YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 2 July 2012

జగన్‌ను విచారించే అధికారం ఈడీకి లేదు

* జగతి చైర్మన్‌గా ఆయన 2011 ఫిబ్రవరిలోనే రాజీనామా చేశారు: అశోక్‌రెడ్డి
* మాజీ చైర్మన్‌గా ఆయన్ను విచారించే అధికారం ఈడీకి లేదు
* వారు కోరిన సమస్త సమాచారాన్ని ఇప్పటికే అందించారు
* ఇంకా కావాలంటే ‘జగతి’ నుంచి తీసుకోవచ్చు
* సంస్థ ప్రతినిధిగా కంపెనీ సెక్రటరీ హాజరుకు ఇదే కోర్టు అనుమతించింది
* అనుమానిత నిందితునిగానే జగన్‌ను విచారించాలనుకుంటున్నాం: ఈడీ న్యాయవాది
* వాదనలు పూర్తి... నిర్ణయాన్ని 6కు వాయిదా వేసిన న్యాయమూర్తి

హైదరాబాద్, న్యూస్‌లైన్: జగతి పబ్లికేషన్స్ చైర్మన్, డెరైక్టర్‌గా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2011 ఫిబ్రవరి 1న రాజీనామా చేశారని, గతంలో జగతి పబ్లికేషన్స్ చైర్మన్‌గా ఉన్నారన్న కారణం తో జగన్‌ను విచారించే అధికారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)కు లేదని ఆయన తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. దర్యాప్తు సంస్థల విచారణకు ఎవరు హాజరుకావాలన్నది సదరు కంపెనీ నిర్ణయించుకుంటుందని, నేర విచారణ చట్టం (సీఆర్‌పీసీ) అదే స్పష్టం చేస్తోందని తెలిపారు. సంస్థ ప్రతినిధిగా ఎవరినైనా పంపే అవకాశాన్ని చట్టం కల్పించిందని చెప్పారు. 

ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను.. ఆయన కంపెనీల్లో పెట్టుబడులపై విచారించేందుకు అనుమతించాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు సోమవారం విచారించారు. అశోక్‌రెడ్డి వాదనలు విన్పిస్తూ.. 2011 ఫిబ్రవరి 1న జగన్ జగతి పబ్లికేషన్స్ చైర్మన్, డెరైక్టర్ పదవులకు రాజీనామా చేశారని, అలాం టప్పుడు జగతి పూర్వ చైర్మన్ హోదాలో ఆయన్ను ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. 

ఈడీ అధికారులు కోరిన సమస్త సమాచారాన్ని ఇప్పటికే సమర్పించారని, ఇంకా వారికేమైనా సమాచారం కావలిస్తే జగతి పబ్లికేషన్స్ నుంచి తీసుకోవచ్చని తెలిపారు. సీబీఐ కేసు నమోదు చేసిన వెంటనే ఈడీ కూడా కేసు నమోదు చేసిందని...2011 నవంబర్‌లో జగతి పబ్లికేషన్స్ నుంచి సమాచారాన్ని కోరుతూ ఈడీ నోటీసులు జారీ చేసిం దని తెలిపారు. ఈ నోటీసులకు జగతి పబ్లికేషన్స్ స్పందిస్తూ వారు కోరిన సమాచారాన్ని ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అందజేశారని, తర్వాత గత మే 25, జూన్ 14, 15 తేదీల్లో కూడా ఈడీ అడిగిన సమాచారాన్ని అందించినట్లు అశోక్‌రెడ్డి వివరించారు. 

జగతి పబ్లికేషన్స్ తరఫున కోర్టు విచారణకు కం పెనీ సెక్రటరీ సీపీఎన్ కార్తీక్ హాజరయ్యేందుకు అనుమతిస్తూ ఇదే కోర్టు జూన్ 20న ఉత్తర్వులు జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. పది నెలలుగా విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు హఠాత్తుగా జగన్‌ను ప్రశ్నించాలనుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన సమాచారం కావలిస్తే నోటీసులు జారీ చేస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జగన్‌ను వ్యక్తిగత హోదాలో మొదటి నిందితునిగా పేర్కొన్నారని వివరించారు. 

మనీల్యాండరింగ్ (పీఎంఎల్‌ఏ) చట్టంలోని సెక్షన్ 3 (2) ప్రకా రం ఈడీ నోటీసులు అందుకున్న వారు వ్యక్తిగతంగా హాజరుకావచ్చు లేదా ప్రతినిధినైనా పంపవచ్చని పేర్కొన్నారు. జగన్‌ను విచారించేందుకు అవసరమైన కారణాలేవీ ఈడీ చూపలేకపోయిందని, జగన్‌కు వ్యతిరేకంగా ఒక్క వాక్యం కూడా ఈడీ పిటిషన్‌లో లేదని అశోక్‌రెడ్డి నివేదించారు. అలాగే ఎటువంటి ఆధారాలనూ కోర్టు ముందు ఉంచలేకపోయిందన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా జగన్‌ను విచారించేందుకు అనుమతి కోరడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. పైగా జగతి పబ్లికేషన్స్ వివరాలేవీ జగన్‌కు తెలియవని, కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లేవీ చూడకుండా జగన్ ఈడీ ప్రశ్నలకు ఎలా సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్ ఇచ్చే సమాధానాలు తప్పయితే పీఎంఎల్‌ఏ చట్టం కింద మళ్లీ చర్యలు చేపట్టవచ్చని అన్నారు. అందువల్ల ఈడీ పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. 

కాగా అనుమానిత నిందితునిగానే జగన్‌ను ప్రశ్నించాలని భావిస్తున్నామని ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ ఇప్పటికే సమర్పించిన చార్జిషీట్ల ఆధారంగానే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావిస్తున్నామని తెలిపారు. జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్‌గా రాజీనామా చేసినా జగన్‌ను ప్రశ్నించే అధికారం తమకుందని, జైలులోనే జగన్‌ను విచారిస్తామని పేర్కొన్నారు. కేసు తీవ్రత దృష్ట్యానే పలుమార్లు విచారించాల్సి వస్తోందన్నారు. విచారణకు అనుమతించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈనెల 6కు వాయిదా వేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!