YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 5 June 2012

కోఠి సీబీఐ ఆఫీసులోనే మూడవరోజు జగన్ విచారణ!

ద్వారంపూడిని విచారించిన సీబీఐ
రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి కూడా హాజరు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కడప పార్లమెంట్ సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దర్యాప్తు అధికారులు మూడవ రోజు కోఠి కేంద్రీయ సదన్ సీబీఐ కార్యాలయంలోనే విచారించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా న్యాయవాదుల సమక్షంలోనే విచారణ కొనసాగింది. ఉదయం 10.30 గంటలకు చంచల్‌గూడ జైలు నుంచి జగన్‌ను బయటకు తీసుకొచ్చారు. ఆయన నవ్వుతూ అభివాదం చేసి అక్కడే సిద్ధంగా ఉన్న నల్ల స్కార్పియో బులెట్ ప్రూఫ్ వాహనంలో కూర్చున్నారు. కోఠిలోని కేంద్రీయ సదన్‌కు చేరుకున్న అనంతరం సీబీఐ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో డీఐజీ వెంకటేష్, డీఎస్పీ ప్రవీణ్‌లు ఆయనను విచారించారు. సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ మధ్యాహ్నం వరకు సీబీఐ కోర్టులో ఉన్నారు. అనంతరం ఆయన సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు జగన్ విచారణ కొనసాగింది. తిరిగి పూర్తి భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు.

విచారణకు హాజరైన ద్వారంపూడి

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని కూడా సీబీఐ అధికారులు మంగళవారం విచారణకు పిలిచారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.10 వరకు ఆయన సీబీఐ కార్యాలయంలోనే ఉన్నారు. జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించిన సాక్షి కార్యాలయ భవనాలకు చంద్రశేఖర్‌రెడ్డి కొన్ని జిల్లాల్లో భూములను అమ్మారు. జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ భూముల కొనుగోలు జరిగింది. భూముల అమ్మకంపై చంద్రశేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. బుధవారం కూడా ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆడిటర్ విజయసాయిరెడ్డి, ఎంబీఎస్ జ్యుయెలర్స్ యజమాని సుకేష్‌గుప్త కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు సుకేష్‌గుప్త సీబీఐ కార్యాలయంలోనే ఉన్నారు. కోఠిలోని కేంద్రీయ సదన్ వద్ద రెండవరోజు కూడా పోలీసులు విస్తృతస్థాయిలో భద్రతాచర్యలు చేపట్టారు. గుర్తింపు కార్డులు చూపాకే ఉద్యోగులను అనుమతించారు. జీహెచ్‌ఎంసీ భవన సముదాయంలో పాత పుస్తకాలను విక్రయించే షాపులకు వెళ్లేవారిని అనుమతించకపోవడంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తంచేశారు. 

విచారించింది అరగంటే...

సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి సీబీఐ అధికారుల పిలుపుమేరకు మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే ఆయన కోఠిలోని సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటల వరకూ ఆయన సీబీఐ కార్యాలయంలోనే ఉన్నా సీబీఐ అధికారులు మాత్రం కేవలం అర్ధగంట మాత్రమే విచారించారు. సాక్షి దినపత్రికకు ప్రకటనలకు సంబంధించి సందేహాలను దర్యాప్తు అధికారులు లేవనెత్తారు. ప్రకటనలకు సంబంధించిన అన్ని అంశాలపైనా రామకృష్ణారెడ్డి దర్యాప్తు అధికారులకు కూలంకషంగా వివరణ ఇచ్చారు. దర్యాప్తు అధికారులు లేవనెత్తిన అనేక అనుమానాలను ఆయన నివృత్తిచేశారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!