YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 9 October 2012

ప్రజలు ఆదరించేది జగన్‌నే... జగన్ కోసం(sakshi)

ప్రజల అండతో జగనన్న తండ్రి ఆశయాలకోసం ముందుకు సాగుతున్నాడు. సహనంతో కూడిన సాహసంతో, గుండె ధైర్యమే ఊపిరిగా, మెండైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే నాయకుణ్ణి ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు అనేది సత్యం. 

నా పేరు విజయ్. మాది కనిగిరి దగ్గర పెద్దగొల్లపల్లి అనే గ్రామం. నేను బెంగుళూరులో ఉద్యోగం చేస్తుంటాను. సెప్టెంబర్ 2009... నేను విశాఖపట్నంలో ఎంసిఏ చదువుతున్న రోజు. వైయస్సార్ హెలికాప్టర్ మిస్సయినప్పటి నుంచి నా స్నేహితులు అందరూ భయపడుతున్నా, నేను మాత్రం ‘ఆయనకు ఏమవుతుందిరా. అడవిలో అయినా కొండల్లోనైనా జీవించగల ధైర్యశాలి మన వైయస్సార్’ అని చెప్తుండేవాడిని. కాని నాకు కూడా ఎక్కడో ఒక భయం... సెప్టెంబర్ 3న ఎగ్జాం... పరీక్ష హాల్లోకి వెళ్లి సమాధానాలు రాయడం మొదలుపెట్టిన పది నిమిషాల లోపే స్నేహితుని దగ్గర నుంచి ఒక విషాదకరమైన ఎస్‌ఎంఎస్. అంతే పరీక్షా కేంద్రాన్ని వదిలేసి బయటకు వెళ్లిపోయా.. వైఎస్ మీద అంత అభిమానం పెంచుకున్న నేను మరి పరీక్ష రాయలేకపోయాను.

నేను జగనన్నని ఎన్నోసార్లు దగ్గరగా చూశాను. కాని కలిసింది మూడుసార్లే. ఒకసారి కడప ఉపఎన్నికల ముందురోజు కలిశాను. అయినా కూడా జగనన్న మమ్మల్ని నిరాశపరచకూడదన్న ఉద్దేశంతో సాయంత్రం అయిదు గంటలకు కలిసే అవకాశం ఇచ్చారు. ఒక సాధారణ ఎమ్మెల్యే కూడా ఎన్నికల ముందురోజు సాయంత్రం వేరే మనుషులను కలిసేందుకు ఇష్టపడని ఈరోజుల్లో జగనన్న పదిహేను నిమిషాలపాటు మాట్లాడే అవకాశం ఇచ్చారు. కలిసిన ప్రతిసారీ మన కాబోయే ముఖ్యమంత్రి ఇంత సింపుల్‌గా ఉంటాడా... ఇంతగా మమైకమై మాట్లాడతాడా అనిపిస్తూ ఉంటుంది.

ఇంటర్నెట్‌లో కలిసిన జగనన్న అభిమానులం (సునీల్, నవాజ్, చైతన్య మరియు నేను) బెంగళూరులో వైయస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం పేరుతో ఒక వేదికను ఏర్పరుచుకున్నాం. ఏర్పరుచుకున్న కొన్ని రోజుల్లోనే భారీ మీటింగ్‌ను పన్నెండు వందలమంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో బెంగళూరులో పెట్టి, కర్ణాటకలో ఉన్న ప్రతి వైయస్సార్ అభిమానినీ ఒక వేదిక మీదికి తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే బెంగుళూరులో కూడా వైయస్సార్ జయంతి, వర్థంతి, జగనన్న పుట్టినరోజు వేడుకలను కర్ణాటకలో ఘనంగా జరుపుకుంటాం. తండ్రికోసం చనిపోయిన ప్రతి కుటుంబం కోసం జగనన్న బయలుదేరాడు. రాత్రింబవళ్లు ఊరూరా తిరుగుతూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఒక్కరోజు మండుటెండలో తిరిగొస్తే రెండు రోజులు రెస్ట్ తీసుకుంటాం.

అలాంటిది నెలల తరబడి రోజుకు 18 గంటలపైగా ఒక మనిషి ప్రజల మధ్య తిరుగుతున్నాడంటే అతను అందరిలాంటి మనిషి కాదని అర్థమైపోతుంది. అలా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజాభిమానం అనే సంపదను రోజురోజుకు కూడబెట్టుకుంటున్న ప్రజా నాయకుణ్ణి జైలులో కూర్చోబెట్టిన కుటిల నీతిని అర్థం చేసుకోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మాకు పెద్ద కష్టమేమీ కాదు. అతను దమ్మున్న నాయకుడు కాబట్టే జైలులో ఉండి కూడా పార్టీని నడిపించాడు... గెలిపించాడు.. వైయస్సార్‌ని అప్రతిష్టపాలు చేయడానికి ఎన్నో శక్తులు అహర్నిశలు శ్రమించాయి. మిత్రులే శత్రువుల పంచన చేరారు. అయినా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అండతో జగనన్న తండ్రి ఆశయాలకోసం ముందుకు సాగుతున్నాడు. కష్టపడకుండా... వాయిలార్ రవి చుట్టూ, ఆజాద్ చుట్టూ, అహ్మద్ పటేల్ చుట్టూ, సోనియమ్మ చుట్టూ తిరిగి అందలం ఎక్కాలంటే అది కొంతమంది స్వార్థపరులకే సాధ్యం. కాని వాళ్లు పేదవారి హృదయాలలో స్థానం దక్కించుకున్న దాఖలాలు చరిత్రలో లేవు. సహనంతో కూడిన సాహసంతో, గుండె ధైర్యమే ఊపిరిగా, మెండైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే నాయకుణ్ణి ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు అనేది సత్యం.

- విజయ్, హ్యూలెట్ ప్యాకార్డ్, బెంగళూరు.

వర్షించే మేఘన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు...

ప్రతి రైతు సగర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేసిన ఘనత రాజశేఖరరెడ్డిది. ఆయన మరణం తర్వాత పంటను కాపాడుకోవడానికి రైతు... పొలాలు వదిలి వీధుల్లో పోరాటం చేయాల్సిన దుస్థితికి కారణం ఎవరు? అప్పుడు సాధ్యమైన 7 గంటల ఉచిత కరెంటు ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడం లేదు. అదే గవర్నమెంట్, అదే మంత్రులు, అదే హైకమాండ్ కదా! జగన్ రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించేలా చేశాడు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. బహుశా అందుకేనేమో జగన్‌ను జైలులో నిర్బంధించారు. పేదవాడు గుప్పెడు మెతుకులు తినడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదేమో. అందుకే జగన్‌ను ఇలా వేధిస్తోందా? అనే ప్రశ్న ప్రతి రైతును తొలచివేస్తోంది.

రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జలయజ్ఞం ఏమైనట్లు..? ఇప్పటివరకు అదనంగా ఎన్ని ఎకరాలకు నీరు అందించారు. ఎందుకిలా జరుగుతోంది. అదే జగన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే అన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి కావా? రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది కాదా? ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రం పచ్చగా ఉండడం ఇష్టంలేకనే జగన్‌ను నాలుగు గోడల మధ్య బంధించారా? వర్షించే మేఘాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. జగన్ కూడా అంతే.

అధికారం ఈరోజు ఉంటుంది. రేపు ఉండకపోవచ్చు. కాని, కీర్తిప్రతిష్టలు శాశ్వతంగా నిలిచిపోతాయనే సత్యాన్ని పాలకులు గ్రహించడం మంచిది. ప్రజాశ్రేయస్సు కోరే నాయకుణ్ణి ప్రజల నుంచి దూరం చేయకండి. పేదవారిని భిక్షగాళ్లుగా దిగజార్చకండి. కక్షలకు ఇది వేదిక కాదు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. తెలుగు తల్లిని ఢిల్లీ వీధుల్లో అనాథగా నిలబెట్టే ప్రయత్నాలు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. జగనన్నని చూడాలని పరితపించే కోట్లాది గుండెలలో నేనూ ఒకడిని. జగనన్న త్వరలోనే మా ముందుకు వచ్చి, మా అందరి ఆశలు నెరవేరుస్తాడని ఆశతో ఎదురుచూస్తున్నాం.

- రామచంద్ర యెంబేటి, కోట, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిలా

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!