన్ని విమానాశ్రయ నిర్వహణ వ్యయంగా సంస్థ వాడుకుని మరింతగా లాభపడిందని పేర్కొంది. ‘‘దీన్ని అనుమతించే పక్షంలో బిడ్డింగ్ దశలోనే దరఖాస్తుదారులందరికీ ఈ విషయాన్ని తెలిపి ఉండాల్సింది. కానీ ఒప్పందంలో ఎక్కడా దీన్ని పేర్కొనలేదు’’ అంటూ ఆక్షేపించింది. పైగా, ‘‘4,70,179 చదరపు మీటర్లలో నిర్మాణాలు చేపడతామని ప్లాన్‌లో పేర్కొని, అందుకు విరుద్ధంగా ఏకంగా 5,53,887 చదరపు మీటర్లలో సంస్థ నిర్మాణాలు చేపట్టింది. తద్వారా ప్రాజెక్టు వ్యయం 43.25 శాతం పెరిగిపోయింది’’ అని వివరించింది.

మేం ప్రయోజనాలేమీ పొందలేదు: జీఎంఆర్

‘‘విమానాశ్రయ ప్రాజెక్టు పనుల బిడ్డింగ్ పారదర్శకంగానే జరిగింది. కాగ్ ఆరోపించినట్లుగా ప్రభుత్వం నుంచి మా కన్సార్షియం సంస్థ ‘డీఐఏఎల్’కు ఎలాంటి ప్రయోజనాలూ లభించలేదు. రూ.1,63,557 కోట్ల విలువ చేసే స్థలాన్ని రూ.100 వార్షిక లీజుకే దక్కించుకున్నామన్న ఆరోపణలూ సరికావు. ఆ స్థలంపై మాకు అద్దె ఆదాయమూ రాదు. అమ్ముకోవడానికి అనుమతులూ ఉండవు. ఒక్క ఎకరం విలువను ఉజ్జాయింపుగా లెక్కగట్టి.. దాన్నే మొత్తానికి అన్వయించడం సరికాదు. ఇక ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫీజు నిబంధననూ తర్వాతెప్పుడో చేర్చారన్న ఆరోపణలు సైతం అవాస్తవం.’’

‘కోల్’గొట్టారు!

‘‘బొగ్గు గనుల కేటాయింపుకు పోటీయుత బిడ్డింగ్ విధానాన్ని సకాలంలో అమలు చేయకపోవడం వల్ల.. వాటిని దక్కించుకున్న ప్రైవేటు సంస్థలకు లక్షా 86 వేల కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూరింది. ఈ కేటాయింపులను పోటీయుత, పారదర్శక, నిష్పాక్షిక బిడ్డింగ్ ద్వారా జరిపి ఉంటే పైన పేర్కొన్న లబ్ధిలో అధిక భాగం ఖజానాకే చేరి ఉండేది’’
- కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)

లక్షా 86 వేల కోట్ల రూపాయల బొగ్గు స్కాంలో యూపీఏ
మన్మోహన్ సర్కారును కడిగేసిన కాగ్
బొగ్గు గనులను ఇష్టారాజ్యంగా ప్రైవేటుకు కట్టబెట్టారు
ప్రైవేటు సంస్థలకు లక్షా 86 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు
పోటీ, పారదర్శకత, నిష్పాక్షికత లేని బిడ్డింగే కారణం
లేదంటే ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరేది
జీఎంఆర్‌తో ఢిల్లీ విమానాశ్రయ ఒప్పందమూ నష్టదాయకమే
దాంతో రూ. 1.63 లక్షల కోట్ల ఆదాయానికి గండిపడింది
రూ. 3,400 కోట్ల డెవలప్‌మెంట్ ఫీజు వసూలుకు అక్రమ అనుమతి
రిలయన్స్ పవర్‌కు బొగ్గు నిల్వల మళ్లింపు అనుమతులూ అక్రమమే
వాటివల్ల రూ. 29,033 కోట్ల మేర ఆ సంస్థకు అనుచిత లబ్ధి
మూడు ఉదంతాలతో ఖజానాకు రూ.3.06 లక్షల కోట్ల నష్టం
పార్లమెంటుకు కాగ్ నివేదికలు.. సర్కారుపై మండిపడ్డ విపక్షాలు.. 
బొగ్గు శాఖ ప్రధాని చేతిలో ఉండగానే కేటాయింపులు..
ఆయన తక్షణం రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ 


