YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 7 October 2012

జవాబు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి

చంద్రబాబు పాదయాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘ఏం సమస్యలున్నాయో చెప్పండంటున్నావ్! 40 ఏళ్ల నుంచి పేరూరులో ఉంటున్నా. గేదెలు కాసి పాలు అమ్ముకుని బతుకుతాండా. పరిటాల రవి, కాంగ్రెసోళ్లు, సునీతమ్మ ఎవరొచ్చినా ఇల్లు ఇవ్వలేకుండారు. ఇంకేమి సమస్యలు చెప్పేది? పనిలేకనా..?’’
- రామగిరి మండలం పేరూరుకు చెందిన వెంకటలక్ష్మమ్మ

‘‘ఎవ్వరూ మాకు ఏం సేసింది లేదు. కాంగ్రెసోళ్లు చెయ్యలేదు. టీడీపీ వాళ్లూ అంతే. అట్టాంటప్పుడు ఏం సెప్పినా దేనికి..?’’
- పేరూరుకు చెందిన షమీమ్ ప్రశ్న

‘‘ఏందో ‘మీకోసం.. మాకోసం.. నాకోసం’ అంటూ యాత్ర చేపట్టినావు. ఎందుకు చేస్తాండావో! దీంతో ప్రజలకు ఏం ఉపయోగమో తెలీడం లేదు. ఇంతకూ ఈ యాత్రతో ప్రజల సమస్యలు తీరతాయంటావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదు?’’

- పేరూరు గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి నిలదీత

అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేరూరులో జనం వేసిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. చంద్రబాబు ఆదివారం ఆరో రోజు పాదయాత్రను పేరూరు నుంచి కంబదూరు మీదుగా కుర్లపల్లి వరకూ కొనసాగించారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలం (రామగిరి) పరిధిలోని పేరూరులోనే చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. సమస్యలు చెప్పాలని బాబు అడగ్గా ప్రజలు మైకు అందుకుని ప్రశ్నల వర్షం కురిపించారు. కరెంటు, మంచినీళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇలా అనేక సమస్యలపై నిలదీశారు. టీడీపీ హయాంలోనూ, పరిటాల రవి ఉన్నప్పుడూ తమ బతుకులు ఇలాగే ఉన్నాయంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో బాబు నీళ్లు నమిలారు. ప్రశ్నలు సంధిస్తున్న మహిళలను సునీత వారించే ప్రయత్నం చేశారు. చివరకు మైకులు తీసుకుని టీడీపీ నాయకులతో ఉపన్యాసాలిప్పించారు. 

source: sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!