YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 5 June 2012

కిరణ్, బాబు వ్యాఖ్యలు చట్ట విరుద్ధం

కోర్టులు ఇవ్వాల్సిన తీర్పులను మరొకరు ఇవ్వడం కోర్టు ధిక్కారమే
బాబు మతపరమైన వ్యాఖ్యలు నియమావళికి విరుద్ధం
కలెక్టర్ల నుంచి నివేదికలకు కోరాం..రుజువైతే చర్యలు
ప్రచారం చేసుకోవడం హక్కు.. ఎవరినీ అడ్డుకున్నా కఠిన చర్యలు తీసుకుంటాం
పెయిడ్ న్యూస్‌పై జిల్లా కమిటీలు పరిశీలన చేస్తున్నాయి
ఉప ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. అలాగే ఓటర్లను ఉద్దేశించి మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తీవ్రంగా స్పందించారు. జగన్‌మోహన్‌రెడ్డికి 14 ఏళ్ల శిక్షపడుతుందని ఎన్నికల ప్రచారంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడం చట్ట విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాలపై ప్రచారం చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనే అవుతుందని చెప్పారు. న్యాయస్థానాలు ఇవ్వాల్సిన తీర్పును మరొకరు ఇవ్వడం కోర్టు ధిక్కారం అవుతుందని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలకు సంబంధించిన ఫిర్యాదు అందిందని, దానిపై నివేదిక పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. 

అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ఓటర్లను జై ళ్లో పెడతారని ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించడం కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు. దీనిపై కూడా కలెక్టర్ నుంచి నివేదికను కోరామని వివరించారు. ఎన్నికల ప్రచారంలో బైబిల్‌పై ప్రమాణం చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై కూడా కలెక్టర్ నుంచి నివేదికకు ఆదేశించామని తెలిపారు. మతపరమైన వ్యాఖ్యలను కమిషన్ సీరియస్‌గా పరిగణిస్తుందన్నారు. నివేదికలు వచ్చిన తర్వాత వాస్తవాలుగా తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉప ఎన్నికల ఏర్పాట్లను మంగళవారం భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రచారాన్ని అడ్డుకుంటే కఠిన చర్యలు

ఉప ఎన్నికల స్థానాల్లో పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయని భన్వర్‌లాల్ చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులపై కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉప ఎన్నికల జిల్లాల్లో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని, రాజకీయ పార్టీల, అభ్యర్థుల ప్రచారం ప్రశాంతంగా కొనసాగుతోందని చెప్పారు. ‘‘రాజకీయ పార్టీల నుంచి మేజర్ ఫిర్యాదులేమీ లేవు. 118 కంపెనీల కేంద్ర పోలీసు బలగాల్లో ఇప్పటికే 90 శాతం బలగాలు జిల్లాలకు చేరాయి. మిగతావి రెండుమూడ్రోజుల్లో జిల్లాలకు చేరతాయి. కడప జిల్లా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ వారు రాళ్లు వేయడంతో ప్రత్యర్థి పార్టీ ప్రతిచర్యకు పాల్పడిన ఘటన మా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఉద్రిక్త, సున్నితమైన ప్రాంతాల్లో ప్రధాన పార్టీల ప్రచార సభలకు అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించాం. ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకునే హక్కు ఉంది. దీన్ని ఎవరు అడ్డుకున్నా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన హెచ్చరించారు.

ఇప్పటివరకు రూ.41 కోట్లు స్వాధీనం..

ఉప ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో డబ్బు, మద్యం పంపిణీలపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు భన్వర్‌లాల్ చెప్పారు. ఇప్పటివరకు డబ్బు ఇతర బంగారం, వెండి ఆభరణాలతో కలిపి రూ.41 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇందులో నగదు రూపంలో రూ.31 కోట్లు పట్టుకోగా.. రూ.9 కోట్ల విలువగల బంగారం, వెండి ఇతర ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2009 సాధారణ ఎన్నికల్లో రూ.38 కోట్లు స్వాధీనం చేసుకోగా ఈ ఉప ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న డబ్బు ఎక్కువగా ఉందన్నారు. 

స్వాధీనం చేసుకున్న నగదులో ఎక్కువ భాగం సామాన్య ప్రజల నుంచి అందిన సమాచారం మేరకే పట్టుకున్నామని పేర్కొన్నారు. పోలింగ్ దగ్గర పడుతున్నందున మరింత నగదు, మద్యం పంపిణీ జరిగే అవకాశం ఉన్నందున ఆ సమాచారాన్ని అందించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా 1.74 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇందుకు సంబంధించి 539 వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు 4,547 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. 3,390 బెల్ట్‌షాపులను మూసివేశామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఓటు వేస్తే అభివృద్ధి చేస్తామని అధికారంలో ఉన్న పార్టీ చెప్పడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. అధినాయకుడు సినిమాను నిపుణుల కమిటీ పరిశీలించిందని, అయితే అందులో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏమీ లేవని తేల్చినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
పెయిడ్ న్యూస్‌పై జిల్లా కమిటీలు పరిశీలన

ఇప్పటివరకు పెయిడ్ న్యూస్‌కు సంబంధించి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలకు నివేదించామని, కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలకుడి సమక్షంలోనే ఆ కమిటీ పెయిడ్ న్యూస్ అంశాన్ని పరిశీలిస్తుందని భన్వర్‌లాల్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లా కమిటీలు తీసుకున్న నిర్ణయాలపై ఒక్కటి కూడా రాష్ట్ర స్థాయి కమిటీ ముందుకు అప్పీల్‌కు రాలేదన్నారు. అప్పీల్‌కు రాలేదంటే జిల్లా స్థాయి కమిటీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయనడానికి నిదర్శనమన్నారు. సాక్షి టీవీలో ‘పెద్దాయన..’ పాట కూడా జిల్లా కమిటీల పరిశీలనకే వెళ్తుందన్నారు.

117 ఫిర్యాదులపై చర్యలు..

ఉప ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు, వ్యక్తులు నుంచి మొత్తం 275 ఫిర్యాదులు రాగా అందులో 117 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని భన్వర్‌లాల్ వివరించారు. మరో 149 ఫిర్యాదులకు సంబంధించి జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు అందాల్సి ఉందన్నారు. మరో 9 ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!