YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 14 June 2012

సాయిరెడ్డి ‘నార్కో’ పరీక్షలకు ఇదే కోర్టు అనుమతి నిరాకరించింది * మళ్లీ పిటిషన్ దాఖలు చేయడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుంది

* మత్తు ఇచ్చి మాట్లాడించడం మానసికఏకాంతంలోకి చొరబడడమే
* నార్కోఅనాలసిస్ పరీక్షలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
* సాయిరెడ్డి ‘నార్కో’ పరీక్షలకు ఇదే కోర్టు అనుమతి నిరాకరించింది
* మళ్లీ పిటిషన్ దాఖలు చేయడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుంది
* కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు జరిమానా విధించండి
* విచారణ ఈనెల 19కి వాయిదా

హైదరాబాద్, న్యూస్‌లైన్: సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిసినా... వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డిలను వేధించేందుకే నార్కోఅనాలసిస్, పాలిగ్రాఫ్, బీప్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసిందని జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి ఆరోపించారు. నార్కోఅనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై జగన్, సాయిరెడ్డి తరఫున ఆయన గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. నార్కోపరీక్షలు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని, ప్రాథమిక హక్కులను హరించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. 

సీఆర్‌పీసీ సెక్షన్ 161(2), ఎవిడెన్స్ చట్టాలతోపాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ప్రకారం నిందితులు, అనుమానితులు, సాక్షులను ఒత్తిడిచేసి... వారికి వ్యతిరేకంగా వారే వాంగ్మూలం ఇవ్వాలంటూ బలవంత పెట్టకూడదని నిబంధనలు చెబుతున్నాయని చెప్పారు. నిందితులకు మౌనంగా ఉండే హక్కు ఉంటుందని, నార్కోపరీక్షలు నిర్వహించాలని సీబీఐ కోరడం ఈ హక్కును హరించడమే అవుతుందని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డికి గతంలో నార్కోపరీక్షలు నిర్వహించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇదే కోర్టు ఫిబ్రవరి 2న కొట్టివేసిందని... సీబీఐ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ దాఖలు చేయవచ్చని, కానీ ఇదే కోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేయడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని నివేదించారు. 

సత్యం కేసులోనూ చుక్కెదురే
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు తదితరులకు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు ధర్మాసనం కూడా నిరాకరించిందని అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. నార్కోపరీక్షలకు కోర్టులు అనుమతించవని తెలిసినా చట్టప్రక్రియను దుర్వినియోగం చేసేందుకే సీబీఐ ఈ తరహా పిటిషన్లు దాఖలు చేస్తోందని ఆరోపించారు. ఇటువంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు సీబీఐకి జరిమానా విధించాలని కోరారు. సీబీఐ విచారణకు జగన్, సాయిరెడ్డి పూర్తిగా సహకరించారని, తెలిసిన సమస్త సమాచారాన్ని వెల్లడించారని... ఇంకా కొత్తగా చెప్పేదేమీ లేదని వివరించారు. నార్కో పరీక్షలవల్ల శరీరానికి ఎటువంటి ప్రమాదం లేదని సీబీఐ చెబుతున్నది అవాస్తవమని, నార్కోపరీక్షల సందర్భంగా ఇచ్చే మత్తుపదార్థాలు తీవ్ర ప్రమాదకరమని, చనిపోయే అవకాశం కూడా ఉందని నివేదించారు. 

సెల్వి వర్సెస్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు...
మనిషిని స్పృహలోలేని స్థితికి తీసుకొచ్చి మాట్లాడించడం ఆయన మానసిక ఏకాంతంలోకి చొరబడినట్లు అవుతుందని సెల్వి వర్సెస్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని జగన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇటువంటి పరీక్షలు మనుషుల పట్ల దిగజారుడు స్థాయిలో ప్రవర్తించడం కిందకే వస్తుందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని తెలిపారు. నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించడం ప్రాథమిక హక్కులను హరించడమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిందని పేర్కొన్నారు. 

‘‘న్యాయవాది సాయం తీసుకొని కోర్టుల్లో నిందితుడు తన వాదనను పటిష్టంగా వినిపించే హక్కును ఈ పరీక్షలు హరిస్తాయి. కోర్టుల్లో స్వేచ్ఛ, పారదర్శక తుది విచారణ (ట్రయల్)కు ఈ పరీక్షలతో అర్థం లేకుండా పోతోంది. ఏ వ్యక్తి మీదా బలవంతంగా ఇలాంటి పరీక్షలు జరపరాదు’’ అని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసిందని పేర్కొన్నారు. సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం ఈ పిటిషన్ విచారణార్హం కాదని, కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. కౌంటర్‌ను పరిశీలించిన న్యాయమూర్తి పుల్లయ్య విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!