YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 13 August 2012

సీబీఐ నాలుగో చార్జిషీట్ దాఖలు

* ఐదో నిందితునిగా పేర్కొంటూ సీబీఐ నాలుగో చార్జిషీట్ 
* జగన్, సాయిరెడ్డి, నిమ్మగడ్డ, మోపిదేవి, ఇద్దరు ఐఏఎస్‌లు కూడా
* జాబితాలో జగతి సహా మరో నాలుగు కంపెనీలు
* 333 పేజీలు, 284 డాక్యుమెంట్లు, 250మందికి పైగా సాక్షులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ నాలుగో చార్జిషీట్ దాఖలు చేసింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును చార్జ్‌షీట్‌లో ఐదో నిందితునిగా పేర్కొంది. దాంతోపాటు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు శామ్యూల్, మన్మోహన్‌సింగ్‌లను కూడా చేర్చింది. వైఎస్ జగన్ సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులకు సంబంధించి సీబీఐ ఎస్పీ హెచ్.వెంకటేశ్ సోమవారం చార్జిషీట్ ప్రతిని సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావుకు అందజేశారు. 

ప్రభుత్వ అధికారులపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు అనుమతి తీసుకున్నారా అని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించగా, సంబంధిత ఉన్నతాధికారులకు లేఖలు రాశామని, అవి రాగానే కోర్టుకు అందజేస్తామని తెలిపారు. చార్జిషీట్, అనుబంధ పత్రాలతో కూడిన ఏడు పెద్ద ట్రంకు పెట్టెలు, నిందితులకు ఇవ్వాల్సిన చార్జిషీట్, ఇతర అనుబంధ పత్రాలతో కూడిన రెండు ట్రంకు పెట్టెలను ఈ సందర్భంగా కోర్టుకు అప్పగించారు. 

జగన్, వి.విజయసాయిరెడ్డి, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, నిమ్మగడ్డ ప్రకాశ్, వాన్‌పిక్ ప్రాజెక్ట్స్, జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్, కార్మెల్ ఏషియా, సిలికాన్ బిల్డర్స్ సంస్థలను కూడా నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 120(బి), 409, 419, 420, 468, 471, 477-ఎలతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 9, 11, 12, 13(2), 13(1)(సి),(డి) సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. దాదాపు 333 పేజీల చార్జిషీట్‌తో పాటు 284 డాక్యుమెంట్లు, 250 పై చిలుకు సాక్షుల వాంగ్మూలాలను సమర్పించారు. ఈ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాదులు చార్జిషీట్ ప్రతి కోరగా మంగళవారం ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!