YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 2 July 2012

2.5 లక్షల మంది విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ దూరం!

* ఆన్‌లైన్‌లో చిన్నాచితకా తప్పుల్ని సాకుగా చూపిన రాష్ట్ర ప్రభుత్వం
* కోర్సులు మారిన వారికి ఫీజులు ఇవ్వరు.. పత్రాలన్నీ సమర్పించినా ఓకే చెప్పరు
* డిగ్రీ చదివి బీఈడీలో చేరిన విద్యార్థులకు అష్టకష్టాలు
* పరీక్ష ఫీజులు కట్టించుకోని కాలేజీ యాజమాన్యాలు.. మొత్తం ఫీజు కట్టాలని పట్టు 
* పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన 50 వేల మందికి ఇక్కట్లు
* కౌన్సెలింగ్ సమయంలో ధ్రువపత్రాలను ఇవ్వనందుకు ఈసారి ఫీజులు బంద్!
* కళాశాలలు, వెరిఫికేషన్ అధికారుల వద్ద ఇంకా వేల దరఖాస్తుల పెండింగ్
* అగచాట్లు పడుతున్న లక్షలాది మంది విద్యార్థులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఫీజుల పథకం ఈసారి ఏకంగా రెండున్నర లక్షల మంది విద్యార్థులకు అందకుండా పోయింది. సాంకేతిక సమస్యలు, చిన్నచిన్న కారణాలను చూపుతూ ప్రభుత్వం వారిని పథకానికి దూరం పెట్టింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారిలో ఏకంగా పదిశాతం మందికి కోత విధించింది. 2011-12 సంవత్సరానికిగాను మొత్తం 26.4 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా... 23.97 లక్షల మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి, దాదాపు 2.5 లక్షల మందికి మొండిచేయి చూపింది. ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకునే ఈ పథకంలో చిన్నాచితకా తప్పులు జరిగినా వాటిని సరిచేసి.. వీలున్నంత మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు లబ్ధిపొందేలా చూడాల్సిన ప్రభుత్వం... వాటినే సాకులుగా చూపి లక్షలాది మందిని అనర్హులుగా చేయడం గమనార్హం.

కోర్సు మారితే పథకం కట్..
ఫీజుల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకే సవాలక్ష ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా సాంకేతిక సమస్యలు చూపుతూ ఫీజులు కట్టడం లేదు. ముఖ్యంగా కోర్సులు మారిన దాదాపు 50 వేల మంది విద్యార్థులకు ఈ ఏడాది అన్యాయం చేసింది. ఒకవేళ కోర్సు మారినా గతంలో ప్రభుత్వం నుంచి తీసుకున్న ఫీజు తిరిగి చెల్లిస్తే కొత్త కోర్సులో స్కాలర్‌షిప్, ట్యూషన్ ఫీజు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం చివరికొచ్చేసరికి చేతులెత్తేసింది. గతంలో ప్రభుత్వం చెల్లించిన ఫీజును చలానా రూపంలో సర్కారుకు తిరిగి చెల్లించినా కొత్త కోర్సులో వారిని అర్హులుగా గుర్తించలేదు. 

ఎందుకని ఆరా తీస్తే... ‘‘ఇన్‌వాలిడ్ చలాన్ పేమెంట్’’ అని ఈపాస్ వె బ్‌సైట్‌లో చూపెడుతోందని విద్యార్థులు వాపోతున్నారు. ఇక కొందరు విద్యార్థులకు అసలు గతంలో తీసుకున్న ఫీజును ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలన్న విషయమే తెలియదు. తాము కోర్సు మారామని, కొత్త కోర్సులో ఫ్రెష్‌గా దరఖాస్తు చేసుకుంటామని జిల్లా కార్యాలయాలకు వెళితే గతంలో చేసుకున్న దరఖాస్తును రద్దు చేశారుగానీ.. ఫీజు తిరిగి చెల్లిస్తేనే కొత్త కోర్సుకు పథకం వర్తిస్తుందన్న విషయం తమకు చెప్పలేదని వారు వాపోతున్నారు. ముఖ్యంగా డిగ్రీ చదివి బీఈడీ కోర్సులో చేరిన విద్యార్థులు సర్కారు వైఖరితో మానసిక క్షోభకు గురవుతున్నారు. బీఈడీ పరీక్షలకు ఫీజు కట్టేందుకు వెళ్తే కళాశాలల యాజమాన్యాలు కట్టించుకోవడం లేదు. ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద మీరు అర్హులు కానందున మొత్తం ఫీజు చెల్లిస్తేనే పరీక్ష ఫీజు కట్టించుకుంటామని చెబుతున్నారు’’ అంటూ విద్యార్థులు లబోదిబోమంటున్నారు.