న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అంతులేని అవినీతికి, కనీవినీ ఎరుగని స్థాయి కుంభకోణాలకు మారుపేరుగా మారిన యూపీఏ ప్రభుత్వం తాజాగా భారీ స్థాయి బొగ్గు కుంభకోణంలో మెడ లోతున కూరుకుపోయింది. బిడ్డింగులు ఆహ్వానించకుండా పలు ప్రైవేటు సంస్థలకు కేంద్రం ఇష్టారాజ్యంగా 57 బొగ్గు గనులను కేటాయించిందని సాక్షాత్తూ ప్రభుత్వ ఆడిటింగ్ సంస్థ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. తద్వారా వాటికి రూ.1.85 లక్షల కోట్ల మేరకు కేంద్రం అనుచిత లబ్ధినీ, ఖజానాకు భారీ నష్టాన్నీ కలిగించిందంటూ నిగ్గుదేల్చింది. పరిమాణపరంగా ఇది 2జీ కుంభకోణం కంటే కూడా పెద్దది కావడం విశేషం! బొగ్గు గనుల బిడ్డింగ్‌లో సంస్థల మధ్య పోటీకి అసలు అవకాశమే కల్పించలేదని, ఏమాత్రం పారదర్శకతను పాటించలేదని, నిష్పాక్షికతకు కూడా పూర్తిగా నీళ్లొదిలిందని కాగ్ తీవ్రస్థాయిలో అభిశంసించింది. అంతేకాదు.. ఢిల్లీ విమానాశ్రయం అభివృద్ధి పేరుతో అత్యంత విలువైన భూములను కేంద్రం రాయితీల పేరుతో కారుచౌకగా జీఎంఆర్ సంస్థ నేతృత్వంలోని ప్రైవేటు కన్సార్షియానికి కట్టబెట్టడంవల్ల ప్రభుత్వానికి మరో రూ.1.63 లక్షల కోట్ల మేరకు నష్టం కలిగిందని పేర్కొంది. పైగా ఒప్పందానికి విరుద్ధంగా విమానాశ్రయంలో డెవలప్‌మెంట్ ఫీజు వసూలుకు అనుమతించి కన్సార్షియానికి మరో రూ.3,400 కోట్ల దాకా అనుచిత లబ్ధి కలిగించిందని తెలిపింది. వీటికి తోడు నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు నిల్వల మళ్లింపుకు అనుమతించడం ద్వారా అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు మరో రూ.29,033 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చిందని ప్రభుత్వ ఆడిటింగ్ సంస్థ ఆరోపించింది. 

