YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 27 August 2012

ఫీజు పాపం సర్కారుదే!

ఫస్టియర్ విద్యార్థిపై నాలుగు రెట్ల భారం ఎందుకు?
ఇది ఏ సహజ న్యాయ సూత్రాల కిందకు వస్తుంది?
యాజమాన్యాలు భరించాల్సిన భారం విద్యార్థులపైనా!
నిలదీస్తున్న విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు
ప్రభుత్వం సరిగ్గా వాదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రభుత్వం నోటిఫై చేసిన ఇంజనీరింగ్ ఫీజుల విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్ల ఖర్చును లెక్కగట్టి ఫస్టియర్ విద్యార్థులపై భారం వేయడం ఏ సహజ న్యాయసూత్రాల కిందకి వస్తుందని పలువురు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, నిరుపేద విద్యార్థులు నిలదీస్తున్నారు. కళాశాలల యాజ మాన్యాలపై వేయాల్సిన భారం విద్యార్థులపై ఎందుకు వేస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్న. ప్రభుత్వం ఒకరకంగా విద్యార్థులను మోసపుచ్చుతోందని, దీనికంతటికీ సర్కారు నిర్లక్ష్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా ఒక ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభమైందనుకుందాం. అక్కడ ఫస్టియర్‌లో మాత్రమే అడ్మిషన్లు ఉం టాయి. రెండు, మూడు, నాలుగు సంవత్సరాలకు అడ్మిషన్లు ఉండవు. అలా అని అక్కడ చేరిన ఫస్టియర్ విద్యార్థి ద్వారానే కళాశాల నిర్వహణ ఖర్చులన్నీ వసూలు చేస్తారా? భవనాలకు ఇంత ఖర్చయింది. దీనికి ఇంత ఖర్చయింది. కానీ మా కళాశాలలో రెండు, మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులు లేరు కాబట్టి. మొత్తం ఫస్టియర్ విద్యార్థుల నుంచే వసూలు చేస్తాం.. అంటే న్యాయమేనా? ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫై చేసిన ఫీజుల విధానం ఇలాగే ఉంది. ఒక కళాశాలలో ప్రస్తుతం ఉన్న రూ. 31 వేల ఫీజుకు తోడు పెరగాల్సిన అదనపు ఫీజు రూ. 10 వేలు అనుకుందాం. కానీ ప్రస్తుతం ఫీజుల నిర్ధారణలో మాత్రం దానికి నాలుగు రెట్లు అంటే రూ.40 వేలు పెంచేశారు. ఇప్పుడు ఫస్టియర్‌లో చేరిన విద్యార్థి ఫీజు రూ.40 వేలు (అసలు ఫీజుకు అదనంగా) కట్టాలని, రెండో ఏడాదిలో (కొత్త విద్యార్థులు ఫస్టియర్‌లో చేరతారు కాబట్టి) రూ. 30 వేలు కట్టాలని, మూడో సంవత్సరంలో రూ.20 వేలు కట్టాలని, నాలుగో సంవత్సరంలో రూ.10 వేలు అదనంగా కడితే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అసలు రూ.10 వేలు కట్టాల్సిన చోట రూ.40 వేలు కట్టాల్సి రావడమే విద్యార్థులకు మింగుడుపడని ప్రశ్న. నిర్వహణ ఖర్చులు యాజమాన్యాలు మోయాల్సి ఉంటే.. ఈ భారం విద్యార్థులపై ఎందుకు వేస్తున్నారన్నది అంతుపట్టని విషయం. ఏటా ఫీజు భారం తగ్గుతుందని ప్రస్తుత ఫీజుల నిర్ధారణ జీవోలో ప్రభుత్వం చెప్పిందే తప్ప.. ఏ సంవత్సరంలో ఎంత తగ్గుతుందో చెప్పకపోవడం గమనార్హం. 

