YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 28 August 2012

‘కోత’లపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు

విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు
చిత్తూరు జిల్లా తవణంపల్లెలో కరెంటు ఆఫీసుకు తాళాలు 
ఖమ్మం జిల్లా చింతకానిలో అర్ధనగ్నప్రదర్శన


న్యూస్‌లైన్ నెట్‌వర్క్: ఎడాపెడా విద్యుత్‌కోతలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. అన్ని జిల్లాల్లోనూ నిరసనలు హోరెత్తాయి. సబ్‌స్టేషన్ల ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలతో వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కాయి. విశాఖజిల్లా పెదగంట్యాడ సబ్‌స్టేషన్‌వద్ద జరిగిన ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి ముందుచూపు లేకే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి మూడురోజుల పాటు జరిగే ఆందోళనలు, ఈనెల 31న నిర్వహించనున్న బంద్‌తోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందో లేదో చూడాలన్నారు. రంగారెడ్డి జిల్లాలో పార్టీ కార్యకర్తలు వికారాబాద్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. శంషాబాద్, శామీర్‌పేట విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట రాస్తారోకోలు, ధర్నా చేపట్టారు. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. 

పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడు ధర్మాన కృష్ణదాస్ పోలాకి, మందస, ఇచ్ఛాపురంలో జరిగిన ఆందోళనలకు నాయకత్వం వహించారు. అనంతపురం జిల్లాలో కంబదూరులో సబ్‌స్టేషన్ ఎదుట, మడకశిరలో ఏడీఈ కార్యాలయం ఎదుట మూడు గంటలసేపు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు ధర్నా చేశారు. యాడికిలో విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లో భారీ రాస్తారోకో జరిగింది. ఈ రాస్తారోకోలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. మధిర పట్టణంలోని ఆర్‌వీ కాంప్లెక్స్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. చింతకాని మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు స్టేజీ వద్ద కొవ్వొత్తులతో రాస్తారోకో నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో నారాయణవనం, చంద్రగిరి, కురబలకోట, ఐరాల, తవణంపల్లెలో సబ్‌స్టేషన్ల వద్ద వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, రైతులు ధర్నాలు చేశారు. తవణంపల్లెలో విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళన చేశారు.

పెన్‌పహాడ్‌లో ఉద్యోగుల నిర్బంధం

నల్లగొండ జిల్లాలో పెన్‌పహాడ్, చిట్యాల, రామన్నపేట, నా ర్కట్‌పల్లి, యాదగిరిగుట్ట, వేములపల్లి, దామరచర్ల, హుజూ ర్‌నగర్, దిర్శించర్ల, మల్లారెడ్డిగూడెం, దొండపాడు, మఠంపల్లి సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించా రు. పెన్‌పహాడ్‌లోని సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడిం చారు. ఉద్యోగులను కార్యాలయంలోనే నిర్బంధించి ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారంలో, కరీంనగర్ జిల్లా మంథనిలో విద్యుత్ ఉపకేంద్రాలను ముట్టడించారు. సిరిసిల్లలో అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. కృష్ణాజిల్లాలో పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో ధర్నాలు జరిగాయి. విజయవాడ వన్‌టౌన్‌లోని కాళేశ్వరరావు మార్కె ట్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో జరిగిన రాస్తారోకోలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాల్గొన్నారు. రెంటచింతలలో పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మకు దహన సంస్కారం చేశారు. మెదక్ జిల్లాలో మల్కాపూర్, నస్తీపూర్, నారాయణఖేడ్, ఇస్నాపూర్ సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు చేశారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనలు పోటెత్తాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!