YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 14 August 2012

కదంతొక్కిన కొల్లేరు ప్రజలు

కొల్లేరు ప్రజలు విజయమ్మ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రెండు రోజుల పాటు జరిగిన దీక్షలో పాల్గొనేందుకు లంక గ్రామాల ప్రజలు తరలివచ్చారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల 12 మండలాల్లోని లంక గ్రామాల నుంచి మొదటి రోజు దీక్షకు 6 మండలాల నుంచి పిల్లలు, పెద్దలు, మహిళలు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు ఏలూరు బైపాస్ రోడ్డులోని మత్స్య శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడ నుంచి ఊరేగింపుగా దీక్ష వేదికకు పయనమయ్యారు. దారి పొడవునా విజయమ్మ దీక్షకు జేజేలు పలుకుతూ తమ బిడ్డలకు ఫీజు పథకం కావాలంటూ మద్దతు ప్రకటించారు. వీరికి కొల్లేరు సంఘం నాయకులు జయమంగళ రామారావు, సైదు సత్యనారాయణ, ఘంటసాల మహాలక్ష్మిరాజు నాయకత్వం వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముంగర సంజీవ్‌కుమార్, ఊదరగొండి చంద్రమౌళి, యాళ్ళ భూషణరాజు తదితరులు పాల్గొనగా ర్యాలీ దీక్షా వేదికకు చేరింది. దీంతో ఒక్కసారిగా దీక్షా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.ప్రత్యేక కట్టుబాట్లతో జీవించే కొల్లేరు ప్రజలు విజయమ్మ దీక్షకు మద్దతు తెలుపుతూ సభా ప్రాంగణంలోకి రావడంతో కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది. 

పోరాటాలే స్ఫూర్తి నింపాయి
సంక్షేమ పథకాలను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తిగా నిలిచారని కొల్లేరు ప్రజలు చెబుతున్నారు. 120 జివో రద్దు, కాంటూరు కుదింపుపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొల్లేరు నాయకులు పనిచేస్తున్నా ఫలితం లేకపోవడంతో కొల్లేరు ప్రజలు వైఎస్‌ఆర్ సీపీపై మక్కువ పెంచుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో తమ లక్ష్యం సాధించుకునేందుకు విజయమ్మ దీక్షకు మద్దతు ప్రకటించారు.

 ఫీజు దీక్షతో పశ్చిమ గోదావరి జిల్లా చారిత్రక ప్రాధాన్యత సొంతం చేసుకుందని, ఈ విజయం అందరిదీ అని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. మంగళవారం రాత్రి ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఫీజు దీక్ష విజయవంతం కోసం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేశారని చెప్పారు. జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నాయని, నైతిక మద్దతు అందించి ప్రజలు తమను ఆదరిస్తున్నారని అన్నారు. రెండు రోజుల పాటు ఏలూరులో నిర్వహించిన ఫీజు దీక్ష ఒక మహోజ్వల ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందించిన ఆదరణ మరువలేనిదన్నారు.

రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల కోసం వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు ఫీజు దీక్షకు పశ్చిమ గోదావరి జిల్లాను ఎంచుకోవడం ఇక్కడి పార్టీ అదృష్టమని అన్నారు. బిడ్డల క్షేమం కోసం ఓ తల్లి పడిన ఆరాటం ఆమె దీక్షలో కనిపించిందని తెలిపారు. రెండు రోజులపాటు అన్నం, నీరు ముట్టకుండా ఆమె సాగించిన దీక్షతో వైఎస్ కుటుంబానికున్న సహనం, మంచితనం, త్యాగనిరతి మరోసారి రుజువయ్యాయని అన్నారు. ఆమె దీక్షతో జిల్లా పార్టీలో మరింత ఉత్తేజం, ఉత్సాహం నింపారని చెప్పారు. ఫీజు దీక్ష విద్యార్థులకు ఒక భరోసా ఇచ్చేలా సాగిందని అన్నారు. విద్యార్థి సమస్యలపైనే కాకుండా ప్రజలు ఎదుర్కొనే ఏ సమస్యపైనైనా వైఎస్‌ఆర్ సీపీ ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తుందనే సంకేతాలు ఈ దీక్ష ద్వారా ప్రజల్లోకి వెళ్లాయని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!