YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 16 October 2012

వైఎస్సార్‌సీపీలోకి జిట్టా

29న భువనగిరిలో బహిరంగ సభ

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ యువ జేఏసీ చైర్మన్ జిట్టా బాలకృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తన అభిమతాన్ని వెల్లడించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన భువనగిరిలో భారీ ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి విజయమ్మ సమక్షంలో తాను, తన అనుచరులు పార్టీలో చేరతామని చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తున్నామని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది కేంద్రమే కనుక వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని గుర్తుచేశారు. మూడున్నర ఏళ్లుగా ఉద్యమంలో ఉన్న తనకు ఒక అండ కావాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పారు. కె.కె.మహేందర్‌రెడ్డి, బీరవోలు సోమిరెడ్డి వంటి తెలంగాణ నాయకులు ఇదివరకే పార్టీలో ఉన్నారని, భవిష్యత్తులో కూడా తెలంగాణ కోసం కృషి చేస్తూనే పార్టీలో కొనసాగుతానని తెలిపారు. త్వరలో తెలంగాణ ఏర్పాటవుతుందనే విశ్వాసం తమకుందని, ఆర్టికల్-3 ప్రకారం కేంద్రమే తెలంగాణ ఏర్పాటు చేయాలని కేసీఆర్ కూడా చెబుతున్నారని ఆయన చెప్పారు. 

వైఎస్ అభిమానులు తెలంగాణలోనూ ఉన్నారు 

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమానులు తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారందరూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్నారని పార్టీ సీజీసీ సభ్యుడు కె.కె.మహేందర్‌రెడ్డి చెప్పారు. పరకాల ఉప ఎన్నికల్లో కొండా సురేఖకు వచ్చిన ఓట్లను బట్టి ఈ విషయం వెల్లడైందన్నారు. వైఎస్ పథకాలన్నీ కుంటుపడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పాత్ర ఎంతో కీలకమన్నారు. రేపు తెలంగాణ ఏర్పడినా ఇక్కడ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర నిర్వహించి ఒక జాతీయ పార్టీగా పరిణమిస్తుందని చెప్పారు. నల్లగొండ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డితో పాటు పలువురు జిల్లా నాయకులు విజయమ్మను కలిసిన వారిలో ఉన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!