YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 22 October 2012

ఎన్‌డీటీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబుపై షర్మిల ధ్వజం

వైఎస్ పాదయాత్రను ఎద్దేవా చేసిన బాబు.. ఇప్పుడు అదే యాత్ర చేస్తున్నారు
ఆరోగ్య శ్రీని, ఉచిత విద్యుత్‌ను నాడు తప్పుపట్టి.. ఇప్పుడు అవే హామీలిస్తున్నారు
బాబు అధికారంలో ఉండగా ఒక్క రైతు రుణమైనా మాఫీ చేశారా?
రైతులపై కేసులు పెట్టి.. కరెంటు చార్జీలు పెంచి ప్రజల్ని వేధించారు

‘‘మహానేత వైఎస్ పాదయాత్రను చంద్రబాబు కాపీ చేస్తున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ పాదయాత్ర చేస్తే ఎద్దేవా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అదే వైఎస్‌ను అనుకరిస్తూ పాదయాత్ర చేయడం విడ్డూరం. అప్పట్లో వైఎస్ ఇచ్చిన హామీలపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు.. ఇప్పుడు అవే హామీల్ని తాను అధికారంలోకి వస్తే అమలు చేస్తానంటున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తామంటున్నారు.. ఆరోగ్యశ్రీని పొగుడుతున్నారు. తాను అధికారంలో ఉండగా ఒక్క రైతు రుణమైనా చంద్రబాబు మాఫీ చేశారా..?’’ అని వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిలదీశారు. బాబు యాత్రకు తమ యాత్రకు అసలు పోలికే లేదని, తమ యాత్ర పూర్తిగా ఉద్వేగపూరితమైనదని పేర్కొన్నారు. జగన్ అరెస్టుకు నిరసనగానే తాను నల్లబ్యాడ్జీ ధరించి యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. మరో ప్రజాప్రస్థానం యాత్రలో ఉన్న షర్మిల సోమవారం తనను కలిసిన జాతీయ న్యూస్ చానల్ ‘ఎన్‌డీటీవీ’ ప్రతినిధితో మాట్లాడారు. 

బాబు పాలనలో కరువు కరాళ నృత్యం..

‘‘చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కరువు కరాళ నృత్యం చేసింది. నాలుగు వేల మందికిపైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రపంచంలో ఇలాంటి ఘోరం ఎక్కడా జరిగి ఉండదు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు కనీస కృషి కూడా చేయలేదు. అప్పట్లో వారి మద్దతు ఉన్న ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉండేది. రైతుల రుణాల్ని మాఫీ చేయాలని కనీసం ఒక్క ఉత్తరం కూడా రాయని దుర్మార్గపు సర్కారు చంద్రబాబుది. పైగా రైతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. కరెంటు చార్జీలు పెంచారు. ప్రజలపై వేధింపులకు దిగారు. ఇలాంటి తరుణంలోనే అన్నదాతలకు భరోసానిస్తూ నేనున్నానంటూ.. వైఎస్ పాదయాత్ర చేశారు. రైతుల కష్టాలను చూసి చలించారు. ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. తాను అధికారంలోకి రాగానే అన్నదాతల్ని ఆదుకున్నారు. వారి రుణాల్ని మాఫీ చేశారు..’’ అని గుర్తుచేశారు.

కుమ్మక్కై జగన్‌ను జైల్లోపెట్టారు..

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కై జగన్‌ను జైల్లో పెట్టాయని షర్మిల అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు హయాం నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారుకు.. బాబు ప్రభుత్వానికి పెద్ద తేడాలేదు. కరువుతో రైతులు అల్లాడుతున్నా వారిని పట్టించుకునేవారే కరువయ్యారు. పంటలకు బీమా సదుపాయం, ఇన్‌పుట్ సబ్సిడీ, కనీస మద్దతు ధర ఇచ్చేవారే లేరు’’ అని ధ్వజమెత్తారు. జగన్‌కు బెయిల్ ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ రెండూ కలిసిపోయి.. సీబీఐని పావులా వాడుకుంటున్నారని విమర్శించారు. ‘‘బాబుపై ఎన్నో ఆరోపణలున్నాయి. కానీ ఆయన్ను కనీసం విచారణకు కూడా పిలిపించరు. సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు ఒక్క రోజు ముందు చంద్రబాబు టీడీపీ ఎంపీలను హుటాహుటిన చిదంబరం వద్దకు పంపారు. ప్రజాసమస్యలపై వినతిపత్రం సమర్పించకుండా కేవలం జగన్‌పై కక్షతోనే.. ‘సాక్షి’ ఆస్తుల్ని అటాచ్ చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ను ఆదేశించాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కుట్రకు ఇంతకంటే నిదర్శనమేం కావాలి..?’’ అని అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!