YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 18 June 2012

చేలో ఉండాల్సిన రైతులు క్యూలో..


విత్తు కష్టాలు షురూ!
బ్లాక్ మార్కెట్‌లో అన్నదాత నిలువు దోపిడీ
రూ. 950 ఉన్న పత్తి విత్తనాలు రూ.1,500కు అమ్ముతున్న కంపెనీలు
నల్ల బజారులో రూ. 200 కోట్లు నష్టపోనున్న రైతులు
సోయాబీన్ విత్తనాలకు తీవ్ర కొరత... వేరుశనగకు నాణ్యత దెబ్బ
చివరికి ఆముదం విత్తనాలు కూడా బ్లాక్ మార్కెట్‌లోనే..

హైదరాబాద్, న్యూస్‌లైన్: విత్తు కష్టాలకు తెరలేచింది! మార్కెట్ మాయాజాలంలో రైతన్న ఎప్పట్లాగే నిలువు దోపిడీకి గురవుతున్నాడు!! గత ఏడాది కరువు నష్టాలను మరిచిపోయి కోటి ఆశలతో ఏరువాకకు సిద్ధమవుతున్న రైతులను విత్తు కష్టాలు చుట్టుముట్టాయి. రాష్ట్రంలో ఎమ్మార్పీ ధరలకు నాణ్యమైన విత్తనం దొరకడం గగనంగా మారింది. ‘అదనులో వ్యవసాయం..’ అన్న మాటను రైతుల కంటే బాగా ఒంట బట్టించుకున్న విత్తన వ్యాపారులు.. అమాయక రైతుల అవసరాలను బ్లాక్ మార్కెట్ రూపంలో సొమ్ము చేసుకుంటున్నారు. విత్తనాలను ఉత్పత్తి చేయడమే ప్రధాన విధిగా ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఏపీ సీడ్స్’ వద్ద కూడా విత్తనాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి సేకరిస్తోంది. ఇలా సర్కారు ఇచ్చేది ప్రైవేటు వ్యాపారులు సరఫరా చేసే విత్తనాలే కావడంతో నాణ్యతాపరమైన సందేహాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా రైతులు చేసేది లేక పెద్ద కంపెనీల విత్తనాల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా కంపెనీలు అడ్డగోలు రేట్లతో రైతుల నడ్డి విరుస్తున్నాయి. రెట్టింపు ధరలకు విక్రయిస్తూ నిలువునా దోచుకుంటున్నాయి. ఈ అక్రమాలను నిరోధించాల్సిన వ్యవసాయ శాఖ అన్ని దశల్లోనూ వ్యాపారులకే అండగా నిలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. ఖరీఫ్‌లో 2.20 కోటి ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక వేసింది. ఈ విస్తీర్ణంలో అన్ని పంటలు కలిపి 40.86 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసింది. వరి, వేరుశనగ, సోయాబీన్, కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్నలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఆముదం, నువ్వులు, జీలుగ, జనుము, పిల్లిపిసర విత్తనాలు కలిపి 11.62 లక్షల క్వింటాళ్లను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. సకాలంలో విత్తన రైతుల నుంచి విత్తనాలను సేకరించడంలో వ్యవసాయ శాఖ, విత్తన ఏజెన్సీలు విఫలమయ్యాయి. దీంతో విత్తన రైతులు తమ పంటను మార్కెట్‌లో అయినకాడికి అమ్ముకున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు మీనమేషాలు లెక్కించిన వ్యవసాయ శాఖ.. ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక ధరలు వెచ్చించి విత్తనాలు సేకరించింది. వీటిని రూ.153 కోట్ల సబ్సిడీతో రైతులకు సరఫరా చేసేందుకు సిద్ధమైంది. అయితే ఇవి నేరుగా విత్తన రైతుల నుంచి సేకరించిన విత్తనాలు కాకపోవడంతో సర్కారు విత్తనాల నాణ్యతపై రైతుల్లో సందేహాలు నెలకొన్నాయి.

చివరికి ఆముదం విత్తనాలు కూడా..

