YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 23 June 2012

దివంగత సీఎం వైఎస్సార్ హెలికాప్టర్ దుర్ఘటనకు సంబంధించిన దర్యాప్తును కూడా ఆగమేఘాల మీద ముగించింది ప్రస్తుత జేడీ లక్ష్మీనారాయణే

తమ చీకటి ఒప్పందాన్ని కాపాడుకునేందుకు ఎల్లో మీడియా పాట్లు పడుతోంది
అందుకే మీడియాను, మహిళను కించపరిచారంటూ దుష్ర్పచారం చేస్తోంది
విలేకరులు సీబీఐ జేడీకి ఫోన్ చేయడాన్ని మా పార్టీ ఎక్కడా తప్పుపట్టలేదు
లక్ష్మీనారాయణపై మాకు అనేక అనుమానాలున్నాయి..
వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై హడావుడిగా దర్యాప్తును ముగించింది ఆయనే
2011 సెప్టెంబర్, డిసెంబర్ మధ్య ఈనాడు.. ఈటీవీలకు జేడీ 23 కాల్స్ చేశారు.. 148 ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చారు.. ఆంధ్రజ్యోతి రిపోర్టర్లకు 4 కాల్స్, 68 ఎస్‌ఎంఎస్‌లు 
జేడీ నుంచి సాక్షి రిపోర్టర్లకు ఒక్క ఔట్ గోయింగ్ కాల్ కూడా లేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రను ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత దాన్ని పక్కదారి పట్టించేందుకు ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. జగన్‌పై జరుగుతున్న కుట్రను ప్రజలకు చెప్పకుండా, నిజాలు దాచిపెట్టి వారి చీకటి ఒప్పందాన్ని కాపాడుకునేందుకు ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోందని దుయ్యబట్టారు. అందుకే మీడియాను, మహిళను కించపరిచారంటూ అనవసర అంశాలను తెరపైకి తెచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారని విమర్శించారు. విలేకరులు సీబీఐ జేడీకి ఫోన్లు చేయడాన్ని తమ పార్టీ ఎక్కడా తప్పు పట్టలేదని స్పష్టం చేశారు. జేడీ లక్ష్మీనారాయణ వృత్తి ధర్మాన్ని అతిక్రమించడాన్నే ప్రశ్నించామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న జేడీని బాధ్యతగల మీడియా ఎందుకు ప్రశ్నించదు... వృత్తి ధర్మాన్ని సరిగా నిర్వహించని వ్యక్తిపై చర్చా కార్యాక్రమాలు ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. 

‘‘కాంగ్రెస్, టీడీపీ కలిసి జగన్‌మోహన్‌రెడ్డిపై రాజకీయంగా చేస్తున్న కక్షసాధింపు చర్యల్లో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ భాగస్వామ్యం కావడంలో ఉన్న మతలబు ఏమిటి? జేడీ తీరు చూస్తుంటే పాత కక్షలున్న వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో దర్యాప్తు చేయాలనే ఆలోచన ఇసుమంతైనా కనిపించడం లేదు. హైకోర్టు ఆదేశాలను కూడా తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అందుకే జగన్‌పై టీవీ సీరియల్స్ మాదిరిగా చార్జిషీట్లు వేస్తున్నారు. కస్టడీ పేరుతో రోజుకో చోటుకి మారుస్తూ.. అది ఎల్లో మీడియాకు లీక్ చేస్తున్నారు. జగన్‌ను డొక్కు వ్యానులో కోర్టుకు తరలించడం లాంటివి దేనికి సంకేతం..’’ అని ప్రశ్నించారు.

జేడీ పాత్రపై అనేక అనుమానాలున్నాయి..

సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న జేడీ లక్ష్మీనారాయణ పాత్రపై అనేక అనుమానాలున్నాయని గట్టు అన్నారు. ఒక వర్గం మీడియా ప్రతినిధులతోనే గంటల తరబడి సంభాషించడం, ఆ తర్వాత రోజు జగన్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం కావడాన్ని బట్టి చూస్తే ఆయన దర్యాప్తులో ఎంత చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతుందని పేర్కొన్నారు. 

‘‘ఈనాడు, ఈటీవీలను చూస్తే సెప్టెంబర్-డిసెంబర్ 2011 మధ్య జేడీ స్వయంగా 23 కాల్స్ చేశారు. 27 కాల్స్‌ను ఆన్సర్ చేశారు. 148 ఎస్‌ఎంఎస్‌లు స్వయంగా ఆయనే ఇచ్చారు. అదే విధంగా ఇద్దరు ఆంధ్రజ్యోతి రిపోర్టర్లకు స్వయంగా 4 కాల్స్ చేశారు. వాళ్లు ఫోన్ చేసినప్పుడు 23 కాల్స్ లిప్టు చేశారు. 68 ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చారు. అయితే సాక్షికి చెందిన ఇద్దరు రిపోర్టర్లకు జేడీ నుంచి ఒక్క ఔట్ గోయింగ్ కాల్ కూడా వెళ్లలేదు. వీళ్లిద్దరి నుంచి వెళ్లిన ఇన్‌కమింగ్ కాల్స్‌లో రెండింటిని మాత్రమే ఆయన లిప్టు చేశారు. ఈ ఇద్దరికీ కలిపి జేడీ 26 ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చారు. జేడీ ఇలా వివక్ష ప్రదర్శించడంలో మతలబు ఏంటి? అంతేకాదు.. దివంగత సీఎం వైఎస్సార్ హెలికాప్టర్ దుర్ఘటనకు సంబంధించిన దర్యాప్తును కూడా ఆగమేఘాల మీద ముగించింది ప్రస్తుత జేడీ లక్ష్మీనారాయణే కనుక మాకు మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ తిరిగి అధికారంలోకి వస్తే వైఎస్ మృతి వెనుక కుట్ర బయటపడుతుందనే ఉద్దేశంతోనే జేడీ ఈ విధంగా చేస్తున్నారా? అందుకే జగన్‌ను రాజకీయంగా ఏదో విధంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారా?’’ అని నిలదీశారు. సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరించిన జేడీ లక్ష్మీనారాయణపై సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, ప్రధానితో పాటు కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

