YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 12 June 2012

నరసన్నపేట.. కాంగ్రెస్ అతి

అడ్డుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, ఉద్రిక్తతలు
కొన్ని చోట్ల మొరాయించిన ఈవీఎంలు, పోలింగ్ జాప్యం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. జలుమూరు మండలం రామకృష్ణాపురంలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. మండలంలోని గొట్టివాడలో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ కార్యకర్త గాయపడ్డాడు. నరసన్నపేట మండలం ఉర్లాంలో కాంగ్రెస్‌కు చెందిన స్థానికేతర నేత వచ్చి ప్రచారం చేస్తుండగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఇది ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సారవకోట మండలం కుమ్మరిగుంట పోలింగ్ స్టేషన్‌లోకి ఒక తాగుబోతు చొరబడి వీరంగం చేయటంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నరసన్నపేట మండలం నడగాంలో కాంగ్రెస్‌కు చెందిన రాడ మోహనరావు పోలింగ్ స్టేషన్ వద్ద ప్రచారం చేయడం ఘర్షణకు దారి తీసింది. పోలీసులు జోక్యం చేసుకుని మోహనరావును మందలించి పంపించటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నరసన్నపేటలోని ఓ పోలింగ్ స్టేషన్ వద్ద కాంగ్రెస్‌కే ఓటేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.జోగారావు ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని పలు పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లో ఉన్న ఓటర్ల వద్దకు వెళ్లి తమ పార్టీలకు ఓటేయాలని కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఇదిలావుంటే.. బి.కొత్తూరు, అల్లాడ, సుబ్రహ్మణ్యపురం, వెదుళ్లవలస, డి.ఎల్.పురం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. దీంతో కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కాగా, మరికొన్ని చోట్ల మధ్యలో అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా సారవకోటలో కొంతసేపు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. పోలాకి మండలం చింతవానిపేటకు చెందిన నేపింటి శాంతమ్మ (42) అనే మహిళ ఓటేసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!