YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 24 June 2012

కాల్స్ వ్యవహారంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ఏబీఎన్ చానెల్ రాధాకృష్ణకు చంద్రబాల నుంచి వచ్చిన కాల్స్ విషయమై ఎందుకు మాట్లాడ్డం లేదు



జగన్ కేసుల దర్యాప్తులో సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ పాత్ర తొలి నుంచీ అనుమానాస్పదంగా ఉందనీ ఆయనను విచారణ నుంచి తప్పించాలనీ ఆ పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు అయిన భూమా శోభా నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరూ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జేడీ లక్ష్మీనారాయణ కాల్స్ జాబితా చూసిన తరువాత ఆయన ఎలా వ్యవహరిస్తున్నారోననేది స్పష్టంగా వెల్లడైందని అన్నారు. లీడ్ ఇండియా ముసుగులో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతోందనే అనుమానాలు కూడా తమకు ఉన్నాయనీ ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ జరిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. 


లక్ష్మీనారాయణ కాల్స్ జాబితాపై తాము త్వరలో ప్రధానమంత్రి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. కాల్స్ జాబితా ఆధారంగా తాము జగన్‌పై జరుగుతున్న కుట్రను ప్రశ్నిస్తూ ఉంటే కొన్ని పత్రికలు, మీడియా మాత్రం ఈ అంశాన్ని పూర్తిగా తప్పు దోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ‘లక్ష్మీనారాయణ ఫోన్ నుంచి కొన్ని వందల సార్లు చంద్రబాల అనే మహిళకు ఎందుకు ఫోన్లు వెళుతున్నాయి? ఆమెకూ ఆయనకూ మధ్య చాలా సార్లు ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌లు వెళుతున్నాయి, వస్తున్నాయి. అదే చంద్రబాల నుంచి జగన్‌కు బద్ధ శత్రువు అయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఫోన్లు వెళుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందని మేం కొన్ని అనుమానాలు లేవనెత్తాం. 

అంతే కాదు ఈ ఏడాది మార్చి నుంచి తాను లీడ్ ఇండియా కార్యక్రమాలకు సంబంధించి రాధాకృష్ణతో మాట్లాడుతున్నట్లు చంద్రబాల చెబుతున్నారు. కానీ అది నిజం కాదు, ఆమె గత జూన్ నుంచే మాట్లాడుతున్నారు, ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారనే సమాచారం మా వద్ద ఉంది. ఇవన్నీ చూసిన తరువాత జగన్‌పై కుట్ర జరుగుతోందని మాకు అనుమానాలున్నాయి. అందుకు సమాధానం చెప్పాల్సింది పోయి అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు, కాల్స్ వ్యవహారంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ఏబీఎన్ చానెల్ రాధాకృష్ణకు చంద్రబాల నుంచి వచ్చిన కాల్స్ విషయమై ఎందుకు మాట్లాడ్డం లేదు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు?’ అని ఎమ్మెల్యేలు అన్నారు. 

వాస్తవానికి తాము జేడీ ఫోన్ కాల్స్ జాబితాను విడుదల చేసినపుడు చంద్రబాల ఎవరు! అనే అనుమానాలను మాత్రమే వ్యక్తం చేశాం. ఆమెకు ఎలాంటి దురుద్దేశ్యాలూ ఆపాదించలేదు. ఆమెను బహిరంగంగా తన చానెల్ ద్వారా బయటకు తెచ్చి ఎవరో తెలియజెప్పి బట్టబయలు చేసింది రాథాకృష్ణ మాత్రమే అని వారన్నారు. జేడీ చేసిన కాల్స్‌కు సమాధానం చెప్పమంటే అసలు ఆ కాల్స్ ఎలా బయటకు తెచ్చారు? వాటిని ఎవరు బయట పెట్టారు? అనే దిశగా ప్రజల దృష్టిని మళ్లించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజుల్లో ఒక వ్యక్తి కాల్స్ జాబితాను సంపాదించడం అంత కష్టమా అని ప్రశ్నిస్తూ సాక్షి పత్రిక నుంచి తమకు కాల్స్ జాబితా అందిందనే ది పూర్తిగా తప్పుడు ప్రచారమని కూడా వారన్నారు. 

