YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 17 August 2012

రిలయన్స్‌కు రాసిచ్చారు

నిబంధనలను తోసిరాజని బొగ్గు మళ్లింపునకు అనుమతి: కాగ్
న్యూఢిల్లీ: ‘‘ససాన్ విద్యుత్కేంద్రం కోసం రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు కేటాయించిన క్యాప్టివ్ బొగ్గు గనుల్లోని మిగులు ఉత్పత్తిని ఆ సంస్థకు చెందిన ఇతర విద్యుత్కేంద్రాలకు మళ్లించుకునేందుకు కేంద్రం నిబంధనలకు విరుద్ధంగా అనుమతించింది. దాంతో రిలయన్స్ రూ.29,033 కోట్ల మేరకు లబ్ధి పొందింది’’ అని కాగ్ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా బిడ్డింగ్ అనంతరం అనుచితంగా రిలయన్స్‌కు రాయితీలివ్వడమే ఇందుకు కారణమంటూ తప్పుబట్టింది. అల్ట్రా మెగా విద్యుత్ ప్రాజెక్టులపై శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ‘‘ససాన్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ.1.196 మాత్రమే. కానీ ఇప్పుడు దాని తాలూకు అదనపు బొగ్గును తన యాజమాన్యంలోని చిత్రాంగి విద్యుత్కేంద్రానికి రిలయన్స్ తరలిస్తోంది. చిత్రాంగి విద్యుత్‌ను యూనిట్‌కు రూ.2.45-3.702 దాకా అమ్ముకుంటోంది. తద్వారా భారీగా లాభపడుతోంది’’ అంటూ వివరించింది. పైగా, ‘‘ససాన్ కోసం రిలయన్స్‌కు రెండు బొగ్గు బ్లాక్‌లు కేటాయించారు. ఇప్పుడు దాని విజ్ఞప్తి మేరకు ఎన్‌టీపీసీ అధీనంలోని ఒక బొగ్గు గనిని వెనక్కు తీసుకుని మరీ కట్టబెడుతున్నారు’’ అంటూ ఆక్షేపించింది. ఈ కేటాయింపును పునఃసమీక్షించాలని సూచించింది.

అవన్నీ తప్పులే: రిలయన్స్ పవర్

‘‘కాగ్ వేసిన అంచనాలన్నీ తప్పులు. మాకు ఎలాంటి అనుచిత లబ్ధీ చేకూరలేదు. ససాన్, చిత్రాంగి ప్రాజెక్టుల మధ్య భిన్నమైన టారిఫ్‌లను చూసి కాగ్.. రిలయన్స్ పవర్‌కు అనుచిత లబ్ధి చేకూరిందని చెబుతోంది. ఇది సమంజసం కాదు. బొగ్గు వనరు ఒకటే అయినప్పటికీ కూడా ఏ రెండు ప్రాజెక్టులూ ఒకే రకమైన టారిఫ్‌ను అమలు చేయలేవు.’’

కేటాయింపులు పారదర్శకమే: మొయిలీ

‘‘రిలయన్స్ పవర్‌కు చేసిన బొగ్గు గనుల కేటాయింపంతా పారదర్శకంగానే జరింది. ఎక్కడా అక్రమాలు లేవు. ఇదంతా తెరిచిన పుస్తకం’’.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!