YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 27 August 2012

సీబీఐ మానదు.. ఈనాడు మారదు

అదే అదనుగా పేజీలకొద్దీ కథనాలు వండేస్తున్న ఈనాడు, దాని తోకలు
‘సాక్షి’లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులపై ఇప్పటికీ అసత్య కథనాలే
ఆయన పెట్టుబడుల్లో 80 శాతం ‘వాన్‌పిక్’ సమయంతో సంబంధం లేనివే
రాక్‌తో ఒప్పందానికి ముందో, వైఎస్ మరణించాకో వచ్చినవే ఇవన్నీ 
ఆయన పెట్టుబడి 847 కోట్లలో నికరంగా మిగిలింది 230 కోట్లే
అందుకు గాను సాక్షిలో ఇప్పటికీ 18 శాతం వాటా
సాక్షి విలువ రూ.3 వేల కోట్లనుకున్నా ప్రసాద్ వాటా విలువ రూ.540 కోట్లు
ఈ లెక్కన ఆయనకు లాభం వచ్చినట్టా? నష్టం వచ్చినట్టా?
ఇప్పటికే లాభానికి భారతీ సిమెంట్స్‌లో వాటా విక్రయం
దానివల్ల ఆదాయపు పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ.62 కోట్లు
‘సాక్షి’లో ఒకేసారి కాక పత్రిక పనితీరు ఆధారంగా దఫదఫాలుగా పెట్టుబడి
భారతిలోనైనా, జగతిలోనైనా తెలివైన ఇన్వెస్టరుగానే ప్రసాద్ నిర్ణయాలు
‘టార్గెట్ జగన్’లో భాగంగా వాటికి దురుద్దేశాలు ఆపాదిస్తున్న దర్యాప్తు సంస్థ
ఎమ్మార్ నుంచి ఐఎంజీ దాకా చంద్రబాబు ఏం చేసినా కన్నెత్తి చూడని తీరు
రాంకీపై దర్యాప్తులో ఆయన పాత్ర బయటపడినా మౌనం వహించిన సీబీఐ
రాయితీల సంతర్పణలో తనకెవరూ పోటీ లేరని నిరూపించిన బాబు
వాన్‌పిక్ కోసం ఇప్పటికే రూ.870 కోట్లు ఖర్చుచేసిన రాక్, నిమ్మగడ్డ
13,200 మెగావాట్ల పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామంటూ ప్రతిపాదనలు
అలాంటి ప్రాజెక్టులు వస్తే ఈ కరెంటు కష్టాలకూ చెల్లుచీటీ
ప్రభుత్వ జాప్యంతో స్తంభించిపోయిన ప్రాజెక్టు; వెనక్కెళుతున్న సంస్థలు

వీళ్లింతే. సీబీఐ మానదు. ఈనాడు మారదు. బరితెగించడానికైనా, దిగజారిపోవటానికైనా ఒక హద్దుంటుందనే సంగతి మరిచిపోయి బహుశా! చాలాకాలమైపోయినట్లుంది!!. ఏడాది నుంచీ కావాల్సిన మీడియాకు లీకులిస్తూ... ఎఫ్‌ఐఆర్ నుంచీ వండుతున్న అంశాలనే... పది రోజుల కిందట నాలుగవ ఛార్జిషీటు రూపంలో సీబీఐ వార్చింది. ఇంకేం!... ‘ఈనాడు’కు, దాని తోకలకు మేత దొరికింది. ఛార్జిషీట్లోని అంశాలంటూ... సీబీఐ వర్గాలు చెప్పాయంటూ అవి మే(రా)స్తూనే వస్తున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున వేల ఎకరాల సంతర్పణ చేసిన చంద్రబాబును సీఈఓ అంటూ పొగిడేసిన ఈ పెన్నులు... ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్‌కు భూములివ్వటాన్ని మాత్రం రియల్ ఎస్టేట్‌కేనంటూ రాసేస్తున్నాయి.

