YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 24 June 2012

భూమన దీక్ష

తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించేదాకా నిరవధిక దీక్ష: కరుణాకరరెడ్డి
ప్రజాసంఘాలు, మహిళల మద్దతు

తిరుపతి, న్యూస్‌లైన్: తిరుపతిలో మద్యాన్ని నిషేధించి, పుణ్యక్షేత్రం పవిత్రత కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆదివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వస్తున్న కోట్లాది మంది భక్తులను మద్యానికి బానిసలు చేసే కార్యక్రమం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీనివాసం (అతిథి గృహ సముదాయం) పక్కనే ఉన్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆదివారం ఉదయం భూమన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. వేదపండితులు మంత్రోచ్ఛరణలతో కరుణాకరరెడ్డిని ఆశీర్వదించారు. నగరంలోని మహిళలు పెద్ద ఎత్తున దీక్షా శిబిరానికి చేరుకుని మద్దతు పలికారు. శిబిరం సమీపంలో రోడ్డుపై మద్యం సీసాలను ధ్వంసం చేశారు. నెహ్రూనగర్‌లో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి కరుణాకరరెడ్డికి సంఘీభావం ప్రకటించారు. తిరుమలకు వెళ్లే మార్గంలో మద్యం షాపులను ఎత్తివేశామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారనీ, అయితే వాటిని పూర్తిగా ఎత్తివేయలేదని భూమన చెప్పారు. పక్కనే మరో చోటుకి తరలించి షాపులను నడుపుతున్నారని పేర్కొన్నారు. నగరంలో అనేక మంది మహిళలు మద్యం నిషేధించాలని కోరుకుంటున్నారన్నారు. ఈ విషయం ఎన్నికల ప్రచారంలో తాను వీధివీధి తిరిగిన సమయంలో మహిళలే స్వయంగా చెప్పారన్నారు. ఎమ్మెల్యే దీక్షకు ప్రజా సంఘాల నేతలు, గిరిజన హక్కుల పోరాట సమితి నాయకులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాటకొండ విశ్వనాథ్ మద్దతు పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సత్యవేడు ఇన్‌చార్జ్ ఆదిమూలంతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!