YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 22 October 2012

బాబు బుర్రకు వైద్యం చేయాలి


వచ్చే ఎన్నికల్లో కూడా గెలవలేమని తెలుసుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నిరాశా నిస్పృహలతో చౌకబారు విమర్శలకు దిగుతున్నారని, ఆయన బుర్రకు వైద్యం చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వరుసగా పదేళ్ల పాటు పదవికి దూరమైన బాబుకు వచ్చే ఎన్నికల్లో కూడా గెలవలేనన్న విషయం వివిధ సర్వేలతో తేలిపోయిందని, అందుకే పూర్తి నిరాశానిస్పృహల్లో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. ‘పాదయాత్రలో బాబుకు కాళ్లు నొప్పి పెడుతున్నాయని వైద్యం చేయిస్తున్నారు... కానీ ఆయనకు వైద్యం చేయాల్సింది కాళ్లకు కాదు, బుర్రకు చేయించాలి’ అని రాంబాబు అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘బహుశా బాబు బుర్ర పాదాల్లోకి పోయిందని అక్కడ వైద్యం చేస్తున్నారేమో!’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్ల కాలంలో చేయనివన్నీ ఇపుడు చేసేస్తానని బాబు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన మాటలు పెదవి నుంచి వస్తున్నాయి తప్ప మనసులో నుంచి రావడం లేదని అంబటి అన్నారు. బాబు ముఖ్యమంత్రి అయితే నవసూత్ర పథకాలను అమలు చేస్తారని ఓ పత్రిక రాసిందని, అయితే అధికారంలో ఉన్నపుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నపుడు మరో మాట చెప్పడం బాబుకు బాగా అలవాటని, ఆయనది ‘బోడి మల్లయ్య’ వ్యవహారమని వ్యాఖ్యానించారు. 

వ్యవసాయ రంగానికి రోజుకు తొమ్మిది గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తానని చెబుతున్న బాబు తాను అధికారంలో ఉండగా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ‘వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కన్నా మెరుగైన పథకం తెస్తారట....బాబు పాలనలో పేదలకు జబ్బులొస్తే ఏం జరిగేదో రాష్ట్ర ప్రజలకు తెలియదా?’ అని ప్రశ్నించారు. బాబు పాదయాత్ర జనం లేక రోజురోజుకూ నీరసించి పోతుంటే.. కొన్ని టీవీ చానెళ్లు, పత్రికలు మాత్రం స్పందన బ్రహ్మాండంగా ఉన్నట్లు చూపించేందుకు తాపత్రయపడుతున్నాయని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు మనుషులను వర్గాలు, కులాలుగా చీల్చేస్తారని, క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు అని విభజించి వైఎస్ కుటుంబీకులకు ఆపాదించేందుకు ఆయన నానా తంటాలు పడుతున్నారని అంబటి చెప్పారు. ‘వైఎస్ క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలుసు. 5 ఏళ్ల 3 నెలల పాలనలో ఆయన కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా పనిచేశారు. వైఎస్ కుటుంబీకుల మతం మానవత్వం అని అందరూ గుర్తించారు’ అని అంబటి స్పష్టం చేశారు. తెలంగాణలో షర్మిల పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!