YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 7 July 2012

మహాయజ్ఞ భగ్నానికి మారీచయత్నం

ప్రాజెక్టులకు గండి కొట్టేందుకు సర్కారు తీవ్రయత్నం
దివంగత వైఎస్‌పై మళ్లీ బురద చల్లే కుయత్నం 
కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 
86 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన వైఎస్ 
వైఎస్ హయాంలోనే 12 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి 
మరో 21 ప్రాజెక్టుల నిర్మాణం పాక్షికంగా పూర్తి 
వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర సర్కారు కుంటి సాకులు 
ఒక్క ప్రాజెక్టు నిర్మాణాన్నీ పూర్తి చేయకుండా కొర్రీలు 
ఇప్పుడు మొత్తం ప్రాజెక్టులకే ఎసరు పెట్టే యత్నాలు 
తాజాగా జలయజ్ఞంపై ప్రత్యేక ప్రాథమిక ఏజీ నివేదిక 
నివేదికను చూసి ఇరిగేషన్ అధికారుల దిగ్భ్రాంతి
జలయజ్ఞం మొత్తం బోగస్ అంటున్న నివేదిక? 
ఈ నెల 17, 18 తేదీల్లో ఇరిగేషన్ శాఖ భేటీ 
తర్వాత ప్రభుత్వానికి అధికారిక నివేదిక 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏళ్లతరబడి బీళ్లుగా మిగిలిపోయిన భూములకు నీరందించి సాగులోకి తేవటం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలయజ్ఞానికి మంగళం పాడేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలన్నింటికీ పూర్తిగా గండికొట్టేందుకు కేంద్ర నాయకత్వ మార్గనిర్దేశనంలో ప్రయత్నాలు తీవ్రం చేసింది. ఇప్పటికే ఒక పథకం ప్రకారం కావాలనే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తికాకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. ప్రాధాన్యత పేరుతో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను వాయిదా వేయటం, సకాలంలో నిధులు చెల్లించకపోవటం ద్వారా ప్రాజెక్టుల పనుల్లో ఉద్దేశపూర్వకంగానే వేగం తగ్గించటం, తర్వాత జీవో నంబర్-1 పేరుతో ప్రాజెక్టులను సమీక్షించి కొన్నింటిని రద్దు చేయటానికి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయటం, దానికి కొనసాగింపుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఏయే ప్రాజెక్టులను రద్దు చే యాలో సూచించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వటం.. వరుసగా జరుగుతున్నాయి. ఇలా.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై మరింత బురద చల్లుతూ రాజకీయ లబ్ధిపొందటంతో పాటు.. మొత్తం ప్రాజెక్టుల నిర్మాణానికీ బ్రేక్ వేయవచ్చన్న పన్నాగాన్ని పద్ధతి ప్రకారం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నేతృత్వంలో పనిచేసే రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ (ఏజీ) తాజాగా మొత్తం జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ బోగస్ అని, అవినీతిమయమని దాదాపు 400 పేజీలతో ప్రాథమిక నివేదిక ఇవ్వటం.. వ్యవసాయరంగ నిపుణులతో పాటు ఇరిగేషన్ అధికారులను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఏజీ నివేదికపై ఈ నెల 17, 18 తేదీల్లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగ్ అభ్యంతరాలపై ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ సమావేశంలో వివరణ ఇవ్వనున్నారు. అనంతరం నివేదికను అధికారికంగా ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఆశ్చర్యకర అభ్యంతరాలు... 

జలయజ్ఞం ప్రాజెక్టులపై ఏజీ ప్రాథమిక నివేదికలో వెలిబుచ్చుతున్న అభ్యంతరాలను పరిశీలిస్తే తీవ్ర ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని ప్రాజెక్టులను ఒకేసారి ఎందుకు మొదలు పెట్టారనేది అందులో ప్రధాన అభ్యంతరంగా చెప్తున్నారు. ప్రాజెక్టులను ఒకేసారి మొదలు పెట్టటం ద్వారా రాష్ట్రానికి, ప్రజలకు జరిగే నష్టం ఏమీ లేదని.. ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే నష్టం కానీ.. ఒకేసారి మొదలు పెట్టటం తప్పు కాదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. పైగా ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న సాగునీటి రంగంపై ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టి భారీ బడ్జెట్ కేటాయింపుల్ని సకాలంలో ఖర్చు చేయగలిగితే ఎన్ని ప్రాజెక్టులనైనా పూర్తి చేయవచ్చని పేర్కొంటున్నారు. గతంలోనే ప్రాజెక్టులను నిర్మించి ఉన్నట్లయితే.. మొన్నటి ట్రిబ్యునల్ తీర్పులో సదరు ప్రాజెక్టులకు నీటి కోటా లభించేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ప్రాజెక్టులను నిర్మించకపోవటం వల్లనే రాష్ట్రానికి నీటి కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని గుర్తుచేస్తున్నారు. 

