YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 12 June 2012

మాచర్ల.. ఉద్రిక్తతల నడుమ..

వెల్దుర్తిలో ‘సాక్షి’ విలేకరిపై టీడీపీ కార్యకర్తల జులుం
అడిగొప్పులలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై టీడీపీ దాడి

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ సందర్బంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. కారంపూడి, దుర్గి, వెల్దుర్తి మండలాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓటర్లను ప్రలోభ పెడుతున్నా పోలీసులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు.

వెల్దుర్తి ఎస్సీ కాలనీలో ఓటర్లను టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సమాచారం తెలుసుకున్న ‘సాక్షి’ మీడియా సిబ్బంది అక్కడికి వెళ్ళి.. ఆ దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు ‘సాక్షి’ విలేకరులపై దౌర్జన్యం చేస్తూ నెట్టివేశారు. ఇదంతా పోలింగ్ బూత్ వద్ద ఉన్న నర్సరావుపేట డీఎస్‌పీ వెంకట్రామిరెడ్డి చూస్తేనే ఉన్నారు తప్ప.. టీడీపీ వారిని నిలువరించటం కానీ, కనీసం ఏం జరిగిందని ప్రశ్నించటం కానీ చేయలేదు. మరోవైపు ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతున్న ‘సాక్షి’ టీవీ విలేకరి రమేష్‌ను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా తోసేశారు. 

దీంతో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. అలాగే దుర్గి మండలం అడిగొప్పులలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగారు. అడిగొప్పులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ నాలి పకీరయ్య ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ఉన్న పార్టీ ఏజెంట్లకు అల్పాహారం ఇచ్చేందుకు వెళ్ళిన క్రమంలో టీడీపీ కార్యకర్తలు దాడి చేసి పిడిగుద్దుల వర్షం కురిపించారు. పకీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే క్రమంలో టీడీపీ నేతలు తమపైనే దాడి జరిగిందంటూ వదంతులు సృష్టించారు. పోలీసులు వెంటపడుతున్న సమయంలో టీడీపీ కార్యకర్త కొనకంటి రాంబాబు వాహనంపై నుంచి కిందపడి గాయాలపాలయ్యారు. అతనికి అయిన గాయాలను చూపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలే కొట్టారంటూ టీడీపీ నాయకులు హడావుడి చేశారు. ఈ నియోజకవర్గంలో కూడా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!