YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 27 October 2012

తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందనే ఆ రెండు పార్టీలు కుట్ర

మరో ప్రజాప్రస్థానంలో వైఎస్ షర్మిల మండిపాటు
తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందనే ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి
చంద్రబాబుకు బుద్ధి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది
జగనన్న సీఎం అయితే రైతులు తలెత్తుకొని జీవిస్తారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 10, కిలోమీటర్లు: 139.4

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాజన్న కొడుకుగా జగనన్న ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై పోరాడుతున్నాడు. జగనన్న మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నాడన్న భయంతో, ఇక తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందన్న కారణంతో కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్ని దొంగ కేసులు పెట్టాయి. ఈ అన్యాయాన్ని మీరంతా చూస్తున్నారు. బాబుగారికి బుద్ధి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మండిపడ్డారు. జగనన్న సీఎం అయితే రైతులు తలెత్తుకొని తిరుగుతారని, వారి కష్టాలు తీరిపోతాయని చెప్పారు. 

శనివారం పదోరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తన ముందు గోడు వెళ్లబోసుకున్న అనంతపురం జిల్లా రైతులకు షర్మిల ఈ మేరకు భరోసానిచ్చారు. జ్వరం కారణంగా షర్మిల కాస్త అస్వస్థతకు గురయ్యారు. అయినా ఉదయం 10.30కు పాదయాత్రకు బయలుదేరారు. మార్గమధ్యలో బడన్నపల్లి క్రాస్ సమీపంలో చెన్నారెడ్డి అనే రైతు వేరుశనగ పంటను పరిశీలించారు. తాను పూర్తిగా నష్టపోయానని ఆ రైతు మొరపెట్టుకున్నారు. భార్య తాళిబొట్టును కూడా బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చానని, ఐదెకరాల్లో 60 వేల పెట్టుబడితో వేరుశనగ పంట వేస్తే ఇప్పుడు పంటకు రూ. 15 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇంతకుముందు మండలం యూనిట్‌గా పంట బీమా అందేదని, ఇప్పుడు దాన్ని తీసేసి వాతావరణ ఆధారిత బీమా అని ఇస్తున్నాని చెప్పారు. దానివల్ల తమకు ఒరిగేదేమీ లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘‘రాజన్న ఉన్నప్పుడు పరిహారం చెల్లించే ఉద్దేశం ఉంది కాబట్టే గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్నారు. 

ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పరిహారం ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే ఇలా అనేక ఆంక్షలు పెడుతున్నారు.. మన్ను తిని బతకాలని చెబుతోంది ఈ ప్రభుత్వం. జగనన్న సీఎం అయితే రైతు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వస్తుంది..’’ అని చెప్పారు. బడన్నపల్లి క్రాస్‌రోడ్డులో 11.15కు జిల్లాకు చెందిన పలువురు ముస్లిం సోదరులు షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు రాగా వారికి షర్మిల బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బడన్నపల్లి స్థానికులంతా తమకు గ్రామాల్లో నీళ్లు లేవని, కరెంటు ఉండడం లేదని వాపోయారు. అర్ధరాత్రి కరెంటు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు పంట వద్దే పడుకోవాల్సి వస్తోందని, ప్రాణాలకు కూడా భద్రత లేదని చెప్పారు. వైఎస్ ఉన్నప్పుడు కరెంటు ఉండేదని, వర్షాలు బాగా పడేవని గుర్తుచేసుకున్నారు. అందుకు ‘‘రాజు మంచోడైతే దేవుడు కూడా దీవిస్తాడు. రాజన్న ఉన్నప్పుడు మాట మీద నిలబడ్డాడు. అందుకే అప్పుడు సుభిక్షంగా ఉంది..’’ అని షర్మిల వారితో పేర్కొన్నారు. రైతుల అవసరాలు గుర్తించి ముందు చూపుతో రాజన్న కరెంటు కొనుగోలు చేసి సరఫరా చేశారని, ఈ ప్రభుత్వానికి ముందు చూపులేదని విమర్శించారు.

