YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 20 June 2012

కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ

- సానుభూతి వంకతో అధికార, ప్రతిపక్షాల ఆత్మ సంతృప్తి: వాసిరెడ్డి పద్మ 

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే శక్తిలేక.. ఆయన్ను ఓడించేందుకు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ వేర్వేరుగా కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 

కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు, కుతంత్రాల వల్లే జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉన్నారని రాంబాబు చెప్పారు. జగన్ నిర్దోషిగా, కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా ఉప ఎన్నికల ఫలితాలతో జగన్ ఎంతో ఉత్సాహంగా, రెట్టింపు ధైర్యంతో ఉన్నారని చెప్పారు. త్వరలో కాంగ్రెస్ దుకాణం మూసివేయటం జరుగుతుందని, వైఎస్సార్‌సీపీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు ఖాయమని పేర్కొన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారని ఆయన తెలిపారు. 

ప్రజల్లో మమేకమై ఉండమన్నారు: వాసిరెడ్డి పద్మ
కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఉప ఎన్నికల పోరులో పత్తాలేకుండా కొట్టుకునిపోవడంతో ఆయా పార్టీల నేతలు.. వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతి ఓట్లతో గట్టెక్కిందని ప్రచారం చేస్తూ ప్రజలకు ముఖం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించినందుకు పార్టీ అధ్యక్షుడు జగన్‌ను కలిసి అభినందనలు తెలిపినట్లు ఆమె చెప్పారు. 

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నారని, అందువల్లే ఆయన కుమారుడు జగన్‌ను వారు తమ కుటుంబసభ్యునిగా ఆదరించి ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారని అన్నారు. నిత్యం ప్రజల్లో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఉద్యమించాల్సిందిగా జగన్ తమకు సూచించినట్లు పద్మ తెలిపారు. జగన్ నిర్దోషి కాబట్టే ఆయనలో గుండెధైర్యం ఏమాత్రం సడలలేదని, తమను కూడా ఆత్మస్థైర్యంతో ఉండాలని సూచించారని ఆమె తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!