‘జగన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మాకు ఎన్నో మార్గాలున్నాయి. జగన్‌పై లక్ష్మీనారాయణ తన హోదాను అడ్డం పెట్టుకుని చేస్తున్న కుట్రను భరించలేని అభిమానులు మాకు ఈ సమాచారాన్ని అందించి ఉండొచ్చు అని ఎమ్మెల్యేలు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లక్ష్మీనారాయణ కాల్స్ జాబితా ఎవరో కోర్టుకు సమర్పించారనీ అదొక పబ్లిక్ డాక్యుమెంట్ అని వారన్నారు. ఆ డాక్యుమెంట్‌కు తోడు తమకు కొందరు జగన్ అభిమానులు అందజేసిన సమాచారాన్ని జత చేశామని కూడా వారు వెల్లడించారు. లక్ష్మీనారాయణ ఏమీ కింది స్థాయి అధికారి కాదనీ ఒక ఉన్నత హోదా కలిగిన వ్యక్తి అనీ ఆయన ఎవరితో మాట్లాడాలనే విషయమై కొన్ని హద్దులు ఉంటాయని వారన్నారు. 

క్రైం రిపోర్టర్లను తామేదో ఇరకాటంలో పెట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారనీ అదెంత మాత్రం నిజం కాదనీ వివరణ ఇస్తూ ‘క్రైం రిపోర్టర్లు జేడీకి ఫోన్ చేయడాన్ని మేం తప్పు పట్టడం లేదు. పైగా అభినందిస్తాం. కానీ జేడీ ఎంపిక చేసుకున్న కొందరు క్రైం రిపోర్టర్లకు ఫోన్ చేయడాన్నే మేం ప్రశ్నిస్తున్నాం. జగన్ కేసుల దర్యాప్తు విషయంలో జేడీ తొలి నుంచీ చాలా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తి ప్రాణాలకు హాని కలిగించే నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించడం సరికాదని సుప్రీంకోర్టు ఇది వరకే తీర్పు నిచ్చింది. విజయసాయిరెడ్డి విషయంలో కూడా సీబీఐ కోర్టు ఈ పరీక్షలకు అనుమతిని ఇవ్వలేదు. అయినా జగన్‌కు ఇలాంటి హాని కలిగించే పరీక్షలు చేయాలని సీబీఐ మళ్లీ పిటిషన్ వేయడం కుట్రలో భాగం కాదా? జగన్ కేసులో ఎవరిని అరెస్టు చేయనున్నారో...ఎవరిని, ఎలా విచారిస్తారో ముందుగానే కొన్ని పత్రికల్లోనూ, కొన్ని చానెళ్లలో వస్తోంది. సీబీఐ అధికారులు నిందితులను, సాక్షులను లోపల ఏం ప్రశ్నిస్తున్నది కూడా కొన్ని పత్రికల్లో పూసగుచ్చినట్లు వస్తోంది. 

మా పార్టీ నాయకుడు అంబటి రాంబాబును ఏం ప్రశ్నించారో మరుసటి రోజు కొన్ని పత్రికల్లో సవివరంగా వచ్చింది. జగన్‌ను అరెస్టు చేసిన తరువాత కూడా ఆయనను ఏ మాత్రం రక్షణ లేని ఒక సాధారణ వాహనంలో ఎక్కించి జైలు నుంచి కోర్టుకు తీసుకు రావడం, సరైన భద్రతా చర్యలు తీసుకోక పోవడం, జైలు నుంచి జగన్‌ను ఏ దారి గుండా తీసుకు వస్తారో కూడా కొన్ని చానెళ్లలో ముందుగానే వస్తోంది. మీడియాకు సీబీఐ విచారణ వివరాలన్నీ లీక్ చేస్తున్నారని తాము ఇంత కాలంగా వ్యక్తం చేస్తూ వచ్చిన అనుమానాలు జేడీ కాల్స్ జాబితాతో నిజమయ్యాయి’ అని ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. 