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..: మౌలిక వసతులు, బోధన ఖర్చులు లెక్కించి కోర్సు ఫీజు నిర్ధారించాలని గత ఏడాది అక్టోబర్ 29న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే కామన్ ఫీజు ఉండాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం.. ఖర్చులు లెక్కించేందుకు యంత్రాంగం లేదని వాదించిందే తప్ప అసలు శాస్త్రీయంగా లెక్కించని పక్షంలో విద్యార్థి నష్టపోతాడన్న వాదనను వినిపించలేదు. భారం యాజమాన్యాలే మోయాలని కూడా వాదించలేదు. దీంతో గత మే 9న సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీచేసింది. ఏఐసీటీఈ పేస్కేళ్లు అమలు చేస్తున్న కళాశాలల ఖర్చును లెక్కించి ఫీజు నిర్ధారించమని ఆదేశించింది. అయితే పెరిగిన భారం ఇదివరకే అడ్మిషన్లు తీసుకున్న పాత విద్యార్థులపై వేయరాదని సూచించింది. కొత్త విద్యార్థులపై భారం పడితే దాన్ని వచ్చే ఏడాది సర్దుబాటు చేయాలని సూచించింది. ఈనేపథ్యంలో అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ)కి 240 కళాశాలలు ఖర్చుల నివేదికలు సమర్పించాయి. వీటిలో 67 ఇంజనీరింగ్ కళాశాలలకు, 5 బీ-ఫార్మసీ కళాశాలలకు వేర్వేరు ఫీజులు ప్రతిపాదిస్తూ ఏఎఫ్‌ఆర్సీ ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఈ ఫీజులను యథాతథంగా నోటిఫై చేసిందే తప్ప.. ఫీజుల మదింపు ప్రక్రియ ఎలా జరిగిందన్న అంశాన్ని పట్టించుకోలేదు. కానీ జీవోలో మాత్రం టాస్క్‌ఫోర్స్ తనిఖీలకు లోబడి ఈ ఫీజులు వర్తిస్తాయని పేర్కొంది. పైగా ఫస్టియర్ విద్యార్థిపైనే ఈ భారం మోపుతూ ఫీజులు నోటిఫై చేసింది. యాజమాన్యాలకు మేలు చేస్తూ.. ఏకంగా నాలుగు రెట్ల భారాన్ని ఫస్టియర్ విద్యార్థులపైనే వేసింది. వాస్తవానికి ఒక ఏడాదికి అయ్యే ఖర్చును మాత్రమే లెక్కించి ఫస్టియర్ విద్యార్థులకు వేయాలి. కానీ నాలుగేళ్లకు అయ్యే ఖర్చును లెక్కించినందున నాలుగు సంవత్సరాల విద్యార్థులపై వేయాలి. పాత విద్యార్థులపై వేయడం న్యాయం కాదు కాబట్టి.. ఫస్టియర్ విద్యార్థి వరకు ఒక ఏడాది ఖర్చునే లెక్కించాలి. మిగిలిన భారం మొత్తాన్ని యాజమాన్యాలే భరించాలి. కానీ ప్రస్తుత ఫీజుల విధానం అందుకు విరుద్ధంగా ఉంది.

