YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 27 October 2012

తీవ్ర జ్వరం బాధిస్తున్నా ....

అనంతపురం, న్యూస్‌లైన్‌ప్రతినిధి: జ్వరం బాధిస్తున్నా లెక్క చేయలేదు.. ప్రజాభిమానం ముందు ఆరోగ్యాన్ని ఖాతరు చేయలేదు.. జనాదరణ నానాటికీ రెట్టింపు అవుతుండటంతో వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను మడమ తిప్పకుండా కొనసాగించారు. తీవ్ర జ్వరం బాధిస్తున్నా శనివారం 8.5 కిలోమీటర్ల దూరం నడిచారు. 


దర్మవరం మండలం గొల్లపల్లి శివారులో బసచేసిన షర్మిలకు శుక్రవారం రాత్రి తీవ్ర జ్వరం వచ్చింది. వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు మందులు వేసుకున్నారు. కానీ.. శనివారం ఉదయానికి కూడా జ్వరం తగ్గలేదు. శనివారం ఉదయం షర్మిలను పరీక్షించిన అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు కొంత విశ్రాంతి తీసుకోవాలని సూచించినా షర్మిల వినలేదు. తన కోసం వేలాది మంది ప్రజలు వేచి చూస్తున్నారని.. వారిని కలుసుకోవడం కోసం పాదయాత్ర కొనసాగిస్తానని తెగేసి చెప్పారు. ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు.

శుక్రవారం బసచేసిన ప్రాంతానికి భారీ ఎత్తున తరలి వచ్చిన జనం షర్మిల వెంట అడుగులో అడుగేస్తూ కదంతొక్కారు. పాదయాత్ర సాగే మార్గంలో రైతులను, రైతు కూలీలను, విద్యార్థులను, మహిళలను అప్యాయంగా పలకరిస్తూ.. ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని.. వారి సమస్యలపై ఆరా తీస్తూ.. భుజంపై చేయి వేసి వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. పాదయాత్ర బడన్నపల్లి క్రాస్‌కు చేరుకునే సరికి అప్పటికే ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. అక్కడే ఉన్న వేరుశనగలో చేనులోకి వెళ్లి.. రైతు చెన్నారెడ్డితో సమస్యలపై ఆరా తీశారు. 

‘అన్నా.. ఎన్ని ఎకరాల్లో వేరుశనగ వేశావు. ఏమేరకు దిగుబడి వస్తుంది’ అంటూ షర్మిల అడిగారు. ఇందుకు చెన్నారెడ్డి స్పందిస్తూ.. ‘అమ్మా.. ఐదెకరాల్లో వేరుశనగ వేశా. ఎకరానికి 20 బస్తాల దిగుబడి వస్తే గిట్టుబాటు అవుతుంది. కానీ.. ఇప్పుడు చెట్టుకు రెండు మూడు కాయలు కూడా లేవు. ఐదెకరాలకు కలిసి 15 బస్తాలు కూడా రావు. పంట సాగుకు రూ.60 వేలు ఖర్చు చేశా. పెట్టుబడి కూడా గిట్టదు. ఇంతకు ముందే రూ.5 లక్షల అప్పుంది. ఈ ఏడాది పెళ్లాం మెడలో తాళిబొట్టు కూడా కుదువపెట్టి పంట సాగుచేశా. వాటిని విడిపించుకునే శక్తి కూడా లేదు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా.. మీకు ఇన్‌పుట్ సబ్సిడీగానీ, పంట నష్టపరిహారాన్ని గానీ ప్రభుత్వం ఇవ్వలేదా’ అని అడిగారు. ‘అమ్మా.. రైతుకు నష్టం జరిగితే ఆదుకునే కాలం వైఎస్‌తోనే పోయింది. అప్పుడు పంట ఎండినా.. పండినా ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యంగా బతికే వాళ్లం. ఇప్పుడు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే.. వాతావరణ బీమాను వేరుశనగకు అమలు చేస్తున్నారు. 

ఆ పథకం వల్ల ఎలాంటి లాభం లేదు. పంటల బీమానే గ్రామం యూనిట్‌గా వైఎస్ అమలు చేసినట్లుగా అమలు చేస్తే రైతుకు న్యాయం జరుగుతుంది’ అంటూ వివరించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘ఈ ప్రభుత్వం రైతులకు మన్నుతిని బతకమని చెబుతున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఏమీ చేయలేం. అధైర్యపడొద్దు. రాజన్న రాజ్యం వస్తుంది. వైఎస్ అమలు చేసిన ప్రతి పథకాన్ని అమలు చేస్తాం’ అంటూ భరోసా కల్పించారు.

రచ్చబండ నిర్వహించిన షర్మిల
బడన్నపల్లి క్రాస్‌లో వైఎస్సార్‌సీపీ నేత సాలార్‌బాష నేత ృత్వంలో ముస్లింలు బక్రీద్ పండుగ సందర్భంగా షర్మిలను కలుసుకున్నారు. వారికి ఆమె బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జగన్‌కు మంచి జరగాలని.. పాదయాత్ర విజయవంతం కావాలని.. ప్రజలకు కష్టాలు తొలగిపోవాలని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతం అక్కడే షర్మిల బడన్నపల్లి గ్రామానికి చెందిన మహిళలతో రచ్చబండ నిర్వహించారు.