హైదరాబాద్‌లో ఒక ఎయిర్‌పోర్టుకు 5,500 ఎకరాలు కేటాయించటాన్ని తప్పుబట్టని ఈ ఎల్లో కూటమి... రెండు పోర్టులు, రెండు విద్యుత్ ప్లాంట్లు, షిప్‌యార్డు, విమానాశ్రయం, పరిశ్రమల కారిడార్‌లకు కలిపి 18000 ఎకరాలు కేటాయించటం మహాపరాధంగా కనిపిస్తోంది. హైటెక్ సిటీ పక్కన రహేజాకు బాబు ఇచ్చిన వందెకరాలు ప్రకాశం జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాలకు సమానం అవుతాయనేది ఈ కూటమి చెప్పగలదా? ఎకరా రెండు కోట్లు పైగా విలువచేసే భూమిని ఐఎంజీ అనే జేబు కంపెనీకి రూ.50 వేల చొప్పున కేటాయించిన చంద్రబాబు లాంటి వ్యక్తి అసలెక్కడైనా ఉంటాడా? భారీ పెట్టుబడి పెట్టామని, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాలని సాక్షాత్తూ రాక్ ప్రభుత్వం నేరుగా లేఖలు రాస్తుంటే... రాక్ ప్రభుత్వం తరఫున వేరెవరో ఫోర్జరీ లేఖలు రాస్తున్నారంటున్న ఈ సీబీఐని ఏమనుకోవాలి? దాన్నే చిలవలు పలవలు జోడించి వండుతున్న ‘ఈనాడు’ను, దాని తోకల్ని ఇంకేమనుకోవాలి? వీళ్లిక మారరా?!!

ఈ ఇన్వెస్ట్‌మెంట్ ‘క్విడ్ ప్రో కో’నా?

చిన్న పిల్లాడికి సైతం అర్థమయ్యే లెక్కలు సీబీఐకి ఎందుకు అర్థం కావటం లేదు? దానికి తోచిందేదో చెబితే... దాన్నే ‘ఈనాడు’, దాని తోకలు ప్రచురిస్తుండటం చూస్తే అసలు కుట్ర ఎక్కడ దాగి ఉందో తెలియటం లేదా? జగన్‌మోహన్ రెడ్డి సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులకు సంబంధించి సీబీఐ చేస్తున్న వాదన నిజమైనదేనా? ఆయన పెట్టుబడెంత? ఇదంతా వాన్‌పిక్ ప్రాజెక్టును రస్ అల్ ఖైమా ప్రభుత్వానికి అప్పగించాకే పెట్టారా? లేక ముందే పెట్టారా? అలాగైతే క్విడ్ ప్రో కో ఎందుకవుతుంది? అసలు ప్రసాద్ పెట్టుబడికి గాను ఆయనకు జగన్‌మోహన్ రెడ్డి సంస్థల్లో ఏం దక్కింది? ఒక్కసారి మీరే చూడండి...

వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం రాక్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది 2008 మార్చి 11న. రాక్ సీఈఓ ఖతర్ మసాద్ స్వయంగా వచ్చి ఎంఓయూపై సంతకాలు చేశారు. కానీ జగన్ సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడులు మొదలైంది మాత్రం 2006 డిసెంబర్లో. అంటే 14 నెలల ముందే. మరి దీన్నేమంటారు?

2006 నుంచి 2010 ఏప్రిల్ వరకూ జగన్ సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడులు కొనసాగుతూ వచ్చాయి. 2009 సెప్టెంబర్లో హెలికాప్టర్ దుర్ఘటనలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. రోశయ్య సీఎం అయ్యారు. వైఎస్సార్ పదవిలో కాదు కదా... జీవించి కూడా లేకున్నా జగన్ సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడుల్ని కొనసాగించారు. ప్రసాద్ పెట్టుబడుల్లో వైఎస్సార్ మరణించాక పెట్టినవే ఎక్కువ. ఆయన ఏం ఆశించి పెట్టారంటారు? దీన్ని క్విడ్ ప్రో కో అంటారా? అలా అని సీబీఐ చేస్తున్న వాదనకు అర్థమేమైనా ఉందా?

జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ సహా జగన్‌మోహన్ రెడ్డి సంస్థల్లో ప్రసాద్ మొత్తం పెట్టుబడి 847 కోట్లు. దీన్లో 2008 మార్చి - 2009 సెప్టెంబర్ మధ్య... అంటే వాన్‌పిక్ కోసం ఒప్పందం కుదిరిన నాటి నుంచి వైఎస్సార్ మరణించే వరకూ పెట్టిన పెట్టుబడి 172 కోట్లు. అంటే 20 శాతం. ఇందులో జగతి పబ్లికేషన్స్‌లో పెట్టింది రూ.30 కోట్లు కాగా... భారతి సిమెంట్స్‌లో 105 కోట్లు, సిలికాన్ బిల్డర్స్‌లో 37 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంటే మొత్తం పెట్టుబడుల్లో 80 శాతం వరకూ రాక్‌తో ఒప్పందం కుదరక ముందో... వైఎస్సార్ మరణించాకో వచ్చినవే. మరి వాన్‌పిక్ ప్రాజెక్టును పొందినందుకు ‘క్విడ్ ప్రో కో’గానే నిమ్మగడ్డ ప్రసాద్ ఈ పెట్టుబడి పెట్టారనటం ఏ మేరకు కరెక్టు?

