YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 25 June 2012

జగన్, ఆచార్యల రిమాండ్ 4 వరకు పొడిగింపు

జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యల రిమాండ్‌ను కోర్టు జూలై 4వ తేదీ వరకు పొడిగించింది. వీరి రిమాండ్ సోమవారంతో ముగియడంతో చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎ.పుల్లయ్య ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వీరి రిమాండ్‌ను పొడిగించారు. అలాగే మొదటి చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, హెటిరో డ్రగ్స్ డెరైక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి, అరబిందో ఫార్మా ఎండీ కె.నిత్యానందరెడ్డి, ట్రిడెంట్ లైఫ్ సెన్సైస్ పూర్వ ఎండీ పి.శరత్‌చంద్రారెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ యద్దనపూడి విజయలక్ష్మీ ప్రసాద్, అరబిందో ఫార్మా కంపెనీ సెక్రటరీ పీఏసీ చంద్రమౌళిలతోపాటు జగతి, జనని ఇన్‌ఫ్రాల తరఫున ప్రతినిధిగా కంపెనీ సెక్రటరీ కార్తీక్, అరబిందో, హెటిరో, ట్రిడెంట్ లైఫ్ సెన్సైస్ సంస్థల ప్రతినిధులు కోర్టుకు హాజరయ్యారు. 

రెండో చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ తరఫున కంపెనీ సెక్రటరీ కార్తీక్‌లు, మూడో చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ తరఫున కంపెనీ సెక్రటరీ కార్తీక్, రాంకీ ఫార్మా తరఫున లాల్ క్రిష్ణ కోర్టు ఎదుట హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేటలో బీసీలు, ఎస్సీలు ఘర్షణపడి పెద్ద ఎత్తున శాంతిభద్రతల సమస్య తలెత్తిన నేపథ్యంలో తాను హాజరుకాలేకపోతున్నానని సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకటరామిరెడ్డి కోర్టుకు నివేదించారు. 

చార్జిషీట్‌లో పేరు మార్చండి : కోర్టు

జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా సంస్థల తరఫున కోర్టు విచారణకు కంపెనీ సెక్రటరీ కార్తీక్ హాజరయ్యేందుకు న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో చార్జిషీట్‌లో ఈ రెండు సంస్థల తరఫున జగన్‌మోహన్‌రెడ్డి పేరున్న చోట కార్తీక్ పేరును చేర్చాలని న్యాయమూర్తి పుల్లయ్య సీబీఐని ఆదేశించారు. అయితే ఇందుకు తమకు కొంత గడువు కావాలని, సీబీఐ కోర్టు ఆదేశాలను తాము హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు సీబీఐ సీనియర్ పీపీ టీవీ రమణ నివేదించారు. తమ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లవచ్చని... హైకోర్టు సీబీఐకి అనుకూలంగా తీర్పు ఇస్తే అప్పుడు మార్చవచ్చని న్యాయమూర్తి స్పష్టం చేశారు. జగతి, జనని ఇన్‌ఫ్రాల తరఫున కార్తీక్ హాజరయ్యేందుకు అనుమతించాలని ఈ రెండు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు గతంలో అనుమతించింది. కార్తీక్ సాక్షిగా ఉన్నాడని, ఆయన ఆ రెండు సంస్థల తరఫున హాజరుకావడానికి వీల్లేదన్న సీబీఐ అభ్యంతరాలను తోసిపుచ్చింది. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!