YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 9 June 2012

హెలికాప్టర్లు కూల్చే పాలకులు పోవాలి


నెల్లూరు, ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో జరుగుతున్న నీచ రాజకీయాలకు ఓటు ద్వారా చరమగీతం పాడాలని వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హెలికాప్టర్లు కూల్చి, ఎదురు తిరిగిన వారిని జైల్లో పెట్టే రాజకీయాలు పోవాలన్నారు. ‘‘ఓటు ప్రజలకున్న ఆయుధం.. ఓటుతో జగనన్న నిర్దోషి అని దేశమంతటా చాటుదాం..’’ అని పేర్కొన్నారు. ప్రజలు, మేధావుల మనసులతో పాటు మాకూ నాన్న మరణంపై సందేహాలున్నాయని, ఆయన రెక్కల కష్టంతో అధికారాన్ని అనుభవిస్తున్న వారు నోరు విప్పుతారని రెండున్నర సంవత్సరాలు వేచి చూశామని, కానీ ఒక్కరు కూడా నోరు విప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లా పర్యటనకు వైఎస్‌తో పాటు వెళ్లాల్సిన కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి నిమిషంలో ఎందుకు ఆగిపోయారు? హెలికాప్టర్ ప్రమాదం ఆయనకు ముందే తెలుసా? ప్రమాదంపై కచ్చితంగా విచారణ జరిపి, నిజాలు నిగ్గు తేల్చాలి. అధికార దాహంతో మా నాన్నను మేమే చంపుకున్నామని బొత్సలాంటి వారు దారుణంగా మాట్లాడుతున్నారు. వైఎస్ తెచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న వారు నేడు ఆయన కుటుంబంపై కక్ష సాధిస్తూ కుట్రలు పన్నుతున్నారు’’ అని చెప్పారు. 

సోనియా చేతిలో సీబీఐ కీలుబొమ్మ అని, ఏం ఆధారాలు ఉన్నాయని జగనన్నను అరెస్టు చేశారో సీబీఐ చెప్పాలన్నారు. సోనియా ఆదేశాలతోనే సీబీఐ జగనన్నను అరెస్టు చేసినట్లు ‘ఇండియా టుడే’ మ్యాగజైన్ స్పష్టంగా చెప్పినట్లు గుర్తుచేశారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేస్తే జైలుకు వెళతారని చంద్రబాబు అంటున్నారు.. రెండు ఎకరాలతో రాజకీయ జీవితం మొదలుపెట్టిన బాబుకు దేశమంతటా ఆస్తులు ఎక్కడివి? చీకట్లో చిదంబరాన్ని కలిసి మేనేజ్ చేసుకోవడం ఆయనకు మాత్రమే తెలిసిన విద్య...’’ అంటూ ఆమె మండిపడ్డారు.

సంతకాలకు నేనే సాక్షి..
‘‘రాజశేఖరరెడ్డి మరణంతో మేం జీవించి కూడా చనిపోయినవారిగా ఉంటే.. మా శరీరంలో ఒక భాగం వేరయినంత బాధల్లో ఉంటే.. ఆ సమయంలో సీఎం పదవి కోసం జగనన్న ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించారని అవాస్తవాలు చెబుతున్నారు’’ అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అప్పుడు రాజశేఖరరెడ్డికి అతి సన్నిహితంగా ఉండే ఓ మంత్రి సంతకాల సేకరణ చేశారు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. కానీ కొందరు మాత్రం శవ రాజకీయాలు చేస్తూ మమ్మల్ని వేధిస్తున్నారు..’’ అని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొనసాగితే కాంగ్రెస్, టీడీపీ గల్లంతవుతాయనే భయంతోనే సీబీఐని అడ్డుపెట్టుకుని జగనన్నను జైలుకు పంపించి, పార్టీని అణగదొక్కేయత్నం చేస్తున్నారన్నారు.

కిరణ్ అధికార దాహానికి ఆయన మాటలే నిదర్శనం..
జగనన్నకు 14 సంవత్సరాలు జైలు తప్పదంటూ సీఎం కిరణ్ చేస్తున్న వ్యాఖ్యలే ఆయన అధికార దాహాన్ని స్పష్టం చేస్తున్నాయని షర్మిల అన్నారు. ‘‘రాజ్యసభ సీటు కోసం 18 మంది ఎమ్మెల్యేలను, 70 లక్షల మంది ఓటర్ల మనోభావాలను సోనియాగాంధీకి అమ్మేసిన చిరంజీవి అప్పటి పథకాలన్నీ సోనియావేనంటూ ఆమె జపం చేస్తున్నారు. మరింత మంచి పదవులు వస్తాయనే ఆయన ఇలా చేస్తున్నారేమో? ఆయన బంధువుల ఇంటిలో రూ.80 కోట్లు దొరికితే దాన్ని రూ.35 కోట్లుగా మార్చారు. సరే ఆ 35 కోట్లే అనుకున్నా... ఇంట్లోనే అంత డబ్బు ఉంటే బయట ఇంకా ఎంతుంది? దీనిపై విచారణ చేయరా..’’ అని ప్రశ్నించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!