YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 15 August 2012

అదే ప్రజాదరణ

రైతులు, చేనేత కార్మికుల కోసమే కాకుండా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థుల కోసం కూడా పోరాడుతూ ప్రజలలో, యువతలో సుస్థిర స్థానం సంపాదించింది. పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అన్ని వర్గాల ప్రజా సమస్యలపైన పోరాడుతూ అద్వితీయమైన ప్రజాస్పందనని కూడగట్టుకుంది. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులలో చైతన్యం తీసుకువచ్చింది. 

మొద్దు నిద్దరలో ఉన్న ప్రభుత్వంలో చలనం తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు ఏకమై కుట్రపన్ని జగన్మోహన రెడ్డిని జైల్లో పెట్టించారు. అయినా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతోపాటు ఆ పార్టీ ప్రముఖ నేతలందరూ ఆ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకా బలమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. 

నిజం చెప్పాలంటే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివిధ పదవులను అలంకరించడం ద్వారా, పాదయాత్ర ద్వారా ఎంతటి ప్రజాభిమానాన్ని పొందారో జగన్ మూడేళ్లలో అంతకంటే ఎక్కువ ప్రజాదరణ పొందారు. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వానికి తొత్తుగా మారటంతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే నాధుడే లేడు. ఆ పరిస్థితులలో జగన్ పార్టీ పెట్టింది మొదలు ప్రజా సమస్యలపైనే పోరాడుతూ వారికి అత్యంత చేరువయ్యారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలపై విజయవాడ, గుంటూరు, నిజామాబాద్ జిల్లా ఆర్మూరుతోపాటు ఢిల్లీలోనూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా నిర్వహించింది. 2010 డిసెంబరులో విజయవాడలో రైతుల కోసం భారీ లక్ష్యదీక్ష చేపట్టారు. 2011 మేలో గుంటూరులో రైతు సమస్యలపై దీక్ష చేశారు. 2011 జనవరిలో రైతులతో ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించారు. 2012 జనవరిలో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మూడు రోజుల పాటు రైతుల సమస్యలపై విజయవంతంగా దీక్ష నిర్వహించారు. రైతులకు విద్యుత్ ను సక్రమంగా అందించకపోవడంతో 2011 ఏప్రిల్ 3న విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడించాలని పిలుపు ఇచ్చారు.

మన రాష్ట్రంలో వ్యవసాయ రంగం తరువాత అత్యధిక మంది ఆధారపడి జీవించేది చేనేత రంగం. వైఎస్ఆర్ సీపీ చేనేత కార్మికుల సమస్యలపై పోరాటం చేయటమే కాకుండా వారి ఆందోళనకు మద్దతు పలికింది. 2010 డిసెంబర్ లో ధర్మవరంలో చేనేత కార్మికులు చేపట్టిన దీక్షకు జగన్మోహన రెడ్డి మద్దతు పలికారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో 2011 జనవరి 22న జగన్ జనదీక్ష చేపట్టారు. 

కులమతాలతో సంబంధం లేకుండా పేద విద్యార్థులు అందరూ ఉన్నత చదువులు చదవాలన్న సదాశయంతో మహానేత వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కోసం పెట్టే ఖర్చుని వైఎస్ సామాజిక పెట్టుబడిగా భావిస్తే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మాత్రం దీనిని అదనపు భారంగా భావించింది. ఈ పథకంని ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నంలేదు. 

విద్యార్థులకు వరమైన ఈ పథకాన్ని రక్షించుకునేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర శంఖం పూరించింది. ఈ పథకం విషయంలో ప్రభుత్వ ఎత్తుగడలను జగన్ ఎప్పటికప్పుడు ఎండగట్టారు. ప్రభుత్వం నుంచి ఫీజు బకాయిలు రాకపోవటంతో కొన్ని కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా వేధించినప్పుడు జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ విధంగా జగన్ రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల మనసుకు దగ్గరయ్యారు. ఇక మహిళలు, వృద్ధులూ జగన్ పట్ల చూపించే ఆదరాభిమానాల విషయం అందరికీ తెలిసిందే. 

అన్ని ప్రాంతాలలో అన్ని వర్గాల ప్రజల నుంచి జగన్ కు అపూర్వ ఆదరణ లభించింది. జగన్ బహిరంగ సభలకు వచ్చే జనవాహిని చూసి తలలు పండిన రాజకీయ విశ్లేషకులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంతటి ప్రజాదరణ గల నేత యువకులలో గానీ, సీనియర్లలో గాని మరొకరు లేరని స్పష్టమైపోయింది. ఈ పరిస్థితులలో ఈ ప్రజాదరణని చూసి తట్టుకోలేక, ఈర్ష్య, కుళ్లుతో అధికార, ప్రధాన ప్రతిపక్షం కలిసి జగన్ ని జైలులో పెట్టించారు.

అయినా ఉప ఎన్నికలలో పార్టీ ఘన విజయం సాధించింది. అయితే పార్టీ తరపున ఉద్యమాలు ఆగలేదు. అదే ఊపు. అదే స్పందన. అదే ప్రజాదరణ. చేనేత సమస్యలపై సిరిసిల్లలో విజయమ్మ చేపట్టిన దీక్ష విజయవంతమైంది. సిరిసిల్ల ప్రజలు ఆమెకు నీరాజనాలు పలికారు. 

విద్యాసంవత్సరం ఆరంభమైయ్యే సమయంలో లక్షల మంది పేద విద్యార్థులకు లబ్ది చేకూర్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్టు పొడవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ పథకాన్ని ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అర్థమైపోయింది. ఈ పథకం విషయంతో గతంలో జగన్మోహన రెడ్డి గట్టిగా నిలబడి పోరాడారు. అదే ఉద్యమ స్పూర్తితో ఈ పథకం కొనసాగింపు కోసం విజయమ్మ ఏలూరు రెండు రోజులు దీక్ష చేశారు. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా భారీ సంఖ్యలో దీక్షాశిబిరం వద్దకు తరలి వచ్చి ఆమెకు మద్దతు పలికారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!