YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 5 July 2012

వైఎస్సార్‌సీపీ సీజీసీలోకి సురేఖ, బోస్, మైసూరా

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యులుగా మాజీ మంత్రులు కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజ్యసభ మాజీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి నియమితులయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన నాటి నుంచీ ఆయన కుటుంబంతో పాటు పయనిస్తున్న సురేఖ తన మంత్రి పదవిని వదులుకున్నారు. ఆ తర్వాత గతేడాది జరిగిన సకల జనుల సమ్మెను పురస్కరించుకుని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 

అయితే స్పీకర్ ఆమె రాజీనామాను ఆమోదించలేదు. అనంతరం గతేడాది డిసెంబర్‌లో రైతులు, రైతు కూలీల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగాలని కోరుతూ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి అసెంబ్లీ సభ్యత్వం నుంచి అనర్హతకు గురయ్యారు. తర్వాత గత నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసి తుది కంటా పోరాడిన సురేఖ.. స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్ తొలి నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలిచినందువల్ల రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి తన శాసనసభా సభ్యత్వాన్ని కోల్పోయారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో రామచంద్రపురంలో మళ్లీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్‌కు సమకాలికుడైన మైసూరారెడ్డి సీనియర్ రాజకీయ వేత్త. ఇటీవలి వరకూ ఆయన టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 

జగన్ అరెస్టుకు ముందు పార్టీలో చేరిన మైసూరా ప్రస్తుతం క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురి సేవలను పార్టీకి పూర్తి కాలం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారిని సీజీసీ సభ్యులుగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలికి మరో సభ్యుడిగా మైనారిటీ నాయకుడు మతీన్ ముజద్దాదిని కూడా నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి విభాగం కన్వీనర్‌గా ఉడుముల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి ఉపాధి అవకాశాల కల్పన విభాగం కన్వీనర్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఉడుముల లక్ష్మీనారాయణరెడ్డి(వీఎల్‌ఎన్ రెడ్డి)ని నియమించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రకాశం జిల్లా చినారికట్ల గ్రామానికి చెందిన వీఎల్‌ఎన్.. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఎయిరో పార్క్(సెజ్) రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. వైఎస్‌తో సన్నిహిత సంబంధాలు కల్గిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చిన్నతరహా పరిశ్రమల బోర్డు, ఎస్‌ఎస్‌ఐ(ఎంఎస్‌ఎంఇ), రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, రిజర్వు బ్యాంకు సాధికార కమిటీతో సహా పలు సంస్థల్లో సభ్యుడిగా విశిష్ట సేవలు అందించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!