ఒక్క జగతి పబ్లికేషన్స్‌నే తీసుకుంటే దీన్లో పెట్టుబడి పెట్టిన రూ.450 కోట్లలో రూ.30 కోట్లు మాత్రమే ఆయన 2008 మార్చి-2009 సెప్టెంబరు మధ్య పెట్టారు. అంటే 6 శాతం. మిగిలిన 94 శాతం అటు రాక్‌తో ఒప్పందం కుదరక ముందో లేక వైఎస్సార్ మరణించాకో పెట్టినవే. వీటన్నిటినీ క్విడ్ ప్రో కో అంటోందంటేనే సీబీఐ కుట్ర అర్థంకాక మానదు.

నికర పెట్టుబడి రూ.230 కోట్లే...

ఇప్పటికీ నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు 847 కోట్లని, దాన్లో కొంత వెనక్కి తీసుకున్నా ఇంకా రూ.530 కోట్లు మిగిలే ఉన్నాయని అడ్డగోలుగా వాదిస్తున్న సీబీఐ... కావాలనే నిజం చెప్పటం లేదు. ఎందుకంటే భారతి సిమెంట్స్‌లో వాటా విక్రయించినపుడు ప్రసాద్‌కు లాభం వచ్చిందని బయటపెట్టడం దానికిష్టం లేదు. బయటపెడితే... క్విడ్ ప్రో కోలకు లాభాలొస్తాయా? అనే ప్రశ్న తలెత్తుతుంది కాబట్టి.

నిజమే! ప్రసాద్ మొత్తం పెట్టుబడి రూ.847 కోట్లు. కానీ 2009లో భారతి సిమెంట్స్‌లోను, సిలికాన్ బిల్డర్స్‌లోను తనకున్న వాటాను విక్రయించారాయన. ఇలా విక్రయించినపుడు రూ.617 కోట్లు ఆయన చేతికి వచ్చాయి. మరి మిగిలినదెంత? 230 కోట్లే కదా! నికరంగా ఆయన పెట్టుబడి ఇదే కదా! ఈ పెట్టుబడికి ప్రతిఫలంగా ఇపుడు జగతి పబ్లికేషన్స్‌లో ఆయనకు 18 శాతం వాటా ఉంది. పత్రికకు ప్రాణం లాంటి సర్క్యులేషన్లో ‘ఈనాడు’కు ఏమాత్రం తీసిపోని సాక్షి... ప్రజాదరణలోను ‘ఈనాడు’ కన్నా మెరుగ్గా ముందుకెళుతూ దేశంలోనే 8వ స్థానంలో ఉన్న సాక్షి... ‘ఈనాడు’ వాల్యుయేషన్లో సగం వేసినా రూ.3000 కోట్లు చేస్తుంది కదా! దాన్లో 18 శాతం అంటే... దాదాపు రూ.540 కోట్ల వాటా ‘సాక్షి’లో ప్రసాద్‌కు ఉన్నట్టే కదా? ఆయన పెట్టుబడికి తగిన లాభం వచ్చినట్లే కదా? ఆయన ఎక్కడ నష్టపోయినట్లు? దీన్ని క్విడ్ ప్రో కో అంటారా? ఇది సీబీఐకి తెలియదా? ఎవరో కొందరిని సంతృప్తి పరచటం కోసం సీబీఐ ఈ అడ్డగోలు వాదనల్ని చేస్తోందని, తన ఎజెండా కూడా అదే కనక ‘ఈనాడు’ దానికి తన దిగజారుడు రాతల్ని జోడించి ప్రచురిస్తోందని అర్థం కానిదెవరికి? 

ప్రసాదేమీ ఒకేసారి ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టేయలేదు. మొదట నామమాత్రపు పెట్టుబడి పెట్టారు. ‘సాక్షి’ ఒక పత్రికగా తనను తాను రుజువు చేసుకున్నాక, అత్యధిక సర్క్యులేషన్, పాఠకాదరణ సొంతం చేసుకున్నాక... మెరుగైన ఆదాయం సాధించాక మాత్రమే ఆయన మరింత పెట్టుబడి పెట్టారు. పెపైచ్చు మొదట్లో ఏ రేటుకైతే షేర్లు కొన్నారో... తరవాతా అదే రేటుకు కొన్నారు. ఇదంతా చూస్తే ఇతర ఇన్వెస్ట్‌మెంట్లలానే దీన్నీ భావించారని తెలియటం లేదా?

