YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 2 June 2012

అ‘న్యాయ’స్వామ్యం!

కోర్టులను రాజకీయం కోసం వేదికలుగా వాడుకోవడం ఆది నుంచీ ఉన్నదే. ఒంటబట్టిన అలవాటే. అలా మొదలైన ప్రహసనం అక్కడితో ఆగి పోలేదు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. ఇవాళ కాకపోతే రేపు జగన్ ప్రజల్లో గెలిస్తే, ప్రజల ముందు న్యాయస్థానం దోషి కాకూడదు. ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని ప్రజలు ఎంచుకోవాలి. కోర్టులు కాదు.

ఈ దేశంలో రాజకీయ నాయకులు చట్టం అంటూ ఒకటి ఉందన్న సంగతి మర్చిపోయారు. వాళ్లకు తెలిసినంత వరకూ ప్రతిదీ రాజకీయమే. అసెంబ్లీ, పార్లమెంటు కూడా వాళ్లకి స్వ-రాజకీయ వేదికలుగా కనిపిస్తాయి. అధికారపక్షంవాళ్లు అపోజిషన్ వాళ్ల నోరుమూయించడానికి, అలాగే ప్రతిపక్షం వాళ్లు అధికారపక్షాన్ని అల్లరి పెట్టడానికి పార్లమెంటు, అసెంబ్లీలను ఉపయోగించుకుంటున్నారు.పార్లమెంటు, అసెంబ్లీలను చూసిన వాళ్లకి కుస్తీ పోటీలు జరిగే బరి గుర్తొస్తుంది. కాకపోతే కుస్తీ పోటీల్లో కండలు చూపించి, జబ్బలు చరిచి ఒకరి మీద ఒకరు కలబడిపోయి కొట్టుకుంటారు. అదే రాజకీయ వేదికల మీద అధికార, ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు తిట్టుకుంటారు. తిట్టుకోవడమూ, కొట్టుకోవడమూ, కాట్లాడుకోవడమూ పొలిటీషియన్స్ పేటెంటేమోననుకుని వీధి కుక్కలు కూడా కొట్లాడుకోవడం మానేశాయి.

దీంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే ప్రజలకి రోతపుట్టింది. అధికారపక్షం, అపోజిషన్ లేకుండా చేసుకోవాలంటే వాళ్లని బోనెక్కించి దోషిగా నిలబెట్టాలనుకొన్నారు. ప్రతిపక్షం వారు నోరు చేసుకొని అధికారపక్షం మీద అభాండాలు వేసి అందర్నీ నమ్మించజూస్తున్నారు. వాళ్లు నోరు చేసుకున్నందుకు వాళ్ల మీద పోలీసులు చెయ్యి చేసుకొని, లాఠీలు చేసుకుని చివరాఖరికి చట్టం ప్రకారం జైలుకు తోలేసేలా చూడాలని కోర్టులని వేడుకున్నారు.కోర్టు వారు పొలిటీషియన్లు పవర్లో ఉంటే తప్ప నోరు చేసుకోవడానికి వీల్లేదు. నోరు చేసుకోవడం, అధికారాన్ని ధిక్కరించడం నేరమా కాదా అన్న విషయం విచారణ తరువాత తేల్చుకోవచ్చు.

ముందుగా ఈ విషయాన్ని తమ కోర్టుకంటే పోలీస్ కోర్టుకి బదిలీ చెయ్యడం మంచిదనుకొని దర్యాప్తు చెయ్యమని పోలీసులను ఆదేశించారు. బపోలీసులు ఎంతో ప్రభుభక్తితో న్యాయస్థానాన్ని గౌరవించి, రాత్రింబగళ్లూ కష్టపడి నిందితులకి నిద్రలే కుండా చేశారు.ఇదన్యాయం, అక్రమం. ప్రజల్లోనూ, పార్లమెంటులోనూ తేల్చుకోవాల్సిన బలాబలాల్ని పోలీస్ కచేరీల్లో తేల్చుకోవలసిరావడం అప్రజాస్వామికం అని ప్రతిపక్షాల వాళ్లు ఎంత గోల చేసినా పెడచెవిన పెట్టారు అధికారపక్షంవాళ్లు.

ప్రజల గోడే కాదు, ప్రతిపక్షాల గోల కూడా పట్టించుకోని ప్రభుత్వం చెవిటిది. ‘‘చెవిటి వాడి ముందు శంఖం ఊదుతావా? ఊదుకో. కానీ వినాల్సింది నేను కాదు. పోలీసు వాళ్లు కాదు. కోర్టువారు. నాకు తెల్సిన భాషలో ప్రతిపక్షం వాళ్ల విమర్శలంటే అర్థం పర్థం లేనివని. మీ మాటలకు అర్థం వెదుకుతూ కూర్చుంటే మా పదవీ కాలం సరిపోదు. అందుచేతే మిమ్మల్ని కోర్టుకి తోలేశాము. మీ అదృష్టం బాగుంటే కోర్టువారు మీ జీవిత కాలం పూర్తయ్యేలోగా తీర్పు చెబుతారు.

అప్పటికదే మీ విజయం’’ అనేసి కోర్టు గొడవల్లో జోక్యం చేసుకోవడం తగదన్నట్లుగా ఊరుకున్నారు. ప్రజల్లో గెల్చినా కానీ, ఊచల్లెక్కబెడుతూ కూచోవాల్సిందే. అందుకే పాలిట్రిక్స్‌లో కేవలం ప్రజల మన్నన పొందితే సరిపోదు. అదృశ్యశక్తి ఆదరణకు నోచుకోవాలి. నోరుచేసుకోవడం నేరమో కాదో తేల్చుకునేసరికి పదవిని అలంకరించడం సంగతి అలావుంచి, వయస్సు మీరిపోతారని సంబరపడుతూ తమ భుజాలు తామే చరుచు కున్నారు అధికారపార్టీ నాయకులు.

ఇది అన్యాయం... అన్యాయం... కోర్టులు రాజకీయ వేదికలుగా మారిపోతే ప్రజాతీర్పుకి విలువ ఉండదని ఘోషించాయి ఎన్నో హృదయాలు.రేపు ఈ కేసులు వీగిపోతే పోలీసులూ, పొలిటీషియన్లూ, పెద్దమనుషులుగా మిగిలిపోవచ్చు.కానీ అంతర్నాటకంలో అణగారిపోయినవారి హృదయాల్లో న్యాయస్థానం పదిలంగా ఉంటుందా? ఇది హాస్యం కాదు. అపహాస్యం కాదు. ప్రజాస్వా మ్యం. అలనాడు పౌరహక్కుల నేత పురుషోత్తంను హత్య చేసిన నిందితుడితో బహిరంగంగా నేరం ఒప్పించి, ఆ తరువాత కోర్టులో కేసు వీగిపోయేలా చేసిన ప్రఖ్యాతి మన తెలుగు ప్రభువుల సొంతం. కోర్టులను రాజకీయం కోసం వేదికలుగా వాడుకోవడం ఆది నుంచీ ఉన్నదే. ఒంటబట్టిన అలవాటే. అలా మొదలైన ప్రహసనం అక్కడితో ఆగి పోలేదు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. ఇవాళ కాకపోతే రేపు జగన్ ప్రజల్లో గెలిస్తే, ప్రజల ముందు న్యాయస్థానం దోషి కాకూడదు. ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని ప్రజలు ఎంచుకోవాలి. కోర్టులు కాదు.

- కొండమీది బెండయ్య

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!