జేడీ రిపోర్టర్లతో ఓవైపు మాట్లాడుతూనే కోర్టుకు మాత్రం తాను మాట్లాడ్డం లేదని తప్పుడు సమాచారం అందజేశారని వారు అభ్యంతరం తెలిపారు. లక్ష్మీనారాయణ దర్యాప్తులో జగన్‌కు న్యాయం జరుగుతుందని తమకు నమ్మకం లేదనీ అందుకే కేసుల విచారణ నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్ చేస్తున్నామని వారన్నారు.

వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించింది ఎవరు?
చంద్రబాల వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించామని గగ్గోలు పెడుతున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. వ్యక్తిగత జీవితాలను తన చానెల్ ద్వారా, పత్రిక ద్వారా ప్రస్తావనకు తెస్తున్న రాధాకృష్ణ గవర్నర్ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించిన నీచమైన చరిత్ర ఎవరిదో చెప్పాలి!

విజయవాడలో ఓ ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు వస్తే సదరు మహిళను కెమెరాల ఉమందు పెట్టి ఆ అధికారిని టార్గెట్ చేసి దానిని వెలికి తీసిన విలేకరిని ప్రశంసించారు. అసలు ఆయన ప్రయివేటు జీవితంలోకి వెళ్లాల్సిన అవసరం మీకేమొచ్చింది? వెలికి తెచ్చిన విలేకరిపై విచారించాలని కోరారా? ఏం ఆయన ఐపీఎస్ అధికారి కాదా! ఒక్క లక్ష్మీనారాయణే ఐపీఎస్ అధికారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబుపై ఓ మహిళ ద్వారా ఆయన వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించాలి చూసిన రాధాకృష్ణకు అపుడది నీచాతినీచం అనిపించలేదా? అంబటిది వ్యక్తిగత జీవితం కాదా! ఒక్క లక్ష్మీనారాయణకు మాత్రమే వ్యక్తిగత జీవితం ఉంటుందా!

తారాచౌదరి వ్యవహారం వెలుగులోకి వచ్చినపుడు ఆమె కాల్స్ జాబితాను రాధాకృష్ణతో పాటుగా పలు చానెళ్లు బయట పెట్టలేదా? ఆ మాట కొస్తే తారా చౌదరి కాల్స్ జాబితాను బయట పెట్టడం తప్పు కాదా? వాసిరెడ్డి చంద్రబాల కాల్స్ జాబితాను బయట పెడితే మాత్రం తప్పయిందా?

భానుకిరణ్ ఎవరెవరితో మాట్లాడిందీ కాల్ లిస్టు తమ వద్ద ఉందంటూ, ఆయన సంభాషణలు తమ వద్ద ఉన్నాయంటూ ఈ చానెళ్లు హల్‌చల్ చేయలేదా? ఆయన కాల్ లిస్టును బయట పెట్టలేదా? అది తప్పు కాదా?

ఒక కుట్రనో, నేరాన్నో, అక్రమాన్నో వెలికి తీసినపుడు దానిని చర్చించాలే తప్ప దాన్ని వెలికి తీసిన వారి గురించి చర్చిస్తారా? ఇంతకుముందు జరిగిన అన్ని సంఘటనల్లోనూ కుట్రను గురించే చర్చించిన రాధాకృష్ణ ఇపుడెందుకు కుట్రను వెలికి తీసిన వారిని లక్ష్యంగా చేశారు? ఆకుట్రలో తానూ భాగస్వామి అయినందుకా! చంద్రబాల నుంచి ఆయనకు వెళ్లిన కాల్స్ గురించి రాధాకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదు? జేడీ నుంచి కాల్స్ అందుకున్న మిగతా వారు రాధాకృష్ణతో టచ్‌లో లేరా? వాటి గురించి రాధాకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదు? అవన్నీ బయటకు రావనుకుంటున్నారా!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!