ఇది రాచరికం కాదు, రాజకీయాలు తెలియని జగన్కు అనుభవం లేదు. ఇది ప్రజాస్వామ్యం, తండ్రి చనిపోతే కొడుకును అందలమెక్కించాలా? అంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గులాంనబీ అజాద్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య మండిపడ్డారు. సోమవారం ఇక్కడ ఆయన ‘న్యూస్లైన్’తో మాట్లాడుతూ తాను అడిగే ప్రశ్నలకు ఆజాద్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
ఇందిరాగాంధీ చనిపోయిన తరువాత ఆమె తనయుడు రాజీవ్గాంధీని ఏ అర్హతతో ప్రధానిని చేశారు? అతని కుమారుడు రాహుల్గాంధీకి ఉన్న అర్హత ఏమిటి ? అనుభవం ఏమిటి? వయస్సెంత ? కనీసం ఆయన సొంత నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యేనూ గెలిపించుకోలేని రాహుల్గాంధీని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఎలా చేశారు? కాబోయే ప్రధానమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ను ఎందుకు ఫోకస్ చేస్తోందంటూ జోగయ్య పలు ప్రశ్నలను సంధించారు. ప్రజాదరణ ఉన్న వ్యక్తే నాయకుడు అవుతారని, అటువంటి ప్రజాదరణ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డికే ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సీబీఐని పావులా వాడుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా కక్ష సాధిస్తోందని, ఇది ప్రజలు గమనిస్తున్నారని జోగయ్య చెప్పారు.
No comments:
Post a Comment