మళ్లీ 51 శాతానికి చేరుతున్న రాక్ వాటా...

వాన్‌పిక్‌లో పోర్టుల నిర్మాణాన్ని ఎన్‌ఈసీకి అప్పగించారు. అయితే నిర్మించినందుకు నగదు బదులు ఈక్విటీ ఇవ్వాలని ఆ సంస్థ కోరటంతో ఇచ్చారు. దీంతో పోర్టులకు సంబంధించిన సంస్థలో రాక్ వాటా 26.5 శాతానికి తగ్గింది. కానీ రాక్‌కు 51 శాతం వాటా ఉండాలన్న ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఎన్‌ఈసీ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని ఎన్‌ఈసీ స్వయంగా సీబీఐకి చెప్పింది. రాక్ కూడా తనకు 51 శాతం వాటా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. రాక్ పాలకుడు స్వయంగా ప్రధానికి లేఖ రాశారు కూడా. మరి ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ సర్దుబాట్లన్నీ జరుగుతున్నపుడు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సర్కారుపై లేదా?

వాన్‌పిక్ తప్పేంటి?

రెండు పోర్టులు, ఒక ఎయిర్‌పోర్టు, షిప్‌యార్డు, విద్యుత్ ప్లాంట్లు, పారిశ్రామిక కారిడార్‌తో కూడినదే వాన్‌పిక్. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది రాక్ ప్రభుత్వంతో. ఈ రాక్ ప్రభుత్వం వైఎస్సార్ హయాంలో పుట్టుకొచ్చిందేమీ కాదు. బాబు హయాంలో వచ్చి, ఇక్కడ రాక్ సిరామిక్స్‌ను ఏర్పాటు చేసింది కూడా. మరి రెండు ప్రభుత్వాల మధ్య (జీ2జీ) ఒప్పందం కుదరటం తప్పా? ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా రూ.870 కోట్లు ఖర్చు చేసిన వాన్‌పిక్ యాజమాన్యం... 1,3000 ఎకరాల భూమి సేకరించింది. 

ఇటీవల ప్రధాని మన్మోహన్‌కు రాసిన లేఖలో రాక్ ఈ విషయం చెప్పింది కూడా. ఇదే విషయాన్ని సీబీఐకీ తెలియజేసింది. అయినా సరే...! రాక్ ప్రభుత్వానికి దీన్లో పాత్ర ఉండకపోవచ్చునని... ఇవన్నీ ఫోర్జరీ లేఖలు కావచ్చునని సీబీఐ వాదిస్తుండటాన్ని ఏమనుకోవాలి? 2008లో ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నపుడు గానీ, ఇటీవల సీబీఐ పిలిచినపుడుగానీ, ఆ తరవాత నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసినపుడు గానీ రాక్ సీఈఓ ఖతర్ మసాద్ నేరుగా వచ్చారుగా? నేరుగా వచ్చి, తామే ఇన్వెస్ట్ చేశామంటున్నపుడు... వారి సంతకాల్ని ఫోర్జరీ చేసి ఉండొచ్చని సీబీఐ వాదిస్తుండటాన్ని ఏమనాలి? దీనికి నిజాయితీ ఉందా?
రాక్‌కు భారత భాగస్వామిగా వచ్చిన నిమ్మగడ్డ ప్రసాద్ ఏమీ అనామకుడు కారు. అప్పటికే చాలా విజయవంతమైన పారిశ్రామికవేత్తగా పేరొందారు. 

ఫార్మాలో అంతర్జాతీయ ఖ్యాతి సాధించారు. ప్రపంచంలో3వ స్థానంలో ఉన్న మైలాన్ ల్యాబొరేటరీస్‌లో డెరైక్టరు కూడా. మ్యాట్రిక్స్ నుంచి బయటకొచ్చాక వివిధ మీడియా, హెల్త్‌కేర్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి... తనవి తెలివైన నిర్ణయాలని నిరూపించుకున్నారు.అందుకే ఆయన్ను ఎంచుకున్నట్లు రాక్ చెప్పింది. పోర్టులు అభివృద్ధి చేయటంలో ఆయనకు అనుభవం లేదని సీబీఐ భూతద్దంలో చూపిస్తోంది. మరి చంద్రబాబు హైదరాబాద్ విమానాశ్రయాన్ని కట్టబెట్టినపుడు జీఎంఆర్‌కు అలాంటి అనుభవం ఉందా? విశాఖలో ఫార్మాసిటీని అనుమతించినపుడు రాంకీకి అలాంటి అనుభవం ఉందా? ఇవి సీబీఐకి తెలియవా? తెలిసి కూడా ప్రసాద్‌ను రాక్ భాగస్వామిగా చేర్చుకోవటాన్ని ఎందుకు తప్పుబడుతోంది?

వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ సంస్థను 2008 జనవరిలోనే ఏర్పాటు చేశారని, అప్పట్లో తన కంపెనీ ముఖ్యులతో సమావేశమైనపుడు... ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మించాలనుకుంటున్నాని, రాక్ యువరాజు తనకు తెలుసని వారితో చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్లో పేర్కొంది. మరి రాక్ పాలకుడు ప్రసాద్‌కు ముందే తెలుసని సీబీఐ అంగీకరించినట్లేగా? తనకు తెలిసిన ప్రసాద్‌ను రాక్ పాలకుడు స్థానిక భాగస్వామిగా తెచ్చుకున్నట్లేగా? మరి రాక్ ముసుగులో ప్రసాద్ తెరపైకి వచ్చారని సీబీఐ చేస్తున్న వాదనలో నిజమెంత?

వాన్‌పిక్ పోర్ట్స్‌తో ఒప్పందం చేసుకుని వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు భూమి కేటాయించారని చేస్తున్న వాదనా ఇలాంటిదే. ‘‘ప్రాజెక్టులో పోర్టులు, కారిడార్, విద్యుత్ ప్లాంట్లు ఇలా చాలా ఉంటాయి కనక వాటికోసం విభిన్న కంపెనీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకనే తొలి రిజిస్ట్రేషన్‌తో పాటు మలి రిజిస్ట్రేషన్ ఛార్జీల్నీ మినహాయించాలి’’ అని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాంటపుడు వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు కేటాయిస్తే తప్పేంటి? ఇదేమైనా కేబినెట్ నిర్ణయానికి విరుద్ధమా? ఎందుకిలా?

వాన్‌పిక్‌లో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి స్యూ, కోస్టల్ సిరోహి సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. 660 మెగావాట్ల చొప్పున రెండు పవర్ ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తామన్నాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల నుంచి ప్రాథమిక అనుమతులు కూడా తెచ్చుకున్నాయి. ఆ ప్రాజెక్టులొస్తే పోర్టుకు కార్గో రాదా? వాటితో ప్రభుత్వానికే ఆదాయం కదా? అలాంటి పవర్ ప్లాంట్లు వస్తే ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలుంటాయా? ఎల్లో కూటమికి, ప్రభుత్వానికి వీటన్నిటినీ వ్యతిరేకించాలన్న ఆసక్తి మాత్రమే ఉండొచ్చు. మరి ఆలోచించే శక్తి సీబీఐకి లేదా?

ప్రభుత్వం నష్టపోయిందెక్కడ?

వాన్‌పిక్‌కోసం ఇప్పటిదాకా సేకరించిన భూములు 13000 ఎకరాలు. దీన్లో ప్రభుత్వ భూమి 173 ఎకరాలు. దీన్ని కూడా ప్రభుత్వానికి డబ్బులు చెల్లించే తీసుకున్నారు. పట్టా భూమి 1500 ఎకరాలు కాగా... మిగిలిన 11,300 ఎకరాలూ అసైన్డ్ స్థలాలే. వీటికి స్టాంపు డ్యూటీ మినహాయించారని రాద్ధాంతం చేస్తున్న సీబీఐ... ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకూ రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని మినహాయిస్తారని, అది ప్రభుత్వ విధానమని పేర్కొనకపోవటమే విచిత్రం. పెపైచ్చు ఈ భూముల్లో అసైన్డ్, ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్ ఉండదు కనక దానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు ఉన్నా వర్తించదు. కానీ భూ బదలాయింపు ఛార్జీల కింద వాటి విలువలో 10 శాతాన్ని చెల్లించాలి. దీనికింద వాన్‌పిక్ ఇప్పటికే రూ.14 కోట్లను ప్రభుత్వానికి మినహాయింపు లభించిందల్లా కేవలం 1,500 ఎకరాల పట్టా భూములకు. అక్కడి విలువ ప్రకారం చూసుకుంటే వాన్‌పిక్‌కు స్టాంపు డ్యూటీ మినహాయింపు వల్ల కలిగిన లబ్ధి రూ.1.3 కోట్లు. మరి దీన్ని భూతద్దంలో ఎందుకు చూపిస్తున్నారన్నది సీబీఐకే తెలియాలి. 