ఇలా ఈ మూడు ఉదంతాల్లో ఖజానాకు కనీవినీ ఎరగని రీతిలో రూ.3 లక్షల కోట్లకు పైగా భారీ నష్టం వాటిల్లిందని తేల్చింది. బొగ్గు గనుల కేటాయింపులు, ఢిల్లీ విమానాశ్రయ అభివృద్ధి ఒప్పందం అమలు, అల్ట్రా మెగా విద్యుత్ ప్రాజెక్టులపై శుక్రవారం పార్లమెంటుకు విడిగా మూడు నివేదికలను కాగ్ సమర్పించింది. ఒక్కో ఉదంతంలోనూ ఒప్పందాలకు ఎలా తూట్లు పొడిచిందీ, నిబంధనలను ఎలా ఉల్లంఘించిందీ కాగ్ పూసగుచ్చినట్టు వివరించింది. బొగ్గు గనుల కేటాయింపుకు పోటీయుత బిడ్డింగ్ పద్ధతిని తక్షణం అమల్లోకి తేవడంతో పాటు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కాగ్ నివేదికలు తీవ్ర రాజకీయ దుమారానికి తెర తీశాయి. యూపీఏ అవినీతికి, కుంభకోణాలకు బొగ్గు గనుల కేటాయింపు ఉదంతం పరాకాష్ట అంటూ బీజేపీ దుయ్యబట్టింది. ‘‘ఇది కేవలం కుంభకోణం మాత్రమే కాదు. దారుణ హత్య, కనీవినీ ఎరగని లూటీ’’ అంటూ దుమ్మెత్తిపోసింది. దీనికి ప్రధాని మన్మోహన్‌సింగ్ వివరణ ఇవ్వడంతో పాటు నైతికంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తూ ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇతర విపక్షాలూ కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. ప్రభుత్వం మాత్రం నివేదికలు తప్పులతడక అంటూ తేలిగ్గా కొట్టిపారేసింది. కాగ్ నివేదికలు ఇప్పుడు బీజేపీ నేత మురళీ మనోహర్ జోషీ నేతృత్వంలోని పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలనకు వెళ్తాయి. గనుల కేటాయింపులు బొగ్గు శాఖ ప్రధాని చేతిలో ఉండగానే జరిగినందున ఆయనపై విమర్శల జడివాన మరింత తీవ్రతరమయ్యే అవకాశముంది.

నివేదిక తప్పుల తడక: శ్రీప్రకాశ్ జైశ్వాల్, బొగ్గు మంత్రి

‘‘యూపీఏ ప్రభుత్వ నిర్వాకం వల్ల రూ.1.86 లక్షల కోట్ల మేర ప్రైవేటు కంపెనీలు లాభపడ్డాయన్న వాదనలో వాస్తవం లేదు. ఆ లెక్కలు తప్పుల తడక . బొగ్గు బ్లాకులను పూర్తి పారదర్శక పద్ధతిలో కేటాయించాం. 2006లో న్యాయ శాఖ నుంచి పరస్పర విరుద్ధాభిప్రాయలు వచ్చిన నేపథ్యంలో బ్లాకులను వేలం వేయలేదు. దీంతోపాటు నాడు బీజేపీ, వామపక్ష పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లు పోటీ బిడ్డింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రస్తుత విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవద్దని ఆ మూడు రాష్ట్రాలూ చెప్పాయి. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కేంద్రం గౌరవించాలి కదా! విధాన నిర్ణయంలో ఎలాంటి తప్పూ లేదు. ఒక వేళ ఉంది అని అంటే.. దానిపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది.’’

ప్రజలను కాగ్ తప్పుదారి పట్టిస్తోంది: పౌర విమానయాన శాఖ

‘‘ఢిల్లీ విమానాశ్రయంపై కాగ్ అంచనాలు పూర్తిగా తప్పు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. ప్రసుత విలువను లెక్కలోకి తీసుకోకుండా కాగ్ అంచనాలు వేసింది. అలాగే మా శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అభిప్రాయాలకు నివేదికలో చోటు ఇవ్వలేదు. ఈ అంశాలపై మాతో చర్చించలేదు.’’

అది మా పని కాదు: అజిత్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి

‘‘ఆ నివేదికను మేం ఆమోదించామా లేదా అని చెప్పడంగాని.. దానిపై కామెంట్ చేయడంగాని మా పనికాదు. నివేదిక ప్రజా పద్దుల సంఘానికి పోతుంది.. ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్లు చూసుకుంటారు.’’

మేం ప్రభుత్వ విధానాలను ప్రశ్నించలేదు: ఏకే పట్నాయక్, డిప్యూటీ కాగ్

‘‘ఆడిట్ రిపోర్టులో ఎక్కడా మేం ప్రభుత్వ విధానాలను ప్రశ్నించలేదు. వాటి అమలులో జరుగుతున్న లోపాలు, జాప్యాలను మాత్రమే ప్రశ్నించాం. విధానాలు ఎలా అమలవుతున్నాయో చూడడమే ఆడిట్ ఉద్దేశం. ఏ కారణం చేతయినా విధాన నిర్ణయాల్లో జాప్యం జరిగిందా అన్నది చూడడమే మా పని.’’
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!