YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 15 June 2012

రికార్డు తిరగరాసిన మేకపాటి

రికార్డు తిరగరాసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి
కాంగ్రెస్ కోట్లు వెదజల్లినా.. తగ్గని ఫ్యాన్ హవా
కౌంటింగ్ మధ్యలోనే వెనుదిరిగిన టీఎస్సార్.. టీడీపీకి డిపాజిట్ గల్లంతు
మంత్రులు ఆనం, మహీధర్ రెడ్డి నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ

నెల్లూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: నెల్లూరు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి.సుబ్బిరామిరెడ్డిపై 2,91,745 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ధరావతు కోల్పోయారు. తాజా విజయంతో మేకపాటి రాజమోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రెండో ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలో ఎప్పుడూ రానంత మెజారిటీని ఆయన సాధించారు. 1980లో ఇందిరాగాంధీ ప్రభంజనంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) తరపున పోటీ చేసిన దొడ్ల కామాక్షయ్యకు 2,27,291 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇప్పటివరకు అది రికార్డుగా ఉంది. ఇప్పుడు మేకపాటి ఆ రికార్డును తిరగరాశారు. రాజమోహన్‌రెడ్డి మొత్తం ఓట్లలో 54.59% రాబట్టుకున్నారు. కౌంటింగ్ కేంద్రానికి ఉదయం 9 గంటలకు వచ్చిన టి.సుబ్బరామిరెడ్డి మొదటి మూడు రౌండ్ల ఫలితాలు వెలువడిన వెంటనే తిరుగుముఖం పట్టారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఫలితాలపై ప్రశ్నించగా మాట్లాడ్డానికి నిరాకరించారు. కాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంటేరు వేణుగోపాల్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

మంత్రుల నియోజకవర్గాల్లోనూ ఫ్యాన్‌దే హవా

నెల్లూరు లోక్‌సభ పరిధిలో రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ హవా కొనసాగింది. కందుకూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో తమ ప్రతిష్టను నిలుపుకునేందుకు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, మహీధర్‌రెడ్డి సర్వశక్తులూ ఒడ్డారు. భారీ ఎత్తున డబ్బు, నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆనం సొంత నియోజకవర్గం ఆత్మకూరులో 33 వేల పైచిలుకు ఓట్ల్ల మెజారిటీ వచ్చింది. అలాగే మున్సిపల్ మంత్రి సొంత నియోజకవర్గం కందుకూరులో 29 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. మహీధర రెడ్డి స్వగ్రామం మాచవరంలో వెయ్యి ఓట్లకుపైగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు మెజారిటీ రావడం చర్చనీయాంశమైంది.

కోవూరులో పెరిగిన మెజారిటీ

కోవూరు శాసనసభస్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అత్యధికంగా 51,468 ఓట్ల ఆధిక్యం లభించింది. కోవూరు ఉప ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఇది రెట్టింపు. దీన్నిబట్టి వైఎస్సార్ కాంగ్రెస్ బలం పెరిగినట్టు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి టి.సుబ్బరామిరెడ్డి స్వగ్రామం ఈ నియోజకవర్గంలోనే ఉండడం గమనార్హం. కోవూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విజయంతో ప్రారంభమైన హవా ఈ ఉప ఎన్నికల్లోనూ కొనసాగింది.

ప్రజలు గొప్పతీర్పు ఇచ్చారు: మేకపాటి

రాజశేఖరరెడ్డిపై అభిమానం, జగన్‌మోహన్ రెడ్డిపైన విశ్వాసంతో ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, టీడీపీల కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని, ఈ తీర్పు ఆ పార్టీ నేతలకు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి మమతా బెనర్జీ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఫోన్‌లో సంప్రదించారన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!