వాన్‌పిక్ ఈ భూముల కోసం రూ.150 కోట్లు చెల్లించిందని, కానీ రూ.450 కోట్లు ఖర్చు చేసినట్లు చూపిస్తోందని సీబీఐ చెబుతోంది. ఇలా చేస్తే ఎవరికైనా నష్టమా? పోనీ వాన్‌పిక్‌కేమైనా లాభమా? నిజానికి అసైన్డ్ స్థలాలు అప్పటికే రెండు మూడు చేతులు మారి ఉన్నాయని, అందుకే తాము వాళ్లందరికీ ఎంతోకొంత సర్దుబాటు చేసి కొనుగోలు చేయాల్సి వచ్చిందని వాన్‌పిక్ చెబుతోంది. ఇదంతా రికార్డుల్లో చూపించలేం కనక అసైనీకి చెల్లించింది చూపించి, మిగతా మొత్తాన్ని లెక్కల్లో చూపిస్తున్నామని తెలియజేసింది. ప్రభుత్వానికి దీన్లో ఏమైనా సందేహం ఉంటే రికార్డుల్లో ఉన్న రైతుల్ని విచారించి నేరుగా తెలుసుకోవచ్చుగా? ఎవరికెంత ముట్టిందో తెలుసుకోవటం అంత కష్టమా? ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం తెలుసుకోలేదా?

స్టాంపు డ్యూటీ మినహాయించారు కనక అక్కడ భూముల కోసం రూ.150 కోట్లు చెల్లించినా, రూ.450 కోట్లు చెల్లించినా ప్రభుత్వం మోసపోవటమనే ప్రశ్నే ఉండదు. పోనీ లీజులో వాన్‌పిక్‌కు ఏమైనా లబ్ధి కలుగుతుందా అంటే.. అదీ లేదు. ఎందుకంటే ఈ భూములకు చెల్లించిన మొత్తాన్ని లీజు ఛార్జీల్లో 23 ఏళ్ల పాటు మినహాయించుకునే అవకాశం వాన్‌పిక్‌కు ఉంటుంది. అది మొదట 2 శాతంగా... ఏటా 6 శాతం చొప్పున పెరిగేట్లుగా నిర్ణయించారు. దీనిప్రకారం తొలి ఏడాది తాను చెల్లించుకున్న మొత్తంలో 2 శాతాన్ని మినహాయించుకునే వాన్‌పిక్... మరసటేడాది 6 శాతం అధికంగా... అంటే 2.12 శాతాన్ని, తరువాతి ఏడాది 2.6 శాతాన్ని మినహాయించుకుంటుంది. ఇలా 23 ఏళ్లలో 100 శాతాన్ని మినహాయించుకుంటుంది. మరి ఇలా మినహాయించుకునేటపుడు అది 150 కోట్లయినా, 450 కోట్లయినా... ఆఖరికి వెయ్యి కోట్లయినా ఒకటే కదా? ఈ మాత్రం సీబీఐకి తెలియదనుకోవాలా?

అది షేర్ హోల్డర్ల ఇష్టం కాదా?

వాన్‌పిక్‌లో ప్రభుత్వ ధనం పైసా లేదు. ప్రభుత్వం నష్టపోయిందీ లేదు. ప్రాజెక్టు అమలుకు ప్రసాద్‌ను భాగస్వామిగా ఎంచుకున్నాక ఆ కంపెనీలో రాక్ ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. అపుడది ఆ ఇద్దరికీ సంబంధించిన వ్యవహారం. ఏ కంపెనీకైనా నిధులొచ్చేది షేర్ల విక్రయం ద్వారానే. లేదంటే రుణాల ద్వారా. షేర్ల విక్రయం ద్వారా వచ్చిన షేర్ అప్లికేషన్ మనీని పూర్తిగా పెట్టుబడిగా పెడతారా... లేక మధ్యలోనే కొంత విత్ డ్రా చేసుకుంటారా అన్నది ఆ కంపెనీ యజమానుల ఇష్టం. తమకేమైనా నష్టం జరిగిందని భావిస్తే ఫిర్యాదు చేయాల్సింది వాటాదారు తప్ప సీబీఐనో... రాష్ట్ర ప్రభుత్వమో కాదు. వాన్‌పిక్ విషయంలో ఇప్పటిదాకా రూ.870 కోట్లను ఈక్విటీగా తెచ్చారన్నది స్పష్టం. దాన్ని పెట్టుబడిగా పెట్టారన్నదీ నిజం. ఇక భూ వినియోగానికొస్తే దాన్ని పోర్టులకోసం కార్గోను తెచ్చే కంపెనీలకివ్వాలన్నది ఒప్పందంలోనే ఉంది. మరి అలా చేసినపుడు దాన్ని రియల్ ఎస్టేట్‌కు వాడుతున్నారని సీబీఐ చెప్పటం ఏ రకమైన వాదన? అసలు ప్రకాశం జిల్లాలో మారుమూల భూముల్ని రియల్ ఎస్టేట్‌కు వాడే అవకాశం ఉందా?

