YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 29 June 2012

జేడీ ఫోన్‌కాల్స్‌పై సమగ్ర దర్యాప్తు జరపాలి

సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరిన ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన డీజీపీ


హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఫోన్ కాల్స్‌పై సమగ్ర దర్యాప్తు జరపాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డీజీపీ వి.దినేష్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కేకే మహేందర్‌రెడ్డి శుక్రవారం డీజీపీని కలిశారు. వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ జేడీ పలువురు మీడియా ప్రతినిధులతో అనేకమార్లు ఫోన్‌లో మాట్లాడటం, ఆయా మీడియాలలో ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా పలు అసత్యమైన కథనాలను ప్రచురించడంపై విజయమ్మ డీజీపీకి ఈ నెల 26న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జగన్‌మోహన్‌రెడ్డితోపాటు తమ కుటుంబాన్ని అంతమొందించేందుకు కూడా కుట్ర జరుగుతోందనిఆ ఫిర్యాదులో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసుశాఖ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డీజీపీకి తాజాగా విజ్ఞప్తి చేశారు. 

ఫోన్ కాల్ వివరాలకు సంబంధించి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, వాసిరెడ్డి చంద్రబాల ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు హుటాహుటిన కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని, విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దర్యాప్తు జరపాలని ఈ సందర్భంగా కోరారు. చంద్రబాల, సీబీఐ జేడీ ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన కేసులను రాష్ట్ర నేర పరిశోధన విభాగాని(సీఐడీ)కి బదిలీ చేసినందున విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదు కేసును కూడా సీఐడీకే ఇవ్వాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డికి మొదటి నుంచీ వ్యతిరేకంగా ఉన్న మీడియా యాజమాన్యం, వ్యాపారపరంగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారితో సీబీఐ జేడీ అనేకమార్లు ఫోన్‌లో మాట్లాడటం అనుమానాలను రేకెత్తిస్తున్నాయని ఎమ్మెల్యేలు అన్నారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ దర్యాప్తు తీరు సవ్యంగా సాగడంలేదనే అంశంపై విజయమ్మ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు, సీబీఐ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులకు, కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారని వివరించారు. తమ విజ్ఞప్తిపై డీజీపీ సానుకూలంగా స్పందించారని, విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మకు పంపానని వెల్లడించారని ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కూడా కలిసి విజయమ్మ ఫిర్యాదుపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరతామన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!