చంద్రబాల ఎవరో మాకు తెలియదు..

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్ లిస్ట్‌లో వందల కాల్స్ ఉన్న వాసిరెడ్డి చంద్రబాల ఎవరో తెలుసుకోవడం కోసం పేరు బయటపెట్టినట్లు గట్టు తెలిపారు. ఆ ఫోన్ నంబర్ చుట్టూ నెలకొన్న వివాదాలనే తాము పేర్కొన్నామే తప్ప చెడుగా ఎక్కడా మాట్లాడలేదని వివరించారు. చంద్రబాల పురుషుడా... మహిళా... అన్న విషయం కూడా తమకు ముందుగా తెలియదని, జగన్‌పై కుట్రలు జరుగుతున్న దృష్ట్యా వాటిని బయటపెట్టడంలో భాగంగానే పేర్లను వెల్లడించినట్లు పేర్కొన్నారు. ‘‘జేడీ కాల్ లిస్టులో కొన్ని వందలసార్లు చంద్రబాల అనే పేరు గల వ్యక్తికి ఫోన్ వెళ్లడం, అక్కడి నుంచి జగన్ కేసుకు సంబంధించిన వారు... అంటే విదేశాల్లో ఉన్న డెలాయిట్ సంస్థ ప్రతినిధులకు కాల్స్ వెళ్లడం, జగన్‌కు వ్యతిరేకంగా నిత్యం విషప్రచారం సాగించే ఆంధ్రజ్యోతి ఎండీతో, ఒక పోలీస్ ఉన్నతాధికారితో తరచుగా సంభాషించడం పట్ల ఆ నంబర్ గల వ్యక్తిని బయటపెట్టాం’’ అని వివరించారు. 

చంద్రబాలను తెరపైకి తెచ్చి ఆమెకు మానవ సంబంధాలు, ఇతర అనవసర విషయాలను ఆపాదిస్తూ చెడుగా చిత్రీకరిస్తున్నది ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణనే అని అన్నారు. వివాదంలో ఉన్న వారిద్దరే సొంత డబ్బా ఉంది కదాని ఒకరికొకరు క్లీన్‌చిట్ ఇచ్చుకోవడం ఎంతవరకు సమంజసమని గట్టు ప్రశ్నించారు. చంద్రబాల చెబుతున్న సమాధానాలు పొంతనలేని విధంగా ఉన్నాయన్నారు. లీడ్ ఇండియా ప్రచారం కోసమే వారితో ఫోన్ సంభాషణలు జరిపానంటున్న ఆమె సమాధానానికి, లభించిన ఆధారాలకు పొంతనే లేదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాల.. లీడ్ ఇండియాకు యాహూ ద్వారా పంపిన ఈ మెయిల్‌ను గట్టు బయటపెట్టారు. లీడ్‌ఇండియా కార్యక్రమం నిర్వహిద్దామంటూ మార్చి 14న నిర్ణయిస్తే.. అంతకుముందే సెప్టెంబర్ నుంచే ఫోన్ సంభాషణలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

జేడీకి రాజకీయ పార్టీ ఫ్లెక్సీలు కట్టడమా?

రాష్ట్రంలో 18 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఒక రాజకీయ పార్టీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు ప్లెక్సీలు పెట్టగా, ఆయన వాటిపై పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడంలో ఉన్న అంతర్యమేమిటని గట్టు ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ రాధాకృష్ణ జర్నలిజం విలువలకు మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తన స్టింగ్ ఆపరేషన్ల కోసం తరచూ మహిళలను ఉపయోగించుకునే వ్యక్తి, వారికోసం పాటుపడుతున్నానని చెప్పడం విడ్డూరమన్నారు. చంద్రబాల అనే మహిళను స్టూడియోలో కూర్చోబెట్టి అవమానపరిచింది ఆయనేనన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చేత, ఆయన బినామీ పెట్టుబడులతో పత్రికను నిర్వహిస్తున్న రాధాకృష్ణ నీతులు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఆయన చరిత్ర ఏంటో.. ఎలా ఎదిగారో జర్నలిస్టు మిత్రులందరికీ తెలుసునన్నారు. ‘‘ప్రజలను అమ్ముడుపోయారని కించపరిచే విధంగా మాట్లాడటం సిగ్గుచేటు. నమ్ముకున్న వ్యక్తికి జనాలు ఓట్లు వేశారు. కానీ రాధాకృష్ణ మాత్రం తన సంస్థలో పెట్టుబడులు పెట్టిన వ్యక్తికి, ఆ పార్టీకి ఊడిగం చేస్తున్నారు’’ అని గట్టు మండిపడ్డారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!