రాయితీల కుప్ప చంద్రబాబు...

ఈ రాష్ట్రానికి పేరు కూడా తెలియని దేశాల్ని పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు. భూముల పందేరంలో, రాయితీల సంతర్పణలో ఆయనతో పోటీ పడటం ఎవరికైనా అసాధ్యమే. అలాంటి బాబువైపు... ఎమ్మార్ స్కామ్‌ను దర్యాప్తు చేసేటపుడు గానీ... విశాఖలో రాంకీకి భూముల్ని కట్టబెట్టడాన్ని విచారించినపుడుగానీ సీబీఐ చూడనే లేదు. వై.ఎస్.విజయమ్మ వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై రాష్ట్ర హైకోర్టు తొలుత దర్యాప్తునకు ఆదేశించినపుడు కూడా సీబీఐ ముందుకు కదలనే లేదు. నిష్పాక్షికంగా ఉండాల్సిన దర్యాప్తు సంస్థ తనకెవరో చెప్పినట్లు... బాబు తనకు బాగా కావాల్సిన వారన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తోంది? జగన్‌మోహన్ రెడ్డి విషయానికొచ్చేసరికి ప్రతి విషయాన్నీ తప్పుబడుతూ వేధించాలని చూస్తోందెందుకు? 

ఏం! వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులు రావటమే తప్పా? దేశంలో గుజరాత్ మొదలుకొని తమిళనాడు వరకూ పాటిస్తున్న నియమాలే ఇక్కడ కూడా పాటించారు కదా? వాన్‌పిక్‌కు భూముల కేటాయింపుతో సహా ప్రతి అంశంపైనా కేబినెట్లో చర్చించాకే జీవోలు విడుదల చేశారు కదా? ప్రతి అంశానికీ కేబినెట్ ఆమోదం ఉంది కదా? మరి సీబీఐ ఎందుకు తప్పుబడుతోంది? అసలు కేబినెట్ నిర్ణయాలు తప్పో ఒప్పో చెప్పే అధికారం సీబీఐకి ఉందా? ఈ బాబు బాగోతాలు దానికెందుకు కనిపించటం లేదు?

ఎయిర్‌పోర్ట్: హెదరాబాద్‌లో విమానాశ్రయానికి 5,500 ఎకరాలు కేటాయించారు. వడ్డీ లేకుండా రూ.315 కోట్ల రుణమిచ్చారు. అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్ గ్రాంట్‌గా ప్రభుత్వానికి తిరిగిరాని విధంగా రూ.107 కోట్లిచ్చారు. ఇవన్నీ చాలవన్నట్లు... మొదటి తొమ్మిదిన్నరేళ్లూ లీజు ఛార్జీలు చెల్లించకుండా మినహాయింపులిచ్చారు. భూమ్మీద ఏ కంపెనీకైనా ఎవరైనా ఇలా ఇచ్చారా? దీంతో పోల్చినపుడు అసలు వాన్‌పిక్‌కు రాయితీలిచ్చినట్టా?

గంగవరం పోర్ట్: విశాఖలోని గాజువాకలో ఎకరా రూ.50 లక్షల వరకూ విలువ చేసే భూములు 2,800 ఎకరాల్ని ఈ పోర్టు కోసం బాబు అప్పగించారు. ఇందులో 1400 ఎకరాలు ప్రభుత్వ భూములు కాగా... మిగిలిన 1400 ఎకరాలూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌వి. దాన్నుంచి తీసుకుని మరీ ఎకరా కేవలం రూ.2.86 లక్షలకిచ్చేశారు. ఇంత చౌకగా భూములెక్కడైనా ఇచ్చారా? వాన్‌పిక్‌కు కేటాయించినవి అసలు ప్రభుత్వ భూములే కాదుగా? వాన్‌పిక్ సొంతగా సగటున ఎకరాకు రూ.4 లక్షలు చెల్లించి వాటిని కొనటం అబద్ధమా?