అలాగైతే సీటు నష్టపోవడమే..!: తొలిరోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ హాజరైన సింధూరకు ఎంసెట్‌లో 2 వేల ర్యాంకు వచ్చింది. తండ్రి ప్రైవేటు ఉద్యోగి. కుటుంబ వార్షిక ఆదాయం లక్షన్నర. ‘నాకు సీబీఐటీ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉంది. కానీ నేను అంత ఫీజు కట్టలేను. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నాకు అర్హత లేదు. రూ. 1,05,000 ఫీజు నేను చెల్లించలేను. రూ. 35 వేల ఫీజు ఉన్న కళాశాలలోనే చదవాలి..’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమైంది. కానీ ప్రభుత్వం విద్యార్థి కౌన్సెలింగ్‌లో ప్రవేశం పొందినప్పుడు రూ. 1,05,000గా ఫీజు చెప్పి.. తరువాత టాస్క్‌ఫోర్స్ తనిఖీల అనంతరం వీలైతే తగ్గిస్తామని అంటోంది. ఇంత భారీ ఫీజును చూసి విద్యార్థి ఆ కోర్సులో చేరకుండా.. సాధారణ కళాశాలలో రూ. 35 వేలకు చేరాడనుకుందాం. ఆ తరువాత టాస్క్‌ఫోర్స్ తనిఖీల అనంతరం రూ.1,05,000 గా నిర్ధారించిన ఫీజు రూ. 50,200లకు తగ్గితే.. సాధారణ కళాశాలలో చేరిన విద్యార్థి నష్టపోక తప్పదు? ఫీజు రూ. 50,200 అని ముందే తెలిస్తే ఆ కళాశాలలో చేరేవాడిని కదా? అని బాధ పడకతప్పదు. ఇది ఒక రకంగా ప్రభుత్వం విద్యార్థులను మోసం చేయడమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

విద్యార్థులకు తీరని ద్రోహం
కోర్టుల్లో సరైన వాదనలు వినిపించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. కోర్టుల్లో వాదనలకు కోట్లు ఖర్చు పెట్టినా.. విద్యార్థులకు న్యాయం చేయలేకపోయింది. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడే శాస్త్రీయంగా ఫీజుల లెక్కింపుపై జాగ్రత్తలు తీసుకోలేకపోయింది. క్షేత్రస్థాయి తనిఖీలు లేకుండా కేవలం కాగితాలపై ఖర్చు ఆధారంగా ఫీజులు లెక్కించడం ధర్మం కాదు. ఫీజులు చూసి పేద విద్యార్థులు అగ్రశ్రేణి కళాశాలల్లో చేరకుండా.. తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పాత ఫీజులనే నోటిఫై చేయాలి.
- డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, విద్యా నిపుణుడు

తరువాత తగ్గిస్తామనడం అన్యాయమే..
సమాజం అసమానతలతో కొట్టు మిట్టాడుతుంటే.. ప్రస్తుత ఫీజుల విధానం ఈ అసమానతలను ఇంకా పెంచి పోషించేలా ఉంది. ఉన్నోడు పెద్ద కళాశాలలో, లేనోడు చిన్న కళాశాలలో చేరాలని ప్రభుత్వమే చెబుతోంది. ఇదెక్కడి సామాజిక న్యాయం. ఫీజు రూ. లక్ష వరకు వెళ్లింది కాబట్టి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ. 3 లక్షల వరకు కుటుంబ ఆదాయం ఉన్న విద్యార్థులకు కూడా చెల్లించాలి. 
- కె.చంద్రమోహన్, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సంయుక్త కార్యదర్శి

న్యాయస్థానాన్ని ఆశ్రయించాం..
ఫీజుల మదింపు శాస్త్రీయంగా లేదని కోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశాం. ఎక్కడా లేని రీతిలో ప్రస్తుతం ఉన్న ఫీజుపై ఏకంగా 300 శాతం వరకు పెంచారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇంజినీరింగ్ చదవడానికి అర్హులు కారా? 
- రామకృష్ణ, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు

ప్రభుత్వ చేతగానితనం
ప్రభుత్వ చేతగానితనం వల్లే ఫీజులు అడ్డగోలుగా పెరిగాయి. ఫీజుల నిర్ధారణపై తొలి నుంచీ నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఫస్టియర్‌లో చేరిన విద్యార్థిపై నాలుగు రెట్ల భారం మోపడం ఏ విధంగానూ న్యాయం కాదు. నాలుగేళ్ల ఖర్చును లెక్క కట్టి ఆ భారం మొత్తాన్ని ఫస్టియర్ విద్యార్థిపైనే వేయడం సమంజసం కాదు.
-ఆంజనేయ గౌడ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!