‘అక్కా.. మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి’ అంటూ ఆత్మీయంగా ఆరా తీశారు. ఇందుకు జయప్రద అనే బీటెక్ విద్యార్థిని స్పందిస్తూ.. ‘అక్కా.. మా నాన్న పొలానికి రాత్రి ఒంటి గంటకు వెళతారు. మళ్లీ ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు. కారణం ఏమిటంటే.. సేద్యానికి కరెంట్ రాత్రి పూట ఇస్తారు. రాత్రి పూట మా నాన్నకు ఏం జరుగుతుందోనని భయంతో రోజూ ఆందోళన చెందుతున్నాం. ప్రతి రైతుదీ ఇదే సమస్య. మా నాన్న ఫీజు కట్టడానికి కష్టపడుతున్నారు. పంటలు పండక అప్పులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోతలు పెడుతోంది. మాలాంటి వారు ఎలా చదవుకోవాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘వైఎస్ హయాంలో సేద్యానికి కచ్చితంగా ఏడు గంటలు విద్యుత్ ఇచ్చేవారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేవారు. కానీ.. ఈ ప్రభుత్వం కోతలు పెట్టడమే పనిగా పెట్టుకుంది. రాజు మంచోడైతే దేవుడి దీవెనలు కూడా ఉంటాయి’ అంటూ వివరించారు. ఆ తర్వాత రాణి అనే మహిళ మాట్లాడుతూ ‘అక్కా.. మా గ్రామంలో తాగడానికి నీళ్లు లేవు’ అంటూ చెప్పింది. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘వైఎస్ పీఏబీఆర్‌కు పది టీఎంసీలు నీటిని కేటాయించి దాహార్తిని తీర్చితే.. ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసి తాగునీటి కష్టాలను పెంచుతోంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

చంద్రబాబుపై నిప్పులు
మధ్యాహ్నం గరుడంపల్లి సమీపంలో భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకున్న షర్మిల సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. వసంతాపురం క్రాస్ మీదుగా చిగిచెర్లకు చేరుకున్నారు. షర్మిల చేరుకునే సరికి చిగిచెర్ల జనసంద్రంగా మారింది. అక్కడ ప్రజల సమస్యలపై షర్మిల ఆరా తీశారు. ‘అక్కా.. వైఎస్ ఉన్నప్పుడు సకాలంలో వర్షాలు పడేవి. మంచి పంటలు పండేవి. కానీ.. ఇప్పుడు వర్షాలు పడటం లేదు. పంటలు పండటం లేదు. తాగునీటి కోసం ఆడవాళ్లు జుట్లుజుట్లు పట్టుకునే దుస్థితి దాపురించింది’ అంటూ వాపోయారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘రాజు మంచోడైతే దేవుడి దీవెనలు కూడా ఉంటాయి. వైఎస్ మంచోడు కాబట్టే ప్రజలకు అంతా మంచే జరిగింది. 

కానీ.. ఈ ప్రభుత్వం ఎడాపెడా పన్నులు పెంచుతూ ప్రజలను బాధిస్తోంది. దేవుడు కూడా వర్షాలు కురిపించడం లేదు. కొద్ది రోజులు ఓపికపట్టండి. మన రాజన్న రాజ్యం వస్తుంది’ అంటూ భరోసా ఇచ్చారు. ‘అక్కా గ్యాస్ ధరలు పెంచేశారు. ఇప్పుడు ఏడాదికి ఆరు సిలిండర్లే ఇస్తారట. ఇదెక్కడి న్యాయం’ అంటూ ఓ మహిళ మొరపెట్టుకుంది. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘చంద్రబాబు సీఎం అయ్యే నాటికి సిలిండర్ ధర రూ.145 ఉండేది. ఆయన దిగిపోయే నాటికి రూ.305కు పెంచారు. ఆ తర్వాత వైఎస్ ఐదేళ్ల హయాంలో సిలిండర్‌పై ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌పై రూ.50 పెంచితే దాన్ని వైఎస్ భరించారు. 

పేదలపై మోపలేదు. కానీ.. ఈ ప్రభుత్వం సిలిండర్ ధరను సగటున రూ.850కు పెంచేసింది. ఇదెక్కడి న్యాయం’ అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో పాపాలు చేశారు. నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎనిమిది సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. ఆర్టీసీ చార్జీలు పెంచారు. ప్రజలపై ఎడాపెడా పన్నులు విధించి.. పీల్చిపిప్పిచేశారు. ఇప్పుడు పాదయాత్ర అంటూ ఎల్లోడ్రామా ఆడుతున్నారు. పాదయాత్రలో చంద్రబాబు శ్మశానాలుగా మార్చిన గ్రామాల్లో ప్రజల కాళ్లు చేతులు పట్టుకుని క్షమాపణ అడిగినా ఆయన చేసిన పాపం పోదు’ అంటూ నిప్పులు చెరిగారు. షర్మిల ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. చిగిచెర్ల శివారులో రోడ్డు పక్కన వేసిన గుడారాల వద్ద రాత్రి 7.45 గంటల సమయంలో పాదయాత్రను ముగించి, అక్కడే బస చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!