YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 6 July 2012

పేకాట క్లబ్ బీటెక్ రవిదే

రాష్ట్ర రాజధానిలోని ఫిలింనగర్‌లో మూడు నెలలుగా సాగుతున్న పేకాట దందాకు ఎట్టకేలకు పోలీసుల దాడితో తెరపడింది. ఈ పేకాట క్లబ్‌ను పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి ఆధ్వర్యంలో నడుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడవడం గమనార్హం. ఫిలింనగర్ రోడ్ నంబర్ -9లోని ప్లాట్ నంబర్ 86-ఏలోని ఓ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు గురువారం రాత్రి దాడి చేసి 26 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేయడం, రూ.21.88 లక్షలను స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. అరెస్టైన వారిలో బీటెక్ రవితోపాటు కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ సోదరుడు దానం రవీందర్, పలువురు రాజకీయ ప్రముఖులున్న విషయం విదితమే. పేకాట దందా నడుస్తున్న ఫ్లాట్‌ను సోమశేఖరరెడ్డి అనే వ్యక్తి అద్దెకు తీసుకోగా.. అందులో మూడు నెలలుగా అనధికారికంగా పేకాట క్లబ్‌ను బీటెక్ రవి నడిపిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై బీటెక్ రవి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా సుమారు రూ.150 కోట్ల పేకాట దందా కొనసాగినట్టు సమాచారం. గురువారం ఒక్కరోజే రూ.కోటి మేరకు పేకాట దందా సాగినట్టు వెల్లడైంది. పేకాడుతూ చిక్కిన పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవితోపాటు 26 మంది పేకాటరాయుళ్లపై పోలీసులు ఏపీ గేమింగ్ యాక్ట్ 3 అండ్ 4 కింద కేసులు నమోదు చేశారు. గురువారం రాత్రంతా వీరిని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన పోలీసులు శుక్రవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మూడువేల నగదు, ఒకరి ష్యూరిటీతో న్యాయస్థానం వీరికి బెయిల్ మంజూరు చేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!