YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 3 July 2012

వైఎస్ హయాంలో భరోసా నేడు లేదు..

- సీఎంను కలిసిన 11 మంది ఎమ్మెల్యేలు
- సర్కారు నిర్లక్ష్యంపై ఉద్యమిస్తామని హెచ్చరిక
- విత్తనాలు, ఎరువుల బ్లాక్‌మార్కెట్‌ను 
- నియంత్రించాలని డిమాండ్
- గిట్టుబాటు ధర కోసం రూ.3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని వినతి
- జగన్ చెప్పినట్లు రూ.500 కోట్లతో 
- 13 ప్రాజెక్టుల పూర్తిపై ఆలోచించాలని సూచన 

హైదరాబాద్, న్యూస్‌లైన్: సర్కారు మొద్దు నిద్ర వీడాలని, రాష్ట్రంలో అష్టకష్టాలు పడుతున్న రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రైతు సమస్యలపై మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సీఎంను కలిసిన ఎమ్మెల్యేల్లో ధర్మాన కృష్ణదాస్, తెల్లం బాలరాజు, గొల్ల బాబూరావు, కొరుముట్ల శ్రీనివాసులు, భూమన కరుణాకర్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, బి.గురునాథరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉన్నారు. ఏరువాక జోరుగా సాగాల్సిన తరుణంలో రైతన్నలు విత్తనాలు దొరక్క, ఎరువులు లేక, రుణాలు అందక కొట్టుమిట్టాడుతూండటం ఆందోళనకరమని వారు సీఎం దృష్టికి తెచ్చారు. 

వైఎస్ హయాంలో భరోసా నేడు లేదు..
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఉన్న భరోసా గత మూడేళ్లలో పటాపంచలైందని 11 మంది ఎమ్మెల్యేలు కిరణ్‌కుమార్ రెడ్డికి విన్నవించారు. సమావేశం ముగిసిన అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రైతుల కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చామన్నారు. విత్తనాలు, ఎరువులను రైతులు బ్లాక్‌మార్కెట్‌లో కొనడం చూస్తే ప్రభుత్వం ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందనే విషయం అవగతమవుతోందన్నారు. 

రాష్ట్రంలో 80 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతూ ఉంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా 27 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, మరో 15 లక్షల టన్నుల యూరియా అవసరమవుతోందన్నారు. అయితే ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నవి వీటిలో 15 శాతం మాత్రమేనని చెప్పారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు.

శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల రుణాలపై వడ్డీ మాఫీ గడువును మరో నెల పొడిగించాలని కోరామన్నారు. పూర్తి కష్టాల్లో ఉన్న రైతులకు ఇదెంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పొరుగు రాష్ట్రాల నుంచైనా విద్యుత్‌ను కొనుగోలు చేసి రైతుల పంటలను కాపాడే వారని గుర్తు చేశారు. ఇప్పటి ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని దుయ్యబట్టారు. రైతులకు జీవనాధారమైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, పంటలు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఘోరవైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

క్రాప్ హాలిడే ప్రకటించినపుడు మేల్కొని ఉండాల్సింది
గత ఏడాది రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించినపుడే ప్రభుత్వం మేల్కొని ఉండాల్సిందని, ఈ రోజు రైతులకు వచ్చిన సమస్యలు కొన్ని ప్రకృతి పరమైనవైతే మరికొన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల వచ్చినవేనని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినతిపత్రంలో పేర్కొన్నారు. తమకు ప్రభుత్వం మేలు చేస్తుందన్న భరోసా రైతులకు కలగడం లేదని, జూలై మొదటి వారంలో రైతులు పొలం పనుల్లో తలమునకలు కావాల్సిన సమయంలో తల పట్టుకుని కూర్చున్నారంటే అందుకు ముఖ్యమంత్రి వైఖరే కారణమని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విత్తనాల కోసం లాటరీలు వేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

బ్లాక్‌మార్కెట్ ఫలితంగా నకిలీ విత్తనాలు రైతులను నిలువునా ముంచే ప్రమాదం ఏర్పడింది. కనుక వెంటనే బ్లాక్‌మార్కెటింగ్‌ను నియంత్రించాలి. 930 రూపాయలు ఖరీదు చేసే బీటీ పత్తి విత్తనాలు 2 నుంచి 3 వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఎరువులు దొరక్క పోగా గత మూడేళ్లలో ఎరువుల ధరలు 300 శాతం పెరిగాయి. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రుణ ప్రణాళికలో హెక్టారుకు కనీసం 50 వేల రూపాయల రుణం ఇవ్వాలి. అయితే బ్యాంకులన్నీ కలిపినా అందులో సగం రుణం కూడా ఇవ్వడం లేదు. సహకార సంఘాల్లోనైతే ఎంత భూమి ఉన్నా రైతుకు 50 వేలకు మించి ఇవ్వడం లేదు. రుణాలు అందని వారు ఇంకా 75 శాతం మంది ఉన్నారని ప్రస్తావిస్తూ ఇదేం దుస్థితి అని ప్రశ్నించారు.

సీఎం ప్రకటించినా.. అమలు లేదు..
కౌలు రైతులకు కూడా రుణాలు ఇస్తామని ఢిల్లీ వీధుల్లో సీఎం ఆర్భాటంగా చేసిన ప్రకటనను ఆచరణలో మాత్రం అమలులో పెట్టలేదని వినతిపత్రంలో విమర్శించారు. 40 లక్షల మంది కౌలు రైతులు ఉంటే 20 శాతం మందికి రుణ అర్హత కార్డులు ఇవ్వలేదన్నారు. రైతులందరికీ తక్షణమే ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు క్రాప్‌హాలిడే ప్రకటిస్తే రుణాలను రద్దు చేయించాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి ఎందుకు కలగలేదని వారు ప్రశ్నించారు. 

తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి డిమాండ్ చేసినట్లుగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి రూ. 3,000 కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కూడా వారు సీఎంకు విజ్ఞప్తి చేశారు. 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 13 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని జగన్ గత ఏడాది చేసిన విజ్ఞప్తిపై స్పందించాలని కోరారు. రైతు సమస్యలపై గత రెండేళ్లుగా జగన్ ఎన్నో దీక్షలు, ధర్నాలు, పాదయాత్రలు, నిరసనలు చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు.

పార్టీ కండువాకు అభ్యంతరం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలవడానికి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాను ధరించి వెళ్లినపుడు భద్రతా సిబ్బంది నుంచి ఆయనకు వింత అనుభవం ఎదురైంది. పార్టీ కండువాను తీసేసి వెళ్లాలని వారు ఆయనను కోరినపుడు ఆయన అందుకు తీవ్రంగా ప్రతిఘటించారు. కండువాను తీసే సమస్యే లేదని, తాను అలాగే వెళతానని చెప్పారు. స్పీకర్ మనోహర్ సహా పలువురు కాంగ్రెస్ కండువాను వేసుకుని వెళుతున్నపుడు తానెందుకు పార్టీ కండువా తీయాలని భద్రతా సిబ్బందిని శ్రీకాంత్ ప్రశ్నించారు. చివరకు ఆయన వారి అభ్యంతరాలను లెక్క చేయకుండా పార్టీ కండువాతోనే వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!