YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 21 June 2012

జగన్ కేసుల నుంచి జేడీని తప్పించాలి



లక్ష్మీనారాయణ దర్యాప్తునకు అనర్హుడు
జేడీకి విలేకరులు ఫోన్ చేయడంలో తప్పులేదు
విలేకరులకు జేడీ ఫోన్లు చేయడాన్నే మేం ప్రశ్నిస్తున్నాం
ఆ ఫోన్ కాల్ జాబితా వెల్లడి వల్ల విలేకరులకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టయితే ఖండిస్తున్నాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల దర్యాప్తులో ఆద్యంతమూ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణను తక్షణం ఈ కేసు విచారణ నుంచి తప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, జనక్ ప్రసాద్, శివకుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లక్ష్మీ నారాయణ ఒక ఉన్నత స్థానంలో ఉం టూ కీలకమైన కేసులను దర్యాప్తు చేస్తూ విచారణకు సంబంధించిన విషయాలను లీకుల రూపంలో వెల్లడిస్తున్నారని ధ్వజమెత్తారు.

అసలు విచారణ వివరాలను లీకుల పేరుతో వెల్లడించడం సీబీఐ మాన్యువల్(నియమావళి)కు విరుద్ధమని, ఇందుకు సంబంధించి హైకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. గత రెండు మాసాలుగా జేడీ పదేపదే పత్రికా విలేకరులతోనూ, పత్రికాధిపతులతోనూ మాట్లాడినట్లు.. కాల్స్ వివరాలను బట్టి తెలుస్తోందని అన్నారు. తమ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన ఆంధ్రజ్యోతి అధిపతి రాధాకృష్ణతో కూడా జేడీ మాట్లాడారని ఆయన వెల్లడించారు.

కొన్ని పత్రికలతోనే ఎందుకు?

‘పత్రికల, చానెళ్ల విలేకరులు విచారణ వివరాలు తెలుసుకునేందుకు సీబీఐ జేడీకి ఫోన్ చేయడాన్ని మేం ప్రశ్నించడం లేదు. కానీ జేడీ స్వయంగా కొన్ని ఎంపిక చేసుకున్న పత్రికలు, చానెళ్ల విలేకరులతో మాట్లాడటాన్ని మేం ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళతో జేడీ ఫోన్‌లో మాట్లాడారు. ఆ తరువాత ఆమె మాకు వ్యతిరేకి అయిన రాధాకృష్ణతో మాట్లాడారు. ఇలా ఎందుకు జరిగిందో రామాయణంలో పిడకల వేటలాగా ఆ చంద్రబాల ఎవరో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో లక్ష్మీ నారాయణ సమాధానం ఇవ్వాలి’ అని అంబటి డిమాండ్ చేశారు. ఈ చంద్రబాల పోలీసు ఉన్నతాధికారి, గ్రేహౌండ్స్ అధిపతితో ఎందుకు మాట్లాడారో కూడా తేలాలన్నారు. విలేకరులు ఎన్ని లక్షల సార్లు లక్ష్మీనారాయణకు ఫోన్ చేసినా ఎవరికీ అభ్యంతరం లేదని, అయితే ఆయనే స్వయంగా విలేకరులకు ఫోన్లు చేసి మాట్లాడటం తప్పు అని అంటున్నామని, ఈ విషయంలో విలేకరులు అపార్థం చేసుకోరాదని కోరారు.

ఆది నుంచీ లీకులే..

అసలు జగన్ కేసులపై విచారణ మొదలైనప్పటి నుంచీ ఆ దర్యాప్తు అంతర్గత వివరాలన్నీ ‘ఈనాడు’ సహా కొన్ని పత్రికల్లో పూసగుచ్చినట్లు వస్తున్నాయని తాము చెబుతూనే ఉన్నామని, ఇపుడు ఫోన్‌కాల్స్ ద్వారా అది అక్షరాలా నిజమైందని అంబటి అన్నారు. తాను స్వయంగా ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సాక్షిగా సీబీఐ ముందు హాజరైతే అక్కడ జరిగిన విషయాలన్నీ మరుసటి రోజు ‘ఈనాడు’ పత్రికలో వచ్చాయన్నారు. అంతే కాదు, సీబీఐ కోర్టు న్యాయమూర్తి నాగమారుతీ శర్మ బదిలీ అవుతున్న విషయం కూడా ముందుగా ఒక తోక పత్రికలో వచ్చిందని, సీబీఐ అధికారులు ఉద్దేశపూర్వకంగా లీక్ చేయకపోతే ఇవన్నీ ఎలా వచ్చాయో లక్ష్మీనారాయణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ కేసుల విషయంలో నిష్పాక్షికంగా విచారణ జరగడంలేదని, ఎంత సేపూ ఆయన్ను ఏదో విధంగా ఇరికించాలనే విధంగా జరుగుతోందని ఆయన అన్నారు. విచారణ వివరాలు చెప్పదల్చుకుంటే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెబితే తప్పు లేదని కూడా ఆయన అన్నారు. తమ పార్టీ విడుదల చేసిన ఫోన్ కాల్స్ జాబితా ఆధారంగా ఎవరి నుంచైనా ఎక్కడి నుంచైనా విలేకరులకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టయితే తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!