వాళ్లు 3 కి.మీ. నుంచి నీళ్లు తె చ్చుకుంటే తెలుస్తుంది..

స్థానికులు నీటి సమస్యను షర్మిలతో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘వైఎస్ ఉన్నప్పుడు పెన్నా రిజర్వాయర్‌కు 10 టీఎంసీల నీటిని తీసుకురావడంతో ఆప్పుడు నీటి సమస్య లేదు. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఆ నీళ్లు రాక భూగర్భజలాలు అడుగంటిపోయాయి. జిల్లాలో దాదాపు 30 వేల బోర్లు ఎండిపోయాయి. ఈ ప్రభుత్వం నిద్రపోతోంది. ముఖ్యమంత్రికేం బాగానే ఉన్నారు. మూడు కిలోమీటర్లు పోయి ఆయన భార్య నీళ్లు మోసుకొస్తే ఆ బాధ అర్థమయ్యేది. ఈ పాపం ఈ సర్కారుదే..’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.15కు గరుడాపల్లి సమీపంలో భోజన విరామానికి ఆగారు. జ్వరం కారణంగా విశ్రాంతి తీసుకుని తిరిగి సాయంత్రం 5 గంటలకు బయలుదేరారు. దారిలో వసంతపురం గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. రాత్రి 7 గంటలకు చిగిచెర్లకు చేరుకోగా స్థానికులు షర్మిలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం తుంగభద్ర నీటిని తీసుకురావడంలో విఫలమవడం వల్లే ఇక్కడ నీటి కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. అనంతరం రాత్రి 7.40కి చిగిచర్ల సమీపంలో ఏర్పాటుచేసిన రాత్రిబస స్థలానికి చేరుకున్నారు.

షర్మిలకు జ్వరం

షర్మిలకు శుక్రవారం రాత్రి నుంచే జ్వరం రావడంతో కొద్దిగా నీరసించారు. రాత్రి 101.8 డిగ్రీల జ్వరం ఉందని, రెండు రోజులుగా తీవ్ర జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారని షర్మిల చిన్నాన్న కుమారుడు, వైఎస్సార్ పార్టీ నేత వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రానికి జ్వరం కాస్త తగ్గిందన్నారు. ఉదయం అనంతపురం నుంచి రిమ్స్ వైద్య నిపుణుడు డాక్టర్ వెంకటేశ్వరరావు షర్మిలకు వైద్య పరీక్షలు చేశారు. సాయంత్రం పులివెందుల నుంచి వైద్య నిపుణులు, వైఎస్ జగన్ మామ, అత్తగార్లు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, డాక్టర్ సుగుణమ్మ వచ్చి షర్మిలను పరీక్షించారు. షెడ్యూలు ప్రకారం షర్మిల శనివారం 13.8 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా.. 8.5 కిలోమీటర్లు మాత్రమే నడవగలిగారు. పాదయాత్రలో పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి, పార్టీ ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి, మరో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఆయన సతీమణి మాధవి, వాసిరెడ్డి పద్మ తదితరులు నడిచారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సాయంత్రం కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.

షర్మిల పాదయాత్రలో ఎన్‌ఆర్‌ఐలు

ధర్మవరం, న్యూస్‌లైన్: మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టిన షర్మిళకు స్థానిక ప్రజలే కాక విదేశాల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. వృత్తిరీత్యా విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు యాత్రలో పాల్గొంటున్నారు. అమెరికా నుంచి పవన్‌కుమార్, అమర్‌జీవ్, అవినాష్, వేణుగోపాల్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ విభాగం మెంబర్ షిప్ కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి అనంతపురం జిల్లాకు వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఎన్‌ఆర్‌ఐ సంఘం రాష్ట్ర కన్వీనర్ వెంకట్ మేడపాటి ఆధ్వర్యంలో యాత్రలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. కువైట్, డల్లాస్ నుంచి మరికొందరు ఈ పాదయాత్రలో పాల్గొంటారన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!