YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 3 July 2012

ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించండి .సీబీఐ కోర్టుకు సాయిరెడ్డి విజ్ఞప్తి

* 3 కేసులపై లాయర్లతో చ ర్చించాల్సి ఉందని వెల్లడి
* ప్రయాణ వివరాలు అందజేస్తానని, పిలిచినప్పుడు విచారణకు హాజరవుతానని హామీ
* నిర్ణయాన్ని 9వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలు చేసిన, చేయనున్న పిటిషన్లపై సీనియర్ న్యాయవాదులతో చర్చించేందుకు వీలుగా ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించాలని ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు మంగళవారం విచారించారు. సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ సాయిరెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. అలాగే జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ సమర్పించిన మూడు చార్జిషీట్లను వేర్వేరుగా విచారణకు స్వీకరించడాన్ని హైకోర్టులో సవాల్ చేయగా కొట్టివేశారని... దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. 

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తులపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌లో సాయిరెడ్డి ఇంప్లీడ్ కానున్నట్లు వివరించారు. ఈ మూడు కేసులపై ఆయన న్యాయవాదులతో చర్చించాల్సి ఉందని చెప్పారు. ఢిల్లీకి వెళ్లే తేదీ, సమయం తదితర వివరాలను సీబీఐ అధికారులకు సమర్పించే వెళ్తామని నివేదించారు. తమకు నెల రోజుల సమయంలో కావాలని, అవసరమైనప్పుడు మాత్రమే ఢిల్లీకి వెళ్తామని అన్నారు. 

సీబీఐ ఎప్పుడు పిలిచినా సాయిరెడ్డి విచారణకు హాజరవుతారని, అలాగే కోర్టు విచారణకు కూడా హాజరవుతారని హామీ ఇచ్చారు. గతంతో షిర్డీ, తిరుమల వెళ్లేందుకు కోర్టు అనుమతించిన సమయంలోనూ యాత్ర వివరాలను ముందే సీబీఐకి అందజేశామని వివరించారు. అయితే ఢిల్లీలో ఎంతకాలం ఉంటారో చెప్పకుండా అనుమతికోరడం తగదని సీబీఐ తరఫు డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సాయిరెడ్డి పిటిషనర్ కాదని, వీరి కేసుల్లో వాదనలు వినిపించేందుకు ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదులే హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. 

జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ దశలో సాయిరెడ్డి హైదరాబాద్ విడిచి వెళ్తే దర్యాప్తునకు విఘాతం కల్గే అవకాశం ఉందని అన్నారు. ఢిల్లీకి వెళ్తానని చెప్పి జైపూర్ వెళ్లవచ్చని, అందుకే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి ఇస్తే...ఆ వివరాలను తమకు సమర్పించేలా ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి... నిర్ణయాన్ని ఈనెల 9కి వాయిదా వేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!