YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 20 July 2012

మంత్రి మండలి అనుమతితోనే అన్ని కేటాయింపులు: నిమ్మగడ్డ

రాక్ చెల్లించిన సొమ్మును నిమ్మగడ్డ ఖాతాలో జమచేసుకున్నారు
ఈ దశలో బెయిల్ ఇస్తే దర్యాప్తునకు విఘాతం: సీబీఐ
ఇరువర్గాల వాదనలు పూర్తి...తీర్పు ఈనెల 30కి వాయిదా

హైదరాబాద్, న్యూస్‌లైన్:వాన్‌పిక్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రస్తుత ముఖ్యమంత్రి, రస్ ఆల్‌ఖైమా (రాక్) ప్రభుత్వం ఇప్పటికీ భావిస్తున్నాయని వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు. దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం మరోసారి విచారించారు. భూముల కేటాయింపుల్లో రహస్యమేమీ లేదని, అన్నింటికీ జీవోలు ఉన్నాయని... వాటిపై ఐఏఎస్ అధికారి మన్మోహన్‌సింగ్ సంతకం చేశారని ఉమామహేశ్వర్‌రావు తెలిపారు. ప్రభుత్వం భూములు కేటాయించిన లక్ష్యం నెరవేరకపోతే నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్నారు. వాన్‌పిక్ నిబంధనల మేరకే వ్యవహరించిందని, పరిహారం చెల్లించి భూములను కూడా స్వాధీనం చేసుకుందని చెప్పారు. వాన్‌పిక్ ప్రాజెక్టులోగానీ, రాయితీ ఒప్పందాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చట్టపరమైన చర్యలు చేపట్టవచ్చని, అయితే అవి నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదని వివరించారు. వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం రాక్ ప్రభుత్వం చెల్లించిన రూ. 450 కోట్లలో కొంత మొత్తాన్ని నిమ్మగడ్డ ప్రసాద్ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని... ఇందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్లు ఉన్నాయని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపించారు. 

రాక్ ఇచ్చిన డబ్బులో రూ. 150 కోట్లను రైతులకు పరిహారంగా చెల్లించారని, మిగిలిన డబ్బులో రూ. 140 కోట్లు జగన్ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టారని తెలిపారు. రాక్ తరఫున చైర్మన్ హోదాలో నిమ్మగడ్డ ఒప్పందంపై సంతకం చేశారని, డెరైక్టర్‌గా ఆయన ఏజెంట్ పరిధిలోకి వస్తారని... ఈ నేపథ్యంలో ఐపీసీ 409 సెక్షన్ ఆయనకు వర్తిస్తుందని పేర్కొన్నారు. అధికారులతో కుమ్మక్కై తమకు అనుకూలంగా జీవోలు జారీ చేయించుకున్నారని, అందుకే ఐఆర్‌ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి నిందితునిగా మారారని వివరించారు. వాన్‌పిక్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నామని, ఈ దశలో నిమ్మగడ్డకు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు విఘాతం కల్గుతుందని నివేదించారు. నిమ్మగడ్డ పలుకుబడి కలిగిన వ్యక్తని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, తీర్పును ఈనెల 30కి వాయిదా వేశారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!