అప్పుడు నో అంటే ఇక అంతేనట!
పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన 50 వేల మంది విద్యార్థులు గతంలో ఎన్నడూ లేని సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు కౌన్సెలింగ్ సమయంలో కొన్ని ధ్రువపత్రాలు సమర్పించలేని పక్షంలో ఫీజు మినహాయింపునకు ‘నో’ అని టిక్ చేసినా.. ఆ తర్వాత అన్ని ధ్రువపత్రాలు సమర్పించి విద్యాశాఖ నుంచి ధ్రువీకరణ తీసుకెళ్తే ఈపాస్ వెబ్‌సెట్‌లో ఆ విద్యార్థిని అర్హులుగా పరిగణించేవారు. ఈసారి మాత్రం అందుకు అంగీకరించడం లేదు. విద్యాశాఖ వద్దకు వెళితే ఈపాస్ దగ్గరకు వెళ్లాలని.. ఈపాస్ వద్దకు వెళితే మా దగ్గర సమయం అయిపోయిందని సమాధానమిస్తున్నారేగానీ వారి సమస్యను పరిష్కరించడం లేదు. 

మరోవైపు దరఖాస్తులను పంపడంలో కళాశాల యాజమాన్యాలు కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. వేలాదిమంది విద్యార్థుల దరఖాస్తులు ఇప్పటికీ కళాశాలల వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. వెరిఫికేషన్ అధికారుల నుంచి అనుమతి పొందని దరఖాస్తులు కూడా అదే సంఖ్యలో ఉన్నాయి. రెండేళ్లు చదువు ఆపేసి మళ్లీ దరఖాస్తు చేసుకున్నవారు, దరఖాస్తులో వివరాలు తప్పుగా నమోదు చేసిన వారిని కూడా అనర్హులుగానే పరిగణించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారి కష్టాలు ఇలా ఉంటే.. స్కాలర్‌షిప్ మంజూరయిన విద్యార్థుల్లో కొందరికి ఇంతవరకు వారి బ్యాంకు అకౌంట్లలో నగదు జమ కాలేదు. గతనెల 14న స్కాలర్‌షిప్ బ్యాంకుకు అందిందని ఈపాస్ వెబ్‌సైట్‌లో చూపెడుతున్నా ఇప్పటికీ వారి ఖాతాల్లో ఆ మొత్తం చేరకపోవడం గమనార్హం!

ఆడిటర్ జనరల్ మొట్టికాయలు
ఓవైపు నిధుల సాకుతో ఆంక్షలు పెడుతూ విద్యార్థులను ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరం చేస్తున్న ప్రభుత్వం మరోవైపు ఈ పథకం కింద మంజూరు చేసిన కోట్ల రూపాయలను మూలనపెడుతోంది. అటు విద్యార్థులకు మంజూరు చేయకుండా, ఇటు ప్రభుత్వానికి జమ చేయకుండా దాదాపు రూ.65 కోట్లు మూడేళ్లుగా బ్యాంకుల్లో మూలుగుతున్నా పట్టించుకోలేదు. చివరకు ఆడిటర్ జనరల్ మొట్టికాయలు వేసిన తర్వాతే మేలుకుంది. వాస్తవానికి 2008-09 సంవత్సరంలో చివరి విడతలో భాగంగా కొంత బడ్జెట్‌ను ప్రభుత్వం మంజూరు చే సింది. 

అయితే స్కాలర్‌షిప్ కింద ఆ నిధులను విద్యార్థులకు ఇవ్వడానికి విద్యార్థులందరికీ బ్యాంకు అకౌంట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన నిధులు వృథా కాకుండా ఉండేందుకుగాను విద్యార్థులందరికీ డమ్మీ అకౌంట్లు నమోదు చేసి ఆ నగదును బ్యాంకుల్లో జమచేయాలని, ఆ తర్వాత విద్యార్థులు బ్యాంకు అకౌంట్ నంబర్ ఇస్తే అందులో జమ చేయాలని నిర్ణయించారు. అలా ఆ నగదును అన్ని జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు నోడల్ ఏజెన్సీల్లో ఉన్న బ్యాంకు అకౌంట్లలో జమ చేశారు. ఆ తర్వాత వాటి గురించే పట్టించుకోలేదు. 

బ్యాంకు అకౌంట్లు తెచ్చుకున్న కొందరు విద్యార్థులకు మాత్రం స్కాలర్‌షిప్ మంజూరు చేశారు. వీరి సంఖ్య వేలల్లోనే ఉంటుందని, మిగిలిన నిధులన్నీ మూడేళ్లుగా బ్యాంకుల్లోనే ఉన్నాయని సంక్షేమ శాఖల ఉన్నతాధికారులే చెపుతున్నారు. దీనిపై ఆడిటర్ జనరల్ కార్యాలయం అభ్యంతరం తెలిపాక అధికారులు కదిలారు. వెంటనే ఆ నిధులను ప్రభుత్వానికి జమ చేయాలని గత నెలలో జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. అయినా చాలా జిల్లాల అధికారులు ఇప్పటికీ నిధులను ప్రభుత్వానికి జమ చేయలేదు. కోట్ల రూపాయల నిధులను ఏళ్ల తరబడి బ్యాంకుల్లో ఉంచితే, అందుకు బ్యాంకులు ఇచ్చే వడ్డీని ఎవరు తిన్నారు? అసలు ఆ నిధుల గురించి మూడేళ్లుగా ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్నలకు సర్కారు వద్ద సమాధానం లేదు. మరోవైపు ఫీజుల పథకం కింద మంజూరై విద్యార్థులకు చేరకుండా దాదాపు రూ.40 కోట్లు ట్రెజరీల్లో మూలుగుతున్నాయని అంచనా.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!