YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 22 July 2012

సిరిసిల్లలో సర్వం సిద్ధం

* చేనేత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
* ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ
* ఉదయం సిరిసిల్ల చేరుకోనున్న విజయమ్మ
* నేతన్న, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు
* ఉదయం 11 నుంచి సాయంత్రం 5 దాకా ధర్నా
* నేతలతో పాటు ఇద్దరు చేనేత కార్మికుల ప్రసంగం
* టీఆర్‌ఎస్ హెచ్చరికల నేపథ్యంలో భారీ బందోబస్తు
* జిల్లా పార్టీ నేతల పర్యవేక్షణలో పూర్తయిన ఏర్పాట్లు

హైదరాబాద్/కరీంనగర్/సిరిసిల్ల, న్యూస్‌లైన్: నేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా, చేనేతలను ఆదుకోవాలన్న డిమాండ్‌తో సోమవారం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తలపెట్టిన ధర్నాకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోనే నేత కార్మికులు అత్యధికంగా ఉన్న కేంద్రాల్లో సిరిసిల్ల ఒకటి గనుక, వారి సమస్యల పరిష్కారానికి అక్కడి నుంచే ఆందోళన ప్రారంభించాలనే సంకల్పంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. నేత కార్మికులకు ధైర్యం నింపి, వారి సమస్యలపై సర్కారుతో పోరాడేందుకు తొలిసారిగా సిరిసిల్లకు వస్తున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణికి ఘనస్వాగతం పలికేందుకు నేత కుటుంబాలతో పాటు ఆత్మీయులు, అభిమానులు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని టీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ధర్నాను శాంతియుతంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. టీఆర్‌ఎస్ విమర్శలకు స్పందించకుండా, చేనేత సమస్య పరిష్కారంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని నేతలను ఆదేశించింది. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించేందుకు విజయమ్మ తలపెట్టిన ధర్నాను రాజకీయం చేయొద్దని పార్టీ నేతలు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ అంశానికి ఈ ధర్నాతో సంబంధం లేదని, ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఏడాది క్రితమే పార్టీ వైఖరిని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కేంద్రం పరిధిలో ఉన్న ఈ సమస్యను త్వరగా తేల్చాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా డిమాండ్ చేశారు కూడా. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువకులు, విద్యార్థులు విజయమ్మ ధర్నాను సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలని వైఎస్సార్‌సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.

కొమురవెల్లి మీదుగా...
విజయమ్మ సోమవారం ఉదయం ఏడింటికి హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి సిరిసిల్ల బయల్దేరతారు. షామీర్‌పేట, తుర్కపల్లి, ఒంటిమామిడి, ములుగు, ప్రజ్ఞాపూర్, సిద్ధిపేట క్రాస్ రోడ్డు మీదుగా చిన్నకోడూరు నుంచి సిరిసిల్ల చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదింటి దాకా ధర్నా చేస్తారు. నేత కార్మికులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వాటి పరిష్కారానికి సర్కారుపై పోరాడేందుకు కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటిస్తారు. కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు తదితర వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు ఇద్దరు నేత కార్మికులు ప్రసంగిస్తారు. సిరిసిల్ల వెళ్లే ముందు దారిలో వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామిని కూడా విజయమ్మ దర్శించు కుంటారని పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ ఆమె వెంట ఉంటారన్నారు. ధర్నా ప్రారంభించే ముందు సిరిసిల్ల నడిబొడ్డున ఉన్న నేతన్న, అంబేద్కర్ విగ్రహాలకు ఆమె పూలమాల వేసి నివాళులర్పిస్తారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలతో పాటు జిల్లా అంతటా ధర్నా గురించే విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్వచ్ఛందంగా వాహనాలను ఏర్పాటు చేసుకుని ధర్నాకు తరలివచ్చేందుకు నేత కార్మికులు సన్నద్ధమవుతున్నారు.

మారిన ధర్నా వేదిక...
సిరిసిల్లలో వైఎస్ చేనేత ధర్నా వేదిక మారింది. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు తొలుత భావించారు. కామారెడ్డి-కరీంనగర్ రోడ్డుకు వేదిక కనీసం 50 అడుగుల దూరం ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించడంతో పుల్లూరి రాధాకృష్ణ కాంప్లెక్స్‌ను ఎంచుకున్నారు. పలువురు తెలంగాణ ప్రాంత నాయకులు ఇప్పటికే సిరిసిల్లకు చేరుకుని విజయమ్మ ధర్నా వేదిక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కె.కె.మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, పుట్టా మధు ధర్నా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

భారీ బందోబస్తు...
నేతన్న ధర్నాను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్, రాజకీయ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ధర్నాకు ఆటంకం కలిగిస్తారనే అనుమానంతో పలువురు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ సోమవారం సాయంత్రానికల్లా విడిచిపెడతామని పోలీసు వర్గాలంటున్నాయి. సిరిసిల్లలో పోలీసులు కవాతు నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలింగ్, పెట్రోలింగ్ పార్టీలను విస్తృతం చేశారు. 

ఇద్దరు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 75 మంది ఎస్సైలు, 113 మంది ఏఎస్సైలు, 100కు పైగా హెడ్ కానిస్టేబుళ్లు, 551 మంది కానిస్టేబుళ్లతో దీక్షా స్థలి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసిల్లతో పాటు ఉద్రిక్తత తలెత్తొచ్చనే అనుమానమున్న ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ధర్నాకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అడ్డంకులు, అవాంతరాలు ఎదురవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు శాఖ పేర్కొంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!