రాంకీ ఫార్మా సిటీ: ఈ ప్రాజెక్టుకు ఐడియా నుంచి కొబ్బరికాయ కొట్టడం వరకు అంతా బాబు చలవే. టెండర్లు పిలిచి... కంపెనీలు వెనక్కి వెళ్లిపోవటంతో చివరకు తాను ఈ ప్రాజెక్టు చేపడతానని ప్రతిపాదించిన రాంకీకి పోటీ లేకుండా భూముల్ని కట్టబెట్టిందీ బాబే. ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉంటూ హడావుడిగా ఎంఓయూ చేసుకుని... 24 గంటలు తిరక్కముందే 2,146 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించిందీ ఆయనే. అప్పటిదాకా అలాంటి ప్రాజెక్టు చేపట్టిన అనుభవం కూడా రాంకీకి లేదు. మరి ఇన్ని చేసిన బాబును వదిలేసి... రాంకీకి గ్రీన్‌బెల్ట్‌లో మినహాయింపులిచ్చారని చెబుతూ వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిపై కేసు పెట్టడాన్ని ఏమంటారు? సీబీఐ దీన్నెలా సమర్థించుకుంటుంది? 

కాకినాడ పోర్టు: సజావుగా నడుస్తున్న కాకినాడ పోర్టును తన సన్నిహితుడైన మలేసియా మాజీ ప్రధాని మహతిర్ మహ్మద్ తనయుడికి కట్టబెట్టి ప్రైవేటీకరణకు టెంకాయ కొట్టింది బాబు కాదా? నర మానవుడెవ్వరూ ఇవ్వని రాయితీల్ని ఈ సంస్థకు నారా వారివ్వలేదా? విస్తరణకు నిధుల్లేవనే సాకుతో ప్రభుత్వ పోర్టును ప్రైవేటీకరించి, ఆ ప్రైవేటు సంస్థ విస్తరణ చేపట్టకపోయినా నోరు మెదపలేదు బాబు. ఈ పోర్టుపై వచ్చిన లాభాలతో, దీన్ని తనఖా పెట్టి తీసుకున్న రుణాలతో విస్తరణ చేపట్టిన మలేసియా సంస్థకు.. రకరకాల రాయితీలిచ్చి, ఆఖరికి ఈ సంస్థలో తన టీడీపీ సహచరులకు కూడా వాటా ఇప్పించిన బడా చరిత బాబుదే.

చెప్పుకుంటూ పోతే బాబు జాబితాకు అంతుండదు. 5,800 ఎకరాలిచ్చిన కృష్ణపట్నం పోర్టు, హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత విలువైన 100 ఎకరాల్ని కొల్లగొట్టి రాష్ట్రానికి 11 శాతం వాటా ఇచ్చిన రహేజా... 513 ఎకరాల స్థలాన్ని టెండర్లు లేకుండా చేజిక్కించుకున్న ఎమ్మార్... ఇవన్నీ బాబు కుంభకోణాలకు నిలువెత్తు సాక్ష్యాలు. ఐఎంజీ భారత అంటూ డమ్మీ కంపెనీల్ని సృష్టించి... అత్యంత విలువైన 950 ఎకరాల్ని ఎకరా రూ.50 వేల చొప్పున కట్టబెడుతూ ఒప్పందం చేసుకున్నదీ ఈ బాబే. ఇంత పెద్ద స్కామ్‌పై విచారించమంటే... సిబ్బంది కొరత ఉందని, దర్యాప్తు చేయలేమని బదులిచ్చిందీ ఈ సీబీఐనే. ఎమ్మార్‌లో అవకతవకలు జరిగాయంటున్న సీబీఐ... బాధ్యుడైన బాబును మాత్రం పిలవ లేదు. అదే ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం కూడా. 

ఈ ప్రభుత్వమూ తక్కువ తినలేదు...

చంద్రబాబును కాసేపు పక్కనపెడదాం. వైఎస్సార్ తరవాత వచ్చిన సీఎంలూ అదే చేస్తున్నారు. అసలు ఒక ప్రభుత్వం ఒక కంపెనీకి రాయితీలివ్వటం తప్పు... అని చెబుతున్న వ్యవహారం బహుశా... ఇదే మొదటిది కావచ్చు కూడా.

మొన్నటికి మొన్న ప్రిజమ్ సిమెంట్స్ సంస్థకు రాష్ట్రంలో 1,000 ఎకరాల్ని కేటాయిస్తూ కిరణ్ కుమార్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

మచిలీపట్నం పోర్టు కోసం నవయుగ ఇంజినీరింగ్‌కు ఇటీవలే 5,324 ఎకరాల భూమిని కేటాయించారు. రూ.355 కోట్ల ఆర్థిక సాయం చేయాలని కూడా ప్రతిపాదించారు. మిగిలిన పోర్టుల మాదిరిగా రాయితీలు షరా మామూలే.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!