పత్తి విత్తనాల బ్లాక్ మార్కెటింగ్ రెండేళ్లుగా జరుగుతుండగా.. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఇప్పుడు ఆముదం విత్తనాలను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో సాగు చేసే ఆముదం విత్తనాల ధరలను ప్రభుత్వం ఈ ఏడాది అమాంతంగా పెంచేసింది. గత ఏడాది వీటి ధర క్వింటాల్‌కు రూ.5 వేలు ఉండగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇచ్చింది. దీంతో రైతులకు రూ.2,500కే విత్తనాలు దొరికాయి. ఈ ఏడాది వాటి ధరను రూ.5,200కు పెంచిన సర్కారు సబ్సిడీని రూ.1,200లకు తగ్గించింది. దీంతో రైతులు క్వింటాల్‌కు రూ.3 వేలు వెచ్చించి కొనుక్కొవాల్సి వస్తోంది. సర్కారే ధర పెంచినందున తాము పెంచితే తప్పేంటన్న ఉద్దేశంతో కంపెనీలు ఆముదం విత్తనాలను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. రూ.400 ఉండే 3 కిలోల ఆముదం విత్తనాల ప్యాకెట్‌ను మహబూబ్‌నగర్, రంగారెడ్డి, అనంతపురం జిల్లాల్లో కంపెనీలు రూ.700లకు చొప్పున అమ్ముతున్నాయి. రైతుల ప్రయోజనాల విషయంలో రాష్ట్ర సర్కారుకు ఏ మాత్రం శ్రద్ధలేదని చెప్పేందుకు విత్తనాల్లో బ్లాక్ మార్కెట్ దందాయే నిదర్శమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు కె.రామకృష్ణ మండిపడ్డారు.

సోయాబీన్... పెరిగిన భారం రైతులపైనే

గత ఖరీఫ్‌తో పోల్చితే సోయాబీన్ విత్తనాల ధరను సర్కారు క్వింటాల్‌కు రూ.1,140 పెంచింది. గత ఏడాదిలో క్వింటాల్ సోయాబీన్ విత్తనాలను రైతులకు రూ.1,540కి పంపిణీ చేయగా ఇప్పుడు రూ.2,680కి పెంచారు. రాష్ట్రంలో సోయాబీన్ సాగు సగటు విస్తీర్ణం నాలుగు లక్షల ఎకరాలు. అవసరాలకు సరిపడా విత్తనాల సేకరణను నవంబర్‌లోనే చేయాల్సి ఉన్నా.. వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్) ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. నవంబర్‌లో క్వింటాల్ సోయాబీన్ విత్తనాల ధర రూ.2,014 ఉంది. వ్యాపారుల లబ్ధి కోసం ఆలస్యం చేయడంతో సోయాబీన్ విత్తనాల ధర అమాంతంగా క్వింటాల్‌కు రూ.4 వేలకు పెరిగింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సోయాబీన్ విత్తనాల సేకరణ ఖర్చు రూ.20 కోట్ల నుంచి రూ.40 కోట్లకు పెరిగింది. అధికారుల నిర్లక్ష్యంతో పెరిగిన విత్తనాల సేకరణ ఖర్చును భరించాల్సిన ప్రభుత్వం.. దాన్ని రైతులపై వేసింది. అంతటితో ఆగకుండా సోయాబీన్ విత్తనాలను గత ఖరీఫ్‌లో 50 శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేయగా ఇప్పుడు దాన్ని 33 శాతానికి తగ్గించారు. దీంతో ఈ విత్తనాల ధర కూడా భారీగా పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఈ ఏడాది సోయాబీన్ సాగు చేయాలని చూస్తున్నారు. సర్కారు మాత్రం వీరికి సరిపడా విత్తనాలను సరఫరా చేసే పరిస్థితి కనిపించకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

పత్తి రైతు... అంతులేని దోపిడీ

వచ్చే ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 36 కంపెనీలు సరఫరా చేసే 1.27 కోట్ల పత్తి విత్తన డబ్బాలు/ప్యాకెట్లు (450 గ్రాములు) సరిపోతాయని నిర్ధారించింది. బ్లాక్ మార్కెటింగ్ రుచికి అలవాటు పడ్డ పెద్ద కంపెనీలు వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో పత్తి రైతులను దోపిడీ చేస్తున్నాయి. రైతులు ఎక్కువగా డిమాండ్ చేసే మహికో కంపెనీ... 10 లక్షల డబ్బాల విత్తనాలు ఇస్తామని మొదట చెప్పింది. కానీ కేవలం 5 లక్షల డబ్బాలే ఇచ్చి చేతులు దులుపుకుంది. మిగిలిన సగం విత్తనాలను సొంత డీలర్ల ద్వారా రూ.930 ఎమ్మార్పీ ఉన్న ఈ విత్తనాలను రైతులకు రూ.1,500 చొప్పున బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తోంది. అక్రమ దందాలో పండిపోయిన మరో నాలుగు కంపెనీలు కూడా ఇలాగే చేస్తున్నాయి. సర్కారు అండతో జరుగుతున్న కంపెనీల బ్లాక్ మార్కెటింగ్‌తో పత్తి రైతులు ఒక్క ఈ ఖరీఫ్‌లోనే రూ.200 కోట్ల మేర దోపిడీకి గురవుతారని అంచనా!

వేరుశనగ... నాణ్యతకు సెగ

రాష్ట్రంలో 44 లక్షల ఎకరాల్లో సాగుచేసే వేరుశనగ విత్తనాలకు నాసిరకం సమస్య పట్టుకుంది. గత ఏడాది కరువుతో వేరుశనగ రైతులే ఎక్కువగా నష్టపోయారు. ఈ సమయంలో వారిని ఆదుకోవాల్సిన సర్కారు వేరుశనగ విత్తనాల ధరలను అడ్డగోలుగా పెంచింది. గత ఏడాది అన్ని రకాల వేరుశనగ విత్తనాల ధర క్వింటాల్‌కు రూ.3,600ఉండగా ఇప్పుడు రూ.3,950కి పెరిగింది. సబ్సిడీ విత్తనాల ధరకు, బహిరంగ మార్కెట్‌లో ధరలు తేడా లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు సొంతంగానే విత్తనాలు సమకూర్చుకుంటున్నారు. గత ఏడాది కరువు పరిస్థితులకు తట్టుకుని బాగా దిగుబడి ఇచ్చిన కే6 రకం వేరుశనగ విత్తనాలకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. వ్యవసాయ శాఖ మాత్రం వీటిని కాకుండా ఇతర రకాలను సిద్ధం చేసింది. దీంతో సబ్సిడీ విత్తనాలకు రైతులు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఇదే అదనుగా కొందరు విత్తన వ్యాపారులు ఆయిల్‌ఫెడ్, హాకా, మార్కెఫెడ్ సంస్థల ద్వారా ధ్రువీకృతం అని చెప్పి సాధారణ విత్తనాలను సరఫరా చేశారు. ప్రాసెస్ కూడా సరిగా చేయకపోవడంతో కొనుగోలు చేసిన రైతులు బస్తాలు విప్పి చూస్తే ప్రతి బస్తాలో 6 కిలోలు విత్తుకు పనికి రాని తాలుకాయలు బయటపడుతున్నాయి. దీంతో రైతులు మళ్లీ విత్తనాలు కొనుగోలు చేయాల్సి రావడంతో సబ్సిడీకి అర్థమే లేకుండా పోతోంది.

విత్తనాల కోసం బారులు...

జహీరాబాద్ , న్యూస్‌లైన్: మెదక్ జిల్లా జహీరాబాద్ వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద సోమవారం రైతులు విత్తనాల కోసం భారీ సంఖ్యలో బారులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో నిల్చున్నారు. ఆదివారం రాత్రి భారీ వర్షం కురియడం, విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం రోజునే ప్రారంభించడంతో పెద్ద సంఖ్యలో రైతులు వ్యవసాయశాఖ కార్యాలయానికి తరలి వచ్చారు. మధ్యాహ్నం వర్షం రావడంతో విత్తనాల పంపిణీ నిలిపివేశారు. కూపన్లు పొందిన రైతులకు మంగళవారం పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో కొందరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!