అలాగే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు రాకముందే పనుల్ని మొదలు పెట్టటమన్నది ఏజీ నివేదికలో పేర్కొన్న మరో అంశంగా తెలిసింది. ఈ విషయంపై వైఎస్ స్వయంగా గతంలో స్పష్టత ఇచ్చారు. నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పరిశ్రమలతో పోల్చలేమని, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే చేపట్టాలంటే దేశంలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేమని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రంలోని 18 విభాగాల నుంచి అనుమతులు రావాల్సి ఉంటుందని.. అయితే ఈ అనుమతులు దశల వారీగా విడుదల చేస్తారని.. ప్రాథమిక అనుమతులైన సీడబ్ల్యుసీ, హైడ్రాలజీ, ఫారెస్ట్ వంటి విభాగాల నుంచి అనుమతులు వస్తే ప్రాజెక్టును మొదలు పెట్టటానికి అవకాశం ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. నిర్మాణ దశలను బట్టి మిగతా అనుమతులను జారీ చేస్తారని వివరిస్తు న్నారు. నదుల్లో నీరు లేకుండానే ప్రాజెక్టులను చేపట్టారనే అభిప్రాయాన్ని కూడా ఏజీ వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే.. కేంద్ర జల సంఘం అనుమతులు రావని, నీటి ఆధారాన్ని చూపితేనే జలసంఘం ప్రాథమిక అనుమతిని జారీ చేస్తుందని ఇరిగేషన్ నిపుణులు చెప్తున్న మాట. రాష్ట్రంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం అనుమతులు ఉన్నాయి. అంటే నీటి లభ్యతపై ఎలాంటి అనుమానం లేనట్లే కదా అని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కృష్ణా నదిపై చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు మహబూబ్‌నగర్, నల్లగొండ, అనంతపురం వంటి కరువు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవని.. వీటికి వరద నీటిని ఉపయోగించుకోవటానికి అనుమతి ఉందని వారు గుర్తుచేస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సహాయంకూడా చేస్తున్నదని.. అవి ఏజీకి మరోలా ఎందుకు కనిపిస్తున్నాయనేది అంతుపట్టని విషయమని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. 

అసలు.. ఇప్పటికే పలు ప్రాజెక్టులపై ఏజీ ఇచ్చిన నివేదికను ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) పరిశీలి స్తోంది. తాజాగా మొత్తం జలయజ్ఞంపై ప్రత్యేక నివేదికను రూపొందించటానికి ఏజీ సిద్ధపడటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటి వరకు సుమారు రూ. 60 వేల కోట్లు వ్యయం చేశారు. కాంట్రాక్టర్ల ఎంపికలో లోపాలు లేకుండా ఉండటం కోసం ఈపీసీ విధానాన్నీ అమలు చేశారు. ఇంత శాస్త్రీయంగా చేపట్టిన ప్రాజెక్టులపై కొత్తగా సందేహాలను తెరపైకి తీసుకురావటం పట్ల రాజకీయ దురుద్దేశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వైఎస్ తర్వాత ప్రాధాన్యత కోల్పోయిన సాగునీటి ప్రాజెక్టులు
రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితుల దృష్ట్యా కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత వైఎస్ ..జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టుల నిర్మాణం మొదలు పెట్టారు. వాటిలో ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి సుమారు 20 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం కల్పించారు. ఆయన మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టులను ప్రాధాన్యత పేరుతో మూడు విభాగాల కింద విభజించారు. మొదటి ప్రాధాన్యత క్రమంలో ఉన్న ప్రాజెక్టుల పనుల్నే చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. కానీ.. ఆ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేకపోయారు. దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ వంటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతా ప్రాజెక్టుల ప్రగతిలో మార్పు లేదు. సకాలంలో డబ్బులు ఇవ్వకపోవటంతో కాంట్రాక్టర్లు పనులు మానేశారు. తర్వాత బిల్లులు చెల్లిస్తామన్నా.. వారు ముందుకు రావటం లేదు. ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లటం, బయటి మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో పనులు చేస్తే నష్టం వస్తుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. దాంతో ప్రాజెక్టుల నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను సైతం పూర్తి చేయలేకపోయారు. గత రెండు ఖరీఫ్ సీజన్ల నుంచి ఆయకట్టుకు నీరు ఇస్తామని పాలకులు చెప్తున్నా.. ఆచరణలోకి మాత్రం రావటం లేదు. ఉదాహరణకు గత ఖరీఫ్‌లోనే హంద్రీ-నీవా ప్రాజెక్టు నుంచి నీరు ఇస్తామని మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. ఈ ఏడాది కూడా నీరిచ్చే పరిస్థితి లేదు. దాంతో ఈ ప్రాజెక్టు కోసం పాదయాత్రకు స్వయంగా మంత్రియే పూనుకోవటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!