YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 24 July 2012

ఉత్సాహం.. ఉత్తేజం

నేత కార్మికులకు అండగా వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం సిరిసిల్లలో చేపట్టిన నేతన్న ధర్నా విజయవంతం కావడంతో అందరి దృష్టీ వైఎస్సార్‌సీపీ పైనే పడింది. నేత కార్మికులు, ప్రజలు తొలిసారిగా జిల్లాకు వచ్చిన విజయమ్మకు బ్రహ్మరథం పట్టడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. మరోవైపు తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధిపొందాలనుకునే వారికి నిరాశే మిగిలింది. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ నేతన్న ధర్నా మెగా సక్సెస్ కావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ముడిసరుకులపై పెరుగుతున్న ధరల భారం, శ్రమకు గిట్టని ఫలితం, పనిలేక పస్తులుంటూ ఆకలిచావులకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేత కార్మికుల కుటుంబాల్లో విజయమ్మ పర్యటన ఆశలు రేకెత్తించింది.

తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ.. సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ.. రానున్న రోజుల్లో వైఎస్సార్‌పార్టీ అధికారంలోకి వస్తే మహా నేత పథకాలన్నింటినీ అమలు చేస్తామని విజయమ్మ ఇచ్చిన హామీ బాధిత కుటుంబాల్లో కొండంత భరోసా నింపింది. నేతన్న ధర్నాను విఫలం చేసేందుకు టీఆర్‌ఎస్, జేఏసీలు సర్వశక్తులు ఒడ్డినా.. ధర్నాను సక్సెస్ చేసేందుకు వైఎస్సార్‌సీపీ నాయకత్వం చేసిన కృషి ఫలించింది. ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నేతలు కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, ఎంఎస్ రాజ్‌ఠాకూర్, జిల్లా కన్వీనర్ పుట్ట మధు మంగళవారం ప్రకటించడంతో ఆ విధంగా శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.
స్వార్థ రాజకీయాలకు చెంపపెట్టు సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఇటీవల సంక్షోభానికి గురైంది. పెరిగిన విద్యుత్ చార్జీలు, అదనంగా వస్తున్న ఏసీడీ చార్జీలు.. పెరిగిన నూలు, విడిభాగాల ధరలు వెరసి వస్త్రోత్పత్తి రంగం కుదేలైంది. గిట్టుబాటుకాని వస్త్రోత్పత్తితో నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేందుకు విజయమ్మ సిరిసిల్లలో చేనేత ధర్నా చేస్తానని జూలై 12న ప్రకటించారు.

ఈ ప్రకటన రాగానే ఎమ్మెల్యే కేటీఆర్ చేనేతకు, పవర్‌లూం పరిశ్రమకు తేడా తెలియదంటూ ఆమె విమర్శాస్త్రాలు సంధించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కేకే.మహేందర్‌రెడ్డి నాగలితో దున్నిన రైతు ఇప్పుడు ట్రాక్టర్‌తో వ్యవసాయం చేస్తే రైతు కాకుండా పోతాడా? అంటూ కేటీఆర్ విమర్శను తిప్పికొట్టారు. తెలంగాణపై విజయమ్మ పార్టీ వైఖరిని చెప్పాలని, లేకుంటే సిరిసిల్లలో అడుగుపెట్టొద్దని టీఆర్‌ఎస్ ఆరోపణలు గుప్పించింది. తెలంగాణ ఇచ్చే శక్తి మా చేతుల్లో లేదని, తెలంగాణకు మేం అడ్డం కాదంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ప్రకటించారు.

జేఏసీ ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టినా.. ధర్నా ముందు రోజు ‘ధూంధాం’ చేసినా.. సోమవారం బంద్ ప్రకటించినా.. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు వైఎస్సార్‌సీపీని విశ్వసించి.. ఆదరించడం స్వార్థ రాజకీయాలకు చెంపపెట్టు లాంటిదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ధర్నా వేదికలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు వైఎ స్సార్‌సీపీ కండువాలతో చేరి నినాదాలు చేయడంతో గొడవకు దారితీసింది. విజయమ్మ చేనేత ధర్నా వేలాది మందితో సక్సెస్ కావడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆలోచనలో పడ్డాయి. వేదిక వద్ద తోపులాట, లాఠీచార్జి నిరసిస్తూ నాయకులు మంగళవారం బంద్‌కు పిలుపునివ్వగా... వ్యాపారుల నుంచి వ్యతిరేకత ఎదురుకావడం విశేషం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!