YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 13 October 2012

ధర్మాన సావిత్రమ్మ మృతికి సంతాపం


నరసన్నపేట(శ్రీకాకుళం), న్యూస్‌లైన్: నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావులను వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం పరామర్శించారు. ధర్మాన సోదరుల తల్లి సావిత్రమ్మ ఇటీవల దివంగతులైన నేపథ్యంలో ధర్మాన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విజయమ్మ శనివారం వారి స్వగ్రామం మబగాం వచ్చారు. సావిత్రమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణదాస్, పద్మప్రియ, ప్రసాదరావులతోపాటు వారి కుటుంబ సభ్యులతో విజయమ్మ కాసేపు మాట్లాడారు. 

సావిత్రమ్మ మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. విజయమ్మతోపాటు వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, కణితి విశ్వనాథం, ఎం.వి.కృష్ణారావు, ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, గొల్ల బాబూరావు, పార్టీ నేతలు కుంభా రవిబాబు, రవిరాజ్, కొయ్య ప్రసాదరెడ్డి, వంశీకృష్ణయాదవ్ తదితరులు ధర్మాన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

విజయమ్మకు సాదర స్వాగతం

విశాఖపట్నం: నరసన్నపేట వెళ్లేందుకు శనివారం విమానంలో విశాఖ చేరుకున్న వై.ఎస్.విజయమ్మకు సాదర స్వాగతం లభించింది. భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో విమానాశ్రయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా పార్టీ నగర నేతలు విజయమ్మ చేతుల మీదుగా ఈనెల 18 నుంచి షర్మిల చేపట్టనున్న ‘మరో ప్రస్థానం’ పాదయాత్ర వాల్‌పోస్టర్లను ఆవిష్కరింపజేశారు. కృష్ణదాస్ కుటుంబాన్ని పరామర్శించాక సాయంత్రం ఎయిరిండియా విమానంలో విజయమ్మ తిరుగు ప్రయాణమయ్యారు. విజయమ్మకు స్వాగతం, వీడ్కోలు పలికిన వారిలో పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, సుజయకృష్